Home
  By Author [ A  B  C  D  E  F  G  H  I  J  K  L  M  N  O  P  Q  R  S  T  U  V  W  X  Y  Z |  Other Symbols ]
  By Title [ A  B  C  D  E  F  G  H  I  J  K  L  M  N  O  P  Q  R  S  T  U  V  W  X  Y  Z |  Other Symbols ]
  By Language
all Classics books content using ISYS

Download this book: [ ASCII | HTML | PDF ]

Look for this book on Amazon


We have new books nearly every day.
If you would like a news letter once a week or once a month
fill out this form and we will give you a summary of the books for that week or month by email.

Title: Kollayi Gattite Nemi
Author: Ramamohan Rao, Mahidhara, 1909-2000
Language: Telugu
As this book started as an ASCII text book there are no pictures available.
Copyright Status: Not copyrighted in the United States. If you live elsewhere check the laws of your country before downloading this ebook. See comments about copyright issues at end of book.

*** Start of this Doctrine Publishing Corporation Digital Book "Kollayi Gattite Nemi" ***


కొల్లాయి గట్టితే నేమి?
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల

మహీధర రామమోహనరావు

నవోదయ పబ్లిషర్స్
కారల్‌మార్క్స్ రోడ్డు
విజయవాడ - 2



Kollayi gattite nemi (Novel)
Mahidhara Rama Mohana Rao

First Edition : 1965
Second Edition : 1978
Third Edition : 2007 (Navodaya)

Title Design : A. Giridhar

Published by :
Navodaya Publishers
Karl Marx Road
Vijayawada - 520 002
Phone : (0866) 2573500

Laser Type Setting :
Sri Sri Printers
Vijayawada - 520 002
Phone : (0866) 2571359

Printed at :
Nagendra Press
Suryaraopet, Vijayawada - 520 002
Phone : (0866) 244 2001

Price :
Paperback : Rs. 150/-
Hard Bound : Rs. 200/-



ఒకమాట


1921 -

మార్చి 31, ఏప్రిల్‌ 1.

ఆనాడు బెజవాడలో అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ జీవితంలో ఆ సమావేశానికి ఎంతో
చారిత్రక ప్రాముఖ్యం వుంది.

- కాంగ్రెస్‌ను విస్తృత ప్రాతిపదికగల ప్రజాసంస్థగా రూపొందించేటందుకు ఆ సమావేశంలోనే నిర్ణయించారు.
- ఖద్దరు వుద్యమం, మద్యనిషేధం కాంగ్రెసు కార్యక్రమంలో భాగాలుగా స్వీకరించబడ్డాయి.
- ప్రజల నుంచే ప్రజోద్యమాల నిర్వహణకు ధనం సేకరించే నిర్ణయం తీసుకొన్నారు.

ఆనాటి నుంచీ ముప్పేటన జాతీయోద్యమం తెలుగుదేశం నాలుగు చెరగులా అలుముకుంది.

వివిధ తరగతుల ప్రజలు తమ ఆదరాలు, అభిమానాలు, ఆశలు, రోషాలు--ప్రక్కకు పెట్టారు.

ఓపినంతలో

తోచిన పద్ధతిలో

ప్రతి ఒక్కరూ ఆ మహాయజ్ఞానికి సమిధనొక్కటి సమర్పించారు.

అసంఖ్యాక ప్రజానీకాన్ని కదిలించి, ముందుకు తీసుకుపోగలిగిన ఒక మహావ్యక్తిని తెలుగు దేశం ముక్తకంఠంతో కీర్తించింది.

ఆయన రూపొందించిన ఖద్దరు వుద్యమాన్ని చేతులు చాచి అందుకొంది, పాటలు పాడింది.

సుందరమైన రాట్నమే పసందు బాంబురా||.........

ఆనాటి తెలుగుదేశపు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చిత్రిస్తున్న ఈ నవలకు 'కొల్లాయి గట్టితేనేమి?' అని
పేరు పెట్టడం కొంతవరకు ఆక్షేపణీయంగా వుంటుందని నేనెరుగుదును. ఏమంటే గాంధీజీ ఈ కథ ముగిసిన మరి ఆరు నెలలకుగాని
'కొల్లాయి' కట్టడం ప్రారంభించలేదు.

కొల్లాయి గట్టకపోయినా ఆయన నిరాడంబర జీవితం, సాధువర్తనం, సమాజంలో అడుగున వున్న జనానికి దగ్గరగా వుండాలనీ, వారిని
పైకి తెచ్చేటందుకు ఆయన పడే తపన--ఇవే ఆనాడు ఆయనను తెలుగుదేశానికి ప్రియతముడిని చేశాయి. దానిని తెలుపడానికి మాత్రమే
ఆ పేరు.

ఇంకొక్కమాట చెప్పాలి. ఈ నవలకు కేంద్రంగా ముంగండనూ, పరిసరాలనూ తీసుకోవడం కల్పనలో కొంత భారం తప్పించుకొనేటందుకు తప్ప
దీనిలో పాత్రలేవీ యదార్థాలు కావు. కథ జరిగి వుండనూ లేదు.

ఇంక ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను, వస్తున్న మార్పులను చిత్రించడంలో ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో
తెలుగుదేశం చెప్పాలి.

వేచి వుంటా......

- రచయిత



ఒకటోభాగం



ఒకటి


కాలేజీ హాస్టలు వరండాలో నిలబడి రామనాధం తాను విడిచిపోతున్న పరిచిత ప్రదేశాల వంక చూస్తూంటే మనస్సు ఎలాగో అనిపించింది.

గోదావరి గట్టుమీద సామాను పెట్టెల్ని స్టేషనుకు లాక్కుపోతూ వగరుస్తున్న రైలు ఇంజను బుసలు ప్రతిరోజూ మాదిరిగా అసహ్యం
అనిపించడం లేదు. రాజమండ్రి స్టేషనులో బయలుదేరబోతున్న రైలూ, గోదావరి రేవులో కదలబోతున్న డరోతీ స్టీమరూ ఒక్కమారే
గీపెట్టేసరికి వులిక్కిపడ్డాడు. ఆ హోరులో వెనుక నుంచి సుబ్బారావు రావడాన్ని అతడు గమనించనే లేదు. రెండు మార్లు అడిగితేగాని
అతని మాట వినబడలేదు.

"ప్రయాణసన్నాహంలో వున్నట్లున్నావు."

"రేపీ పాటికి మా ఊళ్ళో...."

"అదృష్టవంతుడివి......"

ఆ మాటలో వెక్కిరింతను గుర్తించేడు రామనాధం.

"ఆ అదృష్టాన్ని నువ్వెందుకు పంచుకోవూ?" అని డెకారించేడు.

"అంటే......."

ఆ సాచివేతా, చూచిన చూపుతో రామనాథం తన ప్రశ్నలోని బలహీనతను అర్థం చేసుకొన్నాడు.

"అదృష్టం మీ దృష్టిలో ఎప్పుడూ లాభం కలిగించేదే అయి వుండాలని. కాని...."

"ఇప్పుడా అదృష్ట దురదృష్టాల పరిశీలన ఎందుగ్గాని, నీ నోట్సు పారేసి పో...."

పారెయ్యడం ఏ గోదావరిలోనో అని కాదు. సుబ్బారావు గదిలో.

కాకపోతే గాంధీగారు పిలిచేరని కాలేజీ వదిలివేస్తున్న వానికి మరి పుస్తకాలూ, నోట్సూ పనేముంది? రామనాథం విచారం తెలిపాడు.

"సారీ....."

"దానికేముందిలే" అన్నా సుబ్బారావు ముఖంలో నిరాశ కనిపిస్తూనే వుంది.

"మీ తమ్ముడు తీసుకొని వుంటాడనుకొంటూనే అయినా అడిగి చూద్దామనుకున్నా, అతని దగ్గరే తీసుకొంటాలే."

"మావాడు కాదు తీసుకొన్నది. హరినారాయణ"

"వాడికెందుకు?"

రామనాధం ఉత్సుకతను చూపలేదు.

"ఏమో అడిగేడు. ఇచ్చేసేను."

కాలేజీ మొదటివాడుగా రావడానికి రామనాధంతో పోటీపడుతున్న వాడు హరినారాయణ. స్వయంపాకం మనిషి. చాలా గుట్టయినవాడు. ఇతరులు
తనతో సమానంగా రావడాన్ని సహించలేని కుట్ర బుద్ధియని తోటివాళ్ళలో వున్న విశ్వాసమే సుబ్బారావు ప్రశ్నకూ, వ్యాఖ్యకూ మూలం.

"అగ్ని సాక్షాత్కారం చేశావన్నమాట. పుస్తకాలు కూడా."

సహాయ నిరాకరణ ప్రతిజ్ఞ తీసుకొన్న రోజున సభావేదిక ముందు దువ్వూరి సుబ్బమ్మగారు వెలిగించిన విదేశీ వస్త్రదాహయజ్ఞకుండంలో
అతని పక్క బట్టలతో సహా ఆహుతి అయిపోయాయి. సుబ్బారావు ఉపయోగించిన 'కూడా'లో కుండలీకరణం వానికి.

హరినారాయణ గూర్చి తోటి విద్యార్ధులకెటువంటి అభిప్రాయం వుందో రామనాధం ఎరుగును. అతనికీ లేదని కాదు. అయినా దానిని పైకి
ఒప్పుకోనూ లేడు. మిత్రుని మాటను సమర్థించనూ లేకపోయాడు.

"అదేం మాటరా......"

కాని సుబ్బారావు అతని సర్దుబాటును లక్ష్యం చేయలేదు. పైగా ఆ సర్దుబాటు చేయబోవడం చూసి కోపం వచ్చింది.

రామనాధం నవ్వేసేడు.

సుబ్బారావు పట్టలేకపోయేడు.

"మీ ఇద్దరూ ఒక్కటే. కుళ్ళుబుద్ధులు. పక్కవాడెవ్వడేనా మీకు పోటీ అవుతాడని ఏడుస్తారు."

అతని ఆరోపణ విన్నాక రామనాధం మరి నవ్వలేకపోయేడు. కాని, సుబ్బారావు అతని సమాధానాలు వేనినీ అంగీకరించలేదు.

"హరినారాయణకు నీకన్న ఓపికా, శ్రద్ధా ఎక్కువ. ఎరుగుదువా?"

రామనాధం సాయంకాలం ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో తప్ప దొరకడు. హరినారాయణ కాలేజీ వేళల్లో కాలేజీలో,
ఇతర సమయాల్లో హాస్టలులోని తన గదిలో, పుస్తకాల మధ్య తప్ప మరెక్కడా ఉండడు.

కాలేజీలో వాళ్ళిద్దరూ ప్రథమస్థానం కోసం ఇంచుమించు సరిసమాన స్థాయిలో పోటీపడుతున్నారు. అతనికి రామనాధం నోట్సుతో పనిలేదు.
కాని అడిగేడు. తీసుకున్నాడు.

మరొకరు వాటి సాయంతో తనకు పోటీ అవుతారనీ, ఆ ప్రమాదం లేకుండా చేసుకొనేందుకే ముందు పట్టేసేడంటాడు సుబ్బారావు.

అతడు చెప్పేక ఆ అనుమానం రామనాధానికీ కలిగింది. మొదటనే కలగనందుకు సిగ్గూ కలిగింది. కానీ ఆ మాటను వొప్పుకోలేకపోయాడు.

"ముందు నువ్వే అడక్కపోయావూ" అన్నది రామనాధం ఆత్మ సమర్థన.

ఆ వాదం ఒక కొలిక్కి రాకపూర్వమే హాస్టలు గంట మ్రోగింది.

"రా. టిపిన్‌ తీసుకొనిపోదువుగాని"

కాని రామనాధం వచ్చినపని కాలేదు.

"మా తమ్ముడు కోసం చూస్తున్నా, నువ్వెళ్ళు" అన్నాడు.

"సెట్టి బలిజెనంటాడు. మళ్ళీ ఇద్దరూ అన్నయ్యా, తమ్మయ్యా అనుకుంటారు. ఈ బంధుత్వం ఎక్కడిదిరా బాబూ?" అని సుబ్బారావు
నిలదీశాడు.

రామనాధం చిరునవ్వు నవ్వేడు.

అతడు తమ్ముడనే వెంకటరమణ భిన్న కులంవాడు. కాని, సుబ్బారావు అన్నట్లు ఒకరినొకరు అన్నయ్యా, తమ్ముడూ అని
పిలుచుకుంటారు. అన్నదమ్ముల మధ్య వుండే అప్యాయతేగాని వాళ్ళిద్దరి మధ్యా మళ్ళీ సన్నిహితత్వం కనబడదు. ఆ విచిత్రమైన
బాంధవ్యం అందరికీ ఆశ్చర్యమే. వేళాకోళం చేస్తుంటారు. కానీ, ఇద్దరూ పట్టించుకోరు.

"భిన్న కులాల మధ్య బంధుత్వాలుండవా? ఉండకూడదా?"

సుబ్బారావు వాదించగల సహనం చూపలేకపోయేడు.

"ఎందుకుండవు? ఇదిగో ప్రత్యక్షంగా మీరున్నారుగా!"

"మరి......"

"మరీ లేదు గిరీ లేదు. లేవోయి పుల్లయ్యా!"

"మళ్ళీ మేం చేరోదారి అయితే కష్టం."

సుబ్బారావు అతని మాటలు వినిపించుకోలేదు. రెక్క పట్టుకున్నాడు.

"చెరోదారీ లేదు. మరోదారీ లేదు. కబుర్లు చెప్పక నడు. కనిపించని మనిషిని పట్టుకోడానికి డైనింగ్‌ హాల్‌
కన్న మంచి చోటేమిటి?"

ఆ మాట నిజమే అనిపించింది. "సరే, నడు....." అన్నాడు రామనాధం చేయి విడిపించుకుంటూ.

"మళ్ళీ ఎన్నాళ్ళకో...." అంటున్న సుబ్బారావు ప్రక్కనే ఆడుగేస్తూ రామనాధం వేళాకోళం చేసేడు.

"ఏం దేశం వదలిపోతున్నావా?"

"మీ కాంగ్రెసువాళ్ళు మమ్మల్ని పొమ్మనేస్తారేమిటి?"

"యుగాంతర పత్రిక ఖరీదు కథ విన్నావా?"

రౌలట్‌ కమిషన్‌ రిపోర్టు ధర్మమాయని దేశంలో మూలమూలలకంటా స్వాతంత్య్ర యోధుల ప్రయత్నాల కథలు
తెలిసివచ్చాయి. వానిలో ఇదొకటి.

బెంగాల్‌లో టెర్రరిస్టులు రహస్యంగా "యుగాంతర" అంటూ పత్రిక తెచ్చారట. ఒక తెల్లవాని తల, లేదా రెండు
నల్లవాళ్ళ తలలు దాని ఖరీదుగా పైన ముద్రించారట.

సుబ్బారావు తిరగబడి చూశాడు.

"ఆహా!"

"ఏం?"

"మీ గాంధీగారు....."

వేళాకోళానికైనా తన 'కథ' ఎంత అర్థరహితమో గ్రహించి రామనాధం సిగ్గు పడ్డాడు.

హాలులో అడుగుపెట్టే సరికి వెంకటరమణ ఎక్కడినుంచో పరుగెత్తుకుంటూ వచ్చేడు.

సుబ్బారావు తనమీదినుంచి పెద్ద భారం దిగిపోయినట్లు "అమ్మయ్య" అన్నాడు.

"ఇడిగోరా బాబూ మీ తమ్ముడు. ఏమైపోయాడోనని మహకంగారు పడ్డావు."

"మీ కోసమే రావాలనుకొంటున్నా....." అన్నాడు వెంకటరమణ.

"ఎక్కడికెళ్ళేవు? ఓ అరగంటనుంచి నీ గది ముందే కాచుకొని వున్నాడు."

ఎక్కడికెళ్ళిందీ వెంకటరమణ చెప్పడానికి సిగ్గుపడ్డాడు. టిపిన్‌ పళ్ళెం అందుకోవడం ఆలస్యం కాకుండేందుకు అతడు
హాలుముందున్న చెట్టు క్రిందనే పుస్తకం తెరచుకొని బైఠాయించేడు.

"మధ్యాహ్నం పడవకెడుతున్నారా?"

"ముందు రంగనాధం మాష్టార్ని చూడాలి తరువాత....."

వెంకటరమణ ఆశ్చర్యమూ, అసంతృప్తీ ప్రకటించేడు.

"ఇంకా వెళ్ళలేదూ?"

రంగనాధం లెక్చరరు తన ద్వారా కబురు చేశారు. అప్పుడే రెండు రోజులయింది. ఇంతవరకూ వెళ్ళలేదంటే ఏమనుకుంటారు? తాను
చెప్పలేదనీ, నిర్లక్ష్యం చేశాడనీ అనుకుంటారేమోనని అతని భయం.

రంగనాధరావు లెక్చరరు. రామనాధం తెలివిగల విద్యార్థి యని ఆయనకెంతో అభిమానం. సత్యాగ్రహ ప్రతిజ్ఞ చేశాడనీ, కాలేజీ
వదిలిపెడుతున్నాడనీ విన్నాక ఓ మారు వచ్చి కలుసుకోమని కబురు చేశాడు.

కాని ఆయనకు తనమీద వున్న అభిమానమే ఆయన పిలవగానే వెళ్ళడానికి సందేహించేలాగ చేసింది.

రంగనాధరావు ఆక్స్‌ఫర్డులో చదివి వచ్చినవాడు. వేష భాషలలో, ఇంటి ఆచారాలలో కూడా శుద్ధ ఆంగ్లేయుడల్లే వుంటాడు.
ఆయన తన సహాయ నిరాకరణ ప్రతిజ్ఞను అభినందించలేడని రామనాధం అవిశ్వాసం. కనకనే వెళ్ళలేదు. వెళ్ళి ఆయనను
నొప్పించడం అతనికి మనస్కరించలేదు. ఆఖరు నిముషంలో ఓ మారు కనిపించి పోదామనుకున్నాడు.

తమ్ముడి ప్రశ్నలోని ఆదుర్దా గమనించి ఆ పిలుపు రమణ ప్రోత్సాహం మీద జరగలేదు గదా అనిపించింది. అతడికి తాను గాంధీగారు
చెప్పినా సరే చదువు మానడం ఇష్టం లేదు.

"పనుల తొందరలో రాలేకపోయానని చెప్తాలే."

తమ్ముడికి మాటరాకుండా చేస్తానన్నంతవరకే రామనాధం ప్రయత్నం. రమణ ఆ అర్థం గ్రహించి సిగ్గుపడ్డాడు.

"అది కాదు."

"పెద్ద పనేం వుండి వుండదులే. కాలేజీ చదువు కట్టిపెట్టేస్తున్నావేమిటని అడుగుతారు. అంతే."

ఆ నిర్లక్ష్యం వెంకటరమణకు ఇష్టం లేదు.

"ఎందుకన్నా కానీండి."

"వెడుతున్నా కదుటోయ్‌."

రామనాధం ఎంతో ఆప్యాయంగా అతని చేయి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు.

"రా. టిఫిన్‌ తీసుకొన్నావా?"



రెండు


రంగనాధరావు చూపిన ఆదరానికి రామనాధం ఆశ్చర్యమూ, సిగ్గూ పడ్డాడు. ఆ స్వాగతం అప్రత్యాశితం. లెక్చరర్లు
తమకభిమానులైన విద్యార్ధుల దగ్గర కూడా కనబరచే దూరపుతనం లవలేశంకూడా అందులో కనపడలేదు. విద్యాధికులూ, వయస్సులో
పెద్దవాళ్ళూ తమకంటె చిన్నవాళ్ళయందు కనబరచే పెద్దరికం అక్కడ లేదు.

రంగనాధరావు అతడు వచ్చిన వార్త వినగానే చదువుతున్న పుస్తకం ప్రక్కకు నెట్టేడు. ఎదురుగా వున్న కుర్చీ చూపేడు. యోగ
క్షేమాలు తెలుసుకొంటూనే టేబిలుమీది 'కాలింగ్‌బెల్‌' ఒత్తేడు. వెంటనే ప్రత్యక్షమైన బంట్రోతుకు రెండు టీలు
పురమాయించేడు. వాడు వెడుతుంటే వెనక్కి పిలిచేడు.

"మేడమ్‌ ఏం చేస్తున్నారు?"

వాడు చూడలేదు. నసిగేడు.

"రామనాధంగారు వచ్చేరని చెప్పు."

ఇంటి వద్ద తన గురించి చెప్పేరన్నమాట. తాను సత్యాగ్రహ ప్రతిజ్ఞ తీసుకొని, కాలేజీ చదువు కట్టిపెట్టేసినందుకు ఆయన
అంత ఆదరాభిమానాలు చూపుతున్నారనుకోడానికి సమ్మతి చిక్కడం లేదు. కాని, మరో కారణం కనబడదు. కాలేజీలో చేరిన ఈ
నాలుగేళ్ళ కాలంలో ఆయనను తానెప్పుడూ ఇంటి వద్ద కలుసుకోలేదు. ఆయన పిలవలేదు. అనాహూతంగా ఎవరన్నా వెడితే ఆయన చాలా
చిరాకు పడతారని విన్నాడు. చిరాకుపడ్డా వెంటబడి హరినారాయణ గట్టిగా చివాట్లు తిన్నాడని ఎరుగును. అందుచేత రామనాధం
ఎప్పుడూ దూరదూరంగానే ఉన్నాడు. ఆయన తన అభిమానాన్ని కూడా ఓ చిరునవ్వు 'బాగుంది చదువు!' లాంటి ఏకపద వాక్యాలతోనే
ప్రదర్శించేవాడు.

అటువంటి అలభ్యుడనుకొన్న రంగనాధరావు నోట అన్ని మాటలు, అంత సన్నిహితత్వం చూస్తుంటే రామనాధానికి ఎంతో ఆశ్చర్యం
కలిగింది. ఆ ఆశ్చర్యంలో ఆచార్యాణి రాక నాతడు గమనించనే లేదు. "నే చెప్పిన రామనాధం ఇతడే"నని రంగనాధరావు పరిచయం
చేస్తున్నప్పుడే అతడామె రాకను గమనించేడు. వెంటనే లేచి నిలబడ్డాడు.

"నమస్కారం."

టీ త్రాగుతూ చెప్తూన్న కబుర్లలో కనిపించిన రంగనాధరావు కేవలం కొత్త వ్యక్తి.

ఒక్క అరగంటలో తాను ఇంగ్లండులో చదువుకొంటున్న రోజుల నాటి కథలు, చూసిన వ్యక్తుల పరిచయాలూ వినిపించాడు.
మదన్‌లాల్‌ ధీంగ్రా తెల్లదొరని కాల్చివేసినప్పుడు తాను ఆ సభలో వున్నాడు. పెద్ద వీరాధివీరులమని డబ్బా
కొట్టుకొనేవాళ్ళు ఆ రోజున ఎలకల్లా బల్లలూ, కుర్చీల మాటున దాగిన దృశ్యాలు వర్ణిస్తూంటే ఆయన కళ్ళు ఒక్కసారి
మిలమిలలాడేయి. హఠాత్తుగా ప్రశ్నించేడు.

"బాగా ఆలోచించుకొనే దిగి వుంటావులే."

ధీంగ్రాలూ, సవర్కార్లూ చూపిన త్యాగాలూ, సాహసాలతో సమానమైన త్యాగం, సాహసం చూపుతున్నావు. అనే అభినందన ఆ మాటల్లో
వినబడి రామనాధం వులిక్కిపడ్డాడు.

"ఆలోచించనిదే ఏ పనీ చెయ్యకూడదు. ఓమారు తలపెట్టేక దాని అంతేదో చూడాల్సిందే గాని మధ్యలో వెనక్కి తిరగరాదని" ఆయన
ఎప్పుడూ చెప్తూంటారు. అదే ఇప్పుడు కొత్త రూపంలో వినిపించింది.

"అందులో ఎత్తుకొన్నది అల్లాటప్పా వ్యవహారం కాదు. దేశ స్వాతంత్య్రం తెస్తానంటున్నావు. ఇందులో శరీరానికి క్షేమం లేదు.
ఆస్తులు వగైరా మనల్ని కాపాడవు. అభిమానించే వాళ్ళు కూడా ఒక్కొక్క దశలో కనబడరు" అన్నాడు.

రంగనాధరావు చక్కగా సంభాషణలోకి దించేడు. ఆయన భార్య కలిసింది. రామనాధం చేరేడు. కథోపకథనంలో నాలుగు రోజుల క్రితం
జరిగిన బహిరంగ సభలోని ఘటనలు, తర్వాత నాలుగు రోజుల్లో తన అనుభవాలూ రామనాధం చెప్పేడు.

సత్యాగ్రహ ప్రతిజ్ఞ తీసుకొన్నప్పుడు తోడివాళ్ళంతా చప్పట్లు కొట్టేరు హుషారు చేశేరు. వాళ్ళే మళ్ళీ రాత్రి తన గదికి
వ్రేలు మొగాలు వేసుకువచ్చి చదువు మానేస్తున్నందుకు అంత బాధా పడ్డారు. ప్రతిజ్ఞ నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలూ
చూపించేరు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చి కితకితలు పెట్టినట్లయి రామనాధం నవ్వేడు.

రంగనాధరావు భార్య వారి బలహీనతను ఈసడించింది.

కాని, ఆయన గంభీరంగా తలతిప్పేడు.

"అది బలహీనతా? ఉహు! ప్రేమ, గౌరవం, అభిమానం యొక్క మారు రూపం అది."

ఆచార్యాణి ఆశ్చర్యం కనబరచింది.

"దొడ్డ ప్రేమే."

"ఔను. కాని చాలా ప్రమాదకరమైన రూపంలో ఉన్న ప్రేమ అది. దానికి తల ఒగ్గేవా ఇంక ఆ ప్రేమ మిగలదు. అసహ్యం
రేగుతుంది. త్రోసిపుచ్చినా ఒక విధమైన ఈసడింపే నీకు లభించేది. ప్రేమ కనిపించదు."

రంగనాధరావు లేచాడు.

"నిన్ను ఎరుగుదునని చెప్పుకోడానికి సిగ్గుపడవలసిన అవసరం రాదని నాకు తెలుసు" అన్నాడు.

రామనాధం ఆయన చాపిన చేతిని అందుకొన్నాడు.

"తమ ఆశీర్వచనబలం."

రంగనాధరావు ఆ మాట విన్నట్లే లేదు.

"ప్రేమాభిమానాలలాగే దేశభక్తి బహు రూపం. అది ప్రకటించే పద్దతులు కూడా బహురూపాలే. వాటిని అర్ధం చేసుకోవడంలోనే దేశం ఏక
ముఖం అవుతుంది" అన్నాడు.



మూడు


పనులన్నీ పూర్తిచేసుకొని రేవులోకి వచ్చేసరికి మొదటి పడవను నీళ్ళలోకి దిగతోస్తున్నారు. అతడిని చూడగానే గుమాస్తా ఎదురు
వచ్చేడు.

"పంతులుగారూ! రెండో నెంబరు గది ఖాళీగానే వుంది. వెళ్ళండి." కదలిపోతున్న పడవలో ఎక్కడానికి ఏమంత తొందరలే అని రామనాధం
సాగారించబోయేడు.

"రెండోదాని కెడతాలేండి."

"ఇంకా రావలసినవాళ్ళెవరన్నా వున్నారా?"

సమాధానానికెదురు చూడకుండానే గుమాస్తా సరంగును కేకేసేడు. అతడు వినిపించుకోకపోతే కళాసీల మీద కేకలేసేడు.

"వెంకన్నా! చేర్చి పట్టుకోమంటే ఒక్కళ్ళూ వినిపించుకోరేం."

అంత శ్రమపడి పడవ నాపిస్తూంటే రామనాధం తరువాతి పడవకెడతానులే అనలేకపోయేడు.

కదలిన పడవను ఆపించినందుకు గుమాస్తామీద విసుక్కుంటూ వెంకన్న గెడవేసి అదిమిపెట్టేడు.

"దెబ్బ కాయి"

నిలబడివున్న పడవల్ని గుద్దుకోకుండా ఇద్దరు కాచుకొంటూంటే మరో ఇద్దరు తాడు విసిరి చేర్చిపట్టుకొన్నారు.

తాను పడవలో ఎక్కడానికి ఇంతమందికి శ్రమ కలిగించేనా యని నొచ్చుకుంటూ రామనాధం పడిచెక్కమీద కాలు పెట్టేడు.

"సామానులు వాళ్ళు అందుకుంటారులెండి. మీరు లోపలికి వెళ్ళిపోండి"--వెంకన్న కంఠంలో విసుగు, తొందర వినిపిస్తున్నా రామనాధం ఏమీ
అనలేక పోయేడు. చటుక్కున గది గుమ్మంలో కూర్చున్నాడు.

వెంకన్న గెడ మారుస్తూ మొదటి గదిముందు తొంగి చూస్తున్న స్త్రీలను హెచ్చరించేడు.

"ఏమండోయ్‌ మొదటి గదిలోవారు! తల బయటపెట్టకండి. ఏ గెడన్నా తగులుతుంది.

ఆ హెచ్చరిక విని రామనాధం తిరగబడి చూశాడు. వెంకన్న మాటల్ని లక్ష్యం చేయకుండా వారింకా బయటకు చూస్తూనే వున్నారు. ఇంత
శ్రమపడి పడవను చేర్చి పట్టుకొన్నదెవరి కోసమా అని వారి ఆసక్తి. ఓ ఇరవయ్యేళ్ళ సాధారణ యువకుడు ఇచ్చే ఆరణాల
కేవు కోసం గుమాస్తా అంత హడావుడి చేశాడని వారు నమ్మలేకపోయేరు. కాని, నమ్మక తప్పలేదు. అతడు తప్ప మరెవ్వరూ పడవ
ఎక్కలేదు. అతడు ఎక్కగానే తోసేశారు.

కళాసీ తెచ్చిన సామాన్లు సర్దుకుంటూండగానే రేవు గుమాస్తా వచ్చేడు. గది సుఖంగా వున్నదో, లేదో యోగక్షేమాలు తెలుసుకొన్నాడు.
బల్ల చెక్కల కూర్పు ఎగుడుదిగుడు లేకుండా ఎల్లా సర్దితే సుఖంగా వుంటుందో సూచనలిచ్చేడు. వెనక నుంచి తొందరపెడుతున్నసరంగుకు
రామనాధం మంచి చెడ్డలు కనుక్కుంటూండవలసిన అవసరాన్ని హెచ్చరించేడు.

"పంతులుగారెవరో తెలుసా? గాంధీగారి మనిషి. పులి. మొన్న సభలో ఏం మాట్లాడేశారు! ఎంత బాగుంది. ఓహ్‌!"

రామనాధం ఉత్సుకతను ఆపుకోలేకపోయాడు.

"మీరు సభకు వచ్చేరా?"

రామనాధం అమాయకత్వానికి నొచ్చుకుంటున్నట్లు గుమాస్తా పెడనవ్వు నవ్వేడు.

"అదేమిటండోయ్‌, అల్లా అన్నారు? ఏదో బ్రతకడానికి ఈ పడవల దగ్గిర గుమాస్తా పని చేస్తున్నాగాని ఎప్పుడు,
ఏ నాయకులు వచ్చేరన్నా హాజరు కావలసిందేననుకోండి."

ఈలోపున పడవ హాలులో డబ్బులు వసూలు చేసుకువచ్చి సరంగు ఫలితాలు చెప్పేడు.

"ముందుగదిలో వారు చిరతపూడి నాయుడుగారి తాలూకు. బాబుగారు...."

గుమాస్తా ధారాళంగా కేవు చెప్పేసేడు.

"పంతులుగారి దగ్గర అర్ధరూపాయికన్న ఎక్కువ తీసుకోకు. వారు చాలా గొప్పవారు. ఈవేళ వారు వచ్చేరంటే మనమూ, మన పడవా
తరించామన్నమాట."

ఆ అభిమానం, భక్తీ నిలవబెట్టుకొనేందుకు మోసపోతున్నామనుకొంటూనే అర్ధరూపాయి చేతిలో పెట్టేడు రామనాధం. సాధారణంగా గదికి కేవు
పావలా, లేక ఆరణాలు.

"వస్తానండి. తమకేం కావలసినా చెప్పండి" అంటూనే దగ్గరగా నిలిచివున్న పడవ మీదికి గెంతి క్షణంలో అదృశ్యం అయిపోయాడు
గుమాస్తా.



నాలుగు


ఎదురుగాలి వీస్తోంది. చేప పరుగున పోవలసిన పడవ గెడపోటున పీత నడక నడుస్తూంది. తమ పనుల కడ్డంగా వుంటారని
ప్రయాణీకులందరినీ క్రిందకు పంపేసేరు. పడి చెక్క మీద పొడవునా వెనక ముందులకు నడుస్తూ గెడ వేస్తూనే కళాసీలు ఎవ్వరినీ
తల కూడా బయటకు పెట్టనివ్వడం లేదు.

రామనాధం గదిలోనే కూర్చుండిపోయాడు. బయటకు తల పెట్టి నదీ దృశ్యాల్ని కూడా ఏకాగ్రంగా చూడడానికి లేదు. నిముషానికో రెండు
మార్లు ఓ అరడజను కాళ్ళు ఆ దృశ్యాల్ని మూసేస్తూంటే అటు చూడ్డానికి కూడా విసుగు పుట్టింది. ఏమీ తోచడం లేదు.

ఇటువంటి అవసరానికుపయోగిస్తుందని ఓ పేక పెట్టెలో వేసుకొచ్చేడు. హాలులో వున్న వాళ్లంతా అలగాజనం. వాళ్ళ మధ్యకు
వెళ్ళడానికి మనస్కరించలేదు. పక్క గదిలోని వాళ్ళు ఆడవాళ్ళయిపోయేరు.

పక్క పరిచేడు. కొద్దిసేపు 'పేషెన్సు' పరిచేడు. బాగుండలేదు. ఇంకా గెడతోపు మీదనే పడవ సాగుతూంది. ఓమారు తల బయటకు
పెట్టి అటూ ఇటూ చూసేడు. కళాసీ హెచ్చరించడంతో తల వెనక్కి తీసుకొన్నాడు.

ఈమారు ఏమీ తోచక ప్రక్క వేసేడు. ప్రక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళు మూసుకుని వింటున్నాడు.

"సరిగ్గా వారం అయింది. ఆయన ఏం చేస్తున్నారో, మంగమ్మ కనుక్కుంటూందో లేదో, ఏం తింటున్నారో, ఏం బాధపడుతున్నారో
ఏమిటో....."

అది వయస్సు మళ్ళిన ఆమె కంఠం.

రెండో గొంతు వినిపించలేదు. మూగదేమో అనుకొన్నాడు రామనాధం. ఆ ఆలోచనకు నవ్వు వచ్చింది. ఎక్కువగా మాట్లాడే స్వభావం
కాకపోవచ్చు. లేదా, ఏదో ఆలోచిస్తూండి వుంటుంది. ఏమాలోచిస్తూంది? మగణ్ణి గురించా? బహుశా తల్లి ఆమెను ఏ కాన్పుకో
తీసుకువెడుతూందేమో? తొలికాన్పు అయి వుంటుంది. బహుశా భయంగా వుండి వుంటుంది. అంత భయపడుతున్నామెను హాస్పిటలు సౌకర్యం వున్న
రాజమండ్రి నుండి పనికట్టుకుని చిరతపూడి తీసుకెళ్ళడమెందుకో? అక్కడ ఓ వైద్యుడా, ఓ సౌకర్యమా? ఏ మాత్రం కష్టం వచ్చినా
పోతే అమలాపురం పోవాలి. వెళ్ళడానికి దారా, తెన్నా? మట్టిరోడ్లూ, కాలవగట్లూ రెండెడ్లబళ్ళ ప్రయాణంలో ప్రాణం
వసివాడిపోతుంది.

మొదటి కాన్పుకేనా పుట్టింటివాళ్ళు తీసుకెళ్ళలేకపోయారంటారని బలవంత పెట్టింది కాబోలు.....

--బొబ్బర్లంక వద్ద పడవ గట్టుకిపడుతూవున్న హడావిడిలో అతని ఆలోచనలు తెగిపోయాయి. బయటకు వచ్చేడు. అప్పుడే పడవ
తిరుగుతోంది. చాలామంది ఆడవాళ్ళూ, మగవాళ్ళూ గట్టుకెక్కేశారు. రామనాధం కూడా గట్టుకి గంతేశాడు. పడవ లాకులు దాటి కాలువ
దిగువ చేరేవరకు వారంతా కాలకృత్యాలు తీర్చుకొని అందుకొంటారు.

రామనాధం అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేసి, ఇన్ని అరటిపళ్ళు కొనుక్కొని రేవులోకి వచ్చేసరికి పడవ సాగిపోతోంది. అతనిలాగే
బయట మిగిలిపోయినవాళ్ళింకా నలుగురైదుగురున్నారు. వారిలో ఒక పడుచు కూడా వుంది.

"వెలిచేరు దాకా పడవ చేరదు. వెనకదాంట్లో రండి" అని ఒకరు సలహా ఇచ్చేరు.

ఆమె అంగీకరించలేదు. ఎలాగ? తల్లి పడవలో వుంది. సామాను?

అప్పుడర్ధమయింది రామనాధానికి, తన ముందుగదిలోని ప్రయాణీకురాళ్ళిద్దరిలో తనకు వినిపించని కంఠం ఈమెది.

అనుతాపం తెలిపేడు.

"ఎందుకు దిగేరు?"

"అరటిపళ్ళు తీసుకొందామని, ఎక్కినదానినే మళ్ళీ దిగేను."

ఆమె మూగది కాదు, మాటలుతక్కువ మనిషీ కాదు. గర్భిణీ గాదు. ఆమెను గురించి తానూహించుకొన్న కల్పనలన్నీ గుర్తు వచ్చి
అతడు నవ్వుకొన్నాడు. మాటకూడ ఆడలేనంత దుర్భలస్థితిలో లేదు. మంచి ఆరోగ్యంతో మిసమిసలాడుతోంది. ముఖంలో తెలివి, కళ్ళలో
చురుకుదనం, మూర్తిలో ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తూన్నాయి. ఆ ఇరవయ్యేళ్ళ వయస్సు మిసిమి కన్ను తిప్పుకోనివ్వడం లేదు. కాని
ఆమె ముఖం వంక తదేకంగా చూస్తున్నందుకు తనలో తానే సిగ్గుపడి తల తిప్పుకొన్నాడు.

"వెలిచేరు దాకా పడవ నిలపరు. ఏం చేద్దాం."

ఒంటరిగా ఆమెను వదలిపెట్టి తనదారి తాను చూసుకొనేటందుకు మనసు ఒప్పలేదు.

"నిలబడి ఆలోచించినకొద్దీ ఆలస్యమవుతుంది. నడవండి."

"మీరు నడవగలరా?"

ఆమె సమాధానం ఇవ్వకుండా ముందుకు అడుగువేసింది. ఆమె వెనకనూ, ముందర మిగిలినవాళ్ళూ బయలుదేరారు.

ఒక అరమైలు వెళ్ళేసరికి రామనాధం ఆమెతో గట్టున మిగిలేడు. మధ్య మధ్య చెట్లు తెరిపి ఇచ్చిన ఒకటి రెండు చోట్ల చేప
పరుగున పోతూనే పడవ ఒక్క క్షణం గట్టు దరిగా వచ్చి విడిపోతూ వచ్చింది. ఆ వ్యవధిలోపునే నడవమీదవున్న పడవమీదికి
మిగిలినవాళ్ళు గంతేసేరు. వాళ్ళు ఇచ్చిన సులువులూ, ఉపాయాలూ అమలు జరిపి, ఆమె ఎగరలేకపోయింది. ఆమెతోపాటు రామనాధం కూడా
గట్టునే దిగబడిపోయేడు.

పడవను ఆపమన్న కేకలకు లక్ష్యం చెయ్యకుండా సరంగు కేక పెట్టేడు.

"పంతులుగారూ! ఎదరే రేవు. కొంచెం వేగంగా అడుగెయ్యండి."

ఆ రేవు కనీసం మైలు దూరంలో వుందని రామనాధం ఎరుగు. కనుక చీకటి పడుతోంది. నీటివంచకంటా తుమ్మలు పెరిగి జీబుమంటున్నాయి.
నీటి కోతకి గట్టు కయ్యలు పడి వుంది. ఏటి గట్టెక్కటం మంచిదనుకొన్నాడు.

"మీ పేరేమిటి?"

"స్వరాజ్యం"

"స్వరాజ్యంగారూ! మనం ఏటి గట్టెక్కితే మంచిది. ముళ్ళూ.... బురద....."

నిర్జనంగా ఉండే ఏటి గట్టున ఒంటరిగా, చీకట్లో తనతో రావడానికి సందేహిస్తుందేమోనని అతని బెరుకు. కాని, ఆమె
సందేహించలేదు.

"కానీండి. పడవ మీదికి ఎగరలేకపోయాను గాని నడవలేకపోను" అంది.

* * * * *

వేళకు వచ్చి పడవ ఎక్కనందుకు తిక్క బాగా వదిలించేనని మీసాల లోపలనే నవ్వుకుంటూ సరంగు పడవను రేవుకు చేర్చేడు.

"త్వరగా ఎక్కండి."

త్వరగా ఎక్కడం సాధ్యం కానే లేదు. కాలవలో నీరు తక్కువగా ఉంది. పడవ గట్టుకి చేరలేదు. విసుక్కుంటూనే కళాసు గట్టుకి
చెక్క వేసేడు. దానిమీద నడవడంలో కూడా స్వరాజ్యం రామనాధం చేయి ఆసరా తీసుకోవలసి వచ్చింది. అటు తర్వాత అవసరం
లేకపోయినా రామనాధం చేయి వదలలేదు. ఆమె గది ముందుకంటా దిగబెట్టేడు.

కూతురు పడవ ఎక్కలేకపోయినందుకు ఆదుర్దాపడుతున్న తల్లి ఓ మూల కూతురును కోప్పడుతూనే రామనాధాన్ని అభినందించింది.

"ఏమి కష్టం కలిగింది? కాస్త కాలు సాగితేనే నలిగిపోతామా?" అని స్వరాజ్యం తల్లిని వూరడించబోయింది.

"నాకేం కష్టం కలగలేదండి. ఆవిడే నడవగలుగుతూంటే నేను....."

రామనాధం వినయం ప్రకటించేడు.

"అటుకులున్నాయి, పెరుగు తీసుకొన్నాం. ఇంకేం వద్దంటే వినడమూ, పెట్టడమూ ఉందా? ఈ రాత్రి తెల్లారదా, అరటిపళ్ళు
లేకపోతే?"

"తల్లి సాధింపుకు స్వరాజ్యం చిరునవ్వుతో వూరుకుందేగాని, సమాధానం ఇవ్వలేదు. తనకు సాయపడినందుకు రామనాధానికి అభినందనలు
తెలిపింది.

"థాంక్సండీ."

ఆ ఇంగ్లీషు పద ప్రయోగానికి రామనాధం ఆశ్చర్యపడ్డాడు. ఆ ఆశ్చర్యంలో సముచిత సమాధానం ఇవ్వడం మరిచిపోయేడు.

"బాగుందండోయ్‌! ఈ మాత్రానికేనా?"

రామనాధం పెట్టెలోంచి రెండు కొవ్వొత్తులు తీసి ఒకటి వెలిగించేడు. రెండోది ముందుగదిలో వాళ్ళకిచ్చేడు.

"మీరు గట్టివారేనే."

స్వరాజ్యం అందుకుంది. తల్లి సందేహిస్తూనే అడిగింది.

"బాబూ! అటుకులు పెరుగులో వేసేను. తప్పులేదు. తీసుకోండి."

ఆచారభంగం చేసుకోమంటావా అని తప్పు పడతాడేమోనని భయపడుతూ ఆమె అతని ముఖం వంక చూస్తోంది. అతడు సమాధానం ఇవ్వక
పూర్వమే స్వరాజ్యం అందుకుంది.

"ఆయన గాంధీగారి మనిషమ్మోయ్‌!"

ఏటి గట్టున నడుస్తూ కబుర్లలో తెలుసుకొన్న సంగతులు ఏకరువు పెట్టేసింది.

అతడు కాలేజీ మానివేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడని విన్నప్పుడు తల్లి నమ్మలేకపోయింది.

"పోవే, నీ మాటలూ, నువ్వూను"

"నిజమేనండి" అన్నాడు రామనాధం.

ఆమె నీరవురాలై ఒక్క నిముషం కూర్చుండిపోయింది.

"ఏం పని చేశావు నాయనా!"

ఆ మాటలో అభిశంసన లేదు. ఆక్రోశం. వట్టి అసహాయ ఆక్రోశం.

ఏం చెపితే అర్ధం అవుతుందో రామనాధానికి తోచలేదు.

తన బంధువులు తనను ఇంగ్లండు పంపి ఐ.సి.ఎస్‌. చదివించాలనుకుంటున్నారు. పాసై వస్తాడు; ఏ జిల్లాకో కలెక్టరుగా
వేస్తారు. అతడు పెద్ద ఉద్యోగి అనిపించుకొంటాడు. హోదా, మర్యాద అన్నీ పెరుగుతాయి. ధనం ఆర్జిస్తాడు. కాని, అతని
కవన్నీ ఎల్లా లభ్యం అయ్యాయి అనుకోవాలి?

"మీ అమ్మా, నాన్నా చేసుకొన్న పుణ్యం అటువంటిది" అంది మాణిక్యమ్మ.

"వాళ్ళు నే పుట్టక పూర్వమే చచ్చిపోయేరు."

ఒక్క నిముషం అందరూ ఊరుకున్నారు.

"నువ్వు చేసుకోబోయే పిల్ల ఎవరో బంగారు పువ్వులు పూజ చేస్తూండి వుంటుంది."

"నాకు పెళ్ళయిపోయింది."

"ఎవరో అదృష్టవంతురాలు."

"ఇప్పుడు కాదని తేలిపోయిందిగా, నేను చదువు మానేశాను. ఇంక ఇంగ్లండు వెళ్ళడం లేదు. ఐ.సి.యస్‌. లేదు. జిల్లా
కలెక్టరును కాను..."

స్వరాజ్యం మాట అందించింది.

"అంటే ఆవిడ మామూలు పువ్వులతో పూజ చేసిందన్నమాట."

"మీ అమ్మగారిలాగే వాళ్ళూ అనుకొన్నారు. కాని....."

తన్ను ఎగతాళి చేస్తున్నట్లనిపించి మాణిక్యమ్మ ఊరుకొంది.

"అందుచేత నేను మొదట అనుకున్నట్లు చదివి, సంపాదిస్తే కలిగే లాభాలన్నీ ఎవరి పూజకో ఫలితం కాదు."

"పోనీ మీరు చేసుకొన్న పూజాఫలంగానే వుండేదనుకోరాదూ?" అంది స్వరాజ్యం.

"ఆ మాట నిజం. అయితే నేను చేసే పూజ దేవుడికి కాదు. తెల్లదొరతనానికి."

"దొరతనానికి చేసే పూజ దేవుడికి చేసినట్లు కాదా? నావిష్ణు: పృధివీపతి:" అంది మాణిక్యమ్మ.

ఆ శ్లోకభాగం విని రామనాధం విస్తుపోయేడు. 'ముసలిదేమో అనుకొన్నాను గాని దేవాంతకురాలే' అనుకొన్నాడు. ఒక నిముషం
వూరుకున్నాడు.

"జలియన్వాలాబాగ్‌ దురంతాల వంటివి చేయగల ప్రభుత్వానికి విష్ణు అంశ వున్నదనే అనగలమా?" అన్నాడు.

ఈమారు ఏమంటావన్నట్లు స్వరాజ్యం తల్లి ముఖంలోకి చూసింది.

తాము చదివి కలక్టర్లుగావచ్చి డయ్యరులా, ఓడ్వయర్ల స్థానం పుచ్చుకుంటారు. అమాయక ప్రజల్ని కాల్పిస్తారు. మనుష్యుడిలోని
అభిమానాన్ని చంపడానికి పొట్టలపై పాకిస్తారు. ఆ విధంగా చేసిన సేవలకు ఫలితంగా లభించేవే ఆ హోదాలు, ఆ అధికారాలు, ఆ
సంపదలూను.

"అల్లాంటి రక్తపు కూడు తినేకంటే, నాలుగూళ్ళూ ముష్టి యెత్తుకు బ్రతకడం ఇహానికీ, పరానికీ కూడా మంచిది కదూ?" అన్నాడు.

మాణిక్యమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. అన్నీ విని ఒక్క నిట్టూర్పు విడిచింది.

"ఏం లోకమో, ఏం కాలమో, చదువుకొని వూళ్ళేలవలసిన మగమహారాజులు మాకీ చదువులే వద్దంటున్నారు. గడప దాటకుండా ఇల్లు
దిద్దుకోవలసిన ఆడది మగాళ్ళతో సమానంగా చదువుకుంటాననడం...."

"వట్టి పిదపకాలం....." అంటూ స్వరాజ్యం తల్లి మాటలను ఎగతాళి చేసింది.

"పిదపకాలమో, కాదో, నీ బ్రతుకు చెప్పడం లేదూ?"

స్వరాజ్యం చదువుకొంది. ఆమె చదువుకోవడాన్ని అత్తవారు సహించలేకపోయారు. మానిపించాలనుకుంటే ఆ రోజున ఆమె ఒప్పుకోలేదు. ఈ
వేళ మానేసినా వాళ్ళు తీసుకెళ్ళడానికి ఒప్పుకొనే స్థితిలో లేరు. ఆరోజున కూతురు చదువుకోడాన్నే సమర్థించినా, ఈ వేళ కూతురు
జీవితం మోడయిపోయిందని బాధపడుతూంది తల్లి.

కుటుంబ జీవితంలో ఏవో గొడవలున్నాయని గ్రహించి రామనాధం గమ్మునయిపోయేడు. తొందరపడి ఇంటిగుట్టు బయటివాళ్ళవద్ద తేలిపోయానే
అని మాణిక్యమ్మ సంకటపడుతోంది. అనవసర ప్రసంగం తెచ్చినందుకు స్వరాజ్యం తల్లిమీద కొరకొరా చూస్తోంది.

ఈ అసందర్భ స్థితినుంచి బయటపడేస్తూ కళాసీ ఒకడు వచ్చేడు.

"ఎడ్డుగారు రమ్మంటున్నారు."

అక్కడినుంచి లేచిపోవడం ఎల్లాగా అనుకుంటున్న రామనాధానికి ఆ పిలుపు ఆకాశవాణిలా వినిపించింది. రమ్మంటున్నదెవ్వరో కూడా
ఆలోచించకుండానే గమ్మున కదిలేడు.

"ఇప్పుడే వస్తానండి."



అయిదు


పడవ టాపుమీద చాలా మంది కూర్చుని వున్నారు. వారిలో తన అవసరం ఎవరికి వచ్చిందాయని అంతవరకు వచ్చాక గాని రామనాధానికి
తోచలేదు. అవసరం ఉంటే తన దగ్గరికి రావాలి గాని. ఈ పిలిపించే పెద్దరికం ఏమిటనిపించింది. ఎవరో పిలిచేరనగానే ఏమిటో
తెలుసుకోకుండా బయలుదేరినందుకు తనమీదనే కోపమూ, విసుగూ కలిగేయి. కాని మర్యాద తప్పకుండానే అడిగేడు.

"ఎవరండీ పిలిచేరట?"

అంతా ముఖముఖాలు చూసుకొంటున్నారు. మాట్లాడ్డం లేదు. దూరం నుంచి పలకరింపు వినిపించింది.

"పంతులూ ఇల్లారా."

ఆ ఏకవచన ప్రయోగం, కంఠంలో దర్పం, నిర్లక్ష్యం, అధికారం వినిపిస్తూంటే రామనాధం అది తననే అనుకోలేకపోయేడు.

"ఏం మాట్లాడరేం?"

"మేం పిలవలేదు, ఎడ్డుగారు!"

ఎడ్డు అన్నది హెడ్‌ అనే ఇంగ్లీషు మాటకు అపభ్రంశమన్నమాట. అయితే ఆ పిలుపు తనకేనా? అదంతా పోలీసు
ఉద్యోగపు హుమ్మస్సన్నమాట. రామనాధానికి కోపం వచ్చింది.

"ఎవరా ఎద్దు?"

దూరం నుంచి నోట్లో చుట్టతోనే కానిస్టేబుల్‌ దర్పం కనబరిచేడు.

"ఏటిరా బాపనోడు మా గీరగా మాట్లాడుతుండాడు. డొక్కలిరగ తన్నించుకొని బొక్కలోగాని కూకుండాలనుందేటి?"

రామనాధానికి ఆ మాటలు మహా అవమానకరంగా ఉన్నాయి. కాని, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంక తర్వాత మాటతో తన్నుకోవడమే
మిగులుతుంది. పోలీసులంటే చిన్నప్పటి నుంచీ రక్తమాంసాలలో జీర్ణించిపోయిన బెరుకు ఓ మూల. నాలుగు తన్నితే వీడికిక్కడ
దిక్కేమిటి? అనే పడుచుదనపు తీండ్రం ఓ మూల.

రామనాధం పోలీసు కూర్చున్న చోటికి చరచరా నడిచేడు. జేబులోంచి అగ్గిపెట్టె తీసి పుల్ల వెలిగించేడు. ఆ వెలుతురులో ప్రక్కనే
వున్న టోపీమీద నెంబరు చదివాడు.

"మూడువందల తొంభయ్యారు."

"ఏయ్‌ టోపీ ముట్టుకున్నావా జాగ్రత్త!"

రామనాధం నిర్భయంగా దగ్గరికి రావడం, టోపీమీద నెంబరు చదవడం చూస్తోంటే పోలీసుకు ధైర్యం సన్నగిల్లుతోంది.

"ఏ స్టేషను నీది?....."

పోలీసు హెడ్డుగారంటూ నలుగురూ చేతులు నలుపుతూంటే దర్పం చూపబోయిన హెడ్డుకు ఆ ఏకవచన ప్రయోగం చెవిమీద తేలు కుట్టినట్లు
అనిపించింది.

"మర్యాదగా మాట్లాడు."

రామనాధం ఇంక వెనక అడుగువేసే ధోరణిలో లేడు. అనవసరంగా అవమానించినందుకు ఓ మూల ఉక్రోషం. తన దూకుడు చూసి, పోలీసువాని
మీద చూపుతున్న దాష్టీకం చూసి మెచ్చుకొంటున్న జనం. ఏమిటో ఈ గందరగోళం అని హాలులో వాళ్ళూ, గదులలో వాళ్ళూ బయటకు
వచ్చేరు. పడవ ఓ ప్రక్కకు వొరుగుతూందని చుక్కాని దగ్గర నుంచి సరంగు కేకలు వేస్తున్నాడు. కాని ఎవ్వరూ వినిపించుకోవడం
లేదు. సరంగు ఈ మారు రామనాధాన్నే అడిగేడు.

"పంతులుగారూ! తమరు మీ గదిలోకి వెళ్ళిపొండి. పోలీసాయన ఏదో పొరపాటున అన్నాడు గాని....."

"పొరపాటా! ఒళ్ళు కొవ్వు, గవర్నమెంటు మాది కదా అని తెగ నీలుగు" అని వినిపించింది.

చూస్తున్న జనంలో ఎవరన్నారో, ఎక్కడనుంచి వినిపించిందో ఆ చీకట్లో ఎవరికీ తెలియలేదు. కాని ఆ మాటా, దానికి నాలుగు మూలల
నుంచీ వచ్చిన ఆమోద ధ్వనులూ విన్నాక హెడ్డుకు తన స్థితి అర్ధమయింది. తర్వాత గవర్నమెంటు ఏం చేస్తుందో గాని, ప్రస్తుతం
తన్ను చంపి కాలవలో పారేసినా అదేమిటని అడిగేవాడు లేడని అర్థం అయింది. గాంభీర్యం సడలినా ఉద్యోగపు బుకాయింపుతో
బయటపడడానికి ప్రయత్నించేడు.

"సర్కారు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నిన్ను పోలీసుస్టేషనుకు తీసుకెడతా. రా ఇల్లా కూర్చో."

ఈ దెబ్బతో రామనాధం భయపడతాడని అతని వూహ. కాని జరిగింది వేరు.

రామనాధం ఆ మాట వింటూనే సరంగును కేకేసేడు.

"సరంగుగారూ! ఆత్రేయపురం ఎంతదూరం వుంది?"

"ఆ ముసుగులోదేనండీ, ఏం దిగుతారా?"

రామనాధం తన మాటకు బెదిరిపోయేడని పోలీసువాడు భ్రమపడ్డాడు.

"దిగడానికి వీల్లేదు, కూర్చో."

పోలీసు కంఠంలో ఝమాయింపు వినిపించింది. రామనాధం అమాయక కంఠంతో హేళన చేసేడు.

"ఏం, నన్ను పోలీసుస్టేషనుకు తీసుకెళ్ళవూ? పోనీలే నీకు పనుంటే నేనే వెడతాను. నువ్వు పంపించేవని చెప్తా. నీ నంబరు మూడు
వందల తొంభయ్యారుగాని, ఎందుకేనా మంచిది నీ పేరేమిటి?"

పోలీసువాడు ఆ అవహేళనకు గుటకలు మింగుతూంటే అందరూ ఫక్కున నవ్వేరు.

అవహేళన ధోరణిలో పడ్డాక రామనాధం తన విజయాన్ని పూర్తి చేసుకొనకుండా వుండలేకపోయాడు.

"సబినస్పెక్టరుగారి పేరేమిటి? సింగుగారా? జోసెఫ్‌గారా? అబ్దుల్లా సాయిబుగారా?"

ఆ పేర్లన్నీ తానెరిగిన సబినస్పెక్టర్లవే కావడంతో పోలీసువానికి నోట మాట రాలేదు. తాను పొరపాటున కందిరీగల తుట్టెలో
చేయిపెట్టేననిపించింది. ఈ వ్యక్తికి పోలీసు ఉద్యోగులతో ఎల్లాగయితేనేం మంచి పరిచయమే వున్నట్లుంది. తన డబాయింపు యెదురు
తిరిగిందనిపించింది.

సరంగు పరిస్థితుల స్వారస్యం గ్రహించేడు.

"హెడ్డుగారూ, దిగుతారా?"

"హెడ్డూ కాదు, గొడ్డూ కాదు. వట్టి మామూలు పోలీసు బంట్రోతు గాడండీ! డబాయించి ఓ పావలా డబ్బులు వడుక్కుంటే కల్లు పాక
ఖర్చు వెళ్ళిపోతుందని చూసేడు"... అనేసేడు రామనాధం.

అప్పటికప్పుడే పోలీసు హడావిడిగా పడవ దిగి గట్టు ఎక్కేస్తున్నాడు.

"కల్లు పాకలో మాత్రం డబ్బిస్తాడనా, అక్కడా లొట్టెలివ్వకుంటే కుండలు పగలకొడతాననే కూర్చుంటాడు."

పోలీసువాడు గట్టు మీదికి దిగిపోయేడని ధైర్యం చిక్కాక ప్రేక్షకులలో ఒకడు వ్యాఖ్యానించాడు.

ఆ ఘటన రామనాధానికి చాలా చిరాకు కలిగించింది. పోలీసువాని బుకాయింపునూ, దబాయింపునూ అంత సులభంగా ఎదురు తిప్పగలిగినందుకు
సంతోషం కలగలేదు. మాటా, మర్యాదా కూడా యెరగని లంచగొండులు జనాన్ని దబాయించుకొని తినేస్తున్నారనే ఆలోచన ఇంత ప్రత్యక్షంగా
అతనికెన్నడూ అనుభవం కాలేదు. ప్రభుత్వంలో ఉన్న ఇంగ్లీషు వాళ్ళు పెద్ద ఎత్తున పెద్ద మొత్తాలు తినేస్తూంటే, వీళ్ళు చిన్న
మొత్తాలు తినేస్తున్నారు. ప్రభుత్వానికి వీళ్ళు కాపలా, వీళ్ళకి ప్రభుత్వం రక్షణ. ఇద్దరూ జనాన్ని నొక్కేసి జలగల్లా
పీల్చేస్తున్నారు. ఇద్దరికీ టిక్కట్టిచ్చేస్తేనే దేశానికీ, దేశంలోని ప్రజలకీ సుఖం.

అనేక ఆలోచనల ఆవేశంతో ఉడికిపోతూ రామనాధం నిశ్శబ్దంగా వచ్చి తన గదిలో పడుకొన్నాడు. అప్పుడే ముగిసిన ఆ ఘటన మీద
ప్రక్క గదిలో నడుస్తున్న వ్యాఖ్యలు వింటూనే లేచి కూర్చున్నాడు.

"మామ్మగారూ!"

"నాయనా!"

రెండు గదుల మధ్యనున్న చెక్కల తలుపు తెరుచుకొంది.

"ఇందాకా పూజాఫలం, సేవా, అదృష్టం అన్నారు. చూశారా--చదువుకొని పూజించవలసింది ఈ లుచ్ఛాలని, వీళ్ళ గురువుల్ని
సేవించుకోవాలి. అదే మా అదృష్టం."

ఒక్క క్షణం నిశ్శబ్దం.

"చదువుకొని ఈ దుర్మార్గులకీ, దుష్టులకీ సహాయం చేయడమే కాదా మా ఆశయం. ఆ వుద్యోగమే బ్రతుక్కి పరమార్థం అనుకొన్నాం.
మా పూర్వులు చేసిన పుణ్యకార్యాలూ, మా భార్యలు చేసిన పూజలూ మా చేత ఈ లుచ్ఛాలకి చేతులు నలిపించడం కోసమేనా......ఓరి
దేవుడా!"

ఆక్రోశం, ఆత్మగ్లాని, అభిశంసనంతో కంఠం నిండి రామనాధం పక్కమీదికి వొరిగేడు.



ఆరు


నీటిమీది నుంచి వస్తున్న చల్లనిగాలికి వళ్ళు కటకటలాడిపోతూంటే రామనాధానికి తెలివి వచ్చింది. బల్లలమీద జారి ముడుచుకుపోయిన
జింఖానాను నడ్డి క్రిందికి లాక్కుంటూనే ముణగదీసుకొని శాలువా నెత్తిమీదకంటా తీసుకొంటూ ఆలకించేడు. పడవ టాపు మీద దబా దిబా
మనుష్యులు అటూ ఇటూ నడుస్తున్న చప్పుడు. బయట గట్టుమీద కూడా హడావిడిగానే వుంది. దగ్గరలోనే కోళ్ళు అరుస్తున్నాయి.

"ఎక్కడికొచ్చాం అబ్బా?"

పడుకున్నవాడు లేవకుండానే, గది తలుపు తెరిచేడు. చల్లనిగాలి రివ్వున తలుపులు తోసుకు వచ్చింది. ఇంక బద్ధకంగా పడుకోవడం
సాధ్యం కాలేదు. కనీసం తలుపులు వెయ్యడానికైనా లేవాలి.

మసిబారిన లాంతర్ల వెలుతురులో గట్టుమీద మనుష్యులు నీడలలా కదులుతున్నారు. దట్టంగా కమ్ముకొన్న పొగమంచు తెరలను చీల్చుకొని
రాలేక రాలేక వారి మాటలూ, కేకలూ కలలోలాగ వినిపిస్తున్నాయి.

పడిచెక్క మీద చిన్న గుడ్డిలాంతరు చేతబట్టుకొని నిలబడి పనులు పురమాయిస్తున్న ఆసామీని రామనాధం పలకరించాడు.

"ఎక్కడికొచ్చాం?"

అతడు వెనుకకు తిరగకుండా, వార్ఫు మీదికి అడుగుపెడుతూ సమాధానం ఇచ్చేడు.

"గన్నారం చేరింది. దిగొచ్చు."

గోదావరి కాలవల్లో ఒకదానిమీద వుంది గన్నవరం. అక్కడ గోదావరి పాయల్లో ఒక దానిని ఆక్విడక్టుమీదుగా దాటి ఆ కాలవ
రాజోలు ఖండంలో ప్రవేశిస్తుంది. తెల్లవారితే గాని పడవల్ని ఆక్విడక్టులోకి వదలరు. అందుచేత పడవలు గన్నవరం రేవు
చేరేసరికి రాత్రి ఎంత మిగిలివున్నా అవి అక్కడ ఆగవలసిందే. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంచేత తెల్లవారి నలుగురూ
చేరేవరకూ ప్రయాణీకులు కూడా అక్కడ ఆగవలసిందే.

అందుచేతనే దిగవలసిన రేవు వచ్చినా రామనాధం తొందర చూపలేదు. పడవలోంచి సరుకును దింపుతున్నారు. ఆ హడావిడిలో మరి
నిద్రపట్టదు. లేచాడు. నెమ్మదిగా లేచి చీకట్లోనే తడుములాడుతూ పక్కబట్టలు మడతలు పెడుతున్నాడు.

ప్రక్క గదిలో నుంచి పలకరింపు వినిపించింది.

"బాగా రాత్రుందేమిటి నాయనా?"

రామనాధం గదిలోంచి తొంగి చూసేడు.

"ఇంకా చుక్క పైకొచ్చినట్లు లేదండి మాణిక్యమ్మగారూ!"

మాణిక్యమ్మ స్వగతం లాంటి సమాధానం ఇచ్చింది.

"మా బండి వచ్చే వుంటుంది. సూరిగాడు ఎక్కడో పడి నిద్రపోతూండి వుంటాడు."

స్వరాజ్యం నిద్ర లేవలేదాయని ఆ చీకట్లోనే రామనాధం రెండోగదివేపు చూసేడు. అతని సందేహాన్ని సంతృప్తి పరుస్తూ చెక్క కూర్పు
ఆవల ఆమె కంఠం వినిపించింది.

"వస్తే మాత్రం ఇప్పుడెక్కడ బయలు వెళ్ళగలం? చీకట్లో.... గతుకులూ.... గోతులూ........"

ఆమెను పలకరించాలనిపించింది గాని సందేహించాడు. ఒక్క నిముషం నిశ్శబ్ధం.

"పెట్టెలో పైనే వుంది నా చీర తీసియ్యి. నీది కూడా తీసుకో."

"ఎందుకు?"

"మళ్ళీ పనికట్టుకు వస్తామా? వశిష్ఠలో స్నానం చేసి పోదాం....."

ఆమె మాట పూర్తి కాకుండానే కూతురు ఆ సలహాను నిరాకరించింది.

"ఈ చలిలో నే మునగలేనమ్మా!"

మాణిక్యమ్మ ఆశ్చర్యం ప్రకటించింది.

"చలేమిటే?"

"పుణ్యం లేకపోతే పీడాపోయిరి. నువ్వెళ్ళి స్నానం చేసిరా."

కూతురు మొండితనం చూసి తల్లికి కోపం వచ్చింది. ఆ గునిపింపు విని రామనాధం నవ్వుకున్నాడు.

"రాతని పట్టే బుద్దులు......"

తల్లి విసువూ, విచారమూ కనబరచింది.

"అమ్మా! నా బుద్ధికీ, రాతకీ లోపం చూపించి లాభం లేదు. నీ రక్తం పంచుకు పుట్టిందాన్నే నేను....."

అంత విసువూ, కోపంలోను కూడ కూతురు గడుసు సమాధానానికి మాణిక్యమ్మ ఒక్క క్షణం విస్తుబోయి, నవ్వుకుంది. వస్తున్న నవ్వు
ఆపుకొని, రామనాధం చప్పుడయ్యేలా పెట్టె మూతవేశాడు.

"కొవ్వొత్తి వుంది, కావాలాండీ?"

"రాత్రిదే వున్నదండీ, వెలిగించలేదు."

తాను ఆపేక్షించిన కంఠమే సమాధానం ఇవ్వడం అతనికెంతో సంతృప్తి కలిగించింది.

"దిగుతున్నారా యేం నాయనా?"

"లేదండి. పడవల గుమాస్తా కోసం చూస్తున్నా, సామాను వప్పచెప్పేస్తే, ఇంక మా వూరు నడిచి....."

తమ పాలేరూ, బండీ రేవు దగ్గరలో వుంటాయి చూసి పెట్టమని మాణిక్యమ్మ సాయము కోరింది.

"వారి సామానూ మన బండిలోనే వస్తుంది. వారి వూరు మీదుగానే కదా మనము వెళ్ళేది?"

స్వరాజ్యం ఆహ్వానానికి మనస్సు ఉత్ఫుల్లం అయినా రామనాధం ఎంతో సంకోచం చూపేడు.

"అబ్బే! ఎందుకండి? రోజూ కొబ్బరికాయ బళ్ళు మా వూరినుంచి వస్తూనే వుంటాయి. ఏ బండీకో వప్పచెప్పేస్తాను.
మధ్యాహ్నానికల్లా......"

"మాకేం కష్టం లేదు. మొగమాటం......" అని మాణిక్యమ్మ చెప్పబోతోంది.

కాని, స్వరాజ్యం తల్లి మాటకు అడ్డం వెళ్ళింది.

"అంత బండెడు సామానుంటే కష్టమే అనుకోండి."

ఆ కంఠంలో వినబడని నవ్వుకూ, వినబడిన హాస్యానికీ రామనాధం తొట్రుపడ్డాడు.

"అబ్బే! అంత సామానేం లేదనుకోండి."

"ఓ చిన్న కావడిపెట్టె......"

ఈమారు రామనాధమూ ఆ హాస్యంలో మాట కలిపేడు.

"కాదండి బోషాణమే......."

ముగ్గురూ నవ్వేరు. సమస్య తేలిపోయింది.

"అయితే అల్లా వెళ్ళి రెండు పందుం పుల్లలు విరుచుకొస్తా. మీ బండివాడి పేరేమిటన్నారు?"

"సూరాయి!" అని మామ్మగారు అతని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

మొదటి భాగానికి స్వరాజ్యం సమాధానం ఇచ్చింది.

"పుల్లల కోసమే అయితే తొందరలేదు. మా దగ్గరున్నాయి."

రెంగు గదుల మధ్య నున్న తలుపు తెరుచుకుంది.

పలుదోము పుల్ల చేతికివ్వరు.

తలుపు వద్ద మరచెంబు లీలగా కనిపిస్తోంది.

"ఉండండి, వొత్తి వెలిగిస్తా."

అవసరం లేదంటూ చెంబుమీది పుల్ల వొకటి తీసుకొని రామనాధం వార్ఫుమీద అడుగు పెట్టేడు.

"ఇక్కడే వుంటారు గదా!" అన్నాడు.

"మీరు వెళ్ళిరండి." అంది స్వరాజ్యం.



ఏడు


పూటీ గోతుల్లో ఓ మారటూ, ఓ మారిటూ ఒరగబెడుతూ రెండెడ్లబండి నెమ్మదిగా నడుస్తోంది. కొమ్ముతాళ్ళు చేతబట్టుకొని సూరాయి ముందు
నడుస్తున్నాడు. మాణిక్యమ్మ ముందు వేపు కూర్చుండి, తామిల్లు వదిలిన ఈ ఏడెనిమిది రోజుల్లో ఇంటి వద్ద జరిగిన విశేషాలు
తెలుసుకుంటోంది. స్వరాజ్యం ఏదో ఆలోచించుకుంటూ నడిచి వస్తున్న రామనాధాన్ని చూస్తోంది.

ఇందాకా కాలవ రేవులో ముఖం కడుక్కుని పైకి వస్తూంటే ఎదురైన పెదతండ్రి శంకరశాస్త్రి పలకరించిన పద్ధతి మనస్సును ఆందోళన
పరుస్తూంటే రామనాధం పరధ్యానంగా వున్నాడు.

చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొన్న రామనాధాన్ని పెంచి పెద్ద చేసినవాడు శంకరశాస్త్రి. ఆయన చాల కోపిష్టి. తాను
కాలేజీ మానడం ఆయనకు ఇష్టం కాదనీ, తిట్టి గందరగోళం చేస్తాడనీ రామనాధం అభిప్రాయం. కాని జరిగింది వేరు. రేవులో ఎదురయి
పలకరిస్తే "ఓహో! నువ్వా! మనూరి బండి వుండాలి రా" అంటూ మారుమాటకేనా అవకాశం ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోవడం అతనికి అంతు
చిక్కలేదు. తాను కాలేజీ మానిన సంగతీ, సహాయ నిరాకరణ ప్రతిజ్ఞ తీసుకొన్న సంగతీ ఇంటికి వ్రాశానని వెంకటరమణ
చెప్పేడు. అది తెలియకపోయినా, ఆ సమయంలో వచ్చినప్పుడు, "ఏం ఇప్పుడు వచ్చేవ"నేనా అడగాలి. అదీ జరగలేదు. తెలుసు.
అయినా.... ఆయనేదో పెద్ద ఆలోచన చేస్తున్నాడనిపించింది. అల్లాంటప్పుడే అటువంటి శాంతం కనబరుస్తాడనేది అనుభవం. అయితే
ఏమిటో అది?

పరధ్యానంగా నడుస్తూంటే కాలికి ఎదురుదెబ్బ తగిలి తూలిపోయేడు. అతని ముఖము వేపే చూస్తున్న స్వరాజ్యం "అయ్యో" అని
ఆదుర్దా కనపరచింది. సూరాయి బండి నిలిపి ముందుకు వచ్చేడు.

కత్తుల్లా వున్న బెడ్డలు తగిలి అతన కాలివేలు చర్మము లేచిపోయింది. బాధగా వున్నా వోర్చుకుంటూ కుంటుతూ అడుగువేశాడు.

స్వరాజ్యం బండిలో కొంచెము వెనక్కి సర్దుకొని పిలిచింది.

"రాండి. బండిలోకి."

రామనాధం మొగమాటపడుతూంటే మాణిక్యమ్మ పిలిచింది.

"తప్పులేదు. రాండి."

సందేహిస్తూ రామనాధం బండిలో చివరన కాళ్ళు వ్రేలవేసుకొని కూర్చో బోయేడు. ఆ కూర్చుండటంలో కాలివ్రేలి నరాలు తోడుకుపోతున్నాయి.
అతని అవస్థ చూచి స్వరాజ్యం చాలా నొచ్చుకుంది.

"ఏదీ కాలేది?"

ఆ పేరున కాలు పైకి తీసుకొనడానికి అవకాశం ఏర్పడింది. గాయం చూసి స్వరాజ్యం "అబ్బా!" అంది. బొటనవ్రేలు బుగ్గ
చితికిపోయి ఇంకా రక్తం కారుతోంది.

స్వరాజ్యం వెంటనే సూరాయిని పిలిచింది. చెంబు ఇచ్చి రోడ్డు ప్రక్కనే పారుతున్న పంట కాలవలోంచి నీళ్ళు తెప్పించింది. గాయం
కడిగింది. రామనాధం తన జేబులోని చేతిరుమాలు చింపియిస్తే తడిపి కట్టుకట్టింది. తడిగుడ్డ చుట్టబెట్టేక బాధ తగ్గింది. మరల
బండి కదిలింది.

"ఎల్లా వుందిప్పుడు?"

"బాధ తగ్గిందా?"

"రక్తం ఇంకా చిమ్ముతున్నట్లే వుందే."

స్వరాజ్యం అడుగడుగునా సానుభూతి తెలుపుతూంటే రామనాధం సిగ్గుపడుతున్నాడు. కాలు క్రిందికి వ్రేలాడ వేసుకొంటే ప్రాణం జివ్వుమంటున్నా
అంగీకరించడానికి మగతనపు ధీమా ఆటంకం అవుతోంది. మాట తప్పించడానికి ప్రయత్నించి సఫలుడయ్యేడు.

"ఇంటికెళ్ళి ఇంకేం చేయబోతున్నారు?" అని స్వరాజ్యం ఆలోచనలను దారి తప్పించేడు.

సూరాయి నుంచి ఇంటి కబుర్లు తెలుసుకుంటూ, ఆ ధోరణిలో పడి వున్న మాణిక్యమ్మ ఓ చెవి వెనక్కి వేసే వుంచింది. రామనాధం
ప్రశ్నకు కూతురు ఏం సమాధానమిస్తుందో అని ఆమె సావధాన అయింది.

"ఏం చేసేటందుకేముంది? వచ్చే ఏడాది కాలేజీ......"

చదువు మాట వచ్చేక మాణిక్యమ్మ వూరుకోలేకపోయింది. ఆ సమస్య మీదనే రోజూ ఘర్షణలు పెరిగి, తత్ఫలితంగానే స్వరాజ్యం
తల్లితో తన అత్తవారి ఇంటికి బయలుదేరింది. బయలుదేరి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పింది.

"ఇదే ఆఖరు మాటు."

"నువ్వు కాపురం చేయడం నా కోసమే నన్నట్లు మాట్లాడుతావేం?"

"నీ కోసమే ఈ ప్రయాణం."

అక్కడ మాణిక్యమ్మ ఆశించిన ఫలితం కలగలేదు. చదువుకొన్న కోడలుకు ఆ ఇంట్లో అడుగుపెట్టే అధికారం లేదని అనేక రూపాలలో
స్పష్టంగా చెప్పేసేరు. కాని మాణిక్యమ్మకు ఇంకా ఆశ పోలేదు. తన భార్య వేపు అల్లుడు చూసిన చూపులలో ఆమె ఆశ
నిలుపుకుంది. మరల కూతురు కాలేజీలో చేరడం, చదవడం అనే విషయం తలపెట్టకుండా వుంటే ఆమె కాపురం ఓ నాటికి చక్కబడుతుందని
ఆమె ఆశ.

కూతురు తన ఆశను ప్రత్యాఖ్యానం చేస్తున్నట్లనిపించేసరికి తామసం కలిగింది.

"ఆనవాయితీ లేదో అంటే విన్నారు కాదు. ఆడపిల్లకి బడి చదువులెందుకని నెత్తీ - నోరు కొట్టుకున్నా అటు తండ్రీ, ఇటు కూతురూ
చెవి దూరనిచ్చారా? అక్కడి కింత అయింది. సిగ్గు లేకపోతే సరి. మళ్ళీ చదువుతుందిట. చదువు....."

తాను చదివే రోజుల్లో ఆమె కూడా ప్రోత్సాహమే ఇచ్చిందనీ, అత్తవారితో తెగతెంపులు దశ వచ్చాకనే ఆమె ఆ మాటలన్నదనీ
జ్ఞాపకం చేస్తే ఆమె అగ్గిపుంత అయిపోతుంది.

పరాయివాళ్ళ ముందర రోడ్డు మీద మాటలెందుకులే అన్నట్లు స్వరాజ్యం ఓ చిరునవ్వు నవ్వి వూరుకుంది. మాణిక్యమ్మ ఆ అవకాశాన్ని
జారవిడుచుకోలేకపోయింది.

"సవ్యంగా సాగిపోతున్నన్నాళ్ళూ మా అంత తెలివైన వాళ్ళు లేరనుకుంటాం. కాస్త కాలూ, చెయ్యీ వంగేక అన్నీ తెలిసొచ్చేయి.
ఇప్పుడేమనుకుంటే మాత్రం.....?"

హఠాత్తుగా స్వరాజ్యం తండ్రి అబ్బాయి నాయుడుకు మశూచికం పోసి రెండు కళ్ళూ పోయాయి. చేస్తూన్న ప్లీడరు గుమాస్తా పని మానుకొని
రాజమండ్రి వదలి స్వగ్రామం చేరుకున్నాడు. వియ్యాలవారితో పేచీ పడి కూడ సాగిస్తూన్న కూతురు చదువు నిలిచిపోయింది. తాను
అవధ్యుడినై పోయాననీ, కూతురు నిరాధారురాలైపోతుందనీ నాయుడు ఆందోళన పడ్డాడు.

మాణిక్యమ్మ ఎత్తిపొడుపు దానికే. ఆమె కోపాన్ని సర్దేటందుకు రామనాధం ప్రయత్నించాడు.

"అదేం మాటలెండి. ఆడపిల్లని చదివించడానికి నాయుడుగారి మాదిరిగా సాహసం చెయ్యగలవాళ్ళు ఎందరున్నారు? చదువులో వున్న
గొప్పదనం ఆయనకు తెలుసు కనుక..."

అంత నిరాశలోనూ, కోపావేశంలోనూ కూడ మాణిక్యమ్మ ఆ మెచ్చుకోలుకి వుబ్బిపోయింది.

"ఆ గొప్పదనం ఎద్దుముడ్డి పొడుచుకొనేవాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ నాలుగు ముక్కలూ నోట్లో ఉన్నాయి గనుకనే ఈ వేళ ఇంత
అన్నం తింటున్నాం. అది మిగిల్చిన నాలుగెకరాలూ తీసుకోవోయి అనగలుగుతున్నాం. లేకపోతే ఏముంది?" అంది.

'తీసుకోవోయి' అన్నది అల్లుడితో. కాని, ఆ నాలుగెకరాలూ కోడలికి అబ్బిన 'చదువు దుర్గుణాన్ని' సరిపుచ్చగలుగుతాయని
వియ్యంకుడు భావించలేకపోయేడు. స్వరాజ్యం మెళ్ళో పుస్తె కట్టిన ఆ యువకుడికి గునపం పట్టుకొనే చేతితో కలం పుల్ల
పట్టుకోవచ్చుననే సంగతే తెలియదు.

స్వరాజ్యం తల్లి మెత్తపడడాన్ని వుపయోగించుకొంది.

"అప్పుడే చెప్పేరు వీరేశలింగం తాతగారు. మళ్ళీ వూరికెందుకు. కాలేజీలో చేరిపొమ్మన్నారు."

"ఊరికే అవుతుంది. బువ్వ నడవద్దూ."

"ఇప్పుడనకేమమ్మా! లేకపోతే శరణాలయం స్కూలులో పనిచేయమన్నారు కదా...."

"అన్నీ అయాయి. ఇంక నీ సంపాదనమీద బ్రతకాలి. బాగుందమ్మా!"

అత్తవారింట సలక్షణంగా కాపురం చేసుకుంటూ వుండవలసిన కూతురును తమ తిండికోసం ఉద్యోగంలో పెట్టడం అనే ఆలోచనను ఆమె సుతారమూ
అంగీకరించలేక పోయింది.

స్వరాజ్యం గతకాలపు ఆలోచనలలో కొట్టుకుపోతూ చెప్పుకుపోతోంది.

"ఈపాటికి బి.ఏ. ఆఖరి ఏడాదిలో ఉండేదాన్ని, తాతగారి మాట వినే ఉంటే-- ఇప్పుడు మాత్రం ఏముంది? ఏమండీ, చదవమంటారా?"

చివరి ప్రశ్న రామనాధానికి. అయితే ఆమె ఆలోచనను అతడు హర్షింపలేక పోయేడు. ఒక్క క్షణం క్రితం ఆమెను చదివించినందుకు
తల్లిదండ్రులను అభినందించిన వాడే ఇప్పుడామె మరల కాలేజీలో చేరుతాననడాన్ని హర్షించలేక పోయేడు. అతనిలో పొంగులు వారుతున్న
సహాయ నిరాకరణోత్సాహం దెబ్బతింది.

"ఓ మూల దేశ స్వాతంత్య్రం కోసం కాలేజీలూ, స్కూళ్ళూ వదిలెయ్యాలని నాయకులు పిలుస్తూంటే, స్వరాజ్యం మళ్ళీ కాలేజీలో
చేరుదామనుకోవడం!"

కారణం ఏదయినా కూతురు కాలేజీలో చేరడాన్ని నిరుత్సాహపరుస్తున్న రామనాధాన్ని మాణిక్యమ్మ అభినందించింది.

"అల్లా చెప్పు నాయనా! ఇంత చదువుకుంటే ఇంతయిందా? మళ్ళీ చదువేమిటి? చాల్చాలు...."

ఇద్దరి వాదాల్నీ సమన్వయం చేస్తున్నట్లు స్వరాజ్యం తన పథకానికి చిన్న సవరణ జత పరచింది.

"ఒక్క ఏడాదే కదా. గాంధీగారు చెప్పింది? మా యింటి వ్యవహారాలు ఇప్పుడప్పుడే తేలేయా? అవన్నీ సర్దుకొని బయటపడేసరికి
ఆయన పెట్టిన గడుపు ఎల్లాగూ తీరుతుంది."

గాంధీగారి మాటలమీద అవిశ్వాసమే అతనికా మాటల్లో వినిపించింది. 'నాకు విశ్వాసం లేదు. ఏదో పెద్దవాడు చెప్తున్నాడు గనుక
విందాం. తీరా చేసి ఇదంతా ఓ ఏడాది ముచ్చటే కదా' అంటున్నట్లు అనిపించింది.

ఆ ఆచరణ కూడా గాంధీగారు చెప్పినందుక్కాదు. తమ ఇంటి వ్యవహారాలు ఈ లోపున ఎలాగూ తేలవు గనక.

గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం! రామనాధం నవ్వేడు. విశ్వాసం లేని పని నిరుపయోగం. వారం నాడు చెరుకువాడ
లక్ష్మీనరసింహంగారు తమ ఉపన్యాసంలో ప్రబోధించిన గీతా శ్లోకం మనస్సులో మెదిలింది.

మయి సర్వాణి కర్మాణి సన్న్యాస్యా ధ్యాత్మచేతసాః
నిరాశీర్నిర్మమో భూత్వా: యుద్ద్యస్వ విగతజ్వరః

ఆనాడు తోచని లోతులు బండి ముందు నడుస్తూ సూరాయి ఎత్తుకున్న పదంలో వినిపించేయి.

మమ్ము బ్రోవా
మహిని వెలసితివి
మా......హాత్మాగాంధీ ||

రామనాధం తన ఆలోచనలను సమర్థిస్తున్నట్లు వినిపించిన ఆ పాటను వింటూ తల ఎత్తేడు. బహుశా ఆ ఆలోచనే తోచి ఉంటుంది,
స్వరాజ్యమూ తల ఎత్తింది. ఇద్దరి చూపులూ నవ్వుకున్నాయి.



ఎనిమిది


బండి గోరింకల కాలవ దాటింది. వూరు దగ్గిర పడుతున్న కొద్దీ రామనాధం ఉత్సాహంగా సంభాషణలో పాల్గోవడం లేదని స్వరాజ్యం
గ్రహించింది. బహుశా కాలి బాధ ఎక్కువగా వుందేమో ననుకొంది.

"ఏం బాధ ఎక్కువగా..."

ఆ ప్రశ్నతో రామనాధం చటుక్కున ప్రకృతిలో పడ్డాడు. "అబ్బే ఏం లేదు"--అంటూనే మాట మార్చేడు.

"మీరు కాలేజీలో చేరుతానంటే నాయుడుగారేమంటారు?"

అబ్బాయి నాయుడికి కాంగ్రెసు అన్నా, గాంధీగారన్నా ఎంతో భక్తి అని చుట్టు ప్రక్కల వూళ్ళల్లో ప్రసిద్ధి. అటువంటి వాడు ఓ
మూల గాంధీగారు కాలేజీలు వదలమంటూ వుండగా, తాను కూతురును కాలేజీకి పంపుతాడా?

మాణిక్యమ్మ ఒక నిట్టూర్పు విడిచింది.

"నీకు తెలియదు నాయనా! గాంధీగారు చెప్పనీ, బ్రహ్మదేవుడే చెప్పనీ, ఆయన మాట ఆయనదే......"

గాంధీ వుద్యమం మీద మాణిక్యమ్మకు ఏ మాత్రం సద్భావం లేదని రాత్రి నుంచీ ఆమె చెప్తున్న మాటల్ని పట్టి రామనాధం గ్రహించేడు.
దానికి కారణం కూడా ఏమీ లేదు. భర్త తలపెట్టినదేదయినా తప్పుడుదే అయివుండాలని ఆమెలో విశ్వాసం ఏర్పడి పోయిందని
గ్రహించేడు.

ఈ మారు ఏమనాలో తోచక రామనాధం దిక్కులు చూశాడు. అతని మనస్స్థితిని గ్రహించి స్వరాజ్యం చిరునవ్వు నవ్వింది.

"ఏమిటల్లా చూస్తారు?"

"గాంధీగారంటే మా పెదనాన్నకు మంచి అభిప్రాయం. మీ అమ్మగారికి ఆ సదభిప్రాయం లేనట్లుంది. అయినా మీ అమ్మగారు కాలేజీ చదువు
కూడదనడంలో గాంధీగారి మాటకు విలువనిస్తున్నారు. మా పెదనాన్నగారు...."

"పెదనాన్నగారంటే...."

"మా పెదతల్లి భర్త. వాళ్ళే నన్ను పెంచారు....."

"పిల్లలు లేరు కాబోలు....." అంది మాణిక్యమ్మ.

"అదీ నిజమేననుకోండి. కాని, అసలు నా తల్లిదండ్రుల్ని నేనెరగను. ఎప్పుడో నెలల వాడినై వున్నప్పుడే పోయారట.
అప్పటినుంచీ....."

మరల కొంతసేపటివరకూ అతడు తన ఆలోచనలలోకి జారిపోయేడు. స్వరాజ్యం కూడా నిశ్శబ్దంగా కూర్చుంది. రోడ్డు ప్రక్కనే ఉన్న
చిన్న చిన్న ముగ్గు బట్టీలను దాటి బండి నడుస్తూంది. ఏదో జ్ఞాపకం వచ్చి స్వరాజ్యం బండి ఆపించింది.

"ఏం కావాలి? ముగ్గు తీసుకొందామా? పండుగలు రెండు నెలల్లో వస్తున్నాయి. వెల్లలూ, అవీ వున్నాయి. సున్నపుగుల్లే తీసుకొందాం.
జ్ఞాపకం చేశావు. మంచి పని చేశావు."

మాణిక్యమ్మ ఒక్క బిగిని సంసారపు అవసరాల జ్ఞాపకాలలో పడిపోయింది. బండి ఆగగానే స్వరాజ్యం క్రిందికి వురికింది.

"నే దిగుతా వుండండి."

"ఏమిటా తొందర? ఏ కాలో నెప్పి పెడుతుంది."

సర్దుకోబోతున్న రామనాధం కాలు మీద చేయి వేసి నొక్కుతూ స్వరాజ్యం అభ్యంతరం చెప్పింది.

"బండిలోనే కూర్చోండి. దిగొద్దు. ఇంత ముగ్గు వేసి కట్టు కడితే ఆ బాధ తగ్గుతుంది.

రోడ్డు ప్రక్కన చాపలు పరచి, కాల్చిన సున్నపు గుల్లతో ముగ్గు తయారు చేస్తున్న పల్లెకారు బేరం తగిలిందన్న సంతోషంతో
హడావిడి చేస్తున్నారు.

"రండమ్మగారూ!"

మాణిక్యమ్మ సూరాయి సహాయంతో సున్నపు గుల్లా, ముగ్గూ కొలిపించుకుంటూ వుంటే స్వరాజ్యం రామనాధం వేలి గాయం మీద ఇంత ముగ్గు పోసి
కట్టు కట్టేసింది.

"పెద్ద బాధ లేదు. మీరింత....."

"బాధ ఏమీ లేకపోతే, మీరింత మాటామంతీ లేకుండా కూర్చుండే వారేనా?"

రామనాధం ఫక్కున నవ్వేడు.

"నేను వట్టి వాగుడుకాయనని తేల్చేసేరన్నమాట."

తన మాట కాతడు తీసిన అర్ధం విని ఒక్క క్షణం స్వరాజ్యం విస్తుపోయింది. అంతలో తేరుకొని తానూ నవ్వింది.

ఇంక మళ్ళీ బండి ఎక్కడానికి రామనాధం సిగ్గుపడ్డాడు. చిన్న ఎదురు దెబ్బకి అంత ఆర్భాటమా అని స్నేహితులు నవ్వేస్తారు.

పదడుగులు వేశాక కాలి తీపు తగ్గింది. మళ్ళీ ఏదన్నా తగులుతుందేమోననే భయంతో కాలు ఎత్తి వేయడం తప్ప మనిషి
నడవగలిగాడు.

"దెబ్బ తగిలాక బండి ఎక్కించారు గాని లేకపోతే సుబ్బరంగా ఈపాటికి నడిచేద్దును."

"నెపం ఎల్లాగూ వేశారు. ఎక్కండి పోదాం" అంది స్వరాజ్యం.

కాని, రామనాధం బండి ఎక్కలేదు. స్వరాజ్యమూ అతనితోనే నడిచింది.

"ఇదిగో సప్తవటి. దాటగానే నల్ల వంతెన, ప్రక్కనే మా తోట."

ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ బండి వెనకాలనే వస్తున్నారు.

రోడ్డు ప్రక్కనే ఒకదాని తర్వాత ఇంకొకటీ ఏడు మర్రి చెట్లు దట్టంగా పెరిగి కొమ్మలతో రోడ్డును మూసేసి కనిపించాయి. వాటి
పాదాల నొరుసుకుంటూ మురుగుబోదె జలజల దొర్లిపోతుంది.

ఏదో చరిత్ర ప్రసిద్ధమైన ప్రదేశాన్ని చూపుతున్నట్లు రామనాధం చెప్పుకు పోతూంటే స్వరాజ్యం ఓ క్షణం నిలబడింది.

చీకటి గుయ్యారంగా పెరిగిన మర్రి నీడలలో బండి నడుస్తూంటే స్వరాజ్యం ఎంతో వుత్సాహం ప్రకటించింది. రోడ్డుకిరువేపులా జొన్నచేలు
లేత సూర్యుని ఎండలో మిలమిల మెరుస్తున్నాయి.

"ఎంత బాగుందో."

రామనాధం ఔనన్నాడు.

"ఊళ్ళో వున్నప్పుడు తప్పకుండా సాయంకాలం ఓ మారేనా ఇక్కడికి వస్తాం. ఈ ఊడలు పట్టుకొని వూగుతూ....."

పదడుగుల్లో మురుగుకాలవ మీద కట్టిన వంతెనలోకి బండి వచ్చేసింది.

"అదే మా తోట."

ఎదురుగా వున్న బోదె కొబ్బరితోటను స్వరాజ్యానికి చూపించేడు.

స్వరాజ్యం ఏదో గుర్తు చేసుకొన్నట్లు ప్రయత్నిస్తూ ప్రశ్నించింది.

"చెరువుగట్టు వేపున సంపెంగ పొదలున్న తోట ఇదేనా?"

"మీకెలా తెలుసు? ఎప్పుడేనా వచ్చారా?"

"మా పినతల్లిగారిది మీ వూరే. పాలెంలో అమ్మవారి గుడి వెనకనే వాళ్ళిల్లు."

"సూరన్న కాపు మా మరదేనండి" అంది మాణిక్యమ్మ.

"అలాగా?"

"ఓ మారు మా పిన్నితో పిల్లలమందరం చెరువుకు వచ్చేం. అప్పుడా సంపెంగ పొదలు వదిలి రాలేకపోయామనుకోండి. ఇంకా అవి
ఉన్నాయా?"

"బ్రహ్మాండంగా వున్నాయి రాండి. ఓ మారు తోట చూసి వెడుదురు గాని."

సంపెంగ పువ్వుల ఆశకు స్వరాజ్యం మెత్తబడేదే గాని, తల్లి ఆటంక పరచింది.

"సూరాయి మీ పెట్టే, పక్కచుట్టా తోటలో పెట్టేస్తాడు.

తోటలోకి వెళ్ళేటందుకు కోరడికి ఒకచోట కంత వుంది. కంత మధ్యలో ఒక పంగలకొయ్య పశువులు చొరబడడానికి వీలు లేకుండా కేవలం
మనుష్యులు దాటి వెళ్ళేందుకు మాత్రం అనుకూలంగా పాతి వుంది.

తన సామాను తాను పట్టుకుపోతానంటున్నా మాణిక్యమ్మ అంగీకరించ లేదు.

"మీ ఊరి వీధుల్లోకి రానివ్వరని గాని, మీ ఇంటివద్దకే సూరాయి తెస్తాడు."

సూరాయి పంచముడు. పంచములకి ముంగండ వీధుల్లోకి ప్రవేశం లేదు.

సూరాయి తన సామానుల్ని తోట మకాం పాకలో పెట్టి వచ్చేవరకూ రామనాధం వారితో మాట్లాడుతూ నిల్చున్నాడు.

బండి కదులుతూంటే స్వరాజ్యం అతనిని తమ ఊరు రమ్మని ఆహ్వానించింది.

"ఇంక వూళ్ళోనే వుంటారు గనక యెప్పుడేనా వస్తూండండి."

"రా బాబూ! మీబోటి వాళ్ళని చూస్తే వారెంతో ఆనందపడతారు" అంది మాణిక్యమ్మ.

రామనాధం ఒక వారం లోపున వస్తానని వాగ్ధానం చేశాడు.

"తప్పకుండా వస్తా. వచ్చి నాయుడుగారి దర్శనం చేసుకుంటా. అంతవరకూ నా నమస్కారాలు తెలపండి."

"వీలు చిక్కినప్పుడల్లా దయచేయండి. మీబోటి పడుచువాళ్ళకేమంత దూరం?"

ఆమె కళ్ళు ఒత్తుకుంది. మువ్వల గలగలలతో బండి కదులుతూంటే స్వరాజ్యం మరల హెచ్చరించింది.

"తప్పకుండా రావాలి."



తొమ్మిది


బండి దూరం పోయే వరకూ రోడ్డు మీదనే నిలబడి, రామనాధం తోట వేపు తిరిగేడు.

"ఎవరు వాళ్ళు?" అన్న ప్రశ్న వినబడ్డంతవరకూ తన వెనక ఎవరో నిలబడి వున్నారన్న ఆలోచన అతనికి కలగలేదు.
తిరిగి చూసేడు. సుబ్బన్నశాస్త్రి.

"నువ్వా?"

సుబ్బన్నశాస్త్రి మళ్ళీ ప్రశ్నించేడు.

"ఎవరు ఆవిడ? చూసిన గుర్తుంది."

"చిరతపూడి. నాయుడుగారి తాలూకా."

"అల్లా చెప్పు, సూరన్నకాపు ఇంట్లో చూశాను నిరుడు సత్యనారాయణ వ్రతానికి. ఎక్కడా చూశాను అనుకొంటున్నా."

సుబ్బన్నశాస్త్రి పౌరోహిత్యాలు చేయిస్తుంటాడు. ఆ విధంగా చుట్టుప్రక్కల నాలుగైదు మైళ్ళలోపు గ్రామాలలో జరిగే ప్రతి చిన్న
విషయమూ, ప్రతి కుటుంబ చరిత్రలోని సుఖదుఃఖాలూ అతనికి హృత్కవిలి.

"మగడొదిలేసి మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు......"

చదువుకొన్నదనే కక్షతో భర్త తీసుకెళ్ళడం లేదనే గాని మిగిలిన గాథలు రామనాధానికి తెలియవు.

సుబ్బన్నశాస్త్రి మహోత్సాహంతో చెప్పుకుపోయేడు. అబ్బాయినాయుడు బాగా సంపాదిస్తున్నాడు. ఆస్తి వుంది. ఒక్కర్తే కూతురు అనే
ఆశతో చాగల్నాటి సంబంధం వచ్చింది. వాళ్ళూ బాగా వున్నవాళ్ళేనన్నారు. అప్పటికే ఈ అమ్మాయి ఏదో చదువుతూంది. పెళ్ళయ్యాక
అత్తవారు ఆమెను చదివించవద్దన్నారు. నాయుడు ససేమిరా అన్నాడు. రెండేళ్ళు గుసాగుసీ పడ్డారు. చివరకు అతడీమెను వదిలేసి
మరో పెళ్ళి చేసుకున్నాడు.

రామనాధం ఆ వార్త విని మ్రాన్పడిపోయాడు. మరుక్షణంలో సర్దుకొన్నాడు.

"దురదృష్టవంతుడు....."

"అంటే....."

"అంత మంచిపిల్ల పెళ్ళాం కావాలంటే మాత్రం యోగ్యత వుండొద్దూ?"

సుబ్బన్నశాస్త్రి గబగబ ముందుకు అడ్డంగా వచ్చి వెక్కిరింతగా ముఖంలోకి తొంగి చూసేడు.

"అప్పుడే కత్తు కలిపేశావేం?"

"ఏడిశావు."

అంతకంటె స్వరాజ్యం మర్యాద రక్షణకి మరో మాట తోచలేదు రామనాధానికి.

"లేకపోతే మంచేమిట్రా నీ మొహం. మంచట మంచి. ఆ నాయుడు బ్రహ్మసమాజికం గాళ్ళతో కలిసి నానా కూళ్ళు కుడిచేడు. ఆ పాపం
వూరికే పోతుందా? కళ్ళు రెండూ పోయి మూలబడ్డాడు. బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి ప్లీడరు గుమాస్తా పని వదులుకోవలసి వచ్చింది.
రెండుచేతులా సంపాదించేది పోయి వున్నది కాస్తా దావాలనీ, వ్యాజ్యాలనీ హారతి కర్పూరంలా హరించిపోయింది. ఒక్కొక్కళ్ళు పుట్టిన వేళా
విశేషం, చమురు కాళ్ళ తల్లులు. ఆ మగడు పీనుక్కి ఇంత తిండి తినే యోగము వుంది కాబోలు, బయటపడ్డాడు....."

ఆ వాక్ప్రవాహాన్ని అరికట్టడానికి చేసిన ప్రయత్నాలను దులపరించేసుకొని సుబ్బన్నశాస్త్రి తాను అనదలచుకొన్నవన్నీ
అనేశాడు.

అతని మాటలలో దేనిని కాదనాలో, దేనికి సమాధానం ఇవ్వాలో అర్ధం కానట్లు రామనాధం ఒక్క క్షణం నిలబడిపోయాడు. శాస్త్రి
విజయ హుంకారం చేసి, ముక్తాయింపు సాయించేడు.

"మంచి పిల్లట! యోగ్యత వుండాలిట.......హు"

నాయుడు కళ్ళు పోగొట్టిన మశూచి రోగానికి బ్రహ్మసమాజ మతం మీద ప్రత్యేక కక్ష లేదన్న మాట శాస్త్రి చెవి దూరలేదు.
మనిషి పుట్టిన వేళల్ని బట్టి వ్యాజ్యాలు రావడం, ఆస్తులు చేరడం వంటివి జరగవనే హేతువాదం అతడికంగీకారం కాదు.

"మీ ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళకిదో జబ్బు. మశూచికం ఆయనకే ఎందుకు రావాలి? అది వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు పోతున్నాయా?
ఆయనకే ఎందుకు పోవాలి....?"

నూరు ప్రశ్నలు. అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరకవు. అందరికీ దొరకవు. రామనాధానికి కొన్ని తెలుసు. మశూచికం ఎందుకు
వస్తుందో తెలుసును. శాస్త్రం చెపుతూంది. కళ్ళు ఎల్లా పోయాయో చెప్పవచ్చు. కాని నాయుడికి వచ్చిన జబ్బులోనే ఆ తికమక
ఎందుకు రావాలంటే....? తాను చెప్పలేడు.

"నాకిల్లాంటి కబుర్లు చెప్పకు."

శాస్త్రి సలహాను పాటించక తప్పదని రామనాధం ఎరుగును. అట్టే శ్రమ పడకుండా చెప్పడానికి కారణాలు కనిపిస్తూంటే, ఊహా బలం
అవసరమయ్యే హేతు ప్రమాణాల్ని శాస్త్రి అంగీకరించడు. అతనిని ఒప్పించడానికి ప్రయత్నించడం కూడా వట్టి కంఠశోషయని
ఎరుగును. అయినా వూరుకోలేకపోయాడు.

"ఇల్లాంటి పిచ్చి నమ్మకాలు...."

ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళలో వ్యాపిస్తున్న జబ్బుకు ఉదాహరణగా శాస్త్రి మరో ఉపపత్తి తెచ్చి చూపించేడు.

"నీ పక్కచుట్ట పాకలోకి తీసుకెళ్ళిందెవరో చెప్పరాని వాడై వుంటాడు."

"చెప్పరాని వాడనేది మొహంమీద రాసిలేదన్నమాట."

"అప్పుడే అనుకున్నా."

"ఏమని?"

"అదే....."

"బ్రహ్మ సామాజికులు కులభేదాల్నీ, అంటుసొంటుల్నీ పాటించరు. బ్రహ్మ సామాజికుల కుటుంబంతో అంత లొల్లాపత్తుగా వుండే రామనాధానికి
మాత్రం ఆ గాలి సోకకుంటుందాయని ఆలోచన శాస్త్రిది.

"రేవుల్లో కూలీలంతా....."

వాళ్ళని అంటరాని వాళ్ళెందరో అన్న ప్రశ్నను అతడు చెవి చొరవనివ్వడు.

"తెలియక చేసింది పాపం కాదు. బయట ఏం చేశావో, ఏ మూల కూళ్ళు కుడిచేవో నాకక్కర్లేదు. ఊళ్ళో ఆ వెర్రివేషాలేం కుదరవు."

"అయితే అక్కడితో రాజీపడగలవన్నమాట."

ఎక్కడ చేసినా అనాచారం అనాచారమేనన్న ఆలోచనతో పోలిస్తే ఇది రాజీయే.

స్నేహితుని వద్దనున్న చనువుతో హాస్యధోరణిలో మాట్లాడుతున్నా, అతని మాటల వెనుకనున్న ఆచార బలాన్ని రామనాధం ఎరుగును.
చదువుకొనేటందుకే అయినా సముద్రాలు దాటి సీమకెళ్ళినందుకు ఆవుపేడ తినిపించి, ప్రాయశ్చిత్తం చేయించేటంత బలం దానికుంది.

అందులోనూ ముంగండ.

బ్రాహ్మణ గ్రామం. అగ్రహారం కాకపోయినా, అగ్రహారాలకున్న అలిఖిత శాసనాలన్నీ ఆచార బలంతో సాగించుకొంటున్న ఊరు. ఆ
ఆచారాలకు తానూ ఎన్నో మార్లు గర్వపడ్డ వాడే. ఇప్పుడు మాత్రం తనకా అభిమానం లేదూ? తన ఊరి వీధుల్లో పంచముల్ని
నడవనివ్వకపోవడం, గొంతు ఎండిపోతున్నా సరే చెరువులో నీటిని పంచములెవ్వరూ ముట్టుకోరాదనడం. చెర్లో చేపలు పట్టకుండా
బరిసెలూ, బాణాకర్రలతో కాపలాలు కాయడమూ అగ్రహార బ్రాహ్మణుల నైష్ఠికత్వానికీ, భూతదయకూ ప్రమాణాలుగా చెప్తూంటే నిన్నటికి
నిన్న పడవలో భుజాలు కుదిలించుకొని గర్వపడ్డాడు.

అంటరానితనం మాన్పించడానికై వారం క్రితం బహిరంగ సభలో చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకమే రాలేదు ఆ సమయంలో.

శాస్త్రి కా సమస్యలేవీ పట్టవు. అతనికి కావలిసింది తన గ్రామంలో ఆచార భంగం జరగకూడదు. ప్రపంచంకేసి చూడాలంటాడు
రామనాధం.

"మన ఊరు దాటనంతవరకే. పొలిమేర దాటండి...."

"దేశం అంతా తగులబడిపోనీ, మా కంఠాలలో ప్రాణం వుండగా అనాచారం మన ఊళ్ళో అడుగు పెట్టడానికి వీలులేదు."

రామనాధం నవ్వేడు.

దేశం అంతా ఓ దారిన పోతూ వుంటే ముంగండ ఒక్కటే మనువు ప్రళయకాలంలో ఎక్కిన ఓడలా మిగిలిపోవడం జరగదు. ఆ అలల
తాకిడిలో, మంటల వేడిలో, అటూ ఇటూ కాక తప్పదు. ఒడిలి నురగక తప్పదు.

శాస్త్రికి ఆ నవ్వు అర్ధం అయింది. ఆ మాట అసత్యం కాదని తెలుసు. ఇంక మాట్లాడలేదు. ఒక నిముషం ఉన్నాక లేచి క్రింద
వేసుక్కూర్చున్న తుండు దులిపి భుజాన వేసుకున్నాడు.

"నీ మూలంగా స్నానానికి ఆలస్యమయింది. ఊళ్ళోకి రావూ?"

రామనాధం వెంటనే ఇంటికి వెళ్లి పెదతండ్రి యెదుట పడడానికి సిద్ధంగా లేడు. ఓ నిముషం తోటలో కూర్చుని, ఆలోచనలు
కూడదీసుకోవాలి.

శాస్త్రి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఓ క్షణం నిలబడ్డాడు.

"కాలేజీ మానేసేవటగా....?"

"స్మార్తం చెప్పుకోవాలనుంది. 'కులవిద్యకు సాటిరాదు గువ్వలచెన్నా' అన్నాడు."

"మేమందరం తింటున్నాం. ఇంక నువ్వు తరువాయి."

తమ కులవిద్య కూడూ, గౌరవం ఇవ్వలేదన్న నిరుత్సాహంలో సుబ్బన్నశాస్త్రి మిత్రుని అవహేళనకు అవకాశం ఇచ్చేడు.

"హూణ విద్య చదవడం వట్టి అనాచారం..."

"అనాచారమని మానావా? స్వాతంత్య్రం వస్తుందంటూ ఎవరో గాంధీ చెప్పేడు గనక మానావా?"

"కారణం ఏదయినా ఫలితం ఒక్కటే. ఆ ఫలితం మంచిదా? చెడ్డదా?"

"కార్యకారణ సంబంధం ఉండదూ? అనాచారం దృష్టితో చదువు మానితే ఆచార రక్షణకోసం తాపత్రయ పడతావు. మీ గాంధీ మాటమీద
మానితేనే పంచముడిచేత పక్క బట్టలు తెప్పిస్తావు."

దేశంలోని ఆచారాలకీ, జాతీయోద్యమానికీ, అంత వ్యతిరేకత వుంటుందనే మాట అతని కంతవరకూ తోచనే లేదు. స్వగ్రామం తిరిగివచ్చి
ఏవో కార్యక్రమాలు చేపట్టాలని. ఊరికీ - దేశానికీ ఏదో సేవ చెయ్యాలనీ ఆవేశంతో వచ్చేడు. ఏ సేవ చేస్తాడు? ఏమిటి నీ
కార్యక్రమం అంటే--అంతా అస్పష్టంగానే వుంది. తెర వేసినట్లుంది.

అయితే శాస్త్రి ఆ తెర చింపేసేడు. ఆ తెర వెనుక ఉన్న అలవాట్లూ, ఆచారాలూ, అహంకారాలూ, అభ్యంతరాలూ ఒక్కమారు
విశ్వరూపం చూపేసరికి అతని మనస్సు చెదిరిపోయింది.

దానిని కూడదీసుకోవాలి.



పది


నాలుగుగోడల నడిమికి చేరుకొనే వరకూ ఉగ్గబట్టుకు వచ్చిన శంకరశాస్త్రి భార్యను చూడగానే ఒక్కమారు చక్రకాయలా భగ్గుమని
నిప్పులు చిమ్మేడు. అంటుగిన్నెలు తోముకుంటున్న రాజమ్మ తన వెనక వేపున ఆ ధూంధాంలు వినబడేసరికి ముడుచుకుపోయింది. "ఏదో
అపరాధం వచ్చిందిరా భగవంతుడా" అనుకుంటూ గబగబ చేతులు కడుక్కుంది. ఆమె నడుం యెత్తే లోపున మళ్ళీ పిలుపు.

"ఏమే....."

"వస్తున్నా....."

చేతులు చీర కొంగుకి తుడిచివేసుకుంటూ గబగబ యెదటికి వచ్చింది.

"ఈ వేళ మరిడమ్మ రాలేదు. అంట్లు తోముకోవలసి వచ్చింది."

క్షమార్పణ చెప్పుకొంటున్నట్లున్న ఆ సమాధానాన్ని శంకరశాస్త్రి వినిపించుకోలేదు.

"నీ సుపుత్రుడు దేశంలో దిగేడు."

సుపుత్రుడిని గురించీ, అతడు చదువు మానడం గురించీ ఈ వారం రోజులుగా ఇంట్లో చర్చలు జరుగుతూనే వున్నాయి. ఇక ముందు తమ
కర్తవ్యం ఏమిటో కూడా ఆలోచించుకున్నారు తామిద్దరూ.

కాని తమ నిర్ణయాలకు విరుద్ధంగా మగడు ఈ విధంగా ఝణఝణ లాడుతూంటే ఆమె ఏమీ అర్థంగాక నిలబడిపోయింది. మనస్సులోని
వ్యధను నిరాశ, నిస్పృహలను వెలిగ్రక్కుతూ ఇంటి వెంబడి చిందులు తొక్కుతూంటే వారం రోజుల ప్రశ్నలూ, సమాధానాలూ, బెదిరింపులూ,
అనునయాలూ మళ్లీ ఓమారు భార్యాభర్తల మధ్య ఆవృత్తం అయ్యాయి.

రాజమ్మకు కాన్పులూ, సంతానమూ కూడా నిలవలేదు. చెల్లెలు కొడుకు రామనాధాన్ని తల్లీ-దండ్రీ కూడా కరువైన పసిగుడ్డును తెచ్చి
పెంచింది. అతనినామె యెన్నడూ పరాయమ్మ కన్న బిడ్డగా భావించలేదు.

శంకరశాస్త్రికి కూడా రామనాధంమీద అభిమానం, ప్రేమా లేకపోలేదు. కాని అతడు తన కొడుకు కాదనే విషయాన్ని మరచిపోలేదు.
విశేషమైన కోపం వచ్చినా, విపరీతమైన అభిమానం ప్రదర్శించినా శంకరశాస్త్రి అతనిని రాజమ్మ 'సుపుత్రుని'గానే పేర్కొంటాడు.

ఈ క్షణంలో ఎంతో కోపం, కసితోనో ఆ సుపుత్రుణ్ణి తలచేడని రాజమ్మ యెరుగును. కాని ఇతర సమయాలలో మాదిరిగా ఆమెకీ మారు
కోపం రాలేదు. అతని మీద పెట్టుకొన్న, పెంచుకొన్న యెన్నో ఆశలు ఒక్కమారు తల్లక్రిందులయే సరికి భర్త తట్టుకోలేకుండా
ఉన్నాడని ఆమె గ్రహించింది. అతని మీద జాలి కలిగింది. కాని యెలాగ సర్దుబాటు చేయాలో ఆమెకు అర్ధం కాలేదు. నలభయ్యేళ్లు
పైగా కాపురం చేస్తున్నా ఏ మాటకాతనికి కోపం వస్తుందో, ఏది సర్దుబాటు చేస్తుందో ఆమెకింత వరకు తెలియదు.

భయపడుతూనే సన్నగా, సర్దుబాటుగా కొడుకు రాకకు ఏవేవో కారణాలు చూపబోయింది. అవన్నీ ఒకటికి పదిమార్లు ఈ వారంలో
చెప్పుకొన్నవే.

"ఏ వంట్లోనో బాగుండక వచ్చేడేమో, మీదంతా....."

అంత కోపంలోనూ శాస్త్రి ఒక్కమారుగా నవ్వేడు.

కలిపోసినా వుట్టికేసి చూడడంగా శాస్త్రి దానిని జమకట్టేడు.

"ఏమిటోయ్‌ శాస్త్రీ! రాజమ్మ వున్నదా?" అంటూ మూడుకాళ్ళ ముసలమ్మ నరసమ్మ గుమ్మాలెక్కింది. రాజమ్మ అమ్మయ్య
అనుకుంది.

"రాండి అత్తయ్యగారూ!"

నరసమ్మ కర్ర నేలపడేసి గోడకి జారబడి కూర్చుండిపోయింది. ఆయాసం తీర్చుకున్నాక ఆకాశం వంక చేతులెత్తి మొక్కి అంగలార్చింది.

"ఇంకా ఎంత కాలమయ్యా భగవంతుడా?"

"నీకేం పిన్నీ పుణ్యాత్మురాలివి. బోలెడు బలగం ఉన్నారు. నీ బరువు ఎవరికి?"

శంకరశాస్త్రి మర్యాదకు ఓదార్చాడు. నరసమ్మ మర్యాదకే అభినందించింది.

"మీరంతా వుండగా నాకు లోటేమిటోయి శాస్త్రీ? కాలూ, చెయ్యీ కదపలేని దశ వచ్చాక ఈ బ్రతుకు ప్రపంచానికే భారం కాదుటయ్యా!"

మరల మనస్సులో లేని మాటలతోనే ఓదార్పు.

"దేముడిచ్చినదానికి వెక్కసపడితే పోతుందా?"

"ఆయువిచ్చిన దేవుడు అన్నానికీ, గుడ్డకీ తిప్పటపెడితే ఎట్లాగోయి."

మరల దిక్కుమాలిన గొడవ ప్రారంభమయిందని శంకరశాస్త్రి మనస్సులోనే తిట్టుకున్నాడు.

రాజమ్మ పరిస్థితిని గ్రహించి మాట మార్చటానికి ప్రయత్నించింది.

"ఈ వేళ పనిమనిషి రాలేదు. ఇంకా మజ్జిగ చెయ్యలేదు. చేసి తెద్దామనుకొంటూనే ఉన్నా, పాపం నిన్న ఉపవాసం కూడా కాబోలు. నే
తెచ్చిపెడుదును కదా....."

అసలు ఆమె ఎందుకు వచ్చిందో ఎరిగిన శంకరశాస్త్రి అసలు విషయానికి వచ్చేశాడు.

"ఈ ఏడాది ఇవ్వవలసింది ఎప్పుడో ఇచ్చేశానన్నాడు కదా పిన్నీ!"

"ఇచ్చేడు. నే లేదనలేదుగా. కాని, ఎంత నాయనా! ఏడాదికి పన్నెండు రూపాయలు. ఎప్పుడో రూపాయకి పాతిక శేర్లు బియ్యం
కొలిచిన రోజుల్లో ఇచ్చినట్లే నాలుగు శేర్లిచ్చేటప్పుడూ ఇస్తానంటే యెట్లాగోయ్‌. యెవరిపంచనో పడి వుంటాననుకో.
రాజమ్మ ధర్మమా అని ఇంత మజ్జిగ పోస్తుంది. ఎవరో ఓ కూర ఇస్తారు. నేనొక్క పూటే తింటా. అయితే మాత్రం ఆ రూపాయితో
తిండి గడుస్తుందంటావా?"

"పోనీ నీకీ బాధలూ, తిప్పలూ ఎందుకూ? ఆవిడే ఇంత వుడకేసి నలుగురితో పాటు పడేస్తుంది. తిని రామా, కృష్ణా అనుకుంటూ
కాలక్షేపం చేసేదానికి...."

దేవుడికి పెట్టినంత విసురుగానూ నరసమ్మ మరో నమస్కారం పెట్టింది.

"ఒద్దు నాయనా! ఆ అనాచారం చూడలేను. ఓ మడీ, మైలా లేదు."

"అదేమిటి అత్తయ్యా.....!"

"చయనులుగారింట పుట్టేను, సోమయాజులుగారింట మెట్టేను. ఇంత బ్రతుకూ బ్రతికి గ్రామ పాచకుడి ఇంట ఎలా తిననోయ్‌."

కొన్ని వందలో మారు శంకరశాస్త్రి జ్ఞాపకం చేసేడు.

"మరి డబ్బు ఇవ్వమనేది కూడా గ్రామ పాచకుడినే కదా?"

"నా మెడకురి పోసి అర్ధాంతరపు చావు చచ్చిన ఆ పెద్ద మనిషికి ఆస్తంటూ వుంది కదా. ఏ పొత్తర్ల బియ్యమో పొయ్యక్కర్లేదు
కదా."

మళ్ళీ కొన్ని వందలోమారు ఆమె వాదం ఎంత తప్పో శాస్త్రి నచ్చ చెప్పడానికి ప్రయత్నించేడు.

షోడశ కర్మలు చేయడం అవసరమని చెప్పి, అవి చేయించడం బ్రాహ్మణ ధర్మమని చెప్పి, మళ్ళీ చేయించేవాడిని గ్రామ పాచకుడంటూ
నీచంగా చూస్తే ఎలాగ?

మగడు నరసమ్మగారికి బోధ చేయడం ధోరణిలో పడ్డాక రాజమ్మ బ్రతుకు జీవుడా అని బయటపడింది. ఇంట్లో మాట మూడోకంటి వాని
చెవిని పడనీయరాదంటాడు శంకరశాస్త్రి. అంత జాగ్రత్తగానూ ఉంటాడు.

"క్షణంలో మజ్జిగ తిప్పేస్తా, కూర్చో అత్తయ్యా!"

"వెళ్ళిరా తల్లీ, లేవలేను. ఇక్కడే కూర్చుంటా."

రాజమ్మ వెళ్ళిపోయేక నరసమ్మ ఒక నిట్టూర్పు విడిచి శంకరశాస్త్రి సలహాకు సంతాపం తెలిపింది.

"మిమ్మల్ని ఎవర్నీ అని లాభం లేదు నాయనా! కాలం! కాలం!"

శంకరశాస్త్రి ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం మానలేదు.

"మళ్ళీ సుబ్బన్నశాస్త్రి కదా నీకు కర్మ చేసినా, పిండ ప్రదానం చేసినా, వాడి యింట."

నరసమ్మ విసిరేసింది ఆ సలహాను.

"చచ్చేక చూడొచ్చేనా ఎవడు కొరివి పెట్టేడో....."

ఒక్క నిముషం ఊరుకొన్నాక మళ్ళీ అన్నది.

"బ్రతికుండగా పిడికెడు మెతుకులకి మొహం వాస్తున్నానా! పరలోకానికి ముట్టకపోతుందని విచారం."

"పరలోకం అంటూ ఒకటి వుందనుకుంటే, ఈ లోకంలో వాళ్ళు చేసే పిండప్రదానం అక్కడికి అందుతుందనుకొన్నాక......"

"ఏమో ఎవరు చూడొచ్చేరు? వుందనుకుంటున్నాం. చేస్తున్నాం. పరలోకం అంటూ ఉందో లేదో, ఉంటే అక్కడెల్లా ఉంటుందో చూసి వచ్చిన
వాడెవడూ లేడు. దానిని నమ్ముకొని ఇక్కడ అనాచారపు బ్రతుకు గడపమంటావు?"

ఆ చర్చలు తేలవు. చుట్టు తిరిగి మళ్ళీ మొదటికే వస్తాయి.

శాస్త్రికి ఆ క్షణంలో రామనాధం ఇంట్లో అడుగుపెట్టడం ఊపిరి తీసుకోడానికి వీలిచ్చింది.

"రారా, ఇంతసేపు చేసేవేం? బండి దొరికిందా?"

ఇంట్లో అడుగు పెట్టేసరికి పెద్ద రభస ప్రారంభం అవుతుందని తయారయి వచ్చినవానికి ఆ ఆహ్వానం చాల గంద్రగోళంగా వినిపించింది.
దానిని యెలా అర్థం చేసుకోవాలో కూడా తెలియలేదు. అప్రయత్నంగానే 'ఆ', 'ఊ'లతో సమాధానం ఇచ్చేడు.

"అమ్మేది?"

"లోపలుంది. నరసమ్మని పలకరించవేం...."

రామనాధం చటుక్కున తన పొరపాటు గ్రహించి సర్దుకున్నాడు.

"బాగున్నావా అవ్వా!"

"ఏదో ఇల్లా వున్నా నాయనా! చదువుకు వెళ్ళేవంది. సెలవలా ఇప్పుడు?"

"నీకు తెలియదు. మనవాడే కాలేజీకి సెలవిచ్చేసేడు........"

ఆ విషయాన్ని నరసమ్మకు అర్ధం అయ్యేటట్లు చేయడంలో శంకరశాస్త్రి యెదురు చెప్పడానికి వీలులేకుండా రామనాధాన్ని ఎగతాళి
చేశాడు. అన్నీ విని నరసమ్మవ్వ చిన్న ప్రశ్న వేసింది.

"తెల్లవాళ్ళు దేశంలోంచి పోవాలంటున్నాడా?"

ఈమారు రామనాధం మాట మార్చేందుకు అవకాశం దొరకపుచ్చుకున్నాడు.

"మనింట్లో ఎవడో వచ్చి పెద్దరికం చేస్తానంటే ఒప్పుకుంటామా అవ్వా!"

సరసమ్మవ్వ నమ్మలేనట్లు తల తిప్పింది.

"అరాజకమయి పోతుంది."

ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు, దోపిళ్ళు సాగుతాయి, కరువు పెరిగిపోతుందని అవ్వ నిశ్చితమైన అభిప్రాయం.

"నా వయస్సు తెలుసా?"

ఆమె తన చిన్ననాటి కథలూ, తాను విన్న కథలూ చెప్పే ధోరణిలో పడిందని నెమ్మదిగా శంకరశాస్త్రి సర్దుకున్నాడు. ఇంగ్లీషు
వాళ్ళు వచ్చేక దేశం బాగుపడిందని ఆమె కథలు చెప్తాయి.

బందిపోట్ల చేతుల్లో వాళ్ళ తాతగారు మరణించారు. పిండారీదండ్లు వస్తున్నాయనే సరికి వూళ్ళలో బీభత్సం ఎల్లా వుండేదో వాళ్ళ
అమ్మ చెప్పింది. ఆమె అయిదేళ్ళదయి వుండగా పెద్ద కరువు వచ్చింది. చూచాయగా మిగిలిన ఆ జ్ఞాపకాలు వింటేనే వొళ్ళు
జలదరిస్తుంది.

"తెల్లవాడొచ్చాక ఆ అరాజకం లేదు. ఆనకట్ట కట్టేక ఆ కరువు లేదు. వాళ్ళని పొమ్మని మీరేం చేస్తార్రా
కుర్రనాగమ్మల్లారా.....!"

వర్తక వ్యాపారాల్లో సాగిపోతున్న వందలకోట్ల రూపాయల దోపిడీ, పరిపాలనా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయం. ప్రపంచ
ప్రజల మధ్య చేస్తున్న అవమానాలూ అవ్వకు అర్ధం కావు.

శంకరశాస్త్రి అతనినా ఇబ్బంది నుంచి బయట పడేశాడు.

"నీ లోకం వేరు. నా లోకం వేరు. వాడి లోకం వాడిది. ఒకళ్ళు చెప్తే వినేదుందా? అర్థం అయ్యేదుందా? ఎవళ్ళ దారి వాళ్ళది..
నువ్వు మీ అమ్మకు కనిపించి రారా! లోపలుంది. చల్ల చిలుకుతూంది కాబోలు. వెళ్ళు."

ఆ మాట వచ్చిందే తడవుగా రామనాధం నిశ్శబ్దంగా ఇంట్లోకి నడిచేడు. వెనక నుంచి నరసమ్మవ్వ నిర్వేదం వినబడింది.

"ఆచారాలు, కట్టుబాట్లు, మర్యాదలు, మన్ననలు అన్నీ పోతున్నాయి లోకం తల్లక్రిందులయిపోతోంది...."



పదకొండు


గుమ్మంలో రామనాధాన్ని చూడగానే శంకరశాస్త్రి తన కోపతాపాలకు అట్టే బలం వుండదనే విషయాన్ని గ్రహించడం కష్టమేం కాలేదు.
రామనాధం ముతక కోరా పంచె కట్టేడు. అల్లాంటిదే ఓ లాల్చీ వేశాడు. తెల్లవారగట్ల చీకట్లో గమనించలేదు గాని, అసలు
రామనాధం ఆకారమే మారిపోయినట్లనిపించేడు. ఇంగ్లండు పంపించి చదివించేటందుకూ, ఏ ఐ.సి.ఎస్సో ప్యాసై ఓ జిల్లా కలెక్టరుగా
రాగలిగేటందుకూ ప్రాతిపదికగా ఇస్తున్న వేషభాషల తయారీ లవలేశం కూడా మిగిలినట్లు లేదు. ఆ దుస్తులతో తన ముందుకు
రాగలగటం తన కోపతాపాల ప్రభావానికి ఆశ్వాసాంతం అని అర్ధం అయిపోయింది.

వెంటనే శంకరశాస్త్రి సర్దుకొన్నాడు. ఆ వేళకు నరసమ్మ అక్కడ వుండడం ఎంతో సాయపడింది. ఆమె ఎదుట తన ఓటమిని
ప్రదర్శించుకోలేడు. కనక తెలివిగానే సర్దుకొన్నాడు.

"చెప్తే వినని పిల్లవాడు కాదు. ఒకవేళ పొరపాటున తొందరపడ్డా చెప్తే వింటాడా.." అని ఈ వారం రోజుల నుంచీ భార్య
చెప్తున్నా అతడు నమ్మలేకుండా వున్నాడు. ఇప్పుడు రామనాధాన్ని చూశాక తనలోని అవిశ్వాసాన్ని మనస్సాక్షి హెచ్చరికగా
తీసుకొన్నాడు.

రామనాధం పెంకితనాన్ని తాను వర్ణిస్తూంటే రాజమ్మ అతని మేదకత్వానికి ఒకే ఒక వుదాహరణను రెట్టిస్తూ వచ్చింది.

నాలుగేళ్ళ క్రితం తన కప్పుడే పెళ్ళేమిటని కూర్చున్నాడు. కనీసం ఇరవయ్యేళ్ళయినా వస్తేనేగాని పెళ్ళి చేసుకోనన్నాడు.
స్కూలులో తోటి వాళ్ళంతా వొట్టేసుకున్నారట. అంత పట్టుదలా మానుకొని, చెప్పినట్లు పెళ్ళి చేసుకోలేదా అంటుంది ఆమె.

ఆమెకేం తెలుసు? ఆ ఒప్పుదల కోసం తన ప్రతిష్ఠను సంపూర్ణంగా వెచ్చబెట్టేసిన సంగతినామె ఎరగదు. అమే కాదు. మరెవ్వరూ
ఎరగరు. అప్పటికాతని వయస్సెంత? పదిహేను! తోటలోకి తీసుకెళ్ళి రెండు గుద్దులూ, బుగ్గనులుములూ, గద్దింపులూ తగిలించేక కాని
అతనిని ఆలోచనలో పెట్టించలేకపోయేడు. పెంచిన అభిమానం యావత్తూ ఒడ్డేసేనని ఆ రోజునే గ్రహించేడు.

తమ కుటుంబంలో మంచి విద్యాంసులుండవచ్చు. కాని, మంచి వుద్యోగాలలో ఎవ్వరూ లేరు. సర్కిలినస్పెక్టరు నారాయణమూర్తి స్వయంగా
పిల్లనిస్తానన్నాడు. అదే గొప్ప అనిపించింది. ఆ దృష్టితోనే తాను అంత పట్టుదల చూపేడు. సర్వం ఒడ్డేసేడు. మరల అంత
అవసరం కలగవచ్చునని వూహించలేదు ఆనాడు.

కాని, అంత అవసరమూ వచ్చింది. ఇప్పుడు ఒడ్డకుండా మిగిలినదేమన్నా వున్నా--లాభం లేదు.

ప్రాప్తేతు షోడశే వర్షే
పుత్రం మిత్రవదాచరేత్‌ ||

రామనాధం తనకు పుత్రుడు కూడా కాదు. ఆ సంగతిని వెంటనే అర్థం చేసుకొన్నాడు.

కాని, ఇంతకాలంగా అతని మీద పెట్టుకున్న ఆశల్ని అంత సున్నితంగా వదలలేడు. ఆ ఆశలు కలిగించింది వియ్యంకుడు.
వ్యతిరేకిస్తారని ఎరిగి వున్నా, బ్రాహ్మణీకాన్ని కూడా లక్ష్యం చేయనంత ఆశ కలిగించేడు నారాయణమూర్తి. ఉన్న ఏడెనిమిది
ఎకరాలూ అమ్మేసి అయినా ఇంగ్లండు పంపాలి. అతడు ఐ.సి.ఎస్‌. అయి వస్తే అంతకు పదింతలు భూమి కొనుక్కుంటాడు.
హోదా కొలిచేటందుకు ఇప్పుడు ప్రాతిపదిక లేదు. తల్లిదండ్రులు లేనివాడిని పెంచి పెద్దను చేసిన తమకు, అతడే కలక్టరో అయి
వస్తే ఎంత ప్రతిష్ట! ఎంత మర్యాద!

అన్ని ఆశలూ చూస్తుండగా ఆవిరి అయిపోతూంటే తనకు పట్టనట్లు వూరుకోవడం సాధ్యం కావడం లేదు. కాని, తాను చెయ్యగలదేమిటో
అర్థమూ కాలేదు.

రాజమ్మ తన సలహాకు విలువ వుంటుందనే నమ్మకం లేకపోయినా వూరుకోలేకపోయింది.

"పిల్లనిచ్చిన మామగారున్నాడు. ఆయనకూ వుంది బాధ్యత. వెళ్ళి మాట్లాడండి. దూరం భారం కాదు. అమలాపురంలోనే కదా
వున్నాడు....."

తాను చెయ్యలేనిది వియ్యంకుడు చెయ్యగలగ వచ్చుననే ఆలోచన దుర్భరం అనిపించింది. విసుక్కుని విదిలించేసేడు.

"హు. చెప్పేవు. పోదూ."

కాని, ఆ మాట పూర్తికాకుండానే మెరుపులా ఓ ఆలోచన తట్టింది. చటుక్కున విదిలింపు నిలిపేడు.

ఆమె మాటలోనూ సబబు కనిపించింది. మామగారు పిల్లనిచ్చిన వాడు! నెమ్మదిగా అడుగు కూడదీసుకొన్నాడు.

"అవునేమో. అదీ చూద్దాం."

రాజమ్మ తన సలహాకు వినియోగం వుందనుకొనేసరికి కొండ ఎక్కినంత సంతోషపడింది.

శంకరశాస్త్రి వ్రేళ్ళు దులిపి 'ఛట్‌' మనిపించేడు. మనస్సులో ఆలోచనకో రూపం వస్తూంది...."అంతే!"

"అయితే తొరగా వంట కానియ్యి."

రాజమ్మ గబగబ కట్టు విడిచిన బట్టలు రెండు బిందెలో కూరి చెరువుకు బయలుదేరింది.

"బట్టలుతుకుతూ కూర్చోకు."

"అబ్బే! ఇక్కడున్నట్లు రానూ!" అంటూ రాజమ్మ గుమ్మం దిగింది.



పన్నెండు


భోజనం చేస్తూ రామనాధం ఆగి తల ఎత్తేడు.

"నేను కాలేజీ మానేసి వచ్చానమ్మా!"

వడ్డిస్తున్న రాజమ్మ తల ఎత్తకుండా బహు తాపీగా సమాధానం ఇచ్చింది.

"మీ బాబాయి చెప్పేరు."

"నేనింకా ఆయనతో చెప్పలేదు."

రాజమ్మ ఏమీ అనలేదు. రామనాధం ఒక్క నిముషం వూరుకొని మళ్ళీ ప్రశ్నించేడు.

"కోప్పడ్డారా?"

"భోజనం చెయ్యవోయ్‌! తర్వాత వేద్దువుగాని ఆ ప్రశ్నలు."

ఒక నిముషం వూరుకున్నాడు. మళ్ళీ ప్రారంభించేడు.

"బాబయ్యకి కోపం వచ్చిందని ఎరుగుదును...."

"ఎరిగివుండే మానేవన్నమాట."

రామనాధం తల తిప్పేడు.

"మరి?"

రాజమ్మ చాలా సేపు సమాధానం కోసం ఆగింది.

"మీ మామగారినేనా ఓ మారు అడిగితే...."

రామనాధం కళ్ళతో నవ్వేడు.

"బాబాయికన్న ఆయన దగ్గర బంధువుటమ్మా!"

"దగ్గరికీ, దూరానికీ ఏముంది? ఆయన కాకపోతే మీ ఆవిడ వుంది....."

"దానికేం తెలుస్తుంది, చిన్నపిల్ల."

"నువ్వు మహా ఆరిందా అయ్యావు."

రామనాధం ధీమాగా తన వయసు చూపించేడు.

"నాకు ఇరవయ్యేళ్ళు వస్తున్నాయమ్మా!"

ఆ కంఠస్వరానికి రాజమ్మ నవ్వుకుంది. హేళన చేసింది.

"ఇంకో ఏడాదికి......"

"సంవత్సరాదికి కాదమ్మా నా పుట్టినదినం."

"సరే మూడు నెలల తేడా చెప్పాను."

రామనాధం ఆ మాట వినిపించుకోలేదు.

"బి.ఏ. చదువుతున్నా చిన్నపిల్లడినేనా?"

"మహ గొప్ప చదువు చదివేవు. కాని, నువ్వు చదువుతున్నావంటే...."

రామనాధం హాస్యం ఆడేడు.

"......ఆయనే కారణం అంటావు."

"కాకపోతే? మీ బాబాయి స్కూలు మానిపించి--'హరి ఓమ్‌ అనిపించే వారు."

"అదే బాగుండేదేమో....."

"కాని నువ్వు అప్పుడల్లా అనుకోలేదు."

"ఔననుకో....."

"నువ్వు చాలా తెలివిగలవాడివనీ, ఏదో పెద్ద చదువులకెడతావనీ....."

ఆ ఆలోచనే ఇష్టం లేనట్లు రామనాధం తుంపేసేడు.

"ఇంక చదివేది లేదు. అంతే."

రాజమ్మ ఏమీ అనలేదు.

అతడు భోజనం ముగించి లేచేడు.

చేయి తుడుచుకొన్న తుండు దండెం మీద ఆరవేస్తూ అడిగేడు.

"బాబయ్య మాట వినిపించదు. ఎక్కడికెళ్ళేడమ్మా?"

శంకరశాస్త్రి అమలాపురం వెడుతున్నానని చెప్పే వెళ్ళేడు. ఎందుకు వెడుతున్నదీ తామిద్దరూ మాట్లాడుకొన్నారు. కాని, ఆ విషయం
బయట పెట్టవద్దనుకున్నారు. వూరుకుంది.

రామనాధం ఓ మారు మిద్దెగదిలోనూ, వీధి అరుగుమీదా చూసి వచ్చేడు.

"లేడు."

అతని కంఠంలో ఏదో ఆతురత వినిపించి రాజమ్మ అన్నం తింటూ తల ఎత్తి చూసింది.

"తర్వాత మాట్లాడవచ్చునులే. ఏం తొందర?"

"మళ్ళీ టపా కట్టేస్తారు. మని ఆర్డరు చెయ్యాలి."

మని ఆర్డరు చెయ్యడం అనేసరికి రాజమ్మ కంగారుపడింది.

మని ఆర్డరు చెయ్యాలంటూ ఆయన కోసం వెతుకుతున్నాడంటే ఆయన డబ్బు ఇవ్వాలన్నమాట. తన చేతిలోంచి వెళ్ళే ప్రతి పైసాకూ
శంకరశాస్త్రి ఆరా తీస్తాడు. అందుచేత ఆయన్ని అడగాలంటే భయం. కాలేజీకి వెళ్ళేటప్పుడల్లా రామనాధం చేతికి డబ్బు చిక్కడం
ఒక చిన్నపాటి బ్రహ్మప్రళయం జరిగినాకనే. ఎన్నో చివాట్లు తినాలి. వుపన్యాసాలు వినాలి. గదిమి, గంద్రగోళం చేస్తాడు.
ఒక్కొక్కప్పుడు నిష్ఠూరంగా అనేస్తుంటుంది కూడా.

"వాడి డబ్బు వాడికివ్వడానికి ఇంత ఇదయిపోతారేం?"

శంకరశాస్త్రి ఓపట్టాన తగ్గడు.

"ఇప్పుడు డబ్బూ ఇవ్వాలి. తర్వాత లెక్కా చెప్పాలి. మరచిపోకు."

"మీరు తినేసేరని అనుకోరు లెండి."

తల్లిదండ్రులు చనిపోయిన నాటికి రామనాధానికి నాలుగెకరాల భూమి వుంది. ఆ పొలం మీద శిస్తు దాచి, పెంచి మరో నాలుగెకరాలు
కొన్నాడు. అయితే అది నాలుగేళ్ళ క్రితంనాటి మాట. ఈ నాలుగేళ్ళ ఆదాయం ఎప్పటికప్పుడు అతని చదువులకే సెలవయిపోతూంది.
నాలుగెకరాలున్నప్పుడు మిగిలింది. ఎనిమిదెకరాలున్నప్పుడు చాలక పోయిందా అంటారని ఆయన భయం.

ఇదివరకు తాను కుర్రవాడికొక్కడికే సమాధానం ఇచ్చుకోవలసి వుండేదనీ, ఇప్పుడు వియ్యంకుడికి కూడా చెప్పుకోవలసి వస్తుందనీ
అంటాడు.

తమ తమ నెలవులు తప్పిన

తమ మిత్రులె శత్రులౌట తథ్యము..

అంటూ సుమతీ శతక పద్యాన్ని భార్యకు గుర్తు చేస్తాడు.

క్షణశ: కణశశ్చైవ

విద్యామర్థంచ సాధయేత్‌

అని రామనాధానికి బోధ చేస్తాడు. కొసిరి కొసిరి అడిగిన దానికన్న మరో పదిరూపాయలు చేతులో పెడతాడు.

"మళ్ళీ కావాలంటే పొరుగూళ్ళో ఎవరిస్తారు. ఈ పదీ దగ్గరుంచు" అంటాడు. అయినా అంత గందరగోళమూ, రభసా సాగవలసిందే.

ఆ అనుభవంతో రాజమ్మ కుమారుడి మాటకు కంగారుపడింది.

"నూరూ తీసుకెళ్ళి ఇంకా నెలేనా కాలేదు కాదట్రా."

తన అవసరం ఏమిటో చెప్పాలి. రామనాధం తల్లికెదురుగా వంటింటి గడపమీద కూర్చుండబోయేడు.

"పీట వాల్చుకో, గడపమీద కూర్చోకూడదు."

"కూర్చుంటేనేమమ్మా!"

మామూలు ప్రకారం అనేశాడేగాని, వాగ్వాదం పెట్టుకునే ధోరణిలో లేడు. మాట్లాడకుండా పీట వాల్చుకున్నాడు.

"ఖద్దరు బట్టలకివ్వాలి. ఓ ఏభయి కావాలి."

రాజమ్మ ఏదో భయానక వృత్తాంతం విన్నదానిలాగ గాభరా పడింది.

"ఇప్పుడు బట్టలేమిట్రా, మొన్ననేకదా కుట్టించుకొన్నావు...."

అందులోనూ అతడు దుప్పట్లూ, తుండ్లతోసహా తీసికొన్నానని చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపడింది.

"వెళ్ళేటప్పుడు దుప్పట్లు పట్టుకెళ్ళలేదూ?"

పట్టుకెళ్ళకేం? పట్టుకెళ్ళేడు. కాని, కాలేజీ ఎదట రోడ్డుమీద అగ్ని సాక్షాత్కారం అయిపోయాయి.

బట్టలను అగ్నిహోత్రంలో పడవెయ్యడంలో వున్న రాజకీయ ప్రాముఖ్యాన్ని అతడెంత చెప్పినా ఆమెకు అర్థం కాదు.

బట్టలే కాదు, ఏ వస్తువునైనా పొదుపుగా వాడుకోవడం, అనవసరపు, అదనపు ఖర్చులు చేయకపోవడంలో వున్న ఆర్ధిక ప్రాముఖ్యం
అతనికి అర్థం కాలేదు.

తాననుకొంటున్న దానికన్న ఈ వ్యవహారం చాలా లోతుగా వున్నదనిపించి రాజమ్మ చాలా నిరాశపడిపోయింది. ఇప్పటికే ఆస్తిపాస్తుల
వ్యవహారం వప్పచెప్పేస్తానని మగడు బెదిరిస్తున్నాడు. పెంచిన మమకారంలో ఆమె సర్దుబాటు చేస్తుందిగాని, ఆ మాటే అనేసింది.

ఆ నిరాశతో చేతిలో ముద్ద విస్తట్లో పడేసి, గోడకి జారబడిపోయింది.

"ఏమోరా! నీ పద్ధతి నాకేం బాగా లేదురా, బాగా చదువుతున్నావు. పైకొస్తావనుకుంటే, అది కాస్తా మానేశానంటావు. బోలెడంత
ఖరీదుపోసి నిక్షేపంలాంటి బట్టలు కొనుక్కొని నిప్పుల్లో పారేశానంటావు..."

హఠాత్తుగా అతని వొంటినున్న బట్టలు వెనకటివేనని గమనించింది.

"నన్ను ఆడిస్తున్నావట్రా భడవా!"

ఆమె చూపు గమనించీ, అభిప్రాయం గ్రహించీ రామనాధం తాను కట్టుకున్న బట్టలవేపు చూసుకొని సిగ్గుపడ్డాడు.

ఇంటిదగ్గర వాడుకొనేటందు కుద్దేశించిన నేతపంచె కట్టుకున్నాడు. నలిగిందని పెట్టెలో పడేసిన చొక్కా ఒకటి తొడుక్కున్నాడు. రెండూ
విదేశీ నూలుతో తయారు చేసినవే. విదేశీ వస్త్రాలు ముట్టకూడదని చేసిన ప్రతిజ్ఞను యద్దేవా చేస్తున్నట్లనిపించింది.

సుబ్బమ్మగారు పట్టుకెళ్ళమనే అన్నారు. అయితే డబ్బివ్వనిదే తీసుకోవడం తనకే ఇష్టంలేకపోయింది. వెంటనే కట్టుకోడానికి రెండు
జతలే తీసుకున్నాడు.

"ఏవీ? ఎక్కడ పెట్టేవు?"

ఈ నూతన వ్రతంలో అనాచారం కూడా ఒక భాగమేమోనని భయపడుతున్నట్లనిపించింది ఆమె కంగారు.

"తోటలో వదిలిపెట్టి నారాయడికి కబురు చేశాను."

ప్రయాణంలో మైలపడిన బట్టలు ఇంట్లో కలపనందుకు రాజమ్మ సంతృప్తిపడింది. కాని, కథంతా విన్నాక మరల వ్యధ పట్టుకుంది.
ఆ సుబ్బమ్మ ఎవరో కొరివిలా దాపురించిందనిపించి మండిపడింది.

"ఎవర్రా ఆ సుబ్బమ్మా, దిబ్బమ్మాను? మొగుడూ, మొద్దులూ ఎవరూ లేదా ఏమిటి, ఆవిడగారికి? ఇల్లా...."

దువ్వూరి సుబ్బమ్మగారి వంటి వ్యక్తిని ఎరుగని అజ్ఞానంకన్న ఆమెను పట్టుకొని తిట్టడంలోని అపచారం అతనికెంతో బాధ
కలిగించింది. అతని మాటలు విన్నాక రాజమ్మ తన అవజ్ఞతకు లెంపలు వాయించుకుంది.

కాని, తన కొడుకును భర్త మీదికి రెచ్చగొడుతున్న ఈ చర్యకు మూలం అమెయేనన్న అభిప్రాయం మాత్రం మార్చుకోలేదు.

అయితే డబ్బు సమస్యను పరిష్కరించే విషయం అల్లాగే వుండి పోయింది. భర్తముందు ఆ ప్రసక్తి తేవడానికామె సిద్దంగా లేదు.
రామనాధం కూడా ఇప్పుడే డబ్బు మాట ఎత్తకూడదని ఆమె సలహా.

"కాస్త కోపం తగ్గేక పంపొచ్చులే."

కాని, డబ్బు పంపడం తన ప్రతిష్టతో ముడిపడి వుందనిపిస్తూంది. ముక్కు మొగం ఎరుగని తనకు, రాజమండ్రి వదిలి వెళ్ళిపోతున్న
వాడికి ఏభయి రూపాయల బట్టలు అప్పిచ్చి పంపడానికి ఆమె చూపిన నిబ్బరాన్నీ, మానవులపై ఆమెకు గల విశ్వాసాన్ని చూశాక
ఆమె మీద విపరీతమైన భక్తి పెంచుకున్నాడు. రెండు రోజుల్లో డబ్బు పంపుతాననీ, తరువాతనే తీసుకెడతాననీ చెప్పివచ్చేడు.
ఇప్పుడా మాట తప్పితే తన మర్యాద ఏముంటుంది?

రామనాధం ఒక్కక్షణం ఆలోచించి నిశ్శబ్దంగా లేచిపోయేడు. అతని ముఖం చూశాక రాజమ్మకు చాలా వేదన కలిగింది. ఇంతకాలం చేరదీసి
పెంచిన కొడుకు దూరమైపోతున్నట్లనిపించింది.

"ఒరే రాముడూ?"

ఏదో నచ్చచెప్పాలనీ, సర్దుబాటు చెయ్యాలనీ తపన. కానీ అతడు అప్పటికే గుమ్మం దిగేసేడు. ఆమె పిలుపు వినబడనేలేదు.



పదమూడు


వంటింటి తలుపు గొళ్ళెం పెట్టి సావిట్లోకి వచ్చేసరికి, ఎవరో కిటికీకి ఎదురుగా మడత మంచం వాల్చుకొని పడుకుని వుండడం చూసి,
విశాలాక్షి చటుక్కున ఆగింది. అంతలో రామనాధాన్ని గుర్తుపట్టి ముందుకు అడుగు వేసింది.

"నువ్వుట్రా, హడలిపోయేను."

రామనాధం కళ్ళ మీద చెయ్యి తీసేడు.

అతడు వచ్చేసరికి విశాలాక్షి లోపల ఏదో పని చేసుకొంటూంది. బద్దకంగా వుండి మంచం వాల్చుకు పడుకున్నాడు.

"ఈ లోపున ఏ దొంగాడైనా ఇల్లంతా చక్కపెట్టుకు పోవచ్చు. అంత బేఫరవాగా వున్నారు."

"ఇప్పటివరకూ నాన్న ఇక్కడే వున్నాడు. ఎంగిలాకు పారేసి రావడానికి దొడ్లోకి ఇప్పుడే వెళ్ళేను. నువ్వు భోంచేసేవా?"

"చేసే వస్తున్నా."

"మరి ముఖం అల్లా వుందేం?"

రామనాధం మంచం దిగి గోడనున్న అద్దం ముందు నిలబడ్డాడు. ముఖం డీలా పడ్డట్లు తనకూ తోచింది.

"రాత్రి పడవలో సరిగ్గా నిద్రలేక అయివుంటుంది."

"కాస్సేపు పడుకో. వుండు, తలగడ తెచ్చిస్తా."

విశాలాక్షి లేచింది.

రామనాధం వెనక్కి తిరిగేడు.

"వద్దు, ఇప్పుడు నిద్ర రాదు. పనుంది కూడాను."

"ఏమిటా ముంచుకుపోయే పని?"

ఆ మాట అంటూనే లోపల నుంచి ఓ తలగడ తెచ్చింది. మంచం మీద అమర్చింది.

"పడుకో."

అతడు ఏ సమాధానమూ యిచ్చే లోపునే వీధి గుమ్మంలోంచి పిలుపు వినిపించింది.

"వదినా!"

పిలుపు వెనకనే మంగమ్మ లోపలికి అడుగు పెట్టింది. విశాలాక్షి "రావే" అంటూ ఆహ్వానించింది.

"పైవాళ్ళెవరూ లేరు. మా తమ్ముడు."

"ఎవరు, కలెక్టరు బావా?"

రామనాధం ఇంగ్లండు చదువుకొనేటందుకు వెళ్ళడానికై చేస్తున్న ప్రయత్నాలు బంధువులలో కలిగించిన ఆశల ప్రతిధ్వని. మంగమ్మ
అతని పెద్ద అత్తగారి కూతురు. రామనాధం నవ్వేడు.

విశాలాక్షి చాపమీద కూర్చుంటూ ఆమెనూ ఆహ్వానించింది.

"రావే. అందరివీ భోజనాలయేయా? ఇప్పుడే చెయ్యి కడుక్కున్నా."

మంగమ్మ--"పోవాలి తల్లీ! నీకేం కూర్చోమంటావు" అంటూనే గోడను ఆనుకొని దూరంగా వట్టి నేలనే కూర్చుంది.

రామనాధం హాస్యం చేశాడు.

"నువ్వు చాపలో కూర్చోమనాలి కాబోలునే అక్కా!"

మంగమ్మ ఎంతో విసువూ, ఆయాసమూ కనబరచింది.

"కూర్చున్నట్లే వుంది. వారం రోజులనుంచి ప్రాణాలు తోడేస్తున్నారు."

రామనాధం అర్ధంగాక అక్క ముఖం వంక చూసేడు.

"వాళ్ళ చెల్లెలి పెళ్ళి కాదుట్రా? పనులు చేస్తున్నారు."

"ఓస్‌ అంతేనా? ఊరందరి పనులూ నెత్తిన పడిపోయినట్లు అంటూంటేను."

రామనాధం తేలికగా తీసివేయడాన్ని మంగమ్మ సహించలేకపోయింది.

"మీకేమిటోయి మగ మహారాజులు! అన్నీ అమర్చి విస్తట్లో పెడితే 'ఓస్‌ ఇంతేనా' అని తేలికగా చప్పరించేస్తారు."

ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయాలన్నింటికీ రామనాధమే కారణం అన్నంత ఆవేశంతో మంగమ్మ చర్రుమనేసరికి అతడు పకపక
నవ్వేడు.

విశాలాక్షి చిరునవ్వు నవ్వింది.

"నీ మెత్తదనం అనుకోక వాడి మీద కోపపడతావెందుకే?"

అనవసరంగా ఆవేశపడ్డందుకు మంగమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. విశాలాక్షి లేచింది.

"కనీసం వాళ్ళ పనులన్నా వాళ్ళను చేసుకోమనాలి."

మంగమ్మ ఉడుకుబోతుతనంతో బుంగమూతి పెట్టింది.

"నే వద్దంటున్నానా?"

"వద్దనవు. కాని చెయ్యలేననీ అనవు."

మంగమ్మ తన బలహీనతను సమర్ధించుకొంటున్నట్లు నసిగింది.

"ఇంక వాళ్ళ చేత దెబ్బలు తినడం ఒకటి తరవాయి."

దెబ్బల మాట వచ్చేసరికి రామనాధం విస్తుపోయాడు. కాని నమ్మలేకపోయేడు.

"నిజంగా?.....'

అప్పటికే తాను బయటపెట్టకూడనివి చాలా తేలిపోయినట్లు మంగమ్మ భయపడి లేచింది.

"మీతో మాటలు పెట్టుక్కూర్చుంటే అయిందే. పోతా."

"ఓ అర ఘడియలో నేనూ వస్తున్నా కూర్చో. అప్పుడే వాయ పెట్టేరా?"

"రోకలి కోసం వచ్చా."

"పంచలో వుంది పట్టుకెళ్ళు."

మంగమ్మ లోపలికెళ్ళింది. విశాలాక్షి అనుతాపం తెలిపింది.

"నోరూ, వాయీ లేదు. ఎల్లా బ్రతుక్కొస్తుందో పాపం! ఇరవయ్యేళ్ళు నిండలేదు. ఈ బతుకు యెంతకాలానికి తెల్లవారను?"

రామనాధం అక్కగారి ముఖం వంక చూసేడు. ఒక్క మంగమ్మ కోసమేనా ఆమె విచారం? తనకి మాత్రం వయస్సెంతుంది? తన బ్రతుకేమిటి?
కొడుకొకడున్నాడు గాని......

విశాలాక్షి ఆ హడావుడి ఎందుకో చెప్పింది.

"పెళ్ళికి అటుకులు అంటూ ఓ బస్తాడు కొట్టిస్తున్నారు. అవన్నీ ఈ వెర్రిమొహం చేతి మీదుగా నడవాలి కాబోలు. ఇల్లు పట్టిన
విధవ కూతుళ్ళుంటే ఊరికే పోనిస్తారూ...?"

"పెళ్ళిళ్ళకి కూలీల్ని పెట్టి కొట్టించుకోకూడదూ?"

"మడి ఎల్లాగ?"

మడి అన్నది బ్రాహ్మణ్యానికి లక్షణమాయె. రామనాధం నిరుత్తరుడయ్యేడు.

"నువ్వు పడుకో ఓ నిముషం. నాలుగు వాయల్లో పోటు వేసి చక్కా వస్తా."

రామనాధం ఏమనడానికీ అవకాశం ఇవ్వకుండానే విశాలాక్షి లోపలికి వెళ్ళింది. బట్టలు మార్చుకొని తిరిగి వచ్చేసరికి అతడు
పడుకుని వున్నాడు. వీధి తలుపు జేరవేసి వెళ్ళిపోయింది.

ఆమె రావడం, వెళ్ళడం ఎరిగి వున్న రామనాధం కళ్ళమీది చెయ్యి తియ్యలేదు. ఏమేమో ఆలోచిస్తూ అలాగే పడుకుని వుండిపోయాడు.

ఆ ఆలోచనలలో వుండిపోయి మంగమ్మ లోపలికి రావడాన్ని అతడు గమనించనేలేదు.

మంగమ్మ ఒక్క నిముషం నిలబడింది. కళ్ళను మూసి వున్న చేతి క్రింద అతడు నిద్రపోతున్నదీ లేనిదీ తెలియలేదు. కాలి
బొటనవేలు పట్టుకుని కదిలించింది. రామనాధం వులికిపడి లేచి కూర్చున్నాడు.

"మీరా?"

మంగమ్మ మందహాసం చేసింది. నెమ్మదిగానే అయినా వేళాకోళం చేయకుండా వుండలేకపోయింది.

"ఎవరనుకొన్నావేం?"

అతడు సమాధానం ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండానే తాను వచ్చిన పని చెప్పింది.

"ఇందాక నేను అన్నది మనస్సులో పెట్టుకోకేం. మళ్ళీ ఎవరి దగ్గరా అనకు."

ఎవరి దగ్గరా అనకూడని మాట ఆమె ఇందాక ఏమందో అతనికి అర్ధం కాలేదు. అదే అడిగేడు.

మంగమ్మకు ఆశ్చర్యం కలిగింది.

"అతిశయం పోకు."

"నిజంగానే...."

"దొంగాడు చెయ్యి కరుస్తాడే--అన్నట్లు జ్ఞాపకం చెయ్యడం కూడా ఎందుకులే."

అన్నదే కాని ధైర్యం లేకపోయింది. రామనాధం ఆమె ముఖం వంక చూస్తూ, అడగడానికి సందేహించేడు.

"ఒక్కటి అడుగుతాను. ఏమీ అనుకోరు కదా?"

ఆమె అనుమానిస్తూనే అంది.

"ఏమిటది?"

"పార్వతి అభిమానంగా చూస్తుందా?"

పార్వతి మంగమ్మకు అన్న భార్య. ఆమె రామనాధానికి బంధువురాలు కూడాను. మంగమ్మ మనస్సులోది చెప్పడానికి జంకింది.

"అందరూ అభిమానంగానే వుంటారు."

"సుబ్బారావు?"

సుబ్బారావు ఆమె అన్న.

ఆ ప్రశ్నలకు ఆమె చిరాకు కనబరచింది.

"అమ్మా, నాన్నా వుండగా ఒకరి అభిమాన దురభిమానాలతో పనేం వుంటుంది."

ఒక్క నిముషం వూరుకున్నాక తాను వచ్చిన పని చెప్పేసింది.

"నేనేదో ఇబ్బందులు పడిపోతున్నానని మళ్ళీ ఎవరి దగ్గరన్నా అంటావేమో సుమా...."

ఆమె భయం అతనికి అర్ధం అయింది. జాలీ, విచారమూ కలిగేయి. కాని తానామెకు ఏ విధంగా సాయం చెయ్యగలడు? వీరేశలింగం పంతులు
గారి శరణాలయం జ్ఞాపకం వచ్చింది. కాని, ధైర్యంగా ఆ సూచన ఇవ్వలేకపోయేడు.

సులభంగా చెప్పగలదీ, ఆమె వరకు తప్పు పట్టుకొంటుందనే భయం లేనిదీ ఒక్కటే. తన్ను ఏమన్నా అన్నారంటే నోరుకొక్కేసెయ్యమని
చెప్పడానికి మనసు ఒప్పలేదు. అమాయకంగా ఎప్పుడూ నవ్వుతూ వుండే ఆమె ముఖాన్ని కసీ, కార్పణ్యంతో వూహించలేడు.

అందుచేత మాట తప్పించాలనుకొన్నాడు.

"మీ చదువు జరుగుతూందా?"

మంగమ్మ కళ్ళనీళ్ళు తిరిగినట్లనిపించింది.

"ఎక్కడో ఏదో దేశంలో ఆడపిల్లలు పుట్టగానే నదిలో మొసళ్ళకి పారేసే వారంటూ ఆ మధ్య చెప్పేవు. మన దేశంలో కూడా ఆ
ఆచారం వుంటే ఎంత బాగుండునో....."

రామనాధం తన నెత్తిన ఎవరో మొత్తినంత బాధపడ్డాడు. మనస్సులో ఎంత బాధ వుంటే ఆ మాట అని వుంటుందనిపించింది. తానా బాధకి
ఏమి వూరడి ఇవ్వగలడు?

రామనాధం వూరుకున్నాడు.

"ఒక చిన్న సాయం చెయ్యగలవా?"

తానామెకు చేయగల సాయం ఏమిటో? కాని, తానేదో సాయం చేయగలనని ఆమె అనుకోవడం చాలా గొప్ప అనిపించింది.
'చేయగలిగిందైతే'--అనే మినహాయింపు కూడా వుంచుకోకుండా మహోత్సాహంగా మంచం దిగేడు.

"చెప్పండి."

మంగమ్మ అటూ ఇటూ తొంగి చూసింది.

"వీరేశలింగంగారి అనాథ శరణాలయంలో ఆడవాళ్ళకి చదువు చెప్పిస్తారట కదూ."

తాను చేయదలచిన సూచన అదే. ఇప్పుడామె ఆ ప్రతిపాదన తెచ్చింది. తీరా ఆమె నోటినుంచే ఆ మాట వచ్చేసరికి అన్నీ
అనుమానాలే కలిగేయి.

బంధువులందరినీ కాదని శరణాలయంలో చేరాలి. ఆమె తండ్రి, అన్నలూ అంగీకరించి పంపరు. అక్కడ వితంతు వివాహం చేసేసుకొంటుందని
భయం. తనంత తానుగా వెళ్ళితే మాత్రం, వెతకరూ? కనిపిస్తే లాక్కు వచ్చేస్తారు. నిగ్రహించి నిలబడగలదా? అన్నింటికన్నా
పెద్ద చిక్కు వేరే వుంది. అగ్రహారాచారాల మధ్య పెరిగింది, అన్ని కులాల వాళ్ళతో కలిసి వుండగలదా? అన్నీ అనుమానాలే.

"అదే అడగాలనుకొన్నా? ఏమనుకొంటారో....."

మంగమ్మ అతని మాట పూర్తికాకుండానే ముందు కర్తవ్యం సూచించింది.

"నువ్వు నాన్నని ఒప్పించాలి."

రామనాధానికి నిరుత్సాహమే అనిపించింది.

"జరిగినట్లే....."

"ఒప్పించాలి మరి...."'

అతనికి నమ్మకం లేదు.

"నేను అడగమన్నట్లు చెప్పేవు గనక....."

ఔచిత్యానౌచిత్యాలు ఎరగని కుర్రవానికి చెప్పినట్లు చెప్పడం అతనికి కష్టం తోచింది.

"అంత తెలియనివాడిననుకొన్నారా యేమిటి?"

"అదికాదోయి."

రామనాధం కష్టపెట్టుకొన్నట్లు ఒక్క నిముషం వూరుకున్నాడు.

"కోపం వచ్చిందా?"

"మనస్సు నొచ్చే మాటకి కోపం ఎందుకేమిటి?"

మంగమ్మ అంత భయమూ, ఆదుర్దాలోనూ నవ్వేసింది.

"మళ్ళీ వదిన వచ్చేస్తుంది. మరిచిపోకు. మా నాన్నకి నచ్చ చెప్పాలి."

గిర్రున వెనుతిరిగింది. తన మాటమీద ఆ విశ్వాసం వుంచుతారనే ఆ దిలాసా ఏమిటో, అడుగుదామనుకుంటుండగానే ఆమె వెళ్ళిపోయింది.



పద్నాలుగు


విశాలాక్షి అటుకుల వడ్లపోటు నుంచి తిరిగి వచ్చేవరకూ రామనాధం అక్కడే కూర్చున్నాడు. తన సమస్యకు పరిష్కారమార్గం
అతడెరగడు. అడగడానికైనా అక్కకన్న దగ్గరవాళ్ళూ, మనసిచ్చే వాళ్ళూ కనబడలేదు. ఆమె చూపాలి దారి. వస్తూనే
విశాలాక్షి తమ్ముడక్కడే వుండడం చూసి, ఆశ్చర్యం కనబరచింది.

"ఇక్కడే వున్నావుట్రా, వెళ్ళిపోయేవనే అనుకొన్నా, అక్కడ నరసం పిన్ని ఏదో గొడవలు విడేసింది, వదుల్చుకు రావడం మర్యాద
కాదు. అక్కడికీ వీధి తలుపు గొళ్ళెం పెట్టి వచ్చేనని చెప్పి వచ్చేశా."

"నువ్వు రాలేదని....."

"ఉండు, వస్తున్నా కాళ్ళు కడుక్కుని."

కాళ్ళు కడుక్కుని వస్తూ నాలుగు అరటి పళ్ళు తెచ్చింది.

"తీసుకో, దొడ్లో నూతి దగ్గరున్న అమృతపాణీ బోదె వేసింది. మంచి గెల పడింది.

విశాలాక్షి మళ్ళీ లోపలికెళ్ళి గుండ్రటి కంచు చెంబుతో మంచినీళ్ళు తెచ్చి మంచం పక్కనే వున్న కిటికీలో పెట్టింది.

గృహస్వామినిగా తన బాధ్యతలు పూర్తి అయినాక చాప పరుచుకొని కూర్చుంది.

"ఏమిట్రా సంగతులు? ఏమిటి ఇప్పుడొచ్చేవు, సెలవులేమన్నా వున్నాయా?"

ఇంతవరకూ ఆ ప్రశ్న రాలేదేమనుకొంటున్న రామనాధానికి తాను కాలేజీ వదిలి వచ్చేసిన సంగతి తన అక్క చెవిన పడనేలేదని
అర్థం అయింది.

దాపరికం ఏముంది? చెప్పేసేడు. అతడు గాంధీగారి ఆదేశానుసారం కాలేజీ మానేశాననేసరికి విశాలాక్షి మ్రాన్పడిపోయింది.
భవిష్యత్కార్యక్రమం గురించి అస్పష్టంగా వున్న తన ఆలోచనలు ప్రస్తరించేసరికి ఒక్క నిట్టూర్పు విడిచింది.

"బాగుంది నాయనా! బాగుంది."

ఆ కంఠంలోని నిరసన భావాన్ని గమనించినా అతడు గుర్తించదలచుకోలేదు. డబ్బు పంపించవలసిన అవసరం అతనికి మరో ఆలోచనను
తోచనివ్వడం లేదు.

"శంకరం బాబాయి ఎక్కడికో వెళ్ళేడు. ఇప్పుడు మని ఆర్డరు చెయ్యాలి. ఏభయి రూపాయలు అవసరం."

ఎందుకని అడగను కూడా లేదు. ఆ మొత్తం వినేసరికే ఆమె హడలిపోయింది.

తమవన్నీ చిన్న చిన్న సంసారాలు. నిల్చున్నపాటున ఏభయి రూపాయలు సర్దగలవాళ్ళు అసలా వూళ్ళో మాత్రం ఎందరున్నారు?
మిగిలిన వాళ్ళకన్న రామనాధం వాళ్ళే నయం. శంకరం బాబయ్యకి వడ్డీ వ్యాపారం కూడా వుంది.

ఆ విషయాన్నే మరో విధంగా చెప్పింది విశాలాక్షి.

"ఏభయి రూపాయలే, బాబాయి వచ్చేలోపున అంత తొందరేం వచ్చింది?"

రామనాధం నిరుత్సాహంగా అన్నాడు... "వచ్చింది."

విశాలాక్షి ఒక్క నిముషం ఆలోచించింది. ఆమెకు వేరు దారి తోచలేదు.

"బాబాయి వూళ్ళోనే వుండాలిరా. పొద్దుట చెరువుకెడుతూ రావి క్రింద చూశాను. ఎక్కడికెడతాడు?"

ఇంక ఆ అవసరం ఏమిటో చెప్పక తప్పలేదు. అంతా విని విశాలాక్షి ఒక్క నిట్టూర్పు విడిచింది.

"ఇహ నీదన్నమాట వంతు."

వంతు ఆస్తి పాడు చేసుకోవడంలోనని విశాలాక్షి వుద్దేశం. ఇంత క్రితం ఆమె తండ్రి తన వంతు పని చేసేడు. కాంగ్రెసు సభలనీ,
ఆంధ్రరాష్ట్ర మహాసభలనీ, రాజకీయ సమావేశాలనీ వెళ్ళి రావడానికి ఆయన తన వంతుకు వచ్చిన అయిదు ఎకరాలలో సగం
ఇప్పటికే అమ్మేశాడు. మిగిలిందానికి సరిపడా అప్పు వుంది. వ్యవసాయ పంటలకి కాస్త ధరలు పలుకుతున్నాయి గనుక అప్పులాళ్ళు
వూరుకున్నారు గాని, లేకుంటే అది కూడా ఎప్పుడో అయిపోయేది.

శుభ్రంగా చదువుకుంటున్న తమ్ముడు కాలేజీ వదిలేసేనన్నప్పటికన్న బట్టల కోసం ఒక్కమారుగా ఏభయి రూపాయలు అప్పు చేసేననే
సరికి ఆమెకు ఎక్కువ భయం, ఆదుర్దా కలిగింది. వుండబట్టలేక పోయింది. తన తండ్రి ఆస్తి పాడుచేసేడనే అభిప్రాయాన్ని ఆమె
ఎన్నడూ బయటకు తేలేదు. తనకో నాలుగెకరాలు వుంది. తిండికీ, పిల్లవాడి చదువుకీ లోటు లేదు. ఆయనకు మాత్రం ఆ భూమి మిగిలి
ఏం వుద్దరిస్తుంది? మరింకెవ్వరు మాత్రం వున్నారు? అని సర్దుకొంది. ఎవరన్నా తన తండ్రి ఆస్తి పాడుచేసేడన్నా ఒప్పుకొనేది
కాదు.

ఆయనతో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు తమ యింటికి అప్పుడప్పుడూ రావడం పెద్ద గొప్పగా అనిపించేది. ఓ మారు తమ ఊరిలోని
వివేకోదయ పుస్తక భాండాగారానికి వార్షికోత్సవం జరిగినప్పుడు కాశీనాథుని నాగేశ్వరరావు వచ్చేరు. ఆయన తమ ఇంటనే బస
చేసేరు. అల్లాంటి పెద్దవాళ్ళతోడి పరిచయాలు, ఆ గొప్పదనం ఆస్తి పోతూందన్న కష్టాన్ని తోచనీయలేదు.

అయితే అటువంటి గొప్పతనం కోసం తన తమ్ముడు ఆస్తి పోగొట్టుకోడం ఇష్టం లేదు. తన తండ్రి అంటే వయసు మళ్ళినవాడు. తాను
తప్ప ఆయనకెవరూ లేరు. తనకాయన ఆస్తి లేకపోతుందనే బాధ లేదు.

కాని రామనాధం కుర్రవాడు. అతని విషయంలో ఆమె వూహించుకుంటున్న గొప్పతనం వేరు. బాగా చదువుతూంటే పెద్దరికం వుంటుంది. పెద్ద
వుద్యోగస్థులతో బంధుత్వాలు కలిస్తే అంతస్థు పెరుగుతుంది. మంచి ఉద్యోగం అయిందంటే ఆ అంతస్థు నిలబడడమే కాదు, పెరుగుతుంది.
ధనం లభిస్తుంది. ఈ మాదిరి కల్పనలతో ఆమె తమ్ముడి భవిష్యత్తు గురించి ఊహలల్లుతూంది.

దానికి తగినట్లుగానే అతని జీవితం నడుస్తూంది. బాగా చదువుతున్నాడు. సర్కిలినస్పెక్టరంత వాడు వెతుక్కుంటూ వచ్చి
పిల్లనిచ్చేడు. ఇంగ్లండు పంపించి, ఐ.సి.ఎస్‌. చదివించాలనే ప్రయత్నాలలో వున్నారు. ఏ జిల్లాకో కలక్టరయి
వస్తాడు.

తమ వూళ్ళో ఘనాంత స్వాధ్యాయులున్నారు. భాష్యాంత వైయాకరణులున్నారు. పేరున్న మంత్ర శాస్త్రవేత్తలున్నారు. కాని ఇంగ్లీషు
పెద్ద చదువులు చదువుతున్నది చాలా కొద్దిమంది. ఓ పుంజీడుకు మించరు. ఒక్క నాలుగైదేళ్ళలో అంత పెద్ద పరీక్ష నిచ్చేవాడు
తమనాట అతడొక్కడే వుంటాడు.

అదెంత గొప్పదనం? తమ కుటుంబానికే ఎంత ప్రతిష్ఠ!

హఠాత్తుగా ఈ వార్త విన్నప్పుడు దాని ఫలితాలు ఏ విధంగా వుంటాయో ఆమె కర్థం కాలేదు. ఉన్న బట్టలు తగులబెట్టేసి, మరల
అప్పుచేసేడన్న వార్త వినేసరికి దాని లోతులు అర్థం అయినట్లు తోచింది. ప్రాణం వుసూరుమంది. తన తండ్రి అప్పులు చేయడం,
ఆస్తి పోవడం గుర్తు వచ్చింది. ఆ సాంప్రదాయాన్ని అందిపుచ్చుకున్నాడో యేమో! ఆ ఆవేశంలో అంది.

"ఇంక నీదన్నమాట వంతు."

రామనాధం తిరగబడి చూసేడు.

అతని సమస్యకు దారి చూపుతున్నాననుకోకుండానే విశాలాక్షి హితోపదేశం చేసింది.

"నాన్నలాగ ఇంక అణాబిళ్ళ మీద సంతకాలకు దిగుతావు కాబోలు, అటువంటి పని మాత్రం చెయ్యకు. శంకరం బాబాయి ఆవాలన్నీ
ముద్దచేసి నువ్వేదో నిర్వాకం చేస్తావని జాగ్రత్త పెట్టేడు."

తనకు ఉపకారం చేస్తున్నవారి మనస్సులు నొప్పిస్తున్నాననే ఆరోపణకు రామనాధం సిగ్గుపడ్డాడు.

"ఇంతకీ ఏం చేశావో బాబయ్యకి చెప్పేవా?"

ఔను, కాదు తేలని విధంగా రామనాధం తల వూపేడు.

"అమ్మకి చెప్పా."

"ఏమంది?"

"ఏమీ అనలేదు."

ఆ మాట నమ్మలేక విశాలాక్షి అతని ముఖం చూసింది. తాను చదువు మానినట్లు విన్నాక పెత్తల్లి రాజమ్మ ఏమందో వరసగా
చెప్పలేకపోయేడు. ఏదో అంది. తిట్టలేదు, కోప్పడా లేదు, అంతే. అంతవరకే చెప్పగలిగేడు.

రామనాధం లేచేడు. తాను చేసిన పనికి కనీసం తన పెదతండ్రిగారింటి వద్దనైనా అభినందన లభిస్తుందనుకున్నాడు. కాని, నిరాశ
కలిగింది.

ఎక్కడో చోట డబ్బు చూచి మనియార్డరు చెయ్యాలి. ఎవరిస్తారు. ఆలోచించుకొనేటందుక్కూడా విశాలాక్షి అవకాశం ఇవ్వడం లేదు.

"కూర్చో, ఇప్పుడెక్కడికెడతావు?"

"కాదు, బాబాయిని పట్టుకోవాలి."

విశాలాక్షి ఏమీ అనలేకపోయింది.

"అప్పులు మాత్రం మొదలెట్టకు. ఓ రోజు ఆలస్యమయితే మునిగి పోయింది లేదు."

"ఊ"--అన్నాడేగాని ఆలోచిస్తే మరోలాగ తోచింది. శంకరం బాబాయితో ఇప్పుడే డబ్బు కోసం పేచీ పడడం కూడా మంచిది
కాదనుకున్నాడు.

తర్వాత ఎలాగూ తప్పదు. ఇప్పుడు కాదు, మరి!

ఒక్కటే దారి!



పదిహేను


తోటలోకి తిరిగి వెళ్ళేసరికి మిత్రబృందం నలుగురూ పాక ఎదుట మామిడిచెట్టు క్రింద కొబ్బరితడకలు పరచుకొని కూర్చుని వున్నారు.
అతడిని చూడగానే నలుగురూ ఏక కంఠంతో వుత్సాహం తెలిపేరు.

"అడిగోరా."

"నీ కోసమే ఎదురు చూస్తున్నాం."

రామనాధం కూడా వాళ్ళని చూసి అంత సంతోషమూ ప్రకటించేడు.

"వీధిలో ఎవ్వరూ కనిపించలేదు. ఏమయిపోయారా అనుకున్నా. ఇక్కడ తేలేరన్నమాట."

రామనాధం అటూ ఇటూ చూశాడు.

"సూరప్ప కనిపించడేం?"

"జగ్గయ్య కొట్టుకెళ్ళేడే."

ఎందుకో చెప్పవలసిన పనిలేదు. ఏ పకోడీలో వేసుకొనే ప్రయత్నంలో సరుకులు తేవడానికి వెళ్ళేడు అన్నమాటే--

మిత్రులు నలుగురూ తలో అణా వేసుకొని సరుకులు తేవడం, ఏ పకోడీలో, ఉప్మాయో చేసుకుని తింటూ కాలక్షేపం చేయడం ఆ కూటానికో
అలవాటు, హఠాత్తుగా ఏ అర్థరాత్రి ఎవరికి గుబులుపుట్టినా కూటాన్నంతనూ లేపుకొస్తాడు. ఊరికి అతి సమీపంలో పెద్ద
చెరువుగట్టు నానుకొని రామనాధం పొలం, మకామూ వుండడంచేత చోటుకోసం వెతుక్కోనక్కర్లేదు. ఏ చెట్టుక్రిందనో పొక్కిళ్ళు
పెట్టేస్తారు.

"ఇంకా ఇల్లా కూర్చున్నారేం?"

"నీ కోసమే."

"లేవండి."

నరసింహం లేచి, క్రింద పరుచుక్కూర్చున్న తుండు తీసి దులిపి పైన వేసుకున్నాడు.

"నువ్వే వెళ్ళి ఓ అరడజను అరటికాయలు విరుచుకురా."--అని రామనాధానికి పని పురమాయించేరు.

"మీరెవరన్నా తెస్తే....."

అర్ధోక్తిలోనే నరసింహం భయం ప్రకటించేడు.

"వద్దురా నాయనా! మీ బాబాయి దూర్వాసుడి అవతారం."

"ఆ. మీరు మరీరా. మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఆయన ఎరగడంటావా? ఎప్పుడూ ఏమీ అనలేదు."

"ఔననుకో.....అయినా..... నువ్వు కోసిన దారి వేరు.... కనీసం నువ్వుండగా కోసినా...."

"సింగినాదం కాదూ..."

ఈ మాదిరి సంభాషణ పాఠభేదాలతో తరచు సాగుచుండేదే. కాని ఎవ్వరూ, ఎప్పుడూ ఆ హద్దులు దాటడానికి ప్రయత్నించలేదు.
మిత్రులకు దిలాసా ఇస్తున్నా రామనాధం తానే ఏ కొడవలో తీసుకొని బయలుదేరకనూ పోలేదు. ఇప్పుడూ అంతే జరిగింది.

"నిచ్చెన ఎక్కడుందో చూసేరట్రా."

"ఇంతోటి దానికి నిచ్చెన కూడా ఎందుకు? రా." అని నరసింహం ముందుకి అడుగు వేసేడు.

"ఏ చెట్టు నున్నాయో కూడ చూసి ఏర్పాట్లు చేసినట్లే వుందే?"

నరసింహం చిరునవ్వు నవ్వేడు.

"ఉండు. కొడవలి తెస్తా."

నరసింహం అదీ అనవసరమేనన్నాడు. అతడు చెట్టు ప్రక్కన నిలుచుంటాడు. రామనాధం అతని భుజంమీద నిలబడి గెల నుంచి కాయలు
విరచి పడేస్తాడు.

"చొన బట్టల మీద పడి తగులబడతాయిరా?"--అని రామనాధం భయపడ్డాడు. కాని నరసింహానికి ఆ భయం లేదు. తన భుజంమీద
వుండేది రామనాధం.

విరిచి క్రింద పడేసిన అరటి కాయల్ని ఏరుతూ నరసింహం హఠాత్తుగా ప్రశ్నించేడు.

"ఏమిట్రా. నువ్వు కాలేజీ మానేశావు అన్నారు నిజమేనా?"

"ఎవరన్నారు?"

"ఎవరంటేనేం? నిజమేనా, కాదా?"

సరాసరి సమాధానం ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలతో అసలు విషయాన్నిసూచించడం అగ్రహారపు సంభాషణ పద్ధతి.

"మానడం మంచిదంటావా, కాదంటావా?"

"అదేమి ప్రశ్నలే."

"ప్రశ్న కాకేం?"

రామనాధం తన మనస్సులో చెలరేగుతున్న ఆందోళనను నాలుగు మాటలలో చెప్పేడు.

కాలేజీ మానేసిన మాట నిజం. ఆ రోజున సభలో ఆ ప్రతిజ్ఞ తీసుకొన్నప్పుడు అంతా చప్పట్లు కొట్టేరు. రాజమండ్రి కాలేజీ
ప్రతిష్ఠను నిలబెట్టేడన్నారు.

"బ్రహ్మరథం పట్టేరనుకో."

వందేమాతరం వుద్యమం రోజుల్లో రాజమండ్రి కాలేజీలో చదువుతున్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనే యువకుడు వందేమాతరం బాడ్జి
పెట్టుకుని కాలేజీకి వెళ్ళేడు. ప్రిన్సిపాల్‌ ఎగిసిపడ్డాడు, ఆయనను పంపేసేడు. ఇంక అంటుకుంది. వెన్నేటి
సత్యనారాయణ మొదలయినవారు అనేకమంది హరిసర్వోత్తమరావుననుసరించేరు. అదో పెద్ద వుద్యమమే అయింది. దానికి ఫలితంగా
రాజమండ్రిలో జాతీయ పాఠశాల ఒకటి ఏర్పడింది.

ఆ పాఠశాలలోనే చదువుకొన్న నరసింహానికి రామనాధం నిర్ణయం చాలా సంతోషం కలిగించింది. కాని....

రామనాధం భవిష్యత్తుమీద అతని బంధువులు పెట్టుకొన్న ఆశలు వారికే పరిమితంగా లేవు. అందుచేతనే ఆ సంతోషంలో కూడ ఏదో వెలితి
కనిపిస్తూనే వుంది.

"కాని...కాలేజీ వదిలెయ్యడం మంచిదేనా!" అని మిత్రుడు ప్రశ్నిస్తూంటే నరసింహం ఏమీ చెప్పలేకపోయేడు.

ఆ ప్రశ్నే పకోడీల బాణలి వద్ద మరో రూపంలో ప్రత్యక్షమైంది. బాణలిలో వేగుతున్న పకోడీని ఒక పుల్లతో గుచ్చి పైకి
లాగేటందుకు ప్రయత్నిస్తూ శివరామయ్య ప్రశ్నించేడు. "ఏం పనిరా?"

"ఏం చేస్తే బాగుంటుందంటావు?"

వేగుతూ వేగుతున్న పకోడీని పళ్ళ మధ్య గిట్టకరచి పట్టుకొని నోటి వూర్పుతోనే చల్లార్చ ప్రయత్నిస్తున్న శివకామయ్య ఆ
ప్రశ్నకు సమాధానం ఎరిగి వున్నా చెప్పలేదు.

అల్లాంటి ప్రశ్నలు సాంబావధాన్లకి మహా చికాకు. ముందేం వుందో చూసుకోకుండా ఏ మనిషీ అడుగు వెయ్యకూడదని అతని ఉద్దేశం.
చర్రుమన్నాడు.

"గాడిదల్ని కాయి."

సభాసదులంతా గొల్లున నవ్వేరు. శివకామయ్య నవ్వబోయి పెదవులూ, నాలుకా కాల్చుకున్నాడు.

ఆ గంద్రగోళంలో సమస్య కొంత వెనుకబట్టినా మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది. ఏదో ఒకటి చెప్పాలి గనక రామనాధం చటుక్కున
అనేసేడు.

"వ్యవసాయం....."

"ఆ మాత్రం దానికయితే పరీక్షల ముందు కాలేజీ మానుకోవడం ఎందుకు?" అన్నాడు శివకామయ్య.

"అదీ ప్రశ్నే."

నరసింహం తన సమాధానం అందించేడు.

"ఇంగ్లీషు తెల్లవాళ్ళ భాష. వాళ్ళకి కావలసిన గుమాస్తాల్ని తయారు చేయడంకోసం మనకి చెపుతున్నారు. స్కూళ్ళూ, కాలేజీలలో
వాళ్ళు తమ గొప్పదనాన్ని నూరిపోస్తున్నారు. మనకి తాటేకులు కడుతున్నారు. మన అభిమానాల్ని చంపేసి తమకి తాళం వేసే
వాళ్ళనిగా చేస్తున్నారు.

ఆ ధోరణిలో నరసింహం ఎంత సేపన్నా చెప్పుకు పోగలడు. అదే అసలు ప్రశ్నకు సమాధానం కాదు. అవధానులు తృణీకరించేసేడు.

"పోరా పక్షీ! ఇంగ్లీషు చదువుకొని యెంతెంతటి డాక్టర్లవుతున్నారు?"

"గంటకు వేల రూపాయలు ఫీజు తీసుకొనే గొప్ప గొప్ప వకీళ్ళు మాత్రం?" అన్నాడు రామన్న.

సూరప్పకి ఇంగ్లీషు వైద్యులన్నా, వైద్యాలన్నా నమ్మకం లేదు. అతని తండ్రి ఆయుర్వేద వైద్యుడు. దిగ్దంతులనుకొనే ఇంగ్లీషు
వైద్యులు పేరు గూడా పెట్టలేని గడ్డు రోగాల్ని తానెల్లా కుదిర్చేడో, చరక సుశ్రుతాలూ, భావప్రకాశాల్లోంచి శ్లోకాల సాయంతో
ఆయన చెపుతూంటాడు. ఆ మాటల్నే మరికొంచెం నిందపాలు కలిపి సూరప్ప వివరించపోయేడు.

"తానూ మనిషే. తవుడూ, ఓ రొట్టె-నీ...." అంటూ సూరప్ప ప్రారంభించేడు.

".....ముండా రంగు నీళ్ళూ ఓ మందే..." అని అవధాని సూరప్ప మాటను మధ్యలోనే అందుకుని పూర్తి చేసేడు. మళ్ళీ కూటం
యావత్తూ ఫక్కుమంది.

సూరప్పకి కోపం వచ్చింది.

"తెల్లవాడు ఏం చేసినా నోరు తెర్రబెట్టుకుని హాహా. హోహో.... అని భజన చేస్తే."

"నాకు నచ్చిన మాటలు చెప్పేవురా. లేకపోతే...." అంటూ రామనాధం అతనిని ప్రోత్సహించబోయేడు. కాని సూరప్పకి నమ్మకం
లేదు, కోరచూపులు చూస్తూ విదిలించివేసేడు.

"ఒరేయి నాకు తైరు కొట్టకు."

అవధాని ఫక్కుమని నవ్వేడు.

ప్లీడరు వృత్తియెడ అక్కడున్న వారెవ్వరికీ సదభిప్రాయం లేదు. ఆ జీవితం అబద్ధాల పుట్టయని ఈసడింపు.

అనేకరకాల వాదనలు.

అనేక వృత్తులూ, ఉద్యోగాలూ, మంచిచెడ్డలూ పున:పునరావృత్తం అయ్యాయి.

సమస్యలు బయలుదేరిన చోటనే ఉండిపోయాయి, తాను చేయదలచుకోనివేమిటో రామనాధం లెక్క తేల్చేడు.

"నేను చదవదలచుకోలేదు."

"నేను ఉద్యోగం చేయదలచుకోలేదు."

"దేశానికి నష్టం కలిగించే పని చేయబోవడం లేదు."

అతడు చదువు మానడం, ఉద్యోగం చేయక పోవడం దేశానికి లాభమో నష్టమో చెప్పగల స్తోమత అక్కడున్న వారెవరికీ వున్నట్లు
లేదు.

శివకామయ్య సమాధానం వాళ్ళ మనఃస్థితిని ప్రకటించింది.

"దేశానికి కష్టమో, నష్టమో జరిగిపోయింది. జరుగుతూనే వుంది. పరీక్షలు నాలుగు నెలల్లో వున్నాయి. పరీక్ష ఇస్తే గుమాస్తా
పని చెయ్యాలనే నిర్బంధం ఏమీ లేదు కదా, ఆ పరీక్ష పూర్తి అయ్యేలోపున వచ్చే అదనపు నష్టం ఏమిటి?"

రామనాధం ఆలోచించేడు. తాను చేసింది ఆవేశకృతమూ, అజ్ఞానకృతమూ మాత్రమేనా? ఆ మాటనాతడు ఒప్పుకోలేడు. సమాధానం ఇచ్చేలోపున
రామన్న సమాధానం ఇచ్చేడు.

"మంచిది కాదనుకొన్నాక ఆ పని పూర్తి చెయ్యకూడదా--అంటావేమిట్రా?"

శివకామయ్య అంతతో వూరుకొనే మనిషి కాదు.

"బాగుందోయ్‌. మంచిది కాదు. బ్రహ్మాండంగా వుంది. మరి మంచిదనుకున్నదేదో చెయ్యవద్దుట్రా."

రామనాధం తన మార్గాన్ని మళ్ళీ వారి ముందు పెట్టేడు.

"వ్యవసాయం...."

"మళ్ళీ అదే మాటా..." అని నరసింహం అడ్డు తగిలేడు.

అతడు కాకపోతే అతని వూరి వాళ్ళూ, జిల్లాలో వాళ్ళూ, దేశజనాభా నూటికి ఎనభయ్యయిదు, తొంభయి వంతుల మంది జీవనాధారమే
అదాయిరి. అది కూడా ఈవేళ నుంచి కాదు. వందలు, వేల యేళ్ళ నుంచి, తరాల తరబడి ఆ మంచి పనేదో చేస్తూనే ఉన్నారు.
అయినా దేశానికి అన్యాయం జరిగిపోతూనే వుంది. ఇంగ్లీషు వాళ్ళొచ్చేరు. అంతకు ముందు మరొకరు, వారి ముందు ఇంకొకరు. ఎవరికి
కావలసిన చదువులు వారు మన నెత్తిన రుద్దుతూనే వచ్చేరు. మనవాళ్ళు చేస్తూ వచ్చిన మంచి పని--ఆ వ్యవసాయం వాటిని
వేటినీ మార్చనేలేకపోయింది.

"ఇప్పుడు నువ్వు కూడా ఆ మంచి పనికి దిగుతానంటున్నావు. బాగుంది చెయ్యి. అంతోటి గుమాస్తాల్ని తయారు చెయ్యడానికి తెల్లవాళ్ళు
చేస్తున్న అన్యాయం ఏమవుతుంది? దానిని తొలగించడానికి నువ్వేం చేస్తావు?"

శివరామయ్య వాదనను వెక్కిరించడం తప్ప సభాసదుల వద్ద సమాధానం లేదు. ఆ లోపాన్ని మామూలు పద్ధతిలోనే పూర్తి చేశారు.

"మన సన్యాసికి అక్షరాలు వొంటబట్టలేదు గాని, గొప్ప వకీలు కావలసిన బుర్ర కాదూ, కొద్దిలో ఆ గీత తప్పిపోయింది
కాని...."

మళ్ళీ అందరూ ఫక్కున నవ్వేరు. ఆ నవ్వులలోనే అంత ముఖ్యమైన సమస్యనూ తేలగొట్టేసేరు. లేచారు.



పదహారు


"పెద్దనాన్న ఏరమ్మా?" అంటూ వాకిట్లోకి వచ్చిన రామనాధాన్ని చూస్తూనే లచ్చమ్మ ఎంతో సంతోషం ప్రకటించింది. అతని
ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనే ఆలోచన కూడా మరిచిపోయి అతనిని ప్రశ్నలతో ముంచెత్తింది.

"ఎప్పుడొచ్చేరు బాబూ!"

"రమణయ్య ఎల్లా వున్నాడు?"

కొడుకును గురించిన ప్రశ్నలకు అంతు లేదు. వెంకటరమణ ఆమె కొడుకు.

"ఒళ్ళు వెచ్చదనం లేకుండా వున్నాడా?"

"మీకు కనిపిస్తుంటాడా?"

ఆ వెనువెంటనే అతడు చూపుతున్న నిర్లక్ష్యాన్ని గోడు వెళ్ళబోసుకుంది.

"ఒక్క ఉత్తరం రాయడు."

"పోనీ వాడన్నా సుఖంగా వుండనీ"--అని మనస్సును ఊరడించుకోడానికి ప్రయత్నించబోయింది. కాని ఆ సంతృప్తి ఎంతోసేపు
నిలుపుకొనలేకపోయింది.

"అమ్మంటూ ఒకర్తి బతికివుందనేనా అనుకుంటాడా రాంబాబూ" అంది అక్కసు కంఠాన్ని రుద్ధం చేస్తూంటే...

రమణ మనస్సులోని కష్టం ఏమిటో రామనాధం ఎరుగును. రామనాధమే కాదు లచ్చమ్మా ఎరుగును.

ఆమె విశ్వనాధానికి చట్టరీత్యా భార్య కాదు. భార్య పోయిన తర్వాత విశ్వనాధం ఆమెను చేరదీశాడు. చాకలి చెరువు గట్టున
పొలంలో ఇల్లు కట్టి ఆమెనక్కడ వుంచేడు. వారికో పిల్లవాడు కలిగేడు. వాడు అతనిని నాన్నగారూ అనే పిలుస్తాడు. ఆ
పిల్లవానికి చదువు సంధ్యలు చెప్పిస్తున్నాడు. లోకవృత్తంలో వారు భార్యాభర్తలే.

గాని వారి కులం ఒకటి కాదు. అతడు భోజనం మాత్రం ఇంటి వద్ద చేసి, మిగిలిన గంటలన్నీఆమెతోనే గడిపినా సమాజం వారిని
భార్యాభర్తలుగా ఆమోదించలేదు.

వెంకటరమణ తన జన్మకారణమైన ఈ బాంధవ్యాన్ని గుర్తు చేసుకొనేటందుక్కూడా ఇష్టపడలేకున్నాడని రామనాధానికి తెలుసు.

కాని, ఆ మాటలను లచ్చమ్మకు చెప్పలేడు. లచ్చమ్మ చూచాయగా అర్థం చేసుకొనకపోలేదు. కాని, దానిని విశ్వసించేటందుకు
సిద్ధంగా లేదు.

"నీ వెర్రి నీది, ఒక వారం రోజులు వుత్తరం రాయడం ఆలస్యమైతే..." అంటూ విశ్వనాధం సర్దబోయేడు.

"ఒక వారమా, రెండు నెలలయింది." అంటూ లచ్చమ్మ తేదీలు లెక్కబెట్టింది.

"అయితే కావచ్చుననుకో, చదువులూ, పరీక్షలూ, ఏదో హడావిడి. దానికి తోడు మనం వుత్తరం వ్రాయలేదని వేధిస్తూంటే...."

విశ్వనాధం ఆమెను వూరుకోబెట్టేందుకు చెప్తున్నాడో, నిజంగానే నమ్ముతున్నాడో రామనాధానికి అర్ధం కాలేదు. కాని, దానిని సూచనగా
తీసుకోవడంలో ఆటంకం కనిపించలేదు. రమణ చదువులో ఎంత శ్రద్ధ చూపుతున్నాడో, తిండి వేళప్పుడు కూడా అతని చేతిలో పుస్తకం
ఎలా తెరిచే వుంటూందో వర్ణించేడు.

"నేను వచ్చేసే రోజున వాడిని కలుసుకొందామని హాస్టలుకెళ్ళేను. గదిలో లేడు. కూర్చున్నా, ఎంతకీ వాడు రాడు. ఇంతలో ఎవరో
చెప్తే భోజనాలకేసి వెళ్లేను. అక్కడో చెట్టు క్రింద మనవాడు చదువులో మునిగిపోయి కాఫీకి గంట కొట్టిన సంగతి కూడా
ఎరుగడు."

రామనాధం అతని శ్రద్ధను సుదీర్ఘంగా వర్ణించి, వర్ణించి అతని తరఫున క్షమాపణ వేడుకున్నాడు.

"పాపం నలిగిపోతున్నాడు. ఒక్క క్షణం కూర్చోడం లేదు. కాలేజీ ఫస్టు రావాలనే పంతంతో చదువుతున్నాడు....."

విశ్వనాధం ముఖం ఉత్ఫుల్లమయింది.

"డబ్బుకేం ఇబ్బంది పడ్డం లేదు గదా."

"మీ పెదనాన్నకి డబ్బు రంధి తప్ప వేరే లేదు. అబ్బాయి 'పెద్ద చదువులు చదివించడానికి డబ్బు ఇస్తారు. బాగా వున్నవాళ్ళు
పైకి తీసుకువస్తార'ని ఆ సంబంధం చేశారు. కొడుకుని మాకు కాకుండా చేసేశారు వాళ్ళు. ఈయన పనే ఇదంతా."

విశ్వనాధం ఆ ఆరోపణను స్వీకరించలేకపోయేడు.

"ఏమిటో నీ పిచ్చిగాని, వాడికి ఏం లోటు చేశారు? హాస్టలులో పెట్టి చదివిస్తున్నారు. చదువయ్యేక మంచి ఉద్యోగం వేయించుకొంటారు.
మన కోసమా, వాళ్ళ పిల్ల సుఖం కోసం చేసుకొంటారు గాని....."

"తల్లీ, తండ్రీ అనే పేగును చంపేసే చదువులెందుకంట. ఏదో వుద్యోగం లేకపోతే బతకలేడా? నాలుగెకరాల కొండ్ర దున్నుకుంటే జీవితం
వెళ్ళమారుతుంది."

లచ్చమ్మ సంతృప్తి విశ్వనాధానికి లేదు. తన కొడుకుగా అతనికి సంఘంలో గౌరవస్థితి కల్పించలేడు.... అందుచేతనే వెంకటరమణ
స్కూలు ఫైనల్‌ ప్యాస్‌ కాగానే పెద్ద ధనవంతుల సంబంధం వచ్చేసరికి చటుక్కున వొప్పుకున్నాడు. వాళ్ళు
లచ్చమ్మ కులం వాళ్ళే. ఆ కులంలో వివాహ క్రతువుకు పెద్ద పట్టింపు లేదు, చదువుకుంటున్నాడు, చక్కగా వుంటాడు అనేసరికి
రాయబారం పెట్టేరు. పెళ్ళి అయిపోయింది.

పెళ్ళికి విశ్వనాధం వెళ్ళలేదు.

ఆ వెళ్ళకపోవడం చేతనే వెంకటరమణకు తన జన్మస్థితిలో వున్న అల్పత్వం అర్ధమయింది. విశ్వనాధం తనకు కుదిర్చిన
సంబంధాన్ని, తన వియ్యంకులనుగా, బంధువులుగా అంగీకరించలేడు. ఆ సంగతిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని రమణ చాలా
కష్టపెట్టుకొన్నాడు. ఇంక అటువేపు సంబంధం సాగించడానికి మనసొప్పలేదు. పెళ్ళి అయినాక ఓమారు రెండు మార్లు తల్లిని
చూడబోయినా, అతడు తనకు దూరమయిపోయాడని లచ్చమ్మ గ్రహించడం కష్టం కాలేదు. తానంటే అయిష్టం లేకపోయినా తల్లిని మాత్రం
గౌరవించలేక పోతున్నాడని విశ్వనాధమూ అర్ధం చేసుకోగలిగేడు. మొదట కొంచెం బాధ అనిపించినా త్వరలోనే తట్టుకోగలిగేడు. కాని,
లచ్చమ్మ సర్దుకోలేకపోతూంది. అతడు దూరమవుతున్నాడనిపించేక, దగ్గరకు తెచ్చుకొనేటందుకు మార్గాల నన్వేషించ సాగింది. వారం
వారం ఎవరినో పట్టుకొని ఓ కార్డు వ్రాయించేది. కొత్తగా వూళ్ళో తెరిచిన పోస్టాఫీసును నిలవబెట్టుకునేందుకు గ్రామస్థులు
చేస్తున్న ప్రయత్నంలో ఆమెకు వుత్తరాలు రాసిపెట్టేందుకు మనుష్యుల లోటు లేదు. ఏదన్నా వుత్తరం వస్తే చదివిపెట్టేందుకూ లోటు
లేదు. అసలు లోటల్లా వుత్తరం రావడమే.

కొడుకు అభిమానాన్ని గ్రహించినా ఆమె దానిని స్వీకరించే స్థితిలో లేదు. ధనికులయిన అత్తవారు బీద అయిన తనతో సంబంధం
పెట్టుకోరాదని శాసించి వుంటారని కారణం కల్పించుకొంది. ఆ సంబంధం చేసినందుకు విశ్వనాధాన్ని తప్పు పడుతూంది.

"సరేలే, తేగలు కాల్చేవనుకుంటా, తీసుకురా. కొత్తింబరి కారం వుందా? ఇంత ముద్ద నెయ్యి కూడా వెయ్యి. ఏమిరా అబ్బాయి?"

లచ్చమ్మ అరిటాకులో నెయ్యీ కారం వేసి, ఇన్ని తేగలు తెచ్చి వారి ముందు పెట్టింది.

"ఇప్పుడే పకోడీలు తిన్నా"నంటూ రామనాధం ఓ తేగను ఒలిచి చీరేడు.

"అప్పుడే కూటం తోటలో చేరేరన్నమాట"--అన్నాడు. రామనాధం స్నేహితుల అలవాట్లు తెలిసిన విశ్వనాధం.

రామనాధం చిరునవ్వు నవ్వేడు.

విశ్వనాధం "స్కూలు మానేశావట. రమణ వ్రాసేడు" అన్నాడు.

"చెప్పేడు" అంటూ రెండో వాక్యానికి మాత్రమే సమాధానం ఇచ్చేడు రామనాధం.

ఆ మాట వింటున్న లచ్చమ్మ చటుక్కున అందుకుంది. ఆ రెండో భాగాన్నే.

"వెంకటరమణ వుత్తరం వ్రాశాడా?"

దొరికిపోయినట్లు విశ్వనాధం గతుక్కుమన్నాడు. కాని నిజం చెప్పక తప్పింది కాదు.

"నాలుగు రోజులయింది."

"నాతో చెప్పేరు కాదేం?"

అతడికి ఏం చెప్పాలో తెలియలేదు. ఆ వుత్తరంలో తల్లిని గురించిన మాట ఒక్కటీ లేదు. చదివి వినిపిస్తే లచ్చమ్మ గోల
పెట్టేస్తుంది. కనుక చెప్పవద్దనుకున్నాడు. కాని, ఇప్పుడు దొరికిపోయేడు.

"చెప్దామనుకుంటూనే మరిచిపోయా."

కాని, లచ్చమ్మ ఆ సమాధానానికి సంతృప్తి పడలేదు. కోపం వచ్చి విసురుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.

విశ్వనాధం ముఖం కమిలినట్లయింది. తమ్ముని కొడుకు ఎదుట అటువంటి పరిస్థితి ఎదురవడం సిగ్గు అనిపించింది.

"చదువుకుంటున్నాడన్నమాటే గాని ఉత్తరాలు వ్రాయడం కూడా చేత కాదు. తల్లి పేరు చెప్పి ఆమె ఎట్లా వుందని వ్రాస్తే తప్ప
ఆమెకు సంతృప్తి వుండదు. ఏదో కుర్రాడు మరిచేపోయేడేమో అనుకోదు."

ఆ మాటలకు రామనాధం ఏమీ చెప్పలేదు. చెప్పాలని విశ్వనాధం వుద్దేశ్యమూ కాదు, ఒక్క నిముషం ఊరుకుని మరల ప్రస్తుతానికి
వచ్చేడు.

"తొందర పడ్డావనుకుంటా."

"ఇంక చదువు సాగించడం దేశానికి ద్రోహం చేయడమే ననిపించింది."

విశ్వనాధం 'ఎందుచేత' అని ప్రశ్నించలేకపోయాడు.

స్కూళ్ళు, కాలేజీలు, కోర్టులు, వుద్యోగాలూ మానేసి పరాయి ప్రభుత్వంతో సహాయ నిరాకరణ చేస్తే వాళ్ళు దేశం నుంచి వెళ్ళిపోక
తప్పదనే విశ్వాసాన్ని తాను రోజూ రావి క్రిందా, పెద్ద రేవులో, పొలం గట్టునా అనేక రూపాల్లో చెపుతూంటాడు. బహుశా తన మాటలు
ఈ కుర్రవాని నిర్ణయానికి కారణమేమో కూడా.

ఒక్క నిముషం ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. మరల విశ్వనాధమే ప్రారంభించేడు.

"ఏం చెయ్యాలని?"

"పునర్నిర్మాణ కార్యక్రమం...."

"అంటే.......?"

ఆ కార్యక్రమం బహుముఖం. ఖద్దరు వుత్పత్తి, ప్రచారం, పాఠశాలలు నడపడం, గ్రంథాలయాలు నిర్వహించడం, గ్రామాలలో
పారిశుద్ధ్యం గురించి ప్రబోధం. అంటరానితనం నివారించేటందుకు కృషి. మద్యపాన నిషేధ ప్రచారం...

"నేనేం అనుకోలేదు."--అన్నాడు రామనాధం అసహాయత చూపుతూ.

విశ్వనాధం ఓ నిముషం ఆలోచించేడు.

"స్వయంతీర్ణంపరాన్‌ తారయతి" అన్నాడు ఒక నిముషం పోయేక.

"అంతే మరి."...... అని అంగీకరించేడు రామనాధం.

మరల ఓ క్షణం ఇద్దరూ వూరుకున్నారు.

"ముందు మనూళ్ళో గ్రంథాలయం మూలబడింది. కుర్రాళ్ళు నలుగురినీ పోగుచేసి దానిని నడిపించడానికి ప్రయత్నం చెయ్యి."

ముంగండ గ్రంథాలయం అయిదారేళ్ళ క్రితం వరకూ జిల్లాలోకే పేరుపడ్డ గ్రంథాలయాలలో ఒకటి. అంతవరకూ నిర్వహించిన వాళ్ళు సంసార
జంజాటంలో పడి శ్రద్ధ చూపలేకుండా అయ్యారు. కొత్త వాళ్ళు వచ్చి ఆదుకోలేదు. ఎప్పుడన్నా, ఎవరన్నా పడుచువాళ్ళు ఉత్సాహం
చూపబోయినా వాళ్ళ పట్టుదలమీద పెద్దవాళ్ళకు విశ్వాసం వుండేది కాదు. చివరకది మూలబడింది.

ఆ అవిశ్వాసాన్నే రామనాధం జ్ఞాపకం చేసేడు. విశ్వనాధం దిలాసా ఇచ్చేడు.

"వాళ్ళు మాత్రం ఏం చేసుకొంటారు? ఎంతో కష్టపడి పోగుచేసిన గ్రంథాలయం ఎందుకూ కాకుండా పోతుందని కాని. నువ్వు నిలబడతానను."

రామనాధం ఆలోచించుకోకుండా ఏ మాట ఇవ్వదలచుకోలేదు.

"నలుగురినీ అడుగుతా."

గ్రామానికి గ్రంథాలయ అవసరం ఎంతుందో విశ్వనాధం బహుముఖాలుగా వర్ణించేడు.

మధ్యలో లచ్చమ్మ తిరిగి వచ్చింది.

"రాంబాబూ! తమ్ముణ్ణి కూడా తీసుకువచ్చెయ్యకపోయారా."

"వాడు రాకేం?" అన్నాడు విశ్వనాధం.

"ముందు మీకు ఇష్టం వుందా?" అని లచ్చమ్మ కవ్వించింది.

ఆ ప్రశ్నకు విశ్వనాధం వద్ద సమాధానం లేదు. అతడా ప్రశ్ననెన్నడూ ఆలోచించలేదు. చదువు మాని, వుద్యోగాలను త్రోసిపుచ్చి
గ్రామాలకు తిరిగి రావలసిన వాళ్ళల్లో ఆయన ఎన్నడూ రమణను లెక్కవెయ్యలేదు.

"ఇది ఒకరు చెప్పి చేయించవలసిన పనిటమ్మా! ఎవరికి వారు ఆలోచించుకోవలసిందిగాని" అని రామనాధం పెద్దతండ్రిని
సందిగ్ధస్థితి నుండి తప్పించేడు.

విశ్వనాధం ఏదో తప్పుచేస్తూ దొరికిపోయినట్లు, ఎదురుగా వున్న చింతచెట్టు చివరి రెబ్బలవేపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు.

"వాడి ఆలోచనలు తెలుసా?"

రామనాధం తల వూపేడు.

"ఎప్పుడేనా మాట్లాడేవా?"

"ఉహు."

"నేను చెప్పేను. కాని వాడికి పోలీసు ఆఫీసరు కావాలనే పట్టుదల. పట్టుదల కాదు, జీవితాశయం. మరేవీ వాడి
తలకెక్కలేదు."

"కానీండి. వాడికది నచ్చింది. వుద్యోగం అయినప్పుడు ఏదైతేనేం?"

విశ్వనాధం అతనివంక ఆశ్చర్యంగా చూశాడు.

"ఏదైతేనేమా?"

"పెద్దంత తేడా వుందా?"

విశ్వనాధం ఒక్క నిముషం తటపటాయించేడు.

"వుంది. చాలా తేడా వుంది. తన కుటుంబానికే ఆ ఆలోచన శత్రువును చేసి పెడుతుంది. నువ్వు విదేశీ పాలన పోవాలంటున్నావు. వాడి
ఉద్యోగం ఆ పాలనకు కాపలాకాయటం. అన్నా, తమ్ముడూ, తండ్రీ, కొడుకూ శత్రువులుగా బతుకుతారు...."

రామనాధం ఆ భయాన్ని లెక్కచేయలేదు. తన మామగారు ఓ పోలీసు ఆఫీసరేనాయె. అదేమాట మరొక విధంగా గుర్తు చేశాడు.

"మనకిదివరకే వున్న బంధుత్వాలకన్న ఇందులో వచ్చి మునిగేదేముంది?"

రామనాధం చేసుకున్న సంబంధం విశ్వనాధానికెంతమాత్రం ఇష్టం లేదు. ఆ మాట స్పష్టంగా చెప్పి శంకరశాస్త్రీ వాళ్ళ చేత మాటపడ్డం
కూడా అయిపోయింది. పెళ్ళి జరిగి నాలుగేళ్ళయిపోయినాక ఇప్పుడా అయిష్టాన్ని బయటపెట్టడం న్యాయం అనిపించలేదు. అందుచేత
సాచేశాడు.

"సరేలే. ఏదెల్లా జరగాలో మనమేమన్నా కర్తలమా?"

తండ్రికి కొడుకు ఆలోచనలు నచ్చలేదన్నంతవరకే అర్ధం అయిన లచ్చమ్మ తన కొడుకుని ఇంటికి రప్పించెయ్యడానికి అదొకదారి
కావచ్చుననుకుంది.

"పెంచి, చదువు చెప్పిస్తున్న బాబయ్యగారినే కాదనేంత వాడయ్యాడా? మాట విననప్పుడు చదువు మానిపించేసి తీసుకొచ్చెయ్యకపోయారా?"

విశ్వనాధం సమాధానం చెప్పకపోయేసరికి ఆమె తన వాదాన్ని ప్రస్తరించసాగింది. అప్పటికీ సమాధానం రాకపోయేసరికి తన వాదానికి
అభిమానాన్ని జోడించింది.

"అసలు మీకు ఇష్టం లేదు."

"ఏమిటి?"

"వాడు ఇంటికి రావడం....."

విశ్వనాధం నవ్వేడు.

"నువ్వు చెప్తే ఇంటికి రాడు. నేను చెప్పానని ఆ ఉద్యోగం ఆశా వదులుకోడు."

"ఏం?"

"కారణం ఒక్కటే...."

రామనాధం ముందు ఆ కారణం ఏమిటో ఎన్ని మార్లడిగినా విశ్వనాధం చెప్పలేదు. అతడు వెళ్ళిపోయేక తానే పిలిచి చెప్పేడు ఆమెకు.

"తన తల్లి కులం చిన్నదనేది తప్ప ఆమెగాని, తానుగాని ఈ అగ్రహారంలో వారికి ఏ విధంగా తీసిపోతామని వాడి అభిమానం. నీ
కులం చిన్నదనం నీకూ పట్టలేదు. నాకూ పట్టలేదు. ఓ భోజనం దగ్గర నేనింకా అంగీకరించలేకపోయేను. వాడు నా కొడుకు. నువ్వు
నా భార్యవు. నీ చేతి అన్నం తినలేను. వాడిని పంక్తిని కూర్చోబెట్టుకోలేను. అది అభిమానం అనిపించదూ...."

లచ్చమ్మ ఆ సంగతి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆశ్చర్యపడింది.

"వాడికా....."

ఆమె మాటను విశ్వనాధం పూర్తిచేయనీయలేదు.

"వూళ్ళో చిన్నా పెద్దా అందరూ వాడిని ఏమిరా అంటూంటే వాడందరినీ ఏమండీ అనాలి. ఎవరింటికేనా వెడితే దూరంగా అరుగు చివరన ఆనీ
ఆననట్లు కూర్చోవాలి. ఋషి పంచమి నోముల ప్రసాదాలు తినే అర్హత వాడికి లేదు. ఇవన్నీ అన్యాయాలే. అయితే మనకవి
తోచలేదు. అలవాటు పడిపోయాం. వాడికి అవి శూలాలు అయేయి."

లచ్చమ్మ జ్ఞాపకం చేసుకొంది.

"బాలకృష్ణని 'ఏమిరా' అంటే విశాలాక్షమ్మ కోప్పడ్డారట."

"నాతో చెప్పలేదు."

"నేనే వద్దన్నాను."

విశ్వనాధం ఎంతో అభిమానంతో ఆమె వంక చూసేడు.

"పోలీసు ఆఫీసరైతే తప్ప తనకీ అగౌరవాలు తప్పవని, ఎవ్వరూ గౌరవించరనీ వాడి మనస్సులో పడింది."

కొడుకు మనస్సులో పడిన ఆ అభిమానం లోతుల్నీ, విస్తృతుల్నీ ఆలోచించుకుంటూ ఆ దంపతులు చీకట్లు దిక్కుల్ని అలుముకోడాన్ని కూడా
గమనించలేదు.



పదిహేడు


ముఖం కడుక్కుని లేస్తూ, తోట్లో అడుగు పెడుతున్న సూరాయిని రామనాధం ఆప్యాయతతో పలకరించేడు.

"ఏమిరా సూరాయి! పొద్దున్నే వచ్చేవు...."

"ఏం లేదయ్యగారూ"--అన్నది కేవలం మాటవరసకు అన్నమాట. అబ్బయ్య నాయుడు తోడి అల్లుడుగారికి తోలిపెట్టిన ఆవును
తీసుకొచ్చేడు.

"పెద్ద కాపుగారికి ఆవుపాడి లేదండి. చంటిపిల్ల పాలకి పెద్ద అయ్య ఆవుని తోలిపెట్టారు. తీసుకొచ్చేనండి."

"మీ పెద్దయ్యగారు బాగున్నారా?"

"చిత్తమండి. తమ కాలి దెబ్బ ఎల్లాగుందో కనుక్కుని చూసి రమ్మని చిన్నమ్మ ఈ సీటి ఇమ్మన్నారండి."

సూరాయి ఎంతో భక్తి ప్రవత్తులతో చేతిలో వున్న చీటీని దూరంగా ఒక రాయిమీద పెట్టి పక్కకు తప్పుకున్నాడు. రామనాధం తీసి
చదువుకొన్నాడు. అతని ముఖం ఉత్పుల్లమయింది.

"మీ చిన్నమ్మగారు ఏం రాశారో ఎరుగుదువట్రా?"

"నాకేం తెలుసుద్ది బాబూ! ఏవన్నా పుస్తకాలు ఇస్తే తెచ్చిపెట్టమన్నారండి."

రామనాధం కాస్సేపు ఆ మాటా ఈ మాటా చెప్పి అసలు విషయానికి వచ్చేడు.

"మధ్యాహ్నం వచ్చి మీ అయ్యగారి దర్శనం చేసుకుంటానని చెప్పు. పుస్తకాలు అప్పుడు నేను తెస్తానులే."

మధ్యాహ్నం మూడుగంటల వేళ రామనాధం అవిడి కాలవగట్టుమీద కనిపించగానే సూరాయి తోటలోంచి కేకవేసేడు. నూతి వద్ద నిల్చుని
మాణిక్యమ్మ పలుకరించింది. గుమ్మం వద్ద ఎదురయి స్వరాజ్యం ప్రశ్నించింది.

"మీ కాలు ఎలా వుందో ముందు చెప్పండి. చూసిరారా అంటే సూరాయి మరిచిపోయానన్నాడు. సన్నాసి."

కాలుమీది దెబ్బ అంత పెద్దది కాదన్నా స్వరాజ్యం అంగీకరించలేదు.

"కాస్త మానేవరకూ ఓ కట్టు వుంచండి. తగిలిన వేలికే తగులుతుందని సామెత కూడాను."

"సామెత కనక తగులుతుందా?" అని ఎగతాళి చేసేడు రామనాధం.

సావిట్లో కూర్చున్న అబ్బయ్య నాయుడు వుత్సాహంతో స్వాగతం ఇచ్చేడు.

"ఎవరు రామనాధంగారా, నమస్కారం పంతులుగారూ! దయచేయండి.... అమ్మా! ఓ కుర్చీ వేయించేవా... రాండి, బాబూ!.....
మిమ్మల్ని గురించి మా ఇంటిదీ, అమ్మాయీ నిన్నటి రోజంతా ఒకటే చెప్పడం. వచ్చి దర్శనం చేసుకుందామన్నా అవధ్యుణ్ణి. తమరినే
శ్రమ పెట్టవలసి వచ్చింది... అమ్మా! సూరాయిని పిలిచి ఈశాన్యం మూలలో చెట్టు నుంచి రెండు లేత బొండాలు తీసి
తెమ్మను...."

తనకిస్తున్న పెద్దరికానికి రామనాధం చాల సిగ్గుపడుతున్నాడు. అతని అభ్యంతరాలను ఎవ్వరూ పట్టించుకోడం లేదు.

మాణిక్యమ్మ పళ్ళెంలో రెండు పట్టెడేసి మినప సున్నివుండలు పెట్టుకొని వచ్చింది.

స్వరాజ్యం నాలుగు అమృతపాణీ అరటిపళ్ళు తెచ్చి ఎదురుగా బల్లమీద పెట్టింది.

"మా దొడ్లో చెట్టువి. మంచి రుచిగా వున్నాయి, చూడండి."

ఇంతలో సూరాయి నాలుగు లేత కొబ్బరి బొండాలు చెలిగి సిద్ధం చేసి తెచ్చి కత్తితో సహా తెచ్చిపెట్టేడు.

రామనాధం నిస్సహాయుడుగా ఒక్కొక్కరి ముఖాలే చూసి నవ్వేడు.

"నేనేమన్నా వృకోదరుణ్ణా? మీకు నా మీద ఇంత చెడ్డ అభిప్రాయం ఎలా కలిగింది?"

అబ్బయ్య నాయుడూ, భార్యా కూడా ఏక కంఠంతో అనునయం తెలిపేరు.

"తమబోటి గొప్పవాళ్ళు మా యిళ్లకు రావడమే గొప్ప."

"మీరు ఇంత అభిమానం చూపిస్తే మళ్ళీ రావడానికి సాహసం వుంటుందా?"

చాలా సేపు లోకాభిరామాయణం సాగించి రామనాధం లేచేడు.

"ఒక్క నిముషం కూర్చోండి."

అబ్బాయి నాయుడు కూతురును పిలిచేడు.

"అవధాన్లుగారి నోటు లెక్కకట్టేవు కద. ఇవ్వవలసింది..."

స్వరాజ్యం సంకోచిస్తూనే రామనాధాన్ని సాయం కోరింది.

"మీ వూరు అవధాన్లుగారి వద్ద మేము కొంచెం అప్పు తెచ్చేం. అది ఇచ్చెయ్యాలని ప్రయత్నం...."

"ఆయన దొరకడు. రోజూ ఆడకూతురు ఎక్కడ వెళ్ళగలదు? ఆయననే రమ్మంటే రావడం లేదు" అని పూర్తి చేశాడు నాయుడు.

"పోతుందనే భయం లేనప్పుడు ఆయన తొందరెందుకు పడతాడు?"--అన్నాడు రామనాధం. అప్పయ్యావధాన్లు స్వభావాన్ని గురించి స్వయంగా
ఎరక్కపోయినా వూళ్లో బోలెడు కథలు విని వున్నాడు.

"ఆయనకు తొందర లేకపోయినా మనకుండాలి కదా, రోజు తెల్లవారిందంటే బోలెడు వడ్డీ పెరిగిపోతూంది" అన్నాడు నాయుడు.

రామనాధం తను సలహా ఇవ్వకుండా ఉండలేకపోయేడు.

"ఏ సూరయ్య కాపునో పంపితే తీరిపోతుందిగా...."

అబ్బయ్య నాయుడు ఒక్క క్షణం ఏమీ అనలేదు. తన సూచన ఆయనకిష్టం కాదని రామనాధం గ్రహించేడు.

"మీరు ఎరుగరనుకుంటా! మా సూరయ్య కాపుగారికీ, అవధానులు గారికీ మధ్య జరిగిన గొడవ తరవాత జాగ్రత్త అయినవాళ్ళ
ద్వారా గాని పంపడానికి మనసొప్పడం లేదు...."

రామనాధం ఏమీ అనలేదు. ఓ నిముషం వూరుకొని నాయుడే తన సంకల్పం వెలిబుచ్చేడు.

"తమరు ఆ డబ్బు కాస్తా జమ కట్టించిపెట్టాలి...."

"రేపు పది గంటల వేళ సూరాయికి డబ్బు ఇచ్చి పంపండి. నేను చూస్తాను. దానిదెంత పని?"

"సూరాయి ఎందుకులెండి."

స్వరాజ్యం చిన్న కాగితం పొట్లం తెచ్చి తండ్రికిచ్చింది. ఆయన దానిని రామనాధానికి అందించడానికి చేయి జాపేడు. రామనాధం
ఉలిక్కిపడ్డాడు.

"ఏమిటండదీ?"

"మీకే ఆ శ్రమ ఇస్తాను. తప్పదు."

రమారమి వెయ్యి రూపాయల భారాన్ని నెత్తిన పెట్టుకోడానికి రామనాధం జంకేడు. అవధానులుగారినే పంపిస్తానన్నాడు. స్వరాజ్యమే
వస్తే దగ్గరుండి ఆ పని పూర్తి చేయించి పెడతానన్నాడు. ముక్కు మొగం ఎరుగని వాడిని వారు నమ్మినా, ఆ గౌరవం తాను
దక్కించుకోవడానికైనా ఆ సాహసం చెయ్యలేనన్నాడు.

కాని నాయుడు కుటుంబం ముగ్గురూ అతని భయాలకు నవ్వేశారు.

చివరకు రామనాధానికి తప్పలేదు. "మీరు ఒక్కటి చూసుకోండి. నోటు చెల్లు రాసి చేతికిస్తే గాని చెయ్యి వదలకండి. సూరయ్య
కాపు గోలకి మూలం అదే" అన్నాడు నాయుడు.

"నాకు భయంగా వుంది సుమండి."

"కాలేజీలో చదువుకొచ్చిన వారికీ, సామాన్య రైతుకీ తేడా లేదా? అతనిని చేసినట్లు మిమ్మల్ని మోసం చెయ్యలేడు."

"ఇంకో విధంగా చెయ్యొచ్చు. వడ్డీ లెక్క తప్పు కట్టవచ్చు కదా...."

అదో పెద్ద సమస్య కాదన్నాడు నాయుడు.

"ఆయన మొహం చాటు చేస్తుంటే నెల రోజుల నుంచి రోజుకి రూపాయికి అర్ధణా పోవడం లేదూ...."

రెండు రోజుల నుంచి ఓ యేభయి రూపాయల అప్పు కోసం తాను ఆయనవద్దకే వెళ్ళాలనుకొంటున్న విషయం మరిచిపోయి, అంత దగాకోరు అని
ఎరిగీ అప్పయ్యావధానులుగారి వద్దనే ఎందుకు అప్పు తెచ్చారని ప్రశ్నించేడు.

నాయుడు నవ్వేడు.

అప్పు చేసేవాడి మనస్తత్వం గురించి హాస్యం చేసేడు.

"ఏమి నా మీద పెద్దభారం పెట్టేరు. అది పూర్తి చేసే వరకూ నిద్ర కూడా రాదు..." అంటూ రామనాధం లేచేడు.

"తమరు దేశం కోసం ఒక త్యాగం చేశారు. నాబోటి అవధ్యుడికి సాయం చెయ్యడంతో మీ దేశ సేవ ప్రారంభం కావాలని
కోరుకోరూ......."

అందరి వద్దా సెలవు తీసుకొని గుమ్మం దిగుతూంటే స్వరాజ్యం ఆహ్వానించింది.

"మళ్ళీ ఎప్పుడొస్తారు?"

"ఇదో పని పెట్టేరు కదా, పూర్తి కావడంతోనే వస్తా."

"ఈ పనితో మీ రాక ముడిపెట్టకండి. తీరిక ఉన్నప్పుడెప్పుడన్నా వస్తూండండి. పుస్తకాలు చదివినాక సూరాయి చేత పంపిస్తా.
మళ్ళీ ఏవన్నా ఇద్దురు గాని."



పద్దెనిమిది


రామనాధం సాయంకాలం ఇంటికి వచ్చేసరికి తల్లి మహోత్సాహంతో చెవినవేసిన శుభవార్త విని మ్రాన్పడిపోయేడు.

"ఈ నెలలో ఇంటికి కోడలు వస్తుందిరా అబ్బాయి."

మొదట ఆ వార్తకాతడు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. అప్పుడప్పుడు తన భార్యను తీసుకువచ్చి ఓ పదిరోజులుంచుకు పంపేస్తూండడం
అలవాటుందని అతడికి తెలుసు. ఇప్పుడూ అటువంటి రాకగానే భావించేడు.

రాట్టం ఆకులకు దారం బిగిస్తూ యథాలాపంగా సమాధానం ఇచ్చేడు.

"బాగుందమ్మా!"

"ముహూర్తం పెట్టించి, మళ్ళీ కబురు చేస్తామన్నారు."

"అమలాపురం నుంచి ముంగండ వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళేందుక్కూడా ముహూర్తాలు కావలసొచ్చిందేమమ్మా."

రాజమ్మ కొడుకు అన్నీ ఎరిగి అమాయకత్వం నటిస్తున్నాడనుకొంది. ఆ కొంటెతనం తలుచుకొని నవ్వింది.

"పెళ్ళాం వచ్చేక కూడా ఆవిడ ముందు ఆ ఏకుల బుట్టా, నువ్వూ తయారవుతావా యేం! నవ్వుతుంది."

"ఎందుకమ్మా నవ్వడం?"

"ఏమిట్రా నీ ఎందుకులూ, నువ్వూనూ? కాలేజీ చదువు మాని ఏకులొడుకుతాననే వాడిని చూస్తే ఎవరయినా నవ్వుతారు."

ఆమె అభ్యంతరాన్ని నవ్వులో తేల్చివేయడానికి రామనాధం ప్రయత్నించేడు. అతని నవ్వు చూసేసరికి రాజమ్మకు కోపం చేసింది.

"రేపు వియ్యాలవారి తరఫున శుభపత్రిక తీసుకొని ఎవరో వస్తారు. శుభమా యని నువ్వు....."

అప్పుడు అర్ధం అయింది. తల్లి చెప్పే ముహూర్తానికి ఓ ప్రత్యేకార్థం ఉందని.

"ఏమిటమ్మా నువ్వనేది?"

రాజమ్మ చెప్పింది.

"మీ మామగారు కబురుచేశారు. నాన్నగారు వెళ్ళారు."

అయిదారు నెలల క్రితం సుందరి రజస్వల అయినప్పుడే రాజమ్మ కోడల్ని వెంటనే ఇంటికి తెచ్చుకోవాలనుకొంది. కాని వియ్యంకుడే
అభ్యంతరం చెప్పేడు. కూతురుకు పదమూడేళ్ళయినా నిండలేదనీ, ఆ చిన్న వయస్సులో దంపతుల్ని కలపడం ఆరోగ్యకరం కాదనీ
అన్నాడు.

ఆ సమస్య ఆనాడు తనదాకా రాలేదు కనక తాను అభ్యంతరం చెప్పవలసిన అవసరం కలగలేదు. మామగారికి మనస్సులోనే
అభినందనలు తెలిపేడు.

ఈవేళ ఆయనే ప్రోత్సాహమిస్తున్నాడని తల్లి చెపుతూంది. ఇంక తాను వూరుకోడానికి వీలులేదు. బయటపడక తప్పదు.

ఆడపిల్లలకు కనీసం పదహారేళ్ళూ, మగవానికి ఇరవయ్యేళ్ళూ వస్తే గాని దాంపత్య జీవితం ప్రారంభించరాదని అతని విశ్వాసం.
కాలేజీలో లెక్చరర్లూ, బయట సంఘసంస్కరణవాదులూ శారీరక మానసిక ఆరోగ్య సూత్రాల బలంతో ఆ అభిప్రాయాన్ని మనస్సుకు
నాటించేరు. మామగారికి లలితపూజా వగైరా ఛాందసాలున్నా ఆ మాత్రం కాలానుగుణంగా ఆలోచించగలిగినందుకు ఆనాడు సంతోషపడ్డాడు.

అయితే, ఆయన తన భార్యా వాళ్ళూ రాసి రంపానపెడితే మెత్తపడ్డాడు కాబోలుననుకొన్నాడు. ఆయన మెత్తపడ్డాడని తాను
మెత్తపడాలా?

ధృఢస్వరంతో నిరాకరణ తెలిపేడు.

"నీ కోడల్ని ఇప్పుడు తీసుకురావటం పడదమ్మా."

"అదేమిట్రా అల్లా అంటావు? శుభమా యని కోడల్ని తీసుకు రావాలనుకొంటూంటే..."

ఆమె కంఠంలో ఆశ్చర్యం, ఆదుర్దా వినిపించింది. ఆ అభ్యంతరంలో ఆమెకు కేవలం అశుభ శంక మాత్రమే కనిపించింది. రామనాధం
గ్రహించేడు.

"కోడల్ని పంపమను. ఆవిడ వుంటానన్నంత కాలం వుంచుకోండి. పంపించండి. అంతేగాని...."

ఒక్క నిముషం ఆగి ఆ దృఢస్వరంతోనే ఆ అభిప్రాయాన్నే మరో రూపంలో వివరించేడు.

"నాతో చెప్ప పనిలేదు."

"నీతోగాక ఇంకెవరితో చెప్తాను? ఎవరన్నా వింటే నవ్వుతారు. యెందుకా కోపం? వాళ్ళేం చేశారని?....."

అయిదారు నెలల క్రితమే తన భార్యను పంపనందుకు కోపం వచ్చిందనీ, అదే ఈ అభ్యంతరానికి మూలమనీ ఆమె అనుకొంది. ఆమెకు
ఎల్లా సమాధానం చెప్పాలో రామనాధానికి అర్ధం కాలేదు.

"ఇప్పట్నుంచీ...."

కొడుకు మాటను మధ్యలోనే త్రోసిపుచ్చింది రాజమ్మ.

"పెద్ద మనిషి అయిన పిల్లను వాళ్ళెంత కాలం మాత్రం వుంచుకుంటారురా?......"

"కూతురు బరువుగా వుంటే పంపెయ్యమను. దానికి ముహూర్తాలూ...."

"తప్పు, తప్పు...." రాజమ్మ మందలించింది.

"అలాంటి మాటెప్పుడూ అనకు. వింటే వాళ్ళేమనుకుంటారు. కూతురికి తిండి పెట్టలేని దురవస్థ లేదు వాళ్ళకి. రాజాలాంటి వుద్యోగం.
నౌకర్లు, చాకర్లు, బోలెడంత సంపత్తి. ఆ మాట అన్నావని తెలిస్తే....."

మాటకు మాటగా వచ్చేసినా, ఆ మాట అన్నందుకు రామనాధమే సిగ్గుపడ్డాడు.

"అది కాదమ్మా! ఆ సందేహం వుంటే పంపెయ్యమన్నమాటగా అన్నా గాని...."

రాజమ్మ సంతృప్తిపడింది. కాని అది జరిగేది కాదంది.

"అలా అడగనూ కూడదు. వాళ్ళు పంపనూ పంపరు. ఆ అడ్డు కాస్తా తీరితేగాని వాళ్ళెల్లా పంపుతారు? మనమెల్లా అడుగుతాం...."

ఈమారు రామనాధం తన మనస్సులో వున్న అభ్యంతరాన్ని బయటకు స్పష్టంగా చెప్పక తప్పలేదు.

"పదమూడేళ్ళన్నా నిండలేదమ్మా! ఇప్పటినుంచీ...."

ఆమె రజస్వల అయిందని రాజమ్మ గుర్తుచేసింది.

రజస్వల కావడం కుటుంబ జీవితానికి అర్హతగా తీసుకోరాదంటాడు రామనాధం.

"పెద్దమనిషైతే మాత్రం, వయస్సేం వుందమ్మా."

కొడుకు మాటలకు ఆశ్చర్యపడడంకన్నా రాజమ్మ ఎక్కువగా సిగ్గుపడింది.

భార్య వయస్సును గురించి అటువంటి సానుభూతిని తెలపడం ఆమె ఎన్నడూ ఎరగదు. ఆడపిల్ల పన్నెండేళ్ళు వెళ్ళినా పెద్దమనిషి
కాకపోతే నిషేకం జరిపెయ్యటం చూసింది. ఆడపిల్ల త్వరగా పనికిరావాలని అరటికాయను ఊదరపెట్టినట్లు తెగ మేపడం చూసింది.
ఆలస్యంగా రజస్వల అయ్యే సంప్రదాయం గల కుటుంబాల్లో ఆడపిల్లల్ని గురించి ఎదురుచూస్తూండడం ఎరుగును. పెద్దమనిషయితే చాలు
పదేళ్ళకే ఆడపిల్లను భర్తతో కలపడం తప్పుకాదనే ఆలోచనల మధ్య ఆమె పెరిగింది. ఇప్పుడు కొడుకు వేసిన ప్రశ్ననామె
ఎరగనే ఎరగదు.

"పోరా సిగ్గుమాలినవాడా!" అని సంభాషణను తుంపివేసి వంటపని చేసుకొనేటందుకు వెళ్ళిపోయింది.



పందొమ్మిది


ఆ అభ్యంతరాన్ని శంకరశాస్త్రి అతని భార్య అంత తేలిగ్గా తీసుకోలేక పోయేరు. ఆమెకు నవ్వు మాత్రమే తెప్పించిన ఆ మాట
చెవిని బడేసరికి ఎదురుదెబ్బ తిన్నట్లు దిగ్భ్రాంతుడయ్యేడు. పెళ్ళికి ఒప్పించడానికై తానెంత శ్రమపడవలసి వచ్చిందో అతడు
మరచిపోలేదు. అప్పటికీ, ఇప్పటికీ మధ్య నాలుగేళ్ళు గడిచేయి. పేరుకు నాలుగేళ్లు గాని, అంతక్రితం గడిచిన 15-16
ఏళ్ళ పెంపకమూ ఈ నాలుగేళ్ళ జీవితమూ ఒకదానికొకటి పోలిక లేదు. ఎవ్వరితో మాట మాత్రం కూడా చెప్పకుండా కాలేజీ వదిలేసి
రావడంలోనే అది కనబడింది.

పెంచిన బిడ్డను ఇంకా ఇంకా గొడవల్లో పడిపోకుండా చెయ్యడం కోసం తాను తయారు చేసిన పథకం అంత సులభంగా నిరుపయోగం కాగలదని
శాస్త్రి వూహించనే లేదు.

* * * * *

మధ్యాహ్నం భోజనం కాగానే ఓ కునుకు తీయడం ఆయన అలవాటు. ఆ రోజున ఆ అలవాటు తప్పించేడు. తిండి తిని చేయి కడుక్కుంటూనే
ఆమలాపురం పరుగెత్తాడు.

వియ్యంకుణ్ణి చూడగానే చూపిన వుత్సాహం, ఆయన చెప్పిన వార్త విన్నాక నారాయణమూర్తిలో కనబడలేదు. అల్లుని దేశహితైక
చర్యను విని నారాయణమూర్తి నిర్విణ్ణుడయ్యేడు. కాబోయే కలెక్టరుకు మామనవ్వాలన్న ఆశ మిగలలేదు. ముందు తన ఉద్యోగం
మాటేమిటని భయం పట్టుకొంది.

తన అల్లుడు. సాక్షాత్తూ తన కూతురు మగడు సహాయ నిరాకరణం చేశాడు. ప్రభుత్వం ఏమంటుంది? అల్లునిలో రాజభక్తి
కలిగించడమో, రాజభక్తి గల అల్లుడిని తెచ్చుకోవడమో తనదే బాధ్యత అనరా? మరో మరో ఉద్యోగం కాదు కదా. పోలీసు
డిపార్టుమెంటు. ప్రభుత్వానికి రెప్పలా భావించబడే శాఖ. ఉద్యోగుల నుంచే కాక, వారి బంధువుల నుంచి కూడా అచంచల భక్తి,
విశ్వాసాలు కోరే శాఖ. ఈ కథ తెలిస్తే తన స్థితి ఏమవుతుంది? ప్రమోషన్ల మాట దేవుడెరుగు. అసలీ ఉద్యోగం మాత్రం
వుంచుతారా?

అంత దర్పం, దాష్టీకం చూపే అంతమనిషీ ఆ ఆలోచన తోచేసరికి జావయిపోయేడు. ఎటువంటి వాడికి పిల్లనిచ్చానురా భగవంతుడా
అనిపించింది. వెతికి వెతికి తీసుకొచ్చిన సంబంధం ఇప్పుడేమనుకొంటే ఏం లాభం? తప్పు చేశాననుకున్నా దిద్దుకోవడం సాధ్యమా? తన
అసమర్థతకి ఉక్రోషం పుట్టుకొచ్చింది. ఆ ఉక్రోషంలో ముంగండ వాళ్ళందర్నీ కలిపి తిట్టేడు. ఆ వూళ్ళోని బ్రాహ్మణశాఖ వారి
బలహీనతను వెక్కిరించే ప్రస్తావిక శ్లోకం చదివేడు.

"మొత్తం మీద 'నోభయంగాళ్ళ'నే మాట సార్ధకం చేశారు" అన్నాడు.

మొదట కొంచెం సేపు ఓపిక పట్టి శంకరశాస్త్రి వియ్యంకుడికి తన పథకం నచ్చచెప్పడానికి ప్రయత్నించేడు. కాని, చచ్చిపోయిన
వాళ్ళనూ, బ్రతికివున్న వాళ్ళనూ, గ్రామాన్నీ, శాఖనూ కలిపి తిడుతూంటే ఎంతోసేపు సహించలేకపోయేడు.

కోపం మాట వస్తే శంకరశాస్త్రి తక్కువవాడు కాదు. ఎదుటివాడు పోలీసు ఉద్యోగి అయ్యేది, మరొకడయ్యేది.

ఝుణంఝణలాడించేడు. "తర్వాత ఏమిషయీది."--అనేసి పైనున్న కండువా కుర్చీలో పారేసి ఝయ్యిన లేచేడు.

రెండు గొంతులూ పెద్దవిగా వినబడేసరికి వియ్యంకుడికి ఫలహారం ఏర్పాట్లు చేస్తున్న అన్నపూర్ణమ్మ పరుగెత్తి వచ్చింది. గదిలో
మంచంమీద పడుకొని వారి మాటలన్నీ వింటున్న సుందరి లేచి వచ్చింది. ఆమె ముఖం చూడగానే తమ మాటలు ఆమె విన్నదని శాస్త్రి
గ్రహించేడు. ఆమెను బెదరకొట్టకూడదు. చటుక్కున సర్దుకు కూర్చున్నాడు. కాని, ముఖంలో ఆ ఉద్విగ్నత మాయలేదు.

అసలు సంగతి వినేసరికి అన్నపూర్ణమ్మ ముఖం నల్లబడింది. కాని, తెలివి కోల్పోలేదు. ముందు రంగంలోంచి కూతుర్ని పంపేసేటందుకు
పని పురమాయించింది.

"పొయ్యి చూడు తల్లీ."

ఆమె వెళ్ళిపోయేక ఉభయుల్నీ శాంతపరచ పూనుకొంది.

"ఆయనకు ప్రథమ కోపం అన్నయ్యా! వారిని ఎరగరా ఏమన్నానా? వారి మాటలే అంత. పైగా గవర్నమెంటుతో వ్యవహారమేయని
ఆందోళన. ముందుకు రావలసిన కుర్రాడు తప్పుదారి పట్టేశాడే అన్న విచారం. ఆ మాటలకు కోపం తెచ్చుకొంటే ఎల్లాగ? మీబోటి
వారు......"

అన్నపూర్ణమ్మ అటు మొగుణ్ని కసిరీ, కనుసంజ్ఞలతో బ్రతిమలాడీ మాట్లాడకుండా చేసింది. ఆ మాటా, ఈ మాటా చెప్పి వియ్యంకుణ్ణి
సముదాయించింది.

"మరిప్పుడేమిటి చెయ్యడం?"

అని ముందు ఆలోచనకు హెచ్చరించింది.

ఆమె తెలివీ, మాట నేర్పూ, ఓర్పూ చూస్తూ పరకాయిస్తున్న శాస్త్రి మనస్సులోనే ఆనందపడ్డాడు. ఈ తల్లి తరిఫీదులో పెరిగిన
పిల్ల తన కొడుకుని దారిలోకి తేగలిగేదేయని విశ్వాసం కలిగింది.

"......ఈ వరస చూస్తే ఇతగాడు అసలా అవకాశం ఇచ్చేలాగే లేడే..." అనుకొన్నాడు శంకరశాస్త్రి.

* * * * *

"జరిగిపోయిందేదో జరిగిపోయింది. అంతకంటె ముందుకెళ్ళి సభలనీ, ఖద్దరనీ...." అర్ధోక్తిలోనే అన్నపూర్ణమ్మ మాటకు అడ్డం
వచ్చేడు శాస్త్రి.

"అదేం మిగలలేదు. ఖద్దరుతోటే వచ్చేడు ఊళ్ళోకి."

ఖద్దరు వేసుకొన్న వాళ్లు ఎంత ఖరీదునైనా తమ పూర్వపు దిరీసుల్ని మంటల్లో పారేస్తున్న కథల్ని వింటున్న అన్నపూర్ణమ్మ
ఆశ్చర్యంతో నోరు తెరిచింది.

"అల్లుని వద్ద మంచి ఖరీదయిన బట్టలు...."

నారాయణమూర్తి పళ్ళు కొరుకుతున్నాడు. అవన్నీ మరి లేనట్లు శాస్త్రి తల తిప్పేడు.

అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచి ఆశ్చర్యం నుంచి తేరుకుంది. మళ్ళీ అదే ప్రశ్న....

"మరిప్పుడేమిటి చెయ్యడం!"

నారాయణమూర్తికి తన పోలీసు పద్ధతులపై అనంతమైన విశ్వాసం. దానికి అనుగుణంగానే ఉంది ఆయన సలహా.

అతి గారాం, తినడానికి మస్తుగా ఉండడం వగైరా అవలక్షణాల వలన ఈ మాదిరి ఔద్దత్యం పుట్టుకొస్తూంటుందని అయన నమ్మకం.
దానికొక్కటే మందుంది. ఆయన సంచికట్టులో.

"గూళ్ళు విరగబొడిచేసి, బొక్కలో తోసేస్తే...."

అంటూ దాని ప్రాశస్త్యాన్ని నిరూపించడానికి, కనుబొమ్మలు మిటకరించేడు.

అన్నపూర్ణమ్మ ఎర్రబారి చూసింది. శాస్త్రి మరల భుజం మీది కండువా సవరించుకొన్నాడు.

ప్రత్యామ్నాయ సూచనను శంకరశాస్త్రి వియ్యపురాలి ముందుంచేడు. నారాయణమూర్తి అక్కడున్నట్లు కూడా గుర్తించడం ఇష్టం లేనట్లు
ఆయనకు వీపు తిప్పేడు.

సుందరిని ఎరగాచేసి రామనాధాన్ని పట్టెయ్యాలనేది ఆయన సూచన. అయితే తెలివిగా ఆ మాటను తిప్పి తిప్పి వారి ముందు పెట్టేడు.

ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. దంపతుల్ని కలిపేస్తే అన్నీ సర్దుకొంటాయన్న ఆలోచనను అన్నపూర్ణమ్మ ఆలోచించవలసిందే
అనుకొంది.

నారాయణమూర్తి గర్జించేడు.

"అదేం కుదరదు."

శాస్త్రి ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా తన పథకం ప్రాశస్త్యాన్ని వివరించేడు.

కొత్తగా కాపురానికి వచ్చిన పడుచు పెళ్ళాం మరులలో రామనాధం ఇంటిపట్టునే ఉంటాడు. ఈలోపున వ్యవసాయం అవీ ఆయన
వప్పచెప్తాడు. కదలడానికి వీలూ వుండదు. అసలు అనిపించదు. ఓ యేడాది గడిచిందంటే ఈ పట్టుదలలేవీ వుండవు. అన్నీ
మరిచిపోతారు. ఈలోపున ఒకళ్ళిద్దరు పిల్లలు కలిగేరా ఇహ చెప్పనక్కర్లేదు.

"నన్నెక్కడ కూర్చోమంటావే--అని దిక్కులు చూసే దర్జాలే. మనం యెరగని మొహాలా ఏమిటి?" అని శాస్త్రి వియ్యంకుని వేపు
చూసేడు.

ఐ.సి.యస్‌. అయి ఏ కలక్టరుగానో వస్తాడనుకొన్న అల్లుడిని గురించి ఆ విధంగా ఆలోచించడం ఏదోలా వుంది
అన్నపూర్ణమ్మకి. నారాయణమూర్తికి కసి వుబికి వస్తూంది.

"ఏదో ఉద్ధరిస్తాడనుకొంటే....."

అన్నపూర్ణమ్మ సర్దుబాటు చెయ్యడానికి ప్రయత్నించింది.

"ఇప్పుడేమంత వయస్సు మీరిందనీ, ఇరవయ్యేగా, ఇంకా ఐదేళ్ళు, రేపు జూన్‌లో వెళ్ళమంటే సరి."

నారాయణమూర్తికి భవిష్యత్తు గురించి ఆ విధమయిన ఆశ లేశం కూడా మిగలలేదు.

"ఇవి అల్లా వదిలే జబ్బులు కాదు. ఓమారు వచ్చేక మనిషి సర్వనాశనం అయ్యేవరకూ వదలవు. అప్పుడూ వదలవు. వంశంలో
జీర్ణించిపోతాయి. సెలల్లా బయటవేస్తూనే వుంటాయి."

నారాయణమూర్తి పోటు ఏమిటో శాస్త్రి గ్రహించేడు. రామనాధం అతని పెదతండ్రి విశ్వనాధంమీద జంటదాడి.

తన పుత్రుడు తొందరపడ్డాడనీ, తాత్కాలికావేశంలో కాలు జారేడనీ తలుస్తూ దానిని సరిదిద్దుకోవాలనుకొంటూంటే 'కుదరని జబ్బులూ,
వంశం నుంచి వదలని జబ్బులూ అంటాడేమిటీతడి నీలుగు'. అనిపించింది శాస్త్రికి. ఓ మారు దులిపెయ్యాలనుకొన్నాడు. అయితే ఈ మారు
కొత్త పద్ధతి తొక్కేడు.

"అంతేనండి వియ్యంకుడుగారూ! కొన్ని జబ్బులున్నాయి చూశారూ, అవి ఉద్యోగాన్ని బట్టో, ఇంట్లో వున్న బంగారాన్ని బట్టో, ఒంట్లో
వున్న హుమ్మస్సును బట్టో సంక్రమిస్తుంటాయి. నాలుగు పిచికలు చేరేసరికి క్రిందూ మీదూ తెలియదు. ఏమంటారు? ఆ హోదా, బంగారం,
రక్తం వడి మళ్ళేసరికి ఏడ్పు మొహం పెట్టేస్తారు. అల్లాంటి వాళ్ళను గురించే అన్నాడెవడో మహానుభావుడు, సత్యదర్శి...."

శంకరశాస్త్రి ఆ అప్రత్యక్ష కవికి చేతులు జోడించి నమస్కరించేడు.

"....ఉద్యోగాంతము నందు చూడవలెరా ఆ యయ్యసౌభాగ్యముల్‌."

అంత అవమానకరంగా తన ఉద్యోగపు హోదాను ఎద్దేవా చేసిన వాడు వియ్యంకుడైపోవడం చేత గాని, మరొకరూ, మరొకరూ అయితే వళ్ళు
హూనం చేసివేసేద్దునని నారాయణమూర్తి పళ్ళు కొరికేడు.

శంకరశాస్త్రి చర్రుమన్నాడు. కండువా మడత దులుపుతూ, అపహాస్యంగా వియ్యంకుణ్ని విసిరేశేడు.

"ఇదే పతకం అయితేనా...."

...."అమ్ముకు తిననా" అన్న తరువాయి మాట ప్రక్షిప్తం.

ఏదో గొప్పతనం చూసి పతకం ఇస్తారు. కాని, దానిని అమ్ముకు తినెయ్యడం వరకే అతనికి దాని విలువ తెలుసు. ప్రపంచం
తనకిచ్చిన విలువ నాతడు ఆ పతకం విలువకే కుంచించుకుంటాడు. అంత పరమఅజ్ఞానివే నువ్వూనని శంకరశాస్త్రి వెక్కిరింత.

అన్నపూర్ణమ్మ అతి కష్టంమీద వియ్యంకులిద్దరినీ సమాధానపరిచింది. కూర్చోబెట్టింది. కాని, నారాయణమూర్తి ఓ పట్టాన మనస్సు
కుదుటపరచుకోలేక పోతున్నాడు.

అన్నపూర్ణమ్మ మాటతప్పించి కాస్త వ్యవధానమిస్తేనేగాని వ్యవహారం తెమలదని అర్ధం చేసుకొంది.

"సుందరీ!"

"పీటలు వేశానమ్మా" అని లోనుంచి సుందరి సన్నగా సమాధానమిచ్చింది.

"లేవండి అన్నగారూ!" అంటూ తొందరపెట్టి మగణ్ణి హెచ్చరించింది.

"లేవండి మీరు కూడా. ఆ దుస్తులు తియ్యండి. అమ్మా! నాన్నగారి పంచె చూడమ్మా!"

ఉపాహారాలయి మరల ముగ్గురూ సావిట్లోకి వచ్చి కూర్చున్నారు. మొదటి ఆవేశం చల్లబడి మగవాళ్ళిద్దరూ నిలకడగా మాట్లాడే
స్థితిలో వుండడం చూసి అన్నపూర్ణమ్మ సంతోషించింది. విషయం ప్రస్తావన చేసింది.

"అన్నయ్యగారి ఆలోచన బాగానే వుందనుకుంటా. మీరేమంటారు?"

నారాయణమూర్తి ఓ నిముషం ఆలోచించేడు.

"పిల్లదాన్ని కూడా ఈ గొడవలో దింపితే?"

"వాళ్ళిద్దరూ చూసుకొంటారు. ఎవరు ఎవరిమాట వినాలనేది మనం చెప్పితే జరిగేదా యేమన్నానా?" అన్నాడు శాస్త్రి.

"ఇప్పుడైతే నా కూతురుకూ అతనికీ సంబంధం లేదనొచ్చు"

పై అధికార్లు ఏదో అంటారనే భయంతో తన మగడు కూతురు కాపురమే చెడగొడతాననడం అన్నపూర్ణమ్మకు నచ్చలేదు.

అల్లుడితోపాటు కూతురు కూడా దూరం కావడం మనస్సుకు కష్టంగానే వుంది. ఇదివరకే ఓ కొడుకు వర్ణాంతర వివాహం చేసుకొని ముఖం
చూడకుండా అయ్యేడు. ఇప్పుడు కూతురు. కారణం ఏదయితేనేం?

కాని తప్పనిసరి. కూతురు సంసారాన్ని భగ్నం చెయ్యలేదు. ఆ మాటే చెప్పింది.

"మనకి దూరంగా వున్నా వాళ్ళిద్దరూ కలిసి వుంటారు. అంతగా అయితే మనింటి ఛాయలకు రావద్దందాం. అంతేగాని, మనకేదో కష్టం
కలుగుతుందని పిల్లదాని జీవితం...."

తన ప్రయత్నం ఇద్దర్నీ దూరం చేసుకోడానికి కాదని గుర్తుచేశాడు శాస్త్రి.

"కుర్రాణ్ని కూడా దగ్గిరికి తెచ్చుకోవాలనిగాని....."

నారాయణమూర్తి రుసరుసలాడేడు.

"మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. ఈ ప్రయత్నాలకు ఇదే మొదలు ఇదే ఆఖరు కూడా."

అన్నపూర్ణమ్మ భర్త ముఖం వంక చూసింది. ఆ చూపు అర్ధం గ్రహించేడు నారాయణమూర్తి.

"ఏమల్లా చూస్తావు?"

"బంధుత్వాలు చూసుకోవలసిన చోట కూడా మీ వుద్యోగపు దాస్టీకమేనా?"

"నా వుద్యోగానికి సంబంధించినంతవరకూ అల్లుడూ లేడు, కూతురూ లేదు." నారాయణమూర్తి చిరచిరలాడుతూ లేచేడు.

"మీరే నిర్ణయం చేసుకున్నా సరే. కాని, ఆ కుర్రవాడు నా యింట అడుగు పెట్టడానికి వీలు లేదు. ఆ కార్య కరామత్తులకు నేను
రాను."

"మరి?" అని అన్నపూర్ణమ్మ ఆయన ముఖంలోకి చూసింది.

"అది అంతే. ఓ చీర పెట్టి పిల్లను పంపించెయ్యి. ఆ శుభకార్యం వాళ్ళింట్లోనే చేసుకుంటారు."

"అదెల్లాగ?"

"ఎల్లాగో నన్నడిగితే లాభం లేదు" అంటూ నారాయణమూర్తి వీధిలోకి వెళ్ళిపోయేడు.

శంకరశాస్త్రి ఓ నిముషం ఆలోచించేడు.

"సరే. మీరేమంటారు?"

అన్నపూర్ణమ్మ అతనికి ధైర్యం చెప్పింది.

"మీ ఆలోచన భేషుగ్గా వుంది. అన్నయ్యగారూ! కానీండి. శుభస్య శీఘ్రం. ముహూర్తం పెట్టించండి."

"ఎక్కడ అని....."

"మీ వూళ్ళోనే, మా చెల్లెలిగారింట జరపడానికి మీకేమన్నా అభ్యంతరం వుందా?"

శాస్త్రికి అభ్యంతరం లేదు.

ఆయన అక్కడికక్కడ ముహూర్తం నిర్ణయం చేసేడు. ఆమె సంతృప్తికి సిద్ధాంతిని పిలిపించేడు. అతడు ముహూర్తం ఏమిటో కూడా
ఎరక్కుండానే శాస్త్రిని పొగిడేడు.

"భేష్‌! బ్రహ్మాండంగా వుంది. సందేహము ఏమీ అక్కర్లేదు." అన్నాడు.

"చొరవ ఆలోచన మీనుంచే వచ్చినట్లు నడపండి" అంటూ చూచాయగా హెచ్చరించి శాస్త్రి వచ్చేశాడు.

అంత కష్టపడి తయారు చేసిన పథకం అంతా టప్పున ఎగిరిపోతున్నట్లు నిర్విణ్ణుడయ్యేడు.

* * * * *

ఒక్క క్షణానికి సర్దుకొని ప్రశ్నించాడు "ఏడీ వాడు?"

తాను చెప్పిన మాటకు మగని ముఖంలో కనిపించిన వైలక్షణ్యం చూసి రాజమ్మ భయపడింది. రామనాధం అభ్యంతరం వెనక ఏదో
లోతులుంటాయనిపించింది. సంకోచిస్తూనే సమాధానం ఇచ్చింది.

"ఇంకా భోజనానికి రాలేదు."

శంకరశాస్త్రి ఏమీ అనలేదు. ఏదో ఆలోచిస్తూనే భోజనం ముగించేడు. వీధి అరుగుమీదికి వచ్చేసరికి దారినపోతున్న
సుబ్బన్నశాస్త్రి కనిపించేడు.

"ఎవరు సుబ్బన్నా! ఎక్కడినుంచోయి?"

"పావంచాల రేవునుంచి మామగారూ!" అంటూ సుబ్బన్నశాస్త్రి నిలబడి కబుర్లు ప్రారంభించేడు.

"భోజనమయిందా?"

"ఇప్పుడే అయింది."

--అంటూనే రామనాధం ఎక్కడన్నా కనిపించేడా యని వాకబు చేశాడు శాస్త్రి.

"మధ్యాహ్నం చిరతపూడి వెళ్ళేడు. వచ్చేడా?"

అదో కొత్త వృత్తాంతం. చిరతపూడి ఎందుకు వెళ్ళేడాయని కుతూహలం కలిగింది.

సుబ్బన్నశాస్త్రి విశేషప్రోత్సాహంతో నిమిత్తం లేకుండానే రామనాధం ఎక్కడికి ఎందుకు వెళ్ళేడో తనకు తెలిసిన సమాచారం
తెలియపరిచేడు.

"పొద్దు ఆవేళప్పుడు కుంపటి పొలంగట్టున కనబడ్డాడు. చిరతపూడి అబ్బయ్యనాయుడిగారిని చూసివద్దామని వెడుతున్నానన్నాడు."

"నాయుడుగారితో వీడికి పరిచయం ఏమిటి?"

సుబ్బన్నశాస్త్రి సమాధానం విన్నాక శంకరశాస్త్రి కనుబొమ్మలు ముడిసేడు.

ఆడపిల్లకి మగవాడితో పరిచయం అన్నమాటకర్ధం ఏమిటి? పడవలో కలిసి ప్రయాణం చేసినంతమాత్రాన వాళ్ళ ఇంటికి వెళ్లాలా?

వయసొచ్చిన పిల్ల పిలవడమేమిటి? వీడు బయలుదేరడం ఏమిటి? శంకరశాస్త్రి అనేక అనుమానాలతో కొట్టుకుపోయేడు.

కూడా వున్న తల్లి ఎరగదా? గుడ్డివాడైతే మాత్రం తండ్రికి అర్ధం కాదా? ముక్కు మొగం తెలియని పడుచువాడు పని కట్టుకుని
తనతో పరిచయం పేరుతో ఇంటికి రాకపోకలు ప్రారంభిస్తే ఏమిటో, ఎందుకో గ్రహించలేడూ?

కొడుకు తన భార్య వద్ద తెలిపిన అభ్యంతరానికి మూల కారణం దొరికిందనిపించింది. ఇదే కారణమయితే అతని అభ్యంతరం
నామమాత్రంగానే వుంటుంది.

శంకరశాస్త్రి అబ్యయ్యనాయుడి ఆస్తి వ్యవహారాలూ, కుటుంబ పరిస్థితులూ తెలుసుకోవడం మాటున స్వరాజ్యం చదువు సంధ్యలూ, రూపు
రేఖలూ వివరాలూ తెలుసుకున్నాడు. గ్రామ పురోహితుడుగా సంగ్రహించిన సమాచారంతోపాటు నాలుగురోజుల క్రితం తాను చూసిన మనిషిని కూడా
సుబ్బన్నశాస్త్రి పరిచయం చేసేడు. తను చేసిన వేళాకోళం మాట చెప్పకుండా రామనాధానికి ఆమె యెడగల సదభిప్రాయాన్ని
వివరించేడు.

"మనవాడు ఆమె చాల మంచిపిల్ల అన్నాడు. చదువుకున్నదీ, మర్యాదలెరిగినదీ, మంచి దక్షురాలూ అన్నాడు."

ఒక్క రాత్రి పడవలో పక్క గదుల్లో ప్రయాణం చేసినంతమాత్రానే అంతా అర్ధమయిపోయిందేం అనుకున్నాడు శాస్త్రి. అసలు విషయం
తెలియకుండానే, తాను సకాలంలో సరియైన పని చేస్తున్నాననిపించింది.

'ఇంక ఫర్వాలేదు.' అనుకొని బేఫర్వాగా వీధిలోకి బయలుదేరేడు.



ఇరవై


కాని మరునాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక రామనాధం తాను పడుకున్న చోటికి వచ్చి అసలు విషయంలోకి దిగాక గాని తన పొరపాటు
శంకరశాస్త్రికి అర్ధం కాలేదు.

"ఏమిటి కథ......"--అన్నాడు యథాలాపంగా ఎదుట నిల్చున్న కొడుకును చూచి.

"మీరేదో ప్రయత్నంలో వున్నారని తెలిసింది."--ఆ ప్రయత్నం దేనిని గురించో చెప్పడానికి సిగ్గుపడ్డాడు.

శంకరశాస్త్రి పనుల తొందరలో చెప్పడం మరిచినట్లూ, అతడు జ్ఞాపకం చేస్తేనే గుర్తు వచ్చినట్లూ కొద్ది చిరాకు నటించేడు.

"ఆ. ఔనౌను. చెప్పడం మరిచేను, మీ అమ్మను చెప్పమన్నాను గదా. మొన్న అమలాపురం వెడితే మీ మామగారు చెప్పేరు. పిల్లను
పంపుతాం తీసుకెళ్ళమన్నారు. ఏదో మాటవరసకు అన్నారనుకున్నాను. నిన్న వుత్తరం వ్రాశారు. నాలుగైదు రోజుల్లో ముహూర్తం పెట్టి
కబురు చేస్తామన్నారు..."

రామనాధం నిర్ద్వంద్వంగా ఆ ప్రయత్నం ప్రస్తుతానికి పనికిరాదని చెప్పేడు.

"ఆమె చాల చిన్న వయస్సుది....."

తన వయస్సు ఏ మాత్రం ఎక్కువ. పందొమ్మిదో ఏడు నడుస్తూంది. అప్పుడే సంసారం ఏమిటి? పనికిరాదని చెపుతూంటే శంకరశాస్త్రి
ఆశ్చర్యంతో నోరు తెరిచేడు.

శరీర శాస్త్రరీత్యా భార్యాభర్తలుగా జీవించడానికి తగిన వయస్సు గురించి తాను చదువుకున్నవీ, విన్నవీ అనేక సంగతులు
రామనాధం వివరిస్తూన్నాడు.

కొడుకు మాటలు వింటూంటే శంకరశాస్త్రికి అరికాలి మంట తలకెక్కుతూంది. ఆ శరీర శాస్త్రాలూ, మనశ్శాస్త్రాలూ గురించి ఆయనకే
మాత్రం నమ్మకం లేదు.

ఆ అమ్మాయి రజస్వల అయింది. ప్రకృతి పెట్టిన అడ్డు తీరింది. ఆమెకన్న రామనాధం అయిదేళ్లు పైగా పెద్దవాడు. వరహీనం
మనిషి కాదు, ఒడ్డూ పొడుగూ పాతికేళ్ళ వాడల్లే ఉంటాడు. మరెందుకా అభ్యంతరం. పెంకితనం కాకపోతే.....

పైగా తాను స్వయంగా వెళ్ళి వాళ్ళని కదిలించి, చేసుకువచ్చిన ఏర్పాట్లవి. ఆ మాట పైకి చెప్పకపోయినా జరిగిందది.
నారాయణమూర్తిని గదిమి, వియ్యపురాలిని వొప్పించి చేసుకువచ్చిన ఏర్పాటు, ఇప్పుడు వయస్సు, శరీర శాస్త్రంలాంటి అర్ధం పర్ధం
లేని ఆటంకాలు తెస్తూ, దానినంతనూ కాదంటూంటే వొప్పుకోవలసిందేనా--అనుకున్నాడు.

"అవతల పెద్ద మనుషులతో పని....."

రామనాధం వెనక్కి తగ్గలేదు. తాను మాట ఇచ్చేనంటే 'ఎవరిమ్మన్నారు?'... అదే అడిగేసేడు.

"నన్ను అడగందే......"

పెళ్ళీ, కుటుంబ జీవితం అనేవి వానిననుభవించేవాళ్ళ అభిరుచీ, ఇష్టానిష్టాలు బట్టి జరగాలనే ఆధునికాభిప్రాయం రామనాధానిది.

అలవాట్లూ, ఆచారాల రీత్యా శంకరశాస్త్రి దృష్టిలో అది చాల చిన్న విషయం.

తమ బిడ్డలకి పెళ్ళి చేయడం తల్లిదండ్రుల కర్తవ్యాలలో ఒకటి. పిల్లల్ని పాడు చెయ్యాలని ఎవ్వరూ అనుకోరు.
అదీగాక......

చిన్నవాళ్ళకి ప్రపంచ జ్ఞానం ఏం వుంటుంది? వాళ్లు ఏం చెప్పగలరు? పిల్ల అందంగా వుందో లేదో చూస్తామనుకొంటారు. కాని, వాళ్ళ
మొహం! సిగ్గుపడుతూ, భయపడుతూ, కన్ను ఎత్తగానే సరా? ఎర్రగా బుర్రగా వుంటే సరేనా? కను, ముక్కు తీరు
వుండనక్కర్లేదూ? కుటుంబ గౌరవం, వంశ సంప్రదాయం, రోగాలు-భోగాలు ఎన్ని చూడాలి? పిల్లల భవిష్యత్తునాలోచించి, ఏది మంచిదో
చూసి తల్లిదండ్రులే ముడిపెట్టెయ్యాలి గాని.... శంకరశాస్త్రి ధోరణి అది....

ఆ విధంగానే ఆయన రామనాధం పెళ్ళి చేసేడు. పెళ్ళికి వొప్పించడానికి ఓ మొట్టికాయ వేయవలసి వచ్చినా, అప్పుడే సంఘంలో
కొత్తగా అలవాటు అవుతున్న పద్ధతి ప్రకారం అతనిని తీసుకెళ్ళి పిల్లనోమారు చూపించేడు.

"ఇదిగోరా అబ్బాయి! నీ పెళ్ళాం. చూసుకో...." అన్నాడు.

ఆ మాట వినేసరికి అంతవరకూ తల్లిని ఒత్తుకొని, తలవంచుకొని నిలబడ్డ ఆ తొమ్మిదేళ్ల పిల్ల సిగ్గుతో ఉక్కిరిబిక్కిరి
అయిపోతూ తల్లి పట్టు విడిపించుకొని ఇంట్లోకి పారిపోయింది. నలుగురూ నవ్వేరు.

ఆ క్షణం వరకూ ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దని గునుస్తూ ముఖం మాడ్చుకుని వున్న రామనాధం చక్కగా వున్న ఆ సిగ్గరిని చూసేక
మరి గునసలేదు. ముఖం విడింది.

ఆ విషయాన్నే శంకరశాస్త్రి జ్ఞాపకం చేసేడు.

వయస్సు వచ్చేక దంపతుల్ని కలపడం కూడా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతలలోనిదేనని అతడు భుజాలు కుదిలించుకున్నాడు.

అది ఓ కర్తవ్యం. తమ కర్తవ్య నిర్వహణ గురించి పిల్లల నడిగేదేముంది? అడిగితే మాత్రం ఏం చెప్తారు? అడిగితే
సిగ్గుపడతారు. అందుచేత అడగరు. తాము ఆడదానికోసం అలమటించిపోతున్నట్లు హాస్యం పట్టిస్తారని భయపడి అప్పుడే కాదంటారు.
కాని, కార్యం చేసేస్తే వూరుకుంటారు. నవ్వుకుంటూ పిల్లల్ని కనేస్తారు.

అందుచేతనే పెళ్ళిళ్లూ, పునస్సంధానం విషయంలో దాని కష్టనష్టాలననుభవించే వాళ్లు గదా యని ప్రత్యేకంగా పిల్లవాళ్ళని
అడగరు. అడగాలనీ అనుకోరు. ఇంట్లో హడావిడితోనే వాళ్ళకి అర్ధం అవుతుంది. ఎవరన్నా చెప్పినా మాటవరసగా మాత్రమే.
అలాగే శాస్త్రీ వ్యవహరించేడు.

ఇప్పుడు తన్ను అడిగి వుండవలసింది--అంటే? తన కర్తవ్యంలో అదో భాగం. దానికీ ఒకర్ని అడగాలా యని శంకరశాస్త్రి
ఆశ్చర్యం ప్రకటించేడు.

రామనాధం ఆ కర్తవ్యాన్ని పూర్తిగా నిరాకరించేటందుకు సిద్ధంగా లేడు.

"బాగుంది, కాని నాకది అభ్యంతరం అన్నప్పుడు....."

కొడుకు పట్టుదల చూస్తున్న కొలది శంకరశాస్త్రికి తామసం కలుగుతూ వుంది. అతని అభ్యంతరం తాననుకున్నట్లు నామమాత్రం
కానందుకు చికాకుపడుతున్నాడు. తన మాటకెదురు పలకనివాడు అడ్డు చెప్పేంత వాడయ్యాడా అని కసి పుట్టింది. కాక..... నాయుడు
కూతురితో వ్యవహారం పెళ్ళామే వద్దనేంతవరకూ వెళ్ళిందా అని కూడా అనిపించింది.

ఆ అడ్డు తీర్చేసి కోడల్ని ఇంటికి తెచ్చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు.

'ఆవిడ నట్టింట కనబడేవరకే ఎగిసిపాట్లన్నీ--' అనుకున్నాడు. అయితే వ్యవహారజ్ఞానం వున్నవాడు గనుక కోపతాపాలు చూపి
రెచ్చగొట్టరాదనుకున్నాడు.

ఈమారు శంకరశాస్త్రి బ్రహ్మాండమైన కారణం తీసుకొచ్చేడు.

"అన్నీ సిద్ధం అయ్యేక ఏ కారణం లేకుండా శుభకార్యమిప్పుడు చేసుకొనేది లేదంటే లోకం ఏమంటుంది? పోనీ చదువుతున్నాడు, పరీక్షల
ముందు ఇదేమిటంటావా? అదీ మానుకుకూర్చున్నావాయె."

పోనీ ఈ పేరునన్నా మళ్ళీ కాలేజీకి వెడతానులే అంటాడేమోనని శాస్త్రి ఒక్క నిముషం ఆగేడు.

రామనాధం ఆ ధోరణిలోనే లేడు.

"ఇప్పుడిదేమీ తలపెట్టద్దు. కనీసం రెండేళ్లు....."

శాస్త్రి మాట మధ్యలోనే అందుకున్నాడు.

"ఇప్పుడు అలా అనడం మంచిది కాదు. నేనెందుకు చెప్తున్నానో విను. ఇప్పుడు మనం కాదన్నామంటే మనలో ఏదో లోపం వుంది
అనేస్తారు. అల్లాంటి మాట వచ్చిందంటే ఎంత అప్రతిష్ట!"

ఆ 'ఏదో లోపం' పుంస్త్వహీనతకు సూచన. పడుచువానిని పట్టుకుని అతని పుంస్త్వం గురించి అస్తినాస్తి విచికిత్స
ప్రారంభిస్తారనడం కన్న రెచ్చగొట్టే మాట మరొకటి వుండదు. ఆ మానవ బలహీనతను శంకరశాస్త్రి ఉపయోగించుకోదలచేడు.

కాని, రామనాధం మెత్తబడలేదు.

శాస్త్రి ఈ మారు ఇంకాస్త నొక్కేడు.

"మీ మామగారు చాలా అసాధ్యుడు. అందులో పోలీసు ఆఫీసరు. ఇల్లాంటి మాటొకటి పుట్టిందా మన్ని అల్లరి పెట్టేస్తాడు. పెద్దవాళ్ళ
పరీక్షలనీ, డాక్టరు పరీక్షలనీ.... ఇంక తలెత్తుకు తిరగలేం..."

ఆ పరీక్షల బెదిరింపులక్కూడా రామనాధం లొంగలేదు. రాజకీయ కారణాలతో కాలేజీ మానెయ్యడం ఏమిటంటే చెప్పడానికీ, వాదించడానికీ
ఇంకా పటుత్వం చేకూరలేదు. కాని, సంఘ సంస్కారానికి సంబంధించిన విషయాలమీద అతడు చాలా విన్నాడు, చదివేడు. వీరేశలింగంగారి
ప్రహసనాలూ, సంఘ సంస్కరణలను సమర్థిస్తూ ఆయన తెచ్చిన శ్రుతి-స్మృతి-పురాణ ప్రమాణాలూ అన్నీ అతనికి హృత్కవిలి. ఆ
సమస్యలపై అతడెందరితోనో వాదించేడు. వానిని గురించి అతనికి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.

ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గవలసిన అవసరం కనబడలేదు. పైగా ఇదేమంత సంస్కారం?

సంఘ సంస్కరణ వాదనలు తెచ్చేసరికి శంకరశాస్త్రి మనస్సులో అబ్బాయి నాయుడు మెదిలేడు. సుబ్బన్నశాస్త్రి చెప్పిన వృత్తాంతం
కళ్ళముందు కదిలింది.

"నాయుడు కూతురు చెప్తున్న పాఠాలు బాగానే వొంటబడుతున్నట్లున్నాయే...."

శంకరశాస్త్రి తప్పుమాట అన్నట్లు కనిపించకుండానే తన అనుమానాలు, అభిమానాలు అన్నీ అర్థం అయ్యేలా చేశాడు.

నాయుడు కూతురు మాట వినగానే రామనాధం ఆశ్చర్యపడ్డాడు. వారితోడి పరిచయాన్ని అతడు దాపరికం చేయాలనుకోలేదు. కాని, అది
తండ్రికెల్లా తెలిసిందాయని అతని ఆశ్చర్యం. అప్రయత్నంగానే అడిగేడు.

"నాయుడు కూతురేమిటి?......"

శంకరశాస్త్రి విదిలించేడు.

"పిల్లి కళ్ళు మూసుకొని తన్నెవరూ చూడడం లేదనుకుంటుంది. రాజమండ్రి నుంచి కలిసి పడవలో రావడం, ఆవిడ తమ యింటికి
రమ్మనడం, నిన్న పగటివేళంతా నువ్వు అక్కడే వుండడం ఎవరికీ తెలియదనుకోకు. ఎన్నాళ్ళనుంచేం ఈ పరిచయం....?"

ఇదివరకు ఏమన్నా గోప్యంగా వుంచినా ఈమారు శాస్త్రి తన ప్రశ్నలో దాపరికం మిగల్చలేదు.

రామనాధం నిర్విణ్ణుడైపోయేడు. ఒక్క క్షణం కోపం వచ్చింది. అడుగుతున్నది తండ్రిలాగ పెంచినవాడు. ఏమీ అనలేని స్థితి.
కోపాన్ని దిగమింగుకున్నాడు. కాని, కంఠంలో ఆ కసి ప్రత్యక్షరంలో తొణికింది.

"పెంచిన పెద్దరికం చూసి మీరు నన్ను ఏమన్నా చెల్లుతుంది. కాని, వాటిక్కూడా ఓ పరిమితి వుండాలి. ఇంక నామీద కోపం వుంటే
నాతోనే సరిపుచ్చడం మంచిది. నాకు తెలిసిన వాళ్ళనీ, ఎప్పుడో ఓమారు మాట్లాడిన వాళ్ళనీ, అందులో ఆడపిల్లల్నీ
నిందించడం...."

అంతకన్న నీతో మాట్లాడవలసిన పని ఏమీ లేదన్నట్లు రామనాధం వెనక్కి తిరిగేడు, మాట కూడా పూర్తి చేయకుండా.....

తాను నీతి తప్పలేదని సమర్థించుకోడానికి రామనాధం కోపం చూపినా, నిస్సహాయత చూపి కళ్ళనీళ్ళు పెట్టుకొన్నా, అటువంటి
అనుమానాలకాధారం లేదని ఘటనలు ఏకరువు పెట్టినా శంకరశాస్త్రి నమ్మి వుండేవాడు కాదు. కాని అతడు చూపిన అభిమానం,
నిర్లక్ష్యం చూసేక తన అనుమానం అర్థరహితమని గ్రహించేడు. పొరపాటున మాట జారేనేమో అనిపించింది. కాని అంతవరకూ వచ్చేక
వెనక్కి తగ్గడం చేత కాలేదు. పైగా తాను తయారుచేసిన వలను ఏం చేయడం....

తానూ అభిమానం, నిర్లక్ష్యం చూపించడం తప్ప మార్గాంతరం లేదనుకొన్నాడు.

"ప్రాప్తేతు షోడశే వర్షే.... అని పెద్దలూరికే అన్నారా..... కన్న కొడుకు విషయంలోనే ఆమాట అన్నప్పుడు పెంచడం
తప్ప ఇతర రక్త సంబంధం కూడా ఏమీ లేని నేను నా పరిమితిలో వుండడం మంచిదే. సరే, ఇప్పటినుంచే వుంటాను. నీ ఇష్టం
వచ్చినట్లు చేసుకో. ఆ మామగారికి సమాధానం ఏమిస్తావో నువ్వే చూసుకో"

శంకరశాస్త్రి విసురుకుని వెళ్ళిపోయేడు.



ఇరవయ్యొకటి


"ఏడీ, వీడేడీ."

--అని అపోశనపడుతూ, శంకరశాస్త్రి రామనాధం గురించి వాకబు చేశాడు.

"చీకటి పడుతూనే ఆకలేస్తూందని అన్నం పెట్టించుకొని తిని వెళ్ళిపోయేడు."

రామనాధం రాత్రి ఇంటికి రాలేదు. కాని, ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ముంగండ పెద్ద చెరువులో చేపలు ఎవ్వరూ పట్టకుండా
కాపలా కాయడం ఓ అలవాటుంది. వూళ్ళో పడుచుకారుకు అదో తరిఫీదు. వెన్నెల రాత్రులూ, హుషారు పుట్టినప్పుడూ కర్రసామూ వగైరా
నేర్చుకొంటూంటారు. చెరువు కాపలాకి వెడుతూంటారు. చాలా కుటుంబాలు ఆ అలవాట్లని ప్రోత్సహిస్తాయి.

రామనాధం కూడా వూళ్ళో వున్నప్పుడు ఆ జట్టులోనే వుంటాడు. వాళ్ళతోపాటు ఏ చెరువుగట్టుమీదనో కండువా పరుచుకు పడుకుంటాడు. బహుశా
అలాగే అనుకున్నారు ఈవేళాను.

పొద్దుట కూడా రాకపోయేసరికి రాజమ్మ ఎందుచేత చెప్మా అని విశాలాక్షికి కబురంపించింది. కబురు రాగానే చేతిలో పని వదిలిపెట్టి
విశాలాక్షే వచ్చింది.

"ఏమిటి పిన్నీ! రాత్రి పడవకి వెడుతున్నానన్నాడే, నువ్వెరక్కపోవడం ఏమిటీ? చెప్పలేదా?" అంది.

"ఆ మాటేం చెప్పలేదే" అని రాజమ్మ ఆశ్చర్యపడింది.

ఆ మాట విని శంకరశాస్త్రి మరొకలాగా సంతోషించేడు. గతరోజు గంద్రగోళం పనిచేసిందనుకున్నాడు. భార్యను తీసుకురాకుండా
తప్పించుకోడానికి మళ్ళీ కాలేజీకే వెళ్ళి వుంటాడని భావించేడు. బహుశా తమతో చెప్పడానికి సిగ్గుపడి వుంటాడు.

ఆ సంతోషం ఎంతోసేపు వుండలేదు. పదిగంటలవేళ పొలం నుంచి వస్తూ విశ్వనాధం పలకరించేడు.

"అబ్బిగాడు రాత్రి మెయిల్‌బోటుకి వెళ్ళాలన్నాడు. వెళ్ళినట్లేనా? కాకినాడ కూడా పోయిరావాలన్నాడు."

విశాలాక్షి అన్నదని విన్నప్పుడు రాని కోపం విశ్వనాధం అన్నప్పుడు వచ్చింది. వూళ్ళో అందరికీ తెలుసు. తనకొక్కడికే
తెలియదు. ఆ కోపంలో విసుక్కున్నాడు.

"వాడి తోచినచోటికి వెళ్ళనీ కాకినాడ వెళ్ళినా సరే, కాశీ వెళ్ళినా సరే. నేను చదువు మాని రమ్మంటేనే వచ్చేడా? ఎవరి
కష్టసుఖాలు వాళ్ళవి. గడ్డాలూ, మీసాలూ వచ్చేదాకానే మన మాట. తర్వాత ఎవరి ప్రారబ్ధం వాళ్ళది."

పోకపొత్తిలో కట్టిన అరిటాకుల కట్టతో వాకిట్లోనే నిల్చుని వున్న విశ్వనాధం శాస్త్రి విసుగుదల చూశాక ఆ కట్ట అరుగుమీద
పెట్టేడు. తానూ అరుగుమీద కూర్చున్నాడు.

"నీకు నేను చెప్పవలసినవాణ్ణి కాదనుకో. అయినా, నువ్వంత చెండనాడుకోవడం మంచిది కాదనుకుంటా. బాగులేదు. పోనీ, వాడిది ఒక
పిచ్చే అనుకుందాం. చదువు చెప్పించేవు, పెద్దవాణ్ణి చేసేవు. ఇప్పుడు......"

మొదట విశ్వనాధం చెప్పేది ఏమిటో అర్ధంకాలేదు శాస్త్రికి. కాని క్రమంగా విశదమయింది. రామనాధం వద్దంటూంటే ఇప్పుడు కార్యం
చేసుకోమని నిర్బంధించడం బాగులేదని విశ్వనాధం బోధ. "ఏడిసినట్లే వుంది నీ తెలివి" అనుకున్నాడు ఓ మాటు మనసులోనే
శంకరశాస్త్రి. కాని, ఆ ఓర్పు ఎంతో సేపు నిలవలేదు.

సర్దుబాటుగా విశ్వనాధం మాట్లాడుతూంటే శంకరశాస్త్రి ఆగ్‌బబూలా అయిపోతున్నాడు.

విశ్వనాధానికి రామనాధం స్వయానా తమ్ముడి కొడుకు, అయినా అతని మంచిచెడ్డలూ, యోగక్షేమాలూ గురించి విశ్వనాధం ఎన్నడూ
పట్టించుకోలేదని శాస్త్రి అభిప్రాయం. నిజానికి విశ్వనాధం దగ్గరున్న వాడిని తానూ, భార్యా బ్రతిమాలి తీసుకువచ్చిన
మాటనెన్నడో అతడు మరిచిపోయేడు. ఏ అనారోగ్యమో అని విని చూసిపోవచ్చినప్పుడూ, పరీక్ష ప్యాసైన వార్త విని సంతోషం
తెలపడానికి వచ్చినప్పుడూ ఏదో పుల్లవిరుపుమాట అనేవాడు. ఈసడిస్తూ మాట్లాడేవాడు. అందుచేత విశ్వనాధం రావడం తగ్గించేడు.
ఊళ్ళో వుంటే రామనాధమే వెడతాడు పెదతండ్రిగారి యింటికి. అది శాస్త్రికి ఇష్టం వుండదు. కాని రామనాధం ఆ అభ్యంతరాన్ని
ఎప్పుడూ లెక్కచెయ్యలేదు. అది శాస్త్రికి మరీ కోపం.

కుర్రవాడు తనకు రక్తబంధువేం కాదు, భార్యకు అక్క కొడుకు. తమకు పిల్లలు లేరు. తల్లితండ్రీలేని పిల్లడు, చక్కనివాడు.
చేరదీద్దామంటే సరేనన్నాడు. ఆ కుర్రవాడి వాటా ఆస్తి, భూమి తానే చూసిపెట్టేడు. పెళ్ళిచేసేడు. చదువు చెప్పించేడు. తన
ఇల్లు వదిలేక ఈ రక్తబంధువు మాటమాత్రంగానయినా "పంటలు పండుతున్నాయా, వ్యవహారాలు ఎల్లా వున్నాయని" అడగలేదని శాస్త్రి
మనస్సులో కోపం.

అడిగితే చెప్తాడా అంటే అది వేరుమాట. చెప్పడు. అది తథ్యం. తన మీద నిఘా వుంచేవా అనేస్తాడు. అందుకే అడగలేదేమో
అనుకోడు. మాటకేనా అడగలేదంటాడు. అదో కక్ష. ఆ కోపాన్ని శాస్త్రి ఎన్నడూ రహస్యంగా వుంచుకోలేదు.

విశ్వనాధం ఆస్తి కరిగిపోయి, మనిషి ఆర్ధికంగా లుగసాను అవుతున్నకొద్దీ ఆ కోపం చిన్నచూపుగా మారింది. పిల్లవాడిని తాను
చేరదీసి వుండకపోతే వాని ఆస్తికూడా కరారావుడు చుట్టేసేవాడేననీ, తాను ఆ ఆస్తిని కాపాడడమే గాక మరో నాలుగెకరాలు చేసి
పెట్టేనని శాస్త్రికొక సంతృప్తి.

తనకు అంత చిన్నచూపు వున్న చోటి నుండి ఆ సలహా రావడం శాస్త్రికి ఎంతో అక్కసు కలిగించింది. అంతవరకూ తనకు తట్టివుండని
మాట ఒకటి స్ఫురించింది.

రామనాధం పెంకితనానికి వెనక మద్దతు వుందన్నమాట అనుకున్నాడు. దానితో మరికొంత వెనక్కి కూడా ఆలోచన సాగించాడు.

"కాలేజీ మానడాన్ని కూడా ఈ ప్రబుద్ధుడే ప్రోత్సహించి వుంటాడు" అనిపించింది.

దానికి శాస్త్రి దృష్టిలో బోలెడంత ఆస్కారం వుంది.

వందేమాతరం వుద్యమం రోజులప్పటి నుంచీ విశ్వనాధం వూళ్ళో స్వరాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. కేసరి పత్రికలో ఏదో వ్యాసం
వ్రాసినందుకు తిలక్‌ను ఆరేళ్ళు మాండలే జైలుకు పంపేరని రావిచెట్టు క్రిందా, పెద్ద చెరువు పావంచాలలోనూ గవర్నమెంటును
తిట్టిపోసేవాడు. విపిన్‌ చంద్రపాల్‌ వుపన్యాసం వినడానికి పనికట్టుకొని కాకినాడ వెళ్ళేడు. మొన్నటికి
మొన్న గాంధీని చూస్తానని బెజవాడ వెళ్ళేడు. ఆంధ్రపత్రికను ప్రచురిస్తానని నాగేశ్వరరావు పంతులుగారు అనుకొన్నారో లేదో కార్డు
రాసి పడేశాడు. ఆనాటి నుంచి నాగా లేకుండా తెప్పిస్తున్నాడు. పత్రిక ఆఫీసులోనన్నా వుంటాయో లేదోగాని, అతని వద్ద ఈ
ఆరేడేళ్ళ పత్రికలూ ఒక్కటీ బీరుపోకుండా నెలవారిగా కట్టలు కట్టి జాగ్రత్తగా వున్నాయి. తీరుబడిగా వున్నప్పుడు పాత
వుపన్యాసాలూ, వ్యాసాలూ చదువుతూంటాడు. కాంగ్రెసు సభలు ఎక్కడ జరిగినా వెళ్ళవలసిందే. ఆతనికి ఇంగ్లీషు రాదు, అసలే భాషా
రాదు. ఆంధ్రపత్రిక ధర్మమాయని తెలుగు వ్రాయనూ, చదవనూ వచ్చింది. నిత్యవ్యవహారానికి మించి హిందీ రాదు, సభల్లో ఎవరేం
మాట్లాడినా ఇంటికొచ్చి ఆంధ్రపత్రిక చదివి తెలుసుకోవలసిందే, అలాగని ఒక్క సభకు మానడు.

కాంగ్రెసుయెడ అతనికి గల భక్తీ, ఆసక్తీ ఆతని పరోక్షంలో గ్రామస్తుల హాస్యానికే గురి అవుతుంటాయి. ఏమంటే ఆ భక్తి
వేడిలో ఆస్తి కాస్తా హరించి పోయింది. అంతా ఆతనిని మంచివాడంటారు. న్యాయపరుడు అంటారు. కాని ఆర్ధికంగా చితికిపోయాడు. ఇంక ఆ
మంచికి బలం ఏదీ?

రామనాధాన్ని ప్రోత్సహించడానికి అతని దేశభక్తి కారణం అయి వుంటుందని కూడా శాస్త్రి అనుకోలేదు. అతని ఆస్తి మీద
కన్నుపడడమే కారణం అనిపించింది.

రామనాధం అతని మాటలలో పడి కాలేజీ మానేసేడు.

ఇప్పుడు భార్యను తీసుకురావద్దని కూడా మొరాయిస్తున్నాడు.

దానికీ విశ్వనాధం ప్రోత్సాహం వుందనడానికి ఎన్నో కారణాలు కనిపించేయి.

నారాయణమూర్తితో సంబంధం విశ్వనాధానికి మొదటి నుంచీ ఇష్టం లేదు. పోలీసు ఆఫీసరుతో సంబంధం ఏమిటని అప్పుడే అన్నాడు. వాళ్ళు
బ్రిటిష్ ‌వాళ్ళ తాబేదార్లు. ప్రజల్ని హింసిస్తారు కనక పనికిరాదన్నాడు.

చివరకాతడు పెళ్ళికి కూడా వెళ్ళలేదు. పోలీసు వాళ్ళంటే వున్న అసహ్యమూ, ద్వేషమూతో ఆ సంబంధం చెడగొట్టడానికే రామనాధానికి
ఈ ఆలోచన కలిగించేడనిపించింది. ఆ మాటే అనేసేడు.

"వాడి ముడ్డిగిల్లి ఇప్పుడీ సలహా ఇవ్వక మరేమంటావు?"

ఆ ఆరోపణ విన్నాక విశ్వనాధం చాలా చిన్నపుచ్చుకొన్నాడు. ఆ మాటకు అభ్యంతరం తెలుపడం కూడా అనవసరం అనుకొన్నాడు.
లేచేడు. కాని వెళ్ళిపోయే ముందు ఇంకొక్కమాటు హెచ్చరించకుండా వుండలేకపోయేడు.

"ఇదిగో శాస్త్రీ! మనస్సు చికాకుగా వుండి ఏదో అన్నావు. ఫర్వాలేదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాని ఒక్కటి ఆలోచించు.
రామం చెప్పింది నాకు బేసబబుగా అనిపించలేదు. సంసారం మోసే ఈడు ఇద్దరిదీ కూడా కాదు. ఆలోచించు. చెండనాడుకోకు. నలుసంతవాడిని
ఇంతవాడిని చేశావు!"

శంకరశాస్త్రి కూర్చున్నవాడు బుస్సుమని లేచేడు. అంగోస్త్రం దులిపి భుజాన వేసుకున్నాడు.

"ఇంతమంది బంధువులుండగా వాడికేం లోటు? వాడికిప్పుడు నా అవసరం ఏం వుంది గనుక?"



ఇరవైరెండు


అబ్బాయినాయుడుగారి తోట ఇదేనా అని అడుగుతున్న కుర్రవాని గొంతు విని మాణిక్యమ్మ గుమ్మంలోకి వచ్చింది.

"ఎవరి కోసం నాయనా!"

"అబ్బాయినాయుడుగారి కోసం....."

"వారితో ఏం పని?"

"పనుంది."

"ఏ వూరు మీది?"

"ముంగండ."

"ఎవరి అబ్బాయివి....."

"మా అమ్మ పేరు విశాలాక్షి..."

"నాన్న పేరు?"

"ఆయన పేరు సుబ్రహ్మణ్యం. ఆయన లేరు. నా పేరు బాలకృష్ణ, నా వయస్సు పదేళ్ళు, అంబాజీపేటలో చదువుకుంటున్నా,
థర్డుఫారం. మా హెడ్మాస్టరు పేరు కూడా కావాలా?"

మాణిక్యమ్మ విస్తుపోయి "గడుసువాడివేనే" అంటూంటే, పక పక నవ్వుతూ స్వరాజ్యం వచ్చింది.

"ఇప్పుడేనా చెప్తారా, అబ్బాయినాయుడిగారిల్లు ఇదేనా?" అన్నాడు బాలకృష్ణ తిరిగి.

"ఎవరు పంపించేరు?" అంది స్వరాజ్యం కొంటెతనంగా.

"అదొకటి మిగిలిపోయిందన్నమాట? కాని, నేను చెప్పను ముందు మీరెవరో చెప్పండి."

"అబ్బాయినాయుడుగారు మా నాన్నగారు."

"మీ పేరు?"

"స్వరాజ్యం."

"మీ తోట్లో ఎన్ని కొబ్బరి చెట్లున్నాయి?"

"ఎందుకు?"

"ఏం, మీరు అన్ని ప్రశ్నలు వేయగా లేంది, నేను ఆమాత్రం అడక్కూడదా?"

"ఎందుక్కూడదు? కాని అవసరం ఏమిటాయని గాని...."

"ప్రస్తుతం అటువంటి అవసరం లేదనుకోండి. కాని, అబ్బాయినాయుడుగారి యిల్లు ఇదేనో కాదో, ఆయన ఎక్కడున్నారో అవసరం
వుంది."

"వస్తారు కూర్చోండి."

"ఆయన ఇల్లు ఇదేనో కాదో చెప్పేరు కాదు."

"వస్తారు అంటే ఇది ఆయన యిల్లు అనే కదా...."

"కాదు. ఆయన ఇల్లయితే వుంటారు. పరాయి ఇంటికి వస్తారు."

స్వరాజ్యం కళ్ళు తిప్పింది.

"ఓహో, అదీ నిజమే, సరే. ముందు ఇల్లా దయచెయ్యండి."

బాలకృష్ణ వచ్చి అరుగు మీద కూర్చున్నాడు.

"ఏమిటి సంగతి? మా యిల్లు ఎలా పట్టుకొన్నారు?"

బాలకృష్ణ ఇంకా కొంటెతనం పక్కకు పెట్టలేదు.

"ఇదెవరి ఇల్లో తెలియందేనా?"

స్వరాజ్యం పక పకా నవ్వింది. ఇంతలో అబ్బాయినాయుడు గుమ్మంలోకి వచ్చేడు.

"ఎవరు కావాలంటారాయన?"

"అబ్బాయినాయుడుగారిల్లు కావాలంటారు. ఎందుకంటె చెప్పరు. వస్తారంటే ఆయన ఇల్లేదంటారు."

నాయుడుకూడా మాటల చెలగాటంలో ప్రవేశించేడు.

"నాయుడుగారు కావాలో, వారిల్లు కావాలో మరి?" అన్నాడు.

"అవును అది మరిచేపోయేను... ఏమంటారు? మీకు కావలసినది?" అంది స్వరాజ్యం.

"నాయుడుగారిల్లు...."

"ఇదే మరి....."

"అయితే నాయుడుగారు....."

ప్రశ్నా, సంబోధనా తేలని కంఠస్వరం విని స్వరాజ్యం సమాధానమిచ్చింది.

"ఈయనే....."

బాలకృష్ణ పకపక నవ్వేడు.

"నేను ఎవరని అడగలేదు. నాకు తెలుసు. అందుకే ఆయన్నే పిలచేను" అంటూ బాలకృష్ణ ఒక కవరు తీసి ఆయనకిచ్చేడు.

"ఇది మా మామయ్య మీకివ్వమన్నాడు."

నాయుడు ఆ కవరు కూతురుకు అందచేసేడు. ఆమె విప్పి జమకట్టిన ప్రోనోటు తీసింది.

"ప్రోనోటు పంపించేరు."

"అంత తొందర ఏం వచ్చింది? పాపం చిన్నాయన్ని శ్రమపెట్టేరు."

"నాకేం శ్రమ లేదండోయి. నేను ప్రతివారం రెండుమూడుమాట్లు మీ వూరు వస్తూనే వుంటాను."

"ఎవరింటికి?"

బాలకృష్ణ సమాధానం ఇవ్వలేదు.

"ఎందుకేమిటి?" అని నాయుడు ప్రశ్నించేడు.

"నే చెప్పనా?" అంది స్వరాజ్యం.

"ఊ."

"కోపం చెయ్యరు కదా?"

"ఉహు"

"ఆచార్లుగారింటికి..."

ఆచార్లుగారు పిచ్చాసుపత్రి నడుపుతారు. బాలకృష్ణ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచేడు. పొరపాటున అనేశాడు.

"నన్నెప్పుడు చూసేరు?"

"ఔనా కాదా.......?" అని నిలదీసింది స్వరాజ్యం.

"మీరెప్పుడో చూసేరు....."

"ఎప్పుడూ చూడలేదు."

"జగన్నాధాచార్లు చెప్పి వుంటాడు--" లేకపోతే తెలియడానికి వీలు లేదన్నంత ధీమాతో.

నాయుడు కూతురు కొంటెతనం, అంత పెద్ద కబుర్లు చెప్పే బాలకృష్ణ అమాయకత్వం చూసి నవ్వేడు.

స్వరాజ్యం తానన్న కొంటెమాట అర్ధం చేసుకోనందుకు చాల సంబర పడింది. వెంటనే జగన్నాధాచారి పేరు విని ఆమె అనుమానపడింది.

"నేనెందుకో చెప్పనా?" అని మళ్ళీ కవ్వించింది.

"మీరు చెప్పుకోలేరు."

"పందెం."

"పందెం."

"సరే!"

"సరే!"

"ఎంతెంత?"

బాలకృష్ణ జేబు తడిమి బేడకాసు తీసేడు.

"మా నాన్నగారు మధ్యవర్తి" అంది స్వరాజ్యం.

"సరే!"

నాయుడు నాణెం తడిమి చూసి నవ్వేడు.

"మరి నువ్వు కూడా ఇవ్వాలి" అని కూతుర్ని అడిగేడు ఆయన.

స్వరాజ్యం అక్కడినుంచి కదలకుండానే తల్లిని కేకేసింది. మాణిక్యమ్మ గుమ్మంలోకి రాంగానే ఒక రూపాయి అడిగింది. విషయం విని
మాణిక్యమ్మ బాలకృష్ణను వెనకవేసుకు వచ్చింది.

"చిన్నవాడిని చేసి...."

తనను చిన్నవాడనేసరికి బాలకృష్ణకు అభిమానం వేసింది. తాను స్వరాజ్యం చేతిలోంచి రూపాయి లాగేస్తున్నట్లే గంతువేసేడు.

"ఏం ఫర్వాలేదు. కాయమనండి."

కూతురు ఎత్తు గ్రహించిన నాయుడు బాలకృష్ణను హుషారు చేసేడు.

"వెనకతియ్యవద్దు పంతులూ! ఏమిటో చెప్తుందిట చూద్దాం."

స్వరాజ్యం నవ్వింది. ఓడిపోతావు సుమా అన్నట్లు కవ్విస్తున్న ఆ నవ్వు చూసి బాలకృష్ణ అభిమానపడ్డాడు.

"చెప్పండి చూద్దాం."

ఒక నిముషం ఆగి పందెంలో వున్న అన్యాయాన్ని గుర్తు చేసేడు.

"పోతే నాది బేడ. కాని మీది రూపాయి సుమండి."

"నాది పోదు."

"అయినా ఎందుకేనా మంచిది? తగ్గించుకోండి"--అన్నాడు బాలకృష్ణ.

"ఫర్వాలేదు."

స్వరాజ్యం కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు నటించింది.

"చెప్పెయ్యనా?" అని కవ్వించింది.

"ఊ, త్వరగా చెప్పాలి."

"కాచుకోండి చెప్పేస్తున్నా. జగన్నాధాచార్లు మీకు ఓ పుస్తకం ఇస్తానన్నాడు."

"అది చాలదు. ఆ పుస్తకం ఏమిటో చెప్పాలి." అన్నాడు బాలకృష్ణ ఆదుర్దాతో.

స్వరాజ్యం నవ్వింది. కాని, నాయుడు బాలకృష్ణను సమర్థించేడు.

"వారిద్దరూ ఒక క్లాసు వాళ్ళు. ఒక స్కూలులో చదువుతున్న వాళ్ళూను. వాళ్ళు ఒకరి పుస్తకాలనొకరు పుచ్చుకోవడంలో ఆశ్చర్యం
లేదు. పుస్తకం కోసం వచ్చేడంటే చాలదు."

బాలకృష్ణ ఔనన్నాడు.

"అందులో గొప్పేం లేదు. ఏం పుస్తకమో చెప్పాలి."

"అల్లాకాదు. పుస్తకం కోసం వచ్చేవని నాకేం తెలుసు. ఊరికే రాకూడదూ? అంతే. ఆ బేడ ఇల్లా ఇవ్వండి."

"చాలదు" అన్నాడు బాలకృష్ణ.

"చాలదు" అన్నాడు అతనిని సమర్థిస్తూ నాయుడు.

"అన్యాయం" అంది స్వరాజ్యం.

"ఏమీ కాదు" అన్నాడు బాలకృష్ణ.

"అంతే" అన్నాడు నాయుడు.

"చెప్పలేకపోతే ఓడిపోయినట్లే...." అని బాలకృష్ణ.

"ఏమంటావు, ఆలోచించుకో...." అని నాయుడు వంత.

స్వరాజ్యం ఆలోచన నటించింది.

ఆమె ఓడిపోతుందనే నిర్ణయంతో నాయుడు ఆ రూపాయిని ఎలాగ ఖర్చు పెడతావని అడిగేడు.

"రానీండి చెప్తా." అని బాలకృష్ణ సంతోషం కనబరిచేడు.

"మిఠాయి కొనుక్కోవచ్చు"నని నాయుడు సూచన.

"ముందు రాజస్థాన కథావళికి ఆరణాలు అయిపోతాయి."

"రాజస్థాన కథావళా?" అన్నాడు నాయుడు ఆశ్చర్యంగా. బాలకృష్ణ తల వూపుతూ ఆ పుస్తకం వివరాలు ఇచ్చేడు.

"చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసేరు. రాజపుత్ర వీరుల కథలు. చాలా బాగుంటుంది."

"చదివేరన్నమాట. అందులో ఓ కథ చెప్పండి చూద్దాం" అంది స్వరాజ్యం ఆసక్తి కనబరుస్తున్నట్లు.

"మాట మార్చేస్తున్నారు. మన పందెం తేల్చండి ముందు"--అని తక్షణ కర్తవ్యం గుర్తు చేసేడు బాలకృష్ణ.

"చదివిన పుస్తకం మళ్ళీ ఎందుకు?" అది నాయుడు ఆలోచన.

బాలకృష్ణ అది దగ్గరుండవలసిన పుస్తకం అన్నాడు.

అతడు స్కూలు లైబ్రరీలో తెచ్చి చదివేడు. జగన్నాధాచారి అతని వద్ద చదువుకొనేటందుకు పుచ్చుకొని దాని నిండా సిరా పోసేసేడు.
అది ఇస్తే మేస్టారు తంతారు. కనక ఓ పుస్తకం కొని ఇచ్చేస్తాడు.

స్వరాజ్యం కథ అంతా విని నవ్వేసింది. "నాకు తెలిసింది."

"ఏమిటమ్మా తెలుస్త?" అని డెకారించేడు హేళనగా నాయుడు.

"చెప్పెయ్యనా?"

"చెప్పమనవయ్యా!" అన్నాడు నాయుడు హుషారిస్తూ.

"ఎప్పుడో చెప్పేను ఆ మాట..."

"పైకి చెప్పను, చెవిలో చెప్తా" నంది స్వరాజ్యం.

"కాదు బయటికే చెప్పాలి" అన్నాడు నాయుడు.

"నాకు భయం వేస్తూంది. నిజం కాదేమోనని."

ఆమె భయం అన్న తర్వాత బాలకృష్ణ మరింత తొందరపెట్టసాగేడు.

"చెప్పండి. అలాగే."

అయితే స్వరాజ్యం మరో పేచీ వేసింది.

"మీరు కాదంటే--నేను ఔనంటే తీర్పు ఎల్లాగ?"

అదీ సమస్యే. బాలకృష్ణ ఆలోచించేడు.

"నేను నిజం చెప్తాను."

"సరే."

బాలకృష్ణకు ఆలోచన తట్టింది.

"కాగితం మీద వ్రాసి నాయుడుగారికి ఇస్తాను....." అన్నాడు.

"అక్కర్లేదు. మీ మాటమీద నమ్మకం వుంది" అంది స్వరాజ్యం.

ఆమె మాటను నాయుడు బలపరిచేడు.

లోపలి నుంచి మాణిక్యమ్మ వచ్చి తాను కూడా కలిసింది ఆ ఆటలో.

"మీ చేత అన్నీ చెప్పించేసి...."

"ఏమీ భయంలేదు. చెప్పమనండి."

స్వరాజ్యం అతనిని దగ్గరగా తీసికొని చెవిలో ఒక్కమాట చెప్పింది.

ఆమాట వినగానే బాలకృష్ణ వెలవెలపోయేడు. ఆమె ఎలా చెప్పగలిగిందో అతనికి అర్ధం కాలేదు!

"మీకెల్లా తెలిసింది?" అన్నాడు ఆశ్చర్యంతో.

తాను సరిగ్గా చెప్పినట్లు స్వరాజ్యం అతని ముఖకవళికలను పట్టి గ్రహించ గలిగింది. పందెం నెగ్గినందువలన కలగవలసిన
వుత్సాహం ఆమెలో లేదు.

"నిజం!"

బాలకృష్ణ తల వూపేడు.

"మీకెల్లా తెలిసిందో చెప్పండి--" అని ఆమెను తొందర చేసేడు.

ఆమె చెప్పింది సరిగానే వున్నదని తెలిశాక నాయుడు కూడా వుత్సాహం చూపలేదు. కాని ఆమె ఏం చెప్పిందో....

"అధర్వణవేదం.... అన్నాను." అంది స్వరాజ్యం.

"అధర్వణ వేదమా.....?" అన్నాడు ఆశ్చర్యంతో నాయుడు... "ఆ పేరు నీకెందుకు తోచింది. అసలు."

"జగన్నాధాచార్లుగారు అప్పుడప్పుడు వస్తూంటారు కదూ, ఆయన ఎప్పుడు వచ్చినా అధర్వణ వేదంలో ఏవేవో నారాయణాస్త్రం,
బ్రహ్మాస్త్రం లాంటి వానికి మంత్రాలున్నాయిట నిజమేనా, అని అడుగుతుంటారు. అదేదో సంపాదిస్తే ఇంగ్లీషు వాళ్ళని దేశంలోంచి ఒక్క
దెబ్బని తరిమెయ్యగలం కాదండీ అంటూంటాడు. ఆయన పేరు వస్తే ఆ మాట జ్ఞాపకం వచ్చేసింది. చెప్పేను."

ఆ మాట విని బాలకృష్ణ ఆశ్చర్యపడ్డాడు.

"ఆచార్లుగారింట్లో వుందని చెప్పేడే.... వాళ్ళింట్లో వుందన్న మాట అబద్ధమేనా...." తాను పందెంలో వోడిపోయిన దాని కన్న ఆ
వార్త బాలకృష్ణకు మరింత బాధ కలిగించింది.

"అబద్ధాలకోరు" అన్నాడు.

అధర్వణవేదం పని బాలకృష్ణకు ఏం వచ్చిందో అన్న ఆశ్చర్యం స్వరాజ్యాన్ని వేధించింది.

"ఏం చేద్దామనుకున్నారు ఆ పుస్తకం వుంటే...."

బ్రిటిష్‌వాళ్ళు పంజాబులో ఎన్నో దురాగతాలు చేశారు. జలియన్వాలాబాగ్‌లో డయ్యరు అనేవాడు ఇంచుమించు రెండువేల
మందిని కాల్పించి చంపించేసేడు. వాడినింక బ్రతకనీయకూడదనుకొన్నారు ఆ కుర్రవాళ్ళు ఎల్లాగా?

వాళ్ళకి మంత్ర తంత్రాలు సులువుగా కనిపించేయి. జగన్నాధాచారి తమ యింట్లో అధర్వణవేదం వున్నదన్నాడు. దానికోసం తిరుగుతున్నాడు
బాలకృష్ణ.

నాయుడు కుర్రవాళ్ళ ఆలోచనలకు నవ్వేడు. స్వరాజ్యం బాలకృష్ణ భుజంమీద చేయివేసి దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టుకుంది.

"మరేమంటాడు?"

"ఆ పుస్తకం అటకమీద వుందిట. తన తండ్రి చూడకుండా తియ్యాలి. ఎప్పుడొచ్చినా సరిగ్గా దాని క్రింద కూర్చుని ఆయన జపం
చేయడమో, నిద్రపోవడమో చేస్తుంటాడు. ఆయన కదిలేవరకూ కూర్చోబెడుతున్నాడు. మరునాడు రమ్మంటున్నాడు. తిప్పుతున్నాడు.

కాని డయ్యరును చంపెయ్యాలనే కక్ష, పట్టుదలతో బాలకృష్ణ అతడు రమ్మన్న రోజు, వేళకే వస్తున్నాడు. కాని, అది
దొరకనే లేదు.

"అవన్నీ వట్టి బూటకం నాయనా! జగన్నాధాచార్లు గారింట్లో అధర్వణవేదం వుండడం ఎంత నిజమో, అందులోని మంత్ర తంత్రాలు పని
చెయ్యడమూ అంతే నిజం." అన్నాడు నాయుడు.

తాను కొన్ని నెలలుగా పెంచుకున్న ఆశలనూ, చేసుకున్న కల్పనలనూ ఒక్కమాటలో కొట్టిపారవేస్తూంటే బాలకృష్ణ సహించలేకపోయేడు.

మంత్రశక్తిని గురించి ముంగండలో అనేక కథలు అతడు వింటూంటాడు. అతి ప్రశాంతంగా కూర్చుని రాత్రింబగళ్ళు జపం చేసుకొనేవారు ఆ
వూళ్ళో వున్నారు. వారు గొప్ప మంత్ర శాస్త్రవేత్తలని ఎంతో గౌరవం చూపడం చూస్తుంటాడు. పెద్ద కుంకం బొట్టుపెట్టి, మీసాలూ
వాళ్ళూ భయంకరంగా వుండే తంత్రశాస్త్రవేత్తలూ వూళ్ళో వున్నారు. వారిని చూసి జనం భయపడ్డం చూస్తున్నాడు.

ఒక్కమాటతో అవన్నీ కొట్టిపారేస్తూంటే ఎల్లా నమ్ముతాడు?

తాను విన్న కథల బలంతో అతడు చెప్తూంటే నాయుడు అనుభవంగాని, స్వరాజ్యం తెలివిగాని పనిచెయ్యలేదు.

వాళ్ళ తాతయ్య తేలుమంత్రం వేస్తాడు, నరసమ్మవ్వ చప్పి మంత్రం వేస్తూంది. భైరవశాస్త్రిగారు పాము మంత్రం వేస్తారు.
ఏనుగుపల్లి రాజుగారు పుప్పిపన్ను మంత్రం వేస్తారు.

ఆ అనంతకోటి సాక్ష్యాలకు సమాధానం వుంది. కాని, తనకు కొన్నే తెలుసు. తెలియనివి చాలా. దేని కారణాలు దానివి. అన్నింటికీ
ఒకే సమాధానం కాజాలదు. ఆ సమాధానాలకు శాస్త్రజ్ఞానం కావాలి. కొన్నింటికింకా శాస్త్రాలు కూడా కారణాలు పట్టుకోలేకపోయాయి. ఇంకా
పరిశీలించాలి.....

నాయుడు చర్చను మళ్ళిస్తూ వాళ్ళూరు కబుర్లు అడిగేడు. బాలకృష్ణ విజయశంఖం పూరించి నవ్వేడు.

"ఓడిపోయారన్న మాటేనా...?" స్వరాజ్యం నవ్వింది.

ఇంత ప్రజ్ఞావంతుడివి కనక నీకో పుస్తకం బహుమతి ఇస్తాం అని లోనికి వెళ్ళి వీరేశలింగం పంతులుగారి స్వీయచరిత్ర తెచ్చి
యిచ్చింది.

అది చూసి బాలకృష్ణ ఆనందించేడు.

"మా వూళ్ళో లైబ్రరీలో చాలా మంచి పుస్తకాలున్నాయిట. కాని అది తీయటం లేదు, పుస్తకాలిచ్చే వాళ్ళూ లేరు."

తర్వాత కొంత సేపు కబుర్లు చెప్పి బయలుదేరేడు.

"మీ మావయ్యగారికి వందనాలు చెప్పండి." అన్నాడు నాయుడు.

"ఆయన రాజమండ్రి వెళ్ళేడు."

"ఎందుకు?"

తండ్రీ కూతుళ్ళ మనస్సులలో ఒకే ఆశంక కలిగింది.

"ఎందుకు?"

బాలకృష్ణ ఎరగడు. 'ఏమో'

"ఎప్పుడొస్తారు?"

"అదీ తెలియదు."

ప్రతి ఆదివారం వస్తూండడానికి వాగ్దానం తీసుకొని స్వరాజ్యం అతనిని కాలవగట్టు ఎక్కించింది. వెళ్ళేముందు తమ పందెం కేవలం ఆట
మాత్రమేననీ అతడు వోడడం లెక్కకాదనీ చెప్పింది. కాని బాలకృష్ణ ఏ మాత్రం ఒప్పుకోలేదు.

"ఆ బేడ నాకక్కర్లేదు."

స్వరాజ్యం నవ్వుతూ 'సరే'నంది.



ఇరవైమూడు


"నిన్న సాయంకాలం డబ్బు మాట ఏదో చెప్పేవు...." అంటూ శంకరశాస్త్రి చేస్తూన్న సంధ్యావందనం మధ్యలో ఆపి ఆ దిశగా
వచ్చిన భార్యను ప్రశ్నించేడు. ఆ ప్రశ్న ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.

"డబ్బేమిటి? నేనేం చెప్పేను?"

తన ప్రశ్నను అర్ధం చేసుకోలేని తెలివి తక్కువదనానికి శాస్త్రి ఆమె మీద చుర్రుమన్నాడు.

"ఆ మాత్రం తెలివుంటే లేకపోయిందేమిటి? మన ప్రబుద్ధుడు డబ్బు కావాలన్నాడన్నావు...."

రాజమ్మ 'అదా?' అంది.

"నిన్న కాదు, రాజమండ్రి నుంచి వచ్చిన రోజునే అడిగేడు. ఆ మాట నిన్న జ్ఞాపకం వచ్చింది."

"ఏడవలేకపోయేవు."

ఆ సలహా తీసుకొని రాజమ్మ గబగబ లోనికి పోయింది. ఇంకెన్ని తిట్లు తినవలసి వస్తుందోనని ఆమె భయం.

"యదహ్నా కురుతే పాపం! తదహ్నా ప్రతిముచ్యతే....."

శాస్త్రి మరల సంధ్యావందనంలో మునిగిపోయేడు. కాని అతని మనస్సు దానిమీద లేదు.

నాలుగైదు రోజుల క్రితం తల్లిని డబ్బు కావాలన్నవాడు తననెందుకు అడగలేదు? ఆ అవసరం ఏమయింది?

ఇప్పుడు ప్రయాణానికి కావలసిన డబ్బు ఎక్కడిది? కాకినాడ కూడా వెళ్లాలంటే ఆరోజున కావాలన్నదానికన్న ఎక్కువే కావాలి
మరి?

శంకరశాస్త్రి ఆలోచనలు ఉన్నట్లుండి అప్పయ్య అవధాన్లు వేపు మళ్ళేయి.

పెద్దవాళ్ళచాటు కుర్రకారుకు డబ్బు అప్పు కావాలంటే తమ వూళ్ళో మొదట జ్ఞాపకం వచ్చేది అప్పయ్య అవధాన్లు.

ఇంకెవరిదగ్గరకెళ్లినా పుచ్చుకొనే వడ్డీ తీసుకొంటూనే లక్ష హితోపదేశాలు చేస్తారు. పెద్దవాళ్ళతో కూడా చెప్పేస్తారు. విషయం
కాస్తా వీధిన బడుతుంది. అప్పయ్య అవధాన్లు అసలు సంగతి ఆస్తి మునిగిపోయే దశ వచ్చేవరకూ పైకి పెట్టడు.

పైగా విశ్వనాధం సలహా సహాయాలతో రామనాధం పనిచేస్తున్నాడనిపించేక డబ్బు సమస్య వచ్చే సరికి అవధాన్లు పేరే గుర్తురావడంలో
ఆశ్చర్యం లేదు. విశ్వనాధం ప్రోనోటు మీద వ్రాలు చెయ్యడం నేర్చుకొన్నది అవధాన్ల వద్దనే. ఇంతవరకూ భూమి అమ్ముకొన్నదీ,
అమ్ముకోగా మిగిలింది తనఖా పెట్టినదీ అప్పయ్య అవధాన్లు వద్దనే. కనుక తమ్ముని కొడుకుచేత కూడా అక్కడనే కాతా
పెట్టించాడనిపించింది.

అదే జరిగితే తానీ పదిహేను, పదహారేళ్ళుగా పడ్డ శ్రమ అంతా వ్యర్థమే. పైసా పైసా చొప్పున జాగ్రత్త చేసికొన్నదీ,
అసలు వున్నదీ కూడ చూస్తూ చూస్తుండగా హరించి పోతుంది.

ఆ ప్రమాదం కనిపించేక మరి సంధ్యావందనం కూడా సాగలేదు.

'కోప్పడీ, బెదిరించీ ఇల్లాంటి అలవాట్లు మాన్పించలేము' అనుకున్నాడు.

డబ్బు అవసరం కనబడకుండాలి. లేదా ఇచ్చేవాడు దొరక్కపోవాలి. అంతేకాని, ఒకమారు అప్పుకేసి మళ్ళిన వ్యక్తి చిన్న
అవసరం వచ్చినా అప్పులాడి కోసం వెతుకుతాడనే విషయం కొద్దీ గొప్ప వడ్డీ వ్యాపారం తిప్పుతున్న శంకరశాస్త్రికి
తెలియకపోలేదు.

ఇంక డబ్బు అవసరం వుండకపోవడం ఏమిటి? అందులో ఈనాటి చదువులూ, అలవాట్లూ లోనే డబ్బును మంచినీళ్ళకన్న ధారాళంగా ఖర్చు
పెట్టించే స్వభావం వుంది. తాను కానీ ఖర్చు లేకుండా పంచకావ్యాలూ, అలంకార శాస్త్రం చదువుకొన్నాడు. కట్టుకొనేందుకో అంగవస్త్రం,
భుజాన వేరొక అంగవస్త్రం తప్ప చదువుకొనే రోజుల్లో మారు దుస్తులు ఎరుగడు. కాని రామనాధం చదువు ప్రారంభించిన ఈ
పదిహేనేళ్ళలోనూ పదేళ్ళలోపు వయస్సులో వంటింట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు పెట్టుకున్నాడో తప్ప గోచీ ఎరగడు.
చొక్కాలు, లాగూలు, టోపీలు వీటి కోసం ఒక్క ఏడాదిలో అయిపోతున్న ఖర్చు తాను చదువుకొన్న మొత్తం కాలంలో బట్టలమీద చేసిన
ఖర్చును మించిపోతూందని శాస్త్రి కొడుకును ఎన్నో మార్లు మందలించేడు. పుస్తకాలకయ్యే ఖర్చుకి అసలు పోలికే లేదు. ఏడాదికేడాదికి
ఎన్నో పుస్తకాలు, ఏవేవో పుస్తకాలు, పైన తిండి ఖర్చు, బసలకి ఖర్చు.

ఇన్ని ఖర్చులకి అలవాటుపడ్డ వాళ్ళకి డబ్బు విలువ ఏం తెలుస్తుంది? చదువుకొన్న రోజుల్లో తాము సంభావనలకు వెళ్ళి,
బ్రాహ్మణార్థాలు చేసుకొనీ తెచ్చుకొన్న డబ్బుల్లో తమ ఖర్చు వెళ్ళిపోయేది. ఇప్పుడల్లా వెళ్ళడం నామోషీ కాకున్నా ఆ ఖర్చులకి
ఈ డబ్బులు ఏ మూలకి?

అందుచేత డబ్బు అవసరం అసలీనాటి చదువుల్లోనే వున్నదని శాస్త్రి దృఢ నిశ్చయం. చేతికి ధారాళంగా డబ్బు చిక్కనివ్వకపోడమే
ఆ అవసరాన్ని అదుపులో పెట్టేటందుకు మార్గమని తలచేడు. ఇంతవరకూ ఆ బిగింపు తాను చూసుకొన్నాడు. కాని ఇప్పుడు?

రామనాధానికీ వయస్సు వచ్చింది. అతనికి వెనక ఆస్తి వుంది. అప్పు ఎవరేనా ఇచ్చేస్తారు. అల్లా ఇవ్వకుండా కొంచెం
గట్టెయ్యాలి--అనుకొన్నాడు.

రాత్రి అంతా ఆలోచించేడు. అసలు అప్పయ్య అవధాన్లు వద్ద అప్పు తెచ్చేడో లేదో తెలుసుకోవాలి.

ప్రొద్దున్న తోటనుంచి వస్తూంటే దారిలో రావి క్రింద అవధాన్లు కనిపించేడు. ఆయనే పలకరించేడు.

"దింపు తీయిస్తున్నావా? పొద్దుపోయింది" అన్నాడు.

అవధాన్లు కొబ్బరికాయ కమీషను వ్యాపారం కూడా చేస్తూంటాడు.

"దింపువాళ్ళు వస్తామన్నారు. కాని. ఏదో పనుందని రామని కబురు పెట్టేరు. ఎల్లా వుంది పచ్చికాయ?"

ఆ మాటా ఈమాటా చెపుతూ శాస్త్రి యధాలాపంగా అన్నట్లు అప్పు ప్రసక్తి తెచ్చేడు.

"వారంనాడు మా వాడు ఏ మాత్రమో డబ్బు కావాలంటే లేకపోయింది. అవధాన్లు మామ దగ్గిరికెళ్ళి తీసుకోమని పంపేను. వచ్చాడా?"

అవధాన్లు చటుక్కున అబద్ధం ఆడలేకపోయేడు.

"పట్టుకెళ్ళేడు."

"రేపో ఎల్లుండో దింపుకాయ అమ్మేసి ఇస్తాను" అన్నాడు శాస్త్రి.

అప్పుడుగాని అవధాన్లుకు తాను చేసిన పొరపాటు అర్థం కాలేదు. రామనాధం నోటు వ్రాసి ఇవ్వడమే ఆ విషయాన్ని చెపుతూంది.

శాస్త్రి ఆ అప్పు విషయం గ్రహించేసేడు. నలుగురిలో తన చేత ఔననిపించేడు. ఇంక సర్దుకోలేకపోయేడు.

"అంత తొందరేముందిలే, చేతిలో వున్నప్పుడే ఇద్దువుగాని...."

ప్రక్కనే వున్న భగవచ్ఛాస్త్రులు హాస్యమాడేడు.

"అణాబిళ్ళ మీద సంతకం చేయించే వుంటాడు. అదీ ఆ ధైర్యం."

కాదనడానికి అవకాశం లేకుండా శాస్త్రి అందుకున్నాడు.

"బిళ్ళ ఇచ్చే పంపేను. చేబదులంటే అర్ధం తెలియదు. అది నేర్పకూడదు. ఈనాటి కుర్రాళ్ళకి డబ్బు విలువ బొత్తిగా తెలియకుండా
పోతూంది."

"పంపించే వాళ్ళుంటే..." అని వెంకప్ప తన కొడుకు తోడి అనుభవం తలుచుకొని అంగలార్చేడు. ఆయన కొడుకు ఎప్పుడూ అమలాపురం
బోగంవాళ్ళ ఇళ్ళలోనే వుంటాడు. డబ్బు కావలసినప్పుడే ఇంటికి వచ్చి తెస్తావా, చస్తావా అని కూర్చుంటాడు.

"అడిగిన వెంటనే డబ్బిస్తే దాని విలువ అర్ధం కాదు. ఎక్కడో చూడలేకనా? అవధాన్లు మామనడిగి నేనే తేలేకనా? కాని,
వాళ్ళకీ కష్టసుఖాలు తెలిసిరావాలి....."

శాస్త్రి చెప్తున్నదంతా అబద్దమేనని మనస్సుకి తోస్తూ వున్నా ఏమీ చెప్పలేక అంతకన్న లోతుకి వెళ్ళడం ఇష్టమూ లేక
పిలుస్తున్నా వినిపించుకోకుండా అవధాన్లు పని వుందని వెళ్ళిపోయేడు.

అందులో ఏదో రహస్యం వుందని గ్రహించిన భగవచ్ఛాస్త్రులు అడిగేడు.

"ఏమిటి వ్యవహారం?"

"మామూలే."

"గుణం పోనిచ్చుకున్నాడు కాదు." అని వెంకప్ప తన అసహ్యం వెలిబుచ్చేడు. తాను ఇవ్వవద్దని చెప్పినా కొడుక్కు అవధాన్లు
అప్పిస్తూనే వుంటాడు. "ఇచ్చి చెప్పడు. వడ్డీ పెరిగి ఇనప్పెట్టె నిండాలి." అంటూ ఆయన బాధ వెళ్ళకక్కుకున్నాడు.

ఒకరోజు పోనిచ్చి శాస్త్రి డబ్బు తీసుకొని అవధాని ఇంటివద్ద హాజరయ్యేడు. అతని రాక చూసి అవధాని కొబ్బరి బేరానికి
వచ్చిన వాళ్ళ పని ఆపి వారు దగ్గరుండేటట్లు చేసుకొన్నాడు.

శాస్త్రికి మహచెడ్డ కోపం. చెయ్యి దురుసుతనం కూడా ఎక్కువే.

ఆయన వస్తూనే అసలు విషయం ఎత్తుకుంటాడనుకొన్నది. అలా చెయ్యలేదు. ఆ మాటా ఈ మాటా చెపుతూ హాస్యమాడుతూ కూర్చున్నాడు.
ఆలోపున వీధిన పోతున్న వాళ్ళూ వీళ్ళూ చేరేరు. తన భయం అనవసరం అనిపించింది అవధాన్లకి. కబుర్లు చెప్తూ చెప్తూ
హఠాత్తుగా శాస్త్రి అసలు సంగతి ఎత్తుకున్నాడు.

"మామా! నోటు తీసుకొచ్చి చెల్లు రాయి. డబ్బు తెచ్చేను".

"నోటేమిటి?"--అనేసేడు అప్పయ్య శాస్త్రి. పొరపాటున అంతలో సర్దుకున్నాడు. ఇంట్లో లేని కొడుకును పెద్దగా గొంతెత్తి
పిలిచేడు.

"భానూ! భానూ!"

లోనుంచి భార్య సమాధానం ఇచ్చింది.-- 'అంబాజీపేట వెళ్ళేడు, కొబ్బరి సంతకని. మీతో చెప్పలేదా?"

ఆవిడ కీ యిచ్చి వదిలిపెట్టినట్లు అల్లాగే రెండు రోజులయినా అదే విషయం మీద మాటలు చెపుతూనే వుంటుంది. ఇంట్లో లేడని ఎరిగి
వుండే ఎందుకు పిలిచేనా అని అప్పయ్య అవధాన్లు మనసులో గుందిల్లేడు. తాను కొడుకుకి చెప్పి పంపిన మాటలు కూడా ఆమె
బయటపెట్టేస్తుంది. భార్య నోరు మూయించాలని అవధాని గర్జించేడు.

"ఈపాటికి నోరు ముయ్యి. తెలిసిందిలే. ముండావాగుడు."

ఆ ఆదేశం వినిపించేక ఆమె మరి మాట్లాడలేదు. అవధాని ఇంక కార్యక్రమం ప్రారంభించేడు.

"ఇనప్పెట్టిలో పెట్టి మావాడు వెళ్ళిపోయేడు. తరువాత చూసుకొందాం. నీ దగ్గరుంటే ఒకటీ, నా దగ్గరుంటే ఒకటీనా?"

శాస్త్రి అంత అభేదభావాన్ని చూపించలేకపోయేడు.

"అంత నమ్మకం వున్నవాడివి చేబదులివ్వక నోటు ఎందుకు వ్రాయించుకొన్నావు?"

ఆ అప్పు పత్రం అంతతో ముగించకూడదని అవధాని ప్రయత్నం.

"శాస్త్రీ! నీతో అబద్ధమాడతానటోయ్‌. నిజమే, మా వాడి దగ్గరుంది అది. అంతగా దగ్గరుంటే మరోలాగ
ఖర్చయిపోతుందనుకొనేటట్లయితే డబ్బు ఇచ్చి వెళ్ళు. అబ్బాయి రాగానే నోటు పంపిస్తా"

శాస్త్రి విషయంలో అవధాన్లు మోసం చెయ్యకపోవచ్చు. అంత మంది ముందు తీసుకొన్న సొమ్ము లేదనకపోవచ్చు. కాని, ఒకరిద్దరి
వద్ద డబ్బు తీసుకొని చెల్లు రాయకుండా మళ్ళీ వసూలు చేశాడని వూళ్ళో గొడవలు వున్నాయి.

శాస్త్రి వ్యవహారజ్ఞానం లేనివాడేం కాదు.

అవధాని సూచన విన్నాక కోపం చర్రుమంది. అప్పయ్య గడుసుతనం అర్ధం అయింది. నోటు చూస్తేనేగాని రామనాధం ఎంత అప్పు చేశాడో
తెలియదు. తాను ఎంత అని ఇస్తాడు? ఆ రహస్యం బయటపడితే తన చాటున కుర్రవాడు అప్పులు చేస్తున్నాడని నలుగురికీ
తెలిసిపోతుంది. అదొక విధంగా లోకువా, అప్రతిష్ఠా కూడా.

"ఇదిగో మామా! సూరయ్యకాపు అనుకుంటున్నావేమిటి?"

సూరయ్య కాపు నమ్మకం మీద డబ్బు అలాగే ఇచ్చి మూడెకరాల భూమి పోగొట్టుకొన్నాడని వూళ్ళో చెప్పుకుంటారు. అంతమాట విసిరేసినా
అవధాని కోపం తెచ్చుకోలేదు.

"నీకూ అదే తోచిందిటోయ్‌"--అని మాత్రం అన్నాడు. లేచి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు. ఇంకెందరు ఎన్ని పిలిచినా
మాట్లాడలేదు. తలుపు తియ్యలేదు. శాస్త్రి మహాకోపంతో అరుగు దిగి పైబట్ట నడుముకి బిగించేడు. వాలకం చూస్తే కలబడేలా
ఉన్నాడు.

దగ్గరున్నవాళ్ళు అతనిని శాంతింపచెయ్యటానికి ప్రయత్నించేరు. కాని శాస్త్రి వినిపించుకోలేదు.

"నిన్నిల్లా వదిలేస్తే నా పేరు శాస్త్రి కాదు....." అని ఘోర శపథం చేసేడు.

అయితే అంత కోపంలో కూడా తపోబలం, వాక్శుద్ధి బలం వంటి అతీత శక్తులు తనకిక్కడ సాయపడవనే మాటను మరిచిపోలేదు.
భౌతికశక్తుల్లో కూడ పోలీసుశాఖకున్న బలం, ప్రాభవం మరెవ్వరికీ లేవని కూడా గుర్తుంది. అందుచేత ఆ బెదురునే కలిగించడానికి
ప్రయత్నించేడు.

"వాడి మామగారు నారాయణమూర్తిగారే వచ్చి ఆ నోటు సంగతి చూసుకొంటారు ఇనప్పెట్టిలో వుందో, పోపులపెట్టిలో వుందో అయనే
చూస్తాడు."

అంత దుర్దాంత వ్యక్తి పేరు వుచ్చరించాక అవధాని బిగువు ఎంతోసేపు నిలువలేదు. మరుగంటలో రెండో కొడుకు చేతికిచ్చి నోటు
పంపించేసి, డబ్బు తెచ్చేసుకొన్నాడు.

శాస్త్రి బాకీ యిచ్చేస్తూ ఖబడ్దార్‌ చెప్పేడు.

"ఈమారు తండ్రిచాటు కుర్రాళ్ళకి డబ్బు యిచ్చేటప్పుడు వెనకా, ముందూ చూసుకొని మరీ చెయ్యమని చెప్పు మీ నాన్నతో."

రామలింగం అమాయకంగా ఎదురుప్రశ్న వేశాడు.

"అయితే డబ్బు కోసం నువ్వు పంపించలేదన్నమాట?"

జారినమాట కమ్ముకోవడం సాధ్యంగాక శాస్త్రి వానిమీద మండిపడ్డాడు.

"అతితెలివి! సంతోషించాం."



ఇరవైనాలుగు


రామనాధం కాకినాడలో రైలు దిగి దేవాలయం వీధిలో వున్న రుక్కమ్మ హోటలుకి తిన్నగా వెళ్ళేడు. అక్కడే స్నానం చేసి బట్టలు
మార్చుకొన్నాడు. భోజనం చేశాక తన బావ చంద్రశేఖరాన్ని వెతుక్కుంటూ పిఠాపురం రాజా కాలేజీకి బయలుదేరాడు.

చంద్రశేఖరం కాలేజీలో లెక్చరరు. రామనాధం వెళ్ళేసరికి అతడు క్లాసులో వున్నాడన్నారు. వచ్చేవరకూ ఎదురుచూస్తూ అక్కడే
టీచర్ల గదిలో కూర్చున్నాడు. ముతక ఖద్దరు బట్టలతో వున్న రామనాధంవేపు నలుగురూ వింతగా చూస్తుంటే అతడు ముళ్ళమీదున్నట్లు
కూర్చున్నాడు.

హఠాత్తుగా, అనుకోని విధంగా చూడడంచేత చంద్రశేఖరం మొదట అతనిని గుర్తుపట్టలేకపోయేడు.

"నీ కోసం ఎవరో వచ్చి కూర్చున్నారు." అని తోడి లెక్చరరు చెప్తూంటే చంద్రశేఖరం దగ్గరకు వచ్చేడు.

"తమరు...." అంటూ ముఖంకేసి చూసి చటుక్కున నిలబడ్డాడు.

"మీరు.....ఏమిటీ వేషం" అనబోయినవాడే సర్దుకొని "ఎంతసేపయింది వచ్చి" అన్నాడు.

తనను హెచ్చరించిన మిత్రునికి పరిచయం చేసేడు.

"మా చెల్లెలి భర్త."

తరువాత ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా గంటకొట్టి ఫ్యూనును పిలిచేడు. గదిలోనున్న సంఖ్యను చూసుకొని తేవలసిన కాఫీల సంఖ్య
చెప్పేడు.

"ఆరు తీసుకురా."

మిత్రులలో ఒకరు గుర్తుచేసుకొనేటందుకు ప్రయత్నిస్తున్నట్లు అన్నాడు.

"చెల్లెలు ఒక్కర్తేనన్నావు కాబోలు."

ఆ ప్రశ్నకు మూలం ఏమిటో గ్రహించనట్లు చంద్రశేఖరం నటించేడు.

"ఔను, ఆమె భర్త రామనాధం. ఈ ఏడాది విదేశాలకి వెళ్ళే ఆలోచనలో వున్నారని చెప్పింది ఈతనిని గురించే."

ఖద్దరు దుస్తులవాడు ఐ.సి.ఎస్‌.కు వెళ్ళాలనుకొంటున్నాడంటే మిత్రులకాశ్చర్యమే కలిగింది. కాని, తోటి మిత్రుడు
నొచ్చుకుంటాడని ఎవ్వరూ ఏమీ అనలేదు. అతని ప్రయత్నాన్ని అభినందించేరు.

రామనాధం చిరునవ్వుతో వారి అభినందనలను త్రోసిపుచ్చేడు.

"ఒకప్పుడా అభిప్రాయం వుండింది."

"ఇప్పుడు?"

"లేదు...."

చంద్రశేఖరం ఆ సంభాషణను ఆ విధంగా కొనసాగనివ్వడం ఇష్టంలేక మాట మార్చేడు.

"ఎప్పుడు బయలుదేరేవు?"

మిత్రులు అతని అభిప్రాయాన్ని గుర్తించేరు. ఓ నిముషం ఆమాట యీమాట చెప్పి తమ క్లాసులకి వెళ్ళిపోయేరు. తనకు ఆ గంట
పనేమీ లేదని రామనాధం కళ్ళలో కనిపించిన ప్రశ్నకు సమాధానమిచ్చేడు చంద్రశేఖరం.

"పరీక్షలు దగ్గిరికొచ్చినట్లే. బాగా చదువుతున్నావా?"

అతడు కట్టిన ఖద్దరు బట్టలు చూసేక మనస్సులో కలుగుతున్న భావాలను చంద్రశేఖరం నమ్మదలుచుకోలేదు. దేశంలో వ్యాపిస్తున్న
విదేశీ ప్రభుత్వ ద్వేషానికి చిహ్నంగా మాత్రమే ఆ దుస్తులను గుర్తించదలిచేడు. సత్యాగ్రహం, సహాయ నిరాకరణం చేసి
వుంటాడనుకోలేకపోయేడు. కాలేజీలో మొదటి మార్కుకోసం పోటీపడుతున్న వాడల్లా ఉన్నట్టుండి రంగాన్ని వదిలేస్తాడనుకోలేకపోయేడు. తన
ప్రశ్నకు సమాధానం విని తెల్లబోయేడు.

"పరీక్షలకు వెళ్ళడం లేదు."

"అంటే?"

"కాలేజీ మానేశాను."

చంద్రశేఖరం చాలా బాధగా అన్నాడు.

"సహాయ నిరాకరణం?"

రామనాధం తల ఆడించేడు.

"ఔను."

'ఎంతపని చేశావు?' అన్నట్లు చంద్రశేఖరం విచారంగా, జాలిగా చూసేడు. చాలాసేపటివరకూ మాట్లాడలేకపోయేడు.

అందరూ స్కూళ్ళూ, కాలేజీలూ మానవలసిందనీ, ప్రభుత్వోద్యోగాలకు రాజీనామాలివ్వాలనీ, కోర్టుల్ని బహిష్కరించాలనీ గాంధీగారు
ప్రబోధిస్తున్నారు. అలా చేస్తే ఏడాదిలో స్వరాజ్యం వస్తుందని ఆయన వాగ్దానం చేశారు. తామంతా ఆ కార్యక్రమం విని
నవ్వేశారు. పరీక్షలు ప్యాసుకాని మందమతులూ, బోర్డు డబ్బు కిట్టని వకీళ్ళూ దేశభక్తులయిపోవడానికీ, ప్రతిష్ఠ
కాపాడుకోడానికీ మంచి అవకాశం దొరికిందని వేళాకోళం చేశారు.

కాని, ఇదేమిటి; మంచి తెలివిగలవాడూ, భవిష్యత్తు వున్నవాడూ రామనాధం. అతడు చదువు కట్టిపెట్టేసి సహాయ నిరాకరణం
చేసేడు.

రామనాధం పెదతండ్రి ఒకాయన కాంగ్రెసువాడు ఉన్నారన్నారు. ఆయన్ని తాను చూడలేదు. తన తమ్ముడి కొడుకు పెళ్ళికికూడా ఆయన
రానే లేదు. ఆయన చదువుకోలేదని విన్నాడు.

కాని, రామనాధం చదువుకున్నవాడు. చెల్లెలిని అతనికిచ్చి పెళ్ళిచేయడానికి కారకుడు తానే అయివుండడం ఒక విశేషం. ఇప్పుడు
అందరూ తనమీదపడిపోతారనిపించింది. చంద్రశేఖరం లేచేడు.

"సెలవుచెప్పి వచ్చేస్తా, కూర్చో. ఇంటికి వెడదాం."

"వెళ్ళిరాండి."

తాను చేసిన పనినీ, తన వుత్సాహాన్నీ ఎంతోమంది అర్థం చేసుకోలేరని ఈ వారం పదిరోజుల్లోనూ రామనాధం గ్రహించేడు. చంద్రశేఖరం
వారిలో ఒకడు అయ్యేడు అంతే.

ఏడాదిలో స్వాతంత్య్రం వస్తుందని గాంధీ చెప్తూంటే నమ్మినవాళ్ళూ, సమర్థించినవాళ్ళూ కూడ సహాయ నిరాకరణంలో తమవంతు పాత్ర
ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. పరీక్షలయ్యేక అంతగా అయితే ఓ ఏడాది మానెయ్యకూడదేమిటి? అంటున్నారు. ఈ ఏభయివేల
రూపాయల కేసు ఒక్కటీ పూర్తిచేసి తర్వాత కోర్టు మానమని బంధువులూ, స్నేహితులూ చెప్పినా తాను వొప్పుకోలేదని అయ్యదేవర
కాళేశ్వరరావుగారు ఆరోజున సభలో చెప్పేరు. చేస్తూ చేస్తూన్న వుద్యోగం వదిలేసుకొన్నాక స్వరాజ్యం వచ్చి మాత్రం కూడూ, గుడ్డా
పెడుతుందా అని వాళ్ళ వాదన.

కాని చంద్రశేఖరం వాదనలు ఆ పంథాలో లేవు. తన సెలవు పని పూర్తిచేసుకువచ్చి చంద్రశేఖరం సావకాశంగా ప్రారంభించేడు.

"మన దేశం చాలా చిత్రమైన పరిస్థితుల్లో నడుస్తూంది. మీరంతా దేశాన్ని ఏదో వుద్ధరిస్తామంటున్నారు. ఆ పనికోసం గాంధీ అంటూ ఓ
నాయకుడు కూడా ఏర్పడ్డాడు. ఆయన మీద మీ అందరికీ వుండుకున్న విశ్వాసం నాకు లేదు."

బావగారి అవిశ్వాసాన్ని పోగొట్టడానికి రామనాధం మాటమధ్యలోనే అందుకున్నాడు.

"మనదేశంలో విదేశీయుల పరిపాలన వున్నదనీ, దానిని తొలగించి మన పరిపాలనను మనం సాగించుకోవడం అవసరమనీ వొప్పుకుంటారా?"

చంద్రశేఖరం చరిత్రాధ్యాపకుడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇప్పుడీ దేశంలో వుంటున్న ప్రజల పూర్వీకులంతా బయటినుంచి వచ్చిన
వాళ్ళే. ఇచ్చటి ఆదివాసులీనాటికీ ఆదివాసులుగానే వుండిపోయారు. ఈ గడ్డ దురదృష్టం ఏమిటోగాని విజేతలుగా వచ్చినవాళ్ళు తమ
తరువాత వచ్చిన వాళ్ళ చేతుల్లో ఓడిపోతూండడమే చరిత్రలో పొడుగునా కనిపిస్తుంది. ఈ గడ్డమీద స్వతంత్రం అనుభవించడం
ఎన్నడూ జరగనేలేదని అతని అభిప్రాయం.

ఆ వాదనలను ఖండిస్తున్న అనేకమంది వుపన్యాసాలను రామనాధం విన్నాడు. దేశంమీద దండెత్తిన వాళ్ళని ప్రతిఘటించిన వారి
చరిత్రలూ, స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహావ్యక్తుల కధలూ విన్నాడు. కాని, ఆ వీరచరిత్రలు ఆ
చరిత్రాధ్యాపకుడికి సంతృప్తి కలిగించలేదు.

రామనాధం ఈమారు చరిత్రకి అర్థశాస్త్రం కూడా జతపరిచేడు.

వెనుకటి రోజుల్లో దేశాన్ని ఎంతమంది ఆక్రమించినా వాళ్ళు తమ తరంలోనే దేశంలో స్థిరపడిపోతూ వచ్చేరు. వాళ్ళూ దేశీయులే
అయిపోయారు. ఆఖరున వచ్చిన ముసల్మానులు కూడా ఇక్కడ వాళ్ళలోనే కలిసిపోయారు. ఇదే తమదేశం అనుకున్నారు. ఇక్కడి
వాళ్ళతోపాటే కష్టసుఖాలు పంచుకొంటున్నారు.

"కానీ ఇంగ్లీషువాళ్ళు అల్లా కాదు. వాళ్ళకీ దేశం రావడం డబ్బు సంపాదనకో మార్గం. ఆ లాభం దేశం నుంచి దండుకుపోతున్నారు. మన
దేశం అంతకంతకు దరిద్రంలో కూరుకుపోతూంది...."

రామనాధం గోల్డ్‌ ఎక్సేంజి స్టాండర్డు గురించీ, కౌన్సిలు బిల్లులూ, రివర్స్‌ కౌన్సిల్‌ బిల్లుల
మోసం గురించీ చెప్పుకుపోయేడు.

"స్వరాజ్య సంపాదనమే దీనికి మంచి మందు".... అని తేల్చేడు.

గోల్డు స్టాండర్డు వగైరా పితలాటకాన్ని చిన్న చిన్న వుదాహరణలతో చక్కగా చెప్తూంటే ఇంతసేపటినుంచీ కట్టుగుడ్డలు చూసి
తేలికగా భావించిన లెక్చరర్లందరూ దగ్గిరికి చేరేరు ఒక్కొక్కరు. ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నారు. పంజాబు దురంతాలూ,
జలియన్వాలాబాగ్‌ హత్యలూ కథోపకథనంతో వస్తున్నాయి. చంద్రశేఖరం సంకోచంలో పడ్డాడు.

"లేవండి వెడదాం."

ఇద్దరూ రోడ్డుమీదికి వచ్చేరు.

"మన ఇంటికి వెడదాం."

రామనాధం అలవాటులేమిని ఒక్క క్షణం తటపటాయించేడు.

చంద్రశేఖరం అతని ముఖం వంక చూసేడు....

"అనుమానమేమన్నా వుందేమిటి?"

రామనాధం సర్దుకొని "అటువంటిదేమీ లేదు" అన్నాడు.

"అంత అభ్యంతరం వుంటే భోజనానికి మళ్ళీ వచ్చేద్దువుగాని ఇక్కడికే. ఇంటికి రావడానికేం పోతుంది?"

మనస్సులో బెగటు, హేళన వగైరాలు లేకుండా అంత సరళంగా సంఘంలోని తన స్థితిని అంత నిర్వికారంగా తీసుకోగలిగిన
చంద్రశేఖరాన్ని చూస్తూంటే రామనాధానికి సిగ్గు కలిగింది.

చంద్రశేఖరం ఏ కులానిదో తెలియని అనాథశరణాలయపు అమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడు. వారిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇద్దరూ
చెరో ఉద్యోగమూ చేసుకుంటూ జీవిస్తున్నారు. అతడా పెళ్ళి చేసుకొన్నాక బంధువులు యావన్మందీ తల్లీ తండ్రితో సహా అతనిని
వెలిపెట్టేరు. ఇంటికి రానివ్వకూడదనుకొన్నారు. అతడూ వారికా అవకాశం కలిగించతలచుకోలేదు. అటు తర్వాత తల్లిని చూడ్డానికి
కూడా ఇంటికి వెళ్ళలేదు.

అగ్రహారంలో పుట్టిపెరిగిన రామనాధానికి కులాంతరంలో వివాహాలు అనూహ్యం. కులాంతరులతో సంబంధాలు కలవాళ్ళని చాలామందిని చూసేడు.
తన పెదతండ్రే వున్నాడు.

అయితే ఆ స్త్రీలతో వారి సంబంధం పడకగదికి మాత్రమే పరిమితం. వాళ్ళ చేతినుంచి మంచినీళ్ళు కూడా తీసుకోరనేది ఓ సంతృప్తి.
కాని ఇక్కడి స్థితి వేరు. చంద్రశేఖరం ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. ఆమె వంట తింటున్నాడు. అది గొప్ప అపరాధం, అనాచారం
అని శంకరశాస్త్రి కొత్త రోజుల్లో పరవళ్ళు తొక్కేడు.

అన్నగారు మరో కులం పిల్లను పెళ్ళి చేసుకొన్నాక ఆ చెల్లెల్ని ఇంకా కోడలుగా స్వీకరించవచ్చునా అనే విషయం మీద తమ ఇంట్లో
కొన్నాళ్ళు చర్చలు జరగడం రామనాధం ఎరుగును. ఆ ఆలోచనలను రామనాధం ఆనాడే హర్షించలేదు.

పెళ్ళి అయినాక ఏవో పనులమీద చంద్రశేఖరం రాజమండ్రి వచ్చేవాడు. చెల్లెలి భర్త మీద అతనికెంతో అభిమానం. వచ్చినప్పుడు
తప్పకుండా అతనిని కలుసుకొనేవాడు. హోటలులో పొత్తిపంచె కట్టుకొనే రామనాధం భోజనానికి కూర్చున్నా, బావతో సహపంక్తిని
కూర్చోడానికెన్నడూ ఆలోచించలేదు.

--అయితే అతని తల్లిదండ్రుల ఆచారపు ఆలోచనలు వీధిదాకా రాకుండానే ఆగిపోయాయి. దానికి కారణం నారాయణమూర్తి బహుశ్రద్ధగా
సాగించే లలితా ఉపాసనా కాదు, రామనాధాన్ని ఇంగ్లండు పంపుతాడన్న ఆశా కాదు. పోలీసు ఉద్యోగి దుర్దాంత కోపభయం ఆ ప్రమాదాన్ని
తప్పించింది.

ముంగండలో ఒకరిద్దరు ఆ సమస్యను తీసుకురా ప్రయత్నించినా శంకరశాస్త్రి ఉపద్రష్ట జగన్నాధ పండితరాయలు మొగలుదర్బారులోని
రాజనర్తకిని దర్జాగా పెళ్ళిచేసుకొని చెప్పిన శ్లోకాలని రాగవరసలో చదివి వినిపించి నోరు మూయిస్తూ వచ్చేడు.

ఈ వాదోపవాదాలనూ, చర్చలనూ చంద్రశేఖరం వినలేదనుకోలేము కాని, అవేవీ అతని మనఃస్థైర్యాన్ని కదిలించలేదు. తన రాకకు
ఇబ్బంది పడనివారి ఇంటికే అతడు వెడతాడు. తన ఇంటికి రావడానికి అభ్యంతరం లేకుంటేనే పిలుస్తాడు. ఇంటికి వచ్చేకకూడా
అడిగితేనేగాని మంచినీళ్ళు కూడా ఇవ్వడు. మంచినీళ్ళు త్రాగేటందుకు సందేహం కనబరచినా అతడు నొచ్చుకోడు.

ఆ నిర్వికార స్థితి చూసి రామనాధం సిగ్గుపడ్డాడు. అలవాటు లేకపోవడం తప్ప అభ్యంతరం ఏమిటో అతనికి తెలియదు.

"అబ్బెబ్బే! అదేమిటల్లా అంటారు? నా వరకు అటువంటి పట్టింపులేమీ లేవు" అన్నాడు.

"మరి......?"

"ఏమీలేదు. రావడమే....."

"నీ సామాను ఎక్కడుంది?....."

"రుక్కమ్మ హోటలులో పడేశాను."

"నేనిక్కడే వుంటాను. వెళ్ళి తీసుకొచ్చెయ్యి. నీతో నన్ను కూడా చూసిందేమో, మరి నీకెప్పుడూ మంచినీళ్ళు కూడా ఇవ్వదు."



ఇరవయ్యయిదు


లెవల్‌ క్రాసింగ్‌ అవతల కొద్ది దూరంలో సర్పవరం రోడ్డుమీద, విశాలమైన ఆవరణలో లోపలగా
కనిపిస్తున్న చిన్న బంగాళా పెంకుటింటి ముందు ఆగింది బండి.

"బావగారూ, దిగండి" అంటూ చంద్రశేఖరం ముందు దిగేడు. "బెడ్డింగు లోపలకి తీసుకురావయ్యా" అని బండి అతనికి పురమాయిస్తూ
"అదే మా దివ్యభవనం" అన్నాడు.

కోరడి గుమ్మానికి ఓ పాతికగజాల దూరంలో వుంది యిల్లు. అక్కడి వరకూ దారికి అటూ ఇటూ పలు ఛాయలలో ముద్దబంతిపూలూ,
చంద్రకాంతలూ, బంగాళాబంతిపూలూ బరాబరులు చేస్తున్నాయి.

కన్నుల పండువుగా వున్న ఆ దృశ్యాన్ని చూసి రామనాధం సంతృప్తి వెలిబుచ్చేడు.

"చక్కగా, ప్రశాంతంగా వుంది."

"కదూ" అని చంద్రశేఖరం ఎంతో సంతృప్తి ప్రకటించేడు.

"సునందకి పువ్వులంటే మహా ప్రాణం."

"ఆమె ఇంట్లో లేరు లాగుంది" ద్వారానికి తగిలించి వున్న తాళం చూస్తూ రామనాధం అన్నాడు.

"వుద్యోగం చేస్తోంది కదా. ఈవేళ నేను పెందరాళే వచ్చేను. గాని సాధారణంగా ఇద్దరం కలిసే వస్తుంటాం."

"మరి పిల్లవాడు?"

భార్యాభర్తలిద్దరూ వుద్యోగాలు చేస్తే పిల్లలూ, ఇల్లూ ఏమిటవుతాయనే ప్రశ్నను ఎలా పరిష్కరిస్తున్నారో రామనాధం
తెలుసుకోగోరేడు. ఆడవాళ్ళు చదువుకోవాలనీ, వుద్యోగాలు చెయ్యాలనీ తానెప్పుడన్నా అంటే తన మిత్రులు ఈ బ్రహ్మాండమైన సమస్య
తెచ్చి నోరు నొక్కేస్తున్నారు.

దగ్గరలోనే ఓ ముసలమ్మ వుంది. ఆమెకు నెలకు ఏదో ఇస్తూంటారు. ఆమె చూస్తూంటుంది. కానీ...

చుట్టుప్రక్కల యిళ్ళేం లేవు. ఒంటరితనం అనిపించదూ? ఆడా, మగా కూడా ఇల్లు వదిలిపోతే ఎల్లాగ? దొంగల బెడద వుండదా?
కాలేజీకి దూరం అయింది. రోజూ బళ్ళకి బోలెడు అయిపోతుందే? అనంత సందేహాలు.

బాగుందనే యింటిక్కూడా అనేక ఈతిబాధలు.

చంద్రశేఖరం నవ్వేశాడు. అతడు దూరంగా, ఈ ఒంటరి కాపురమే బాగుందనుకున్నాడు.

"ఏదో పోదూ, వాళ్ళనడుమ అనుకోవడమేగాని అక్కడుండేదంతా కశ్మలం."

అందని ద్రాక్షపళ్ళ రుచిలాంటి మాటకాదని ఆ యిల్లు చూస్తూనే రామనాధం గ్రహించేడు. మురుగుకాలవలూ, దుర్వాసనా లేదు. శుభ్రమైన
గాలి.

చంద్రశేఖరం చెప్పిన కశ్మలం ప్రాదేశికమే కాదు, ప్రజల మనస్సుల్లో వున్నది కూడా అతడి వుద్దేశంలో వుంది.

నిజమే. అతడు కులం తెలియని పిల్లను కట్టుకున్నాడు. కులం బలం మీద ఏర్పడిన సంఘం మధ్య వారికి నిలవ నీడ దొరకడం
కష్టం.

"అదీ నిజమేలెండి" అన్నాడు. "ఇంత అందమైన చోట వుంటే అన్నం, నీళ్ళూ కావాలనిపిస్తుందా?" అంటూ అతడు పువ్వుల మొక్కలు
చూస్తూ మురిసిపోయేడు.

అగ్రహారం ఇళ్ళల్లో కూడా ఏవో పువ్వుల మొక్కలుంటాయి. ములుగోరింట అక్కడ మహాపుష్పం. దేవపూజకి పది పవ్వులుంటాయి.
అంతకన్నా కాస్త శ్రద్ధగల వాళ్ళు ఓ నందివర్ధనమో, కరవీరమో, పారిజాతమో వేస్తారు. దేనికైనా ప్రయోజనం ఒక్కటే.
పువ్వులు పూజ కోసం. కనక తెల్లవారే సరికి మొక్కలన్నీ బోడిగా కనిపిస్తాయి.

ఇక్కడ ప్రతి మొక్కకీ ఒకటో రెండో పువ్వులున్నాయి. రంగు రంగుల పువ్వులు.

మొక్కలకు సమీపంగా వరల నుయ్యి. బారెడులో నీరు. రామనాధం చేద వేసేడు.

"నీరు బాగానే వుంది."

"ఈ నీరే మేము త్రాగేది"

ఇద్దరూ కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఇంట్లోకి వచ్చేరు.

ఇద్దరూ హాలులో వున్న కుర్చీలలో కూర్చున్నారు. చంద్రశేఖరం ఇంక మళ్ళీ మొదటికి వచ్చేడు.

"ఏమిటో ఇప్పుడు చెప్పు, కాలేజీ ఎందుకు మానినట్లు?"

రామనాధం చెప్పినంతసేపూ అతి జాగ్రత్తగా విన్నాడు. చివరకు ఒక్క ప్రశ్న వేసేడు.

"గురజాడ అప్పారావుగారనే ఆయన ఒక దేశభక్తి గీతం వ్రాశారు విన్నావా?"

రామనాధం వినలేదు. తలతిప్పేడు.

"అందులో ఆయన మీరంతా చెప్పే దేశం అంటే ఏమిటో చెప్పేరు."

"ఏమన్నారు?"

చంద్రశేఖరం గురజాడ కవి గీతం వినిపించేడు.

"దేశమంటే మట్టి కాదోయ్‌

దేశమంటే మనుజులోయ్‌"

రామనాధం కళ్ళు విప్పారితాలయ్యాయి. ఎంత గొప్ప భావం.

బంకించంద్రుడు ఆనందమఠంలో దేశానికి జోహారులర్పించిన గీతం నేడు ఒక మహోద్యమానికే తలకట్టయింది.

గురజాడకవి దృష్టిలో దేశంలోని జనతే దేశం. ఎంత ఆత్మీయత.......

"పద్యం అంతా చదవండి."

చంద్రశేఖరం జ్ఞాపకం వున్నంత వరకు చదివేడు. రామనాధం ఆలోచనలో పడ్డాడు.

"చాలా వుదాత్తంగా వుంది."

చంద్రశేఖరం ఒక్కక్షణం వూరుకొని, అతడు ఆలోచించుకొనేటందుకు అవకాశం ఇచ్చేడు.

రామనాధం గీతం చరణాలు గుర్తుచేసుకుంటూ పాడుతున్నాడు.

"స్వంతలాభం కొంతమానుకు

పొరుగువాడికి తోడుపడవోయ్‌.

--బ్రహ్మాండమైన వూహ."

ఆ పద్యంలో రామనాధాన్ని ఆకర్షించిన చరణం వింటూనే చంద్రశేఖరం విస్తుపోయేడు.

"మీరు నా చెల్లెలి భర్త కనక చెప్పవలసిన బాధ్యత కొంత నాకూ వుందనుకుంటున్నాను."

"తప్పేం వుంది?"

"మన దేశాన్ని వుద్ధరించడానికి చదువులెందుకు మానుకోవాలి? నాకర్థం కావడంలేదు. చదువు విజ్ఞానం కలిగిస్తుంది. అజ్ఞానం
అభివృద్ధిని ఎలా సాధిస్తుంది?

ప్రజలలో విపరీతమైన మూఢాచారాలు, అజ్ఞానపుటలవాట్లూ పాతుకు పోయి వున్నాయి. అంటురోగాలూ, కులమత కలహాలతో జాతి అంతా
చివికి, శిథిలం అయిపోతూంది. వాళ్ళ అజ్ఞానం పోవాలి. కులాచారాల మూర్ఖపు కట్టుబాట్లు పోవాలి. దానికి విద్య, ఆధునిక విద్య
ఒక్కటేదారి..... అదీ ఆయన అభిప్రాయం.

ఈ వారం పదిరోజులలోనూ ఈ ప్రశ్న అనేక రూపాలలో చర్చకు వచ్చింది. పాఠాంతరాలతో ప్రత్యక్షమయింది. అనేక కోణాలనుంచి
రామనాధం దానికి సమాధానాలనిచ్చేడు.

ఇంగ్లీషు చదువుకోని మన పూర్వులు అజ్ఞానులా?......కాదు.

వేల సంవత్సరాలుగా భారతదేశం అనేక నాగరికతలను కళ్ళ చూచింది. ఔను.....

ఆ మాటలనెవ్వరూ కాదనలేదు. చంద్రశేఖరమూ అనడం లేదు.

"కాలేజీ చదువూ, ఇంగ్లీషు చదువూ మాత్రమేనా విజ్ఞానం కలిగించేది?" అనే ప్రశ్నకు మాత్రం "తప్పకుండా"-- "సందేహం
ఏముందీ?"-- "ఇంకా అనుమానమా?" వంటి సమాధానాలనే ఇచ్చేడు.

"ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలో వాళ్ళు నిధులు"--అన్నాడు.

రామనాధం దానిని అంగీకరించలేదు. వాళ్ళకి విజ్ఞాన శాస్త్రాల పరిజ్ఞానం వుంటే మాత్రం మనకేం వొరుగుతుందన్నాడు.

"తమకు కావలసిన గుమస్తాలను తయారు చేసుకొనేటందుకు విదేశ పాలకులు తయారుచేసిన పథకం కాదా యిది, మెకాలే...."

"మెకాలే ఏమన్నా అననీ, అనుకోనీ. వాళ్ళు ఏ వుద్దేశంతో ఈ చదువులు ప్రవేశపెట్టినా, ఆ చదువులే మన కళ్ళు తెరిచాయి."

అది చంద్రశేఖరం అచంచల విశ్వాసం-- "గురజాడ కవి చెప్పినట్లు దేశం అంటే ప్రజ. దేశం బాగుపడడం అంటే ప్రజలు
బాగుపడటం. వాళ్ళలో విజ్ఞానం కలగాలి. మూఢాచారాలు పోవాలి. అప్పుడే ప్రజలు, దేశం బాగుపడుతుంది."

అంతవరకే అయితే రామనాధానికీ అభ్యంతరం లేదు. "కాని, అదొక్కటే కర్తవ్యం అంటే ఎల్లాగ?"

రామనాధం అతని మాటలనే మరొక దృక్కోణంలోంచి వివరించి చంద్రశేఖరం వాదాన్ని అతనికే ఎదురుతిప్పేడు.

దేశం అంటే ప్రజ. ప్రజలు బాగుపడడమే దేశం బాగుపడడం. ఈవేళ దేశం మహా దారిద్య్రంలో వుంది. తిండిలేనివాడు చదువు ఏం
చదువుతాడు? వానికి తిండి కలిగించాలి. తిండిలేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని తొలగించాలి. అందుకే గాంధీజీ ఖద్ధరు ఉద్యమమూ,
సహాయనిరాకరణమూ అన్నారు--అని అతని వాదం.

సమస్య మెలితిరిగింది. ఏది ముఖ్యం? కడుపునకు తిండా? మెదడుకు పుష్టియా? ఏది ముందు? ఏది వెనుక?

ఆంగ్లేయుల వైజ్ఞానిక సంపదమీద బావగారికిగల అభిమానాన్ని తగ్గించేటందుకు రామనాధం ఎత్తుకున్నాడు.

"మన పూర్వులు చాలా మేధావంతులు. పాశ్చాత్యులు నేడు సాధించేమన్న శాస్త్రజ్ఞానం మనవాళ్ళకి ఏనాడో వుంది...."

చంద్రశేఖరం చిరునవ్వు నవ్వేడు.

"వారి శాస్త్రపరిజ్ఞానము గురించి ఈవేళ కొలతలు తియ్యడం సాధ్యం కాదు. కనక వొప్పేసుకొందాం. పేచీలేని పని, కాని బావా!
ఈనాడు మన స్థితి ఏమిటి? మా తాతలు నేతులు త్రాగేరు. మా మూతులు వాసన చూడమనా?"

రామనాధం తన వుత్సాహం నుంచి ఇంకా తేరుకోలేదు.

"మనం మహాభారత యుద్ధ కాలం నాటికే....."

"ఇంగ్లీషువాళ్ళకి గోచీ పెట్టుకోవాలనే జ్ఞానం కూడా లేదు...." అని చంద్రశేఖరం ఆ భావాన్ని పూర్తి చేశాడు.

"కాదంటారా?"

"ఎందుకనాలి? ఎంతో ఆలస్యంగా మేలుకున్నా వాళ్ళు మనల్ని మించిపోయేరు."

రామనాధం ఆ మాటల్ని అంగీకరించే ధోరణిలో లేడు. ప్రాచీన కాలంలోనే భారతీయులు నౌకలపై దేశవిదేశాలతో వర్తక వాణిజ్యాలు,
సంస్కృతీ ప్రచారం సాగించిన కథల నాతడెన్నింటినో చదివేడు. వేలి వుంగరంలోంచి ఏడెనిమిది మూరల కట్టుబట్ట దూర్చేటంతటి సన్న
వస్త్రాలు తయారుచేసిన నిపుణుల కథలూ చదివేడు. విన్నాడు. తాజ్‌మహల్‌ వంటి సుందర నిర్మాణం అనాగరికుల
పనా?

చంద్రశేఖరం నవ్వేడు.

"తాజ్‌మహల్‌ను నిర్మించిన శిల్పిని గురించి కాదు, మనం మాట్లాడుతున్నది. ఈనాడు ఈ దేశపౌరులమయిన మన
స్థితి ఏమిటని ప్రశ్న."

రామనాధం వెనకడుగు వేయనే లేదు.

"ఆధ్యాత్మిక సంపదలో మనం వాళ్ళకన్న చాలా ఉన్నత దశలో వున్నాం."

నిజంగా నమ్మకంతోనే చెప్తున్నావా ఆ మాట అన్నట్లు చంద్రశేఖరం నిశితంగా చూసేడు.

"మన ఆధ్యాత్మిక సంపద ఏ మాత్రం పటిష్ఠంగా వుందో మీ గాంధీగారి అస్పృశ్యతా నివారణ ప్రయత్నాలకు లభిస్తున్న ఆదరణ
చెప్పడం లేదూ?"

రామనాధం ఉడికిల్లేడు.

"తెల్లవాళ్ళు దక్షిణాఫ్రికాలో అల్లాంటిపనే చెయ్యడం లేదూ?"

"గాంధీగారిని దర్బాన్‌లో అవమానించేరు గనక ప్రతీకారంగా ముంగండ చెరువులో పంచములని మంచినీళ్ళు ముట్టుకోకూడదని నిషేధం
పెట్టేరా?"

తన వరకూ, తన గ్రామం వరకూ వచ్చేసరికి రామనాధం చల్లబడ్డాడు. చంద్రశేఖరం వెంటనే సర్దుకొన్నాడు.

"మన లోపాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడంలో తప్పు లేదు. ఆ ప్రయత్నంలో మన లోపాల్ని దిద్గుకోగలమనే ధైర్యం వుంటుంది.
వెనుకటి రోజులు తలుచుకొని, మురిసిపోవడం మన పతనానికి ఒక మెట్టు. మనం నేర్చుకున్న మంచినికూడా మరచిపోడానికి అది ఒక
దారి...."

అంటూ తన ముఖంలోకి చూస్తుంటే ఆ మాటలలో ఏదో ప్రత్యేకమయిన అర్థం వున్నట్లనిపించింది.

ఉదాహరణకి... అంటూ చంద్రశేఖరం తన జేబులోంచి ఒక శుభలేఖ తీసి చేతికిచ్చాడు.

రామనాధం చదివి తిరిగి ఇచ్చేశాడు. తాను మాట్లాడడానికి వచ్చిన సమస్యను ఎలా ప్రారంభించాలో అర్థంగాక
కొట్టుమిట్టాడుతున్నవాడికి దారి దొరికినట్లయింది.

"ఔను."

"చూడు, నీ పెండ్లికి పూర్వమూ, తర్వాతా కూడా నాతో కొన్ని విషయాల మీద చర్చ వేసుకొన్నావు. జ్ఞాపకం వుందా?"

తొమ్మిది పదేళ్ళ చెల్లెలికీ, పదిహేను, పదహారేళ్ళ వయస్సున్న తనకూ వివాహం కుదిర్చింది చంద్రశేఖరమే. అప్పుడు తాను
అమలాపురం హైస్కూలులో చదువుతున్నాడు. ఓ రోజున ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో తన్ను చూసేడు. పరిచయం
అయింది. ఆ క్షణం నుంచి తమకు పెళ్ళి కావడానికి పదిహేనురోజులే వ్యవధి. ఆ పదిహేనురోజులూ అతడు తన్ను విడువలేదు.
పెళ్ళిళ్ళ వయస్సు గురించి తాను చెప్పినవన్నీ అతడు ఒప్పుకొన్నాడు. తాను చిన్నతనపు పెళ్ళిళ్ళంటే అయిష్టం చూపించేడు. అయినా
తాను మెత్తబడ్డాడు. దానికి చంద్రశేఖరమే ప్రధాన కారణం.

తాను పెళ్ళిచేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన తనను పెళ్ళికి వొప్పించేడని తర్వాత అనుకొన్నాడు. లేకపోతే సుందరికి పెళ్ళి కావడం
సాధ్యం కాదు. అన్న కులాంతరురాలని పెళ్ళి చేసుకోవడం ఆమె పెళ్ళికి పెద్ద ఆటంకం అయి కూర్చుంటుంది. అందుకే తన్ను వొప్పించేడు.
ఇరవయ్యేళ్ళు వచ్చేక మగవాడు పెళ్ళి చేసుకొంటానంటే స్త్రీకి 15-16 ఏళ్ళుండాలిసుంటుందని వాదం తెచ్చాడు. సంఘంలో పదేళ్ళకుమించి
ఆడపిల్లల్ని వుంచడం లేదు, గనక ఇరవయ్యేళ్ళవాడు తనకంటె పది పన్నెండేళ్ళ చిన్నపిల్లను కట్టుకోవలసి వుంటుంది. అది
సరికాదన్నాడు.

ప్రస్తుత స్థితిలో పెళ్ళికి ప్రధానంకన్నా విలువలేదన్నాడు. సంసారం ప్రారంభించడం ఇరవయ్యేళ్ళు దాటాకనయితే తన విశ్వాసం
నిలబడ్డట్లేనంటూ ఒక్క ప్రశ్న వేసేడు.

"నీకు నా చెల్లెలు నచ్చిందా?"

నచ్చడం ఏమిటి, చాలా బాగా నచ్చిందనుకొన్నాడు రామనాధం.

"ఊ."

"అయితే చేసుకో. లేకపోతే మా నాన్న వుంచడు. పెళ్ళికాక పూర్వమే రజస్వల అయిపోతే ఆయన పూర్వులకు పుట్టగతులుండవని
ఆయన భయం."

సుందరి కావాలనుకొంటే తాను వెంటనే పెళ్ళిచేసుకోవలసిందేనన్నాడు. వాయిదా వేయడం ఆమె మీద ఇష్టం లేదనుకోవాలన్నాడు.

పదిహేనేళ్ళవాడికి పదేళ్ళ పిల్లమీద ఇష్టం వుండడం, లేకపోవడం ఏమిటో ఆతడు ఆలోచించగల స్థితి లేదు. ఊళ్లో వున్న
ఆడపిల్లలకన్న సుందరిలో ప్రత్యేకత ఏమిటో తెలిసే వయస్సూ, అనుభూతం అయ్యే వయస్సూ కాదు. కాని సుందరిని
చెయ్యిజారిపోనీకూడదనుకున్నాడు.

సరేనన్నాడు.

ఆనాడు తొందరపెట్టినవాడు ఈ రోజున "సుందరి వయస్సెంత? నీ వయస్సేమిటి?" అంటున్నాడనిపించింది.

"చదువు పూర్తి చేసుకోకుండా అప్పుడే సంసారం ఏమిటి?" అన్నాడు చంద్రశేఖరం.

"ఆ విషయం మీతో మాట్లాడాలనే వచ్చేను. మీ చెల్లెలు చిన్నపిల్ల, నేనూ ఆ మాటే అన్నాను. ఇప్పుడు కాదంటే విపరీతార్ధాలు
తీస్తున్నారు. మగతనం లేక టలాయిస్తున్నానంటారంటారు బాబాయి. ఆ పిల్ల అంటే ఇష్టంలేక టలాయిస్తున్నానంటారు పెద్దనాన్న."

అదంతా చిత్రంగా వినిపించింది చంద్రశేఖరానికి.

"నువ్వు మా నాన్నగారితో చెప్పకపోయావా? చెప్పించకపోయావా?"

"నా అభ్యంతరం మా బాబాయి తెలుపుతారనుకొన్నాను. తెలుపమన్నాను. కాని మీ వుత్తరం చూస్తే చెప్పినట్లు లేదు. లేక చెప్పినా
లెక్క చెయ్యలేదో. పరిస్థితులు చెప్పి మీ నాన్నగారికి వ్రాయించడానికే వచ్చేను."

"ఇష్టం-అయిష్టం మాటెందుకు వచ్చింది?" అని చంద్రశేఖరం ముందుమాట గుర్తు చేసుకొన్నాడు.

"నేను సహాయనిరాకరణం చేశాను."

"అయితే?"

"మీ నాన్న పోలీసు ఆఫీసరు. బ్రిటిష్‌వాళ్ళ వుద్యోగి."

"ఓహో."

సావధానంగా జరిగిందంతా విన్నాక చంద్రశేఖరం అసలు పరిస్థితి అర్ధం అవుతూందనుకొన్నాడు. కాలేజీ మానడానికీ, ఈ శుభకార్యం
తలపెట్టడానికీ ఎక్కడో సంబంధం వుందనిపించింది. కానీ, అదెటువంటిదో అర్థం కాలేదు.

అయితే చంద్రశేఖరానికి తండ్రి స్వభావం తెలుసు. అల్లుడు సత్యాగ్రహం చేస్తే తన వుద్యోగానికి ఏం ప్రమాదమోనని భయపడే
మనిషి. అదొక్కటే అయితే ఒక విధం. బ్రిటిష్‌ పరిపాలన పోవాలనే వాళ్ళు వట్టి సన్యాసులని ఆయన ఖచ్చితమైన
అభిప్రాయం.

ఆయన తన కూతుర్ని సత్యాగ్రహి అల్లుడి దగ్గరకు కాపురానికి పంపనన్నాడంటే నమ్మగలడు. కాని ఇదేమిటి? తన
అలవాట్లకూ, అభిప్రాయాలకూ విరుద్ధంగా ఈ కార్యం తలపెట్టడం ఏమిటి? ఈ తొందర ఎందుకు? అల్లుడు కాలేజీ మానినట్లెరగడా?

చెప్పలేదన్నాడు రామనాధం. అతడింతవరకు అమలాపురం వెళ్ళనే లేదు.

"కాని తెలియకుండా వుండడం సాధ్యం కాదు. ఆ అవసరం మాత్రం ఏముంది?" అన్నాడు.

చంద్రశేఖరం ఆలోచించేడు. ఆయనకు తెలియకుండా వుండడం సాధ్యం కాదు. ఇంకా గొడవయ్యాకనయితే కూతురు కాపురం చెడుతుందని తల్లి
చేసిన ఏర్పాటేమోననిపించింది. ఆలోచించిన కొద్దీ అదే స్థిరపడింది. 'అంతే' అనుకొన్నాడు.



ఇరవయ్యారు


వంట మధ్యలోనే సునంద వచ్చేసింది. గుమ్మంలోంచే పలకరించింది.

"ఈ వేళ బాగా పొద్దుగల్లనే వచ్చేశారన్నారు. ఎక్కడికెళ్ళేరో అనుకున్నా" నంటూ ఆమె సావట్లో అడుగుపెట్టింది.

అక్కడ భర్తతో మరొకరు కూడా వుండడం గమనించి ఒక్కక్షణం ఆగింది.

ఆమె మాట వినబడగానే చంద్రశేఖరం సంతోషంతో లేచేడు.

"అదిగో ఆమె కూడా వచ్చేసింది" అంతలో గుమ్మంలోపల అడుగుపెట్టి ఆమె నిలబడిపోవడం చూసి నవ్వేడు.

"నందా! ఈతడెవరో ఎరుగుదువా?" అన్నాడు.

సునంద లోనికి వచ్చి చేతులు జోడించి, నమస్కారం చేసి తనకు తెలియదన్నట్లు తల తిప్పింది.

చంద్రశేఖరం నవ్వేడు. రామనాధం లేచి తానే పరిచయం చేసుకొన్నాడు.

"మీరు నన్నెరగరు. రామనాధం నా పేరు. వీరి చెల్లెల్ని....."

చంద్రశేఖరం మాట మధ్యలోనే అందుకొని "మా చెల్లెలి మగడు." అన్నాడు.

"శేఖరం గారు చెప్తూంటారు. వినడమేగాని చూడలేదు" అంది పరిచయం లేమికి క్షమాపణ చెప్పుకొంటున్నట్లు.

శేఖరం అంటే ఎవరో అతనికి అర్థం కాలేదు. అలవాటులేమిని భర్తనే ఆమె పేరున పిలుస్తూందని తోచలేదు. "శేఖరంగారు ఎవరు?"
అన్నాడు.

"మీ బావగారే. రోజూ ఓమారేనా మీ ప్రసక్తి తెస్తూంటారు. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో మొట్టమొదటి మారు
బంతి అందివ్వడం అందుకోవడంతో మీకు పరిచయం అయిందిట కదూ."

రామనాధం నవ్వేడు.

"మరిచిపోలేదన్నమాట" అన్నాడు చంద్రశేఖరం వేపు చూస్తూ.

"ఎల్లా మరిచిపోతాను. ఆ చిన్న వూళ్ళో అంత ఆటగాడు కనబడతాడనుకోలేదు"

"అదేమిటండీ, అమలాపురం హైస్కూలు జట్టుకు ఫుట్‌బాల్‌లో జిల్లాలు దాటి పేరుంటేను."

"ఇప్పుడే వస్తున్నా, కూర్చోండి" అంటూ వారిని కబుర్లకి వదిలేసి సునంద లోనికి వెళ్ళింది.

ఆమె పదినిముషాలలో వచ్చినప్పుడు కొత్త మనిషిలా కనబడి రామనాధం ఆశ్చర్యంగా చూసేడు. అంతకు పూర్వం ముఖంలో కనిపించిన
నలుగుడు, అలసట అంతర్ధానమయ్యేయి. ముఖంలో దీప్తి, హుషారు కనిపించాయి. బట్టలు మారిపోయాయి. మనిషే కొత్తగా వుంది. ఆమె
గదిలోకి వస్తూనే అడిగింది.

"మీరు ఏమన్నా తీసుకొన్నారా? వట్టినే కబుర్లు చెప్తూ కూర్చోబెట్టేరా?"

వారు ఏమీ తినలేదని విని చాలా నొచ్చుకొంది. గబగబా లోనికి వెళ్ళి రెండు ప్లేట్లలో బిస్కట్లు పెట్టి వారి ఎదుట పెట్టింది.

"తీసుకోండి, చా చేసి తీసుకొస్తా."

"తీసుకురా, ముగ్గురం కలిసే త్రాగుదాం." అన్నాడు చంద్రశేఖరం.

ఆ యువదంపతుల జీవిత పద్ధతి చూస్తూంటే రామనాధానికి అంతా కొత్తగానే వుంది. సిగ్గుపడుతూ, ఏదో మూల ఒదిగి కూర్చోకుండా ఆమె
టీ కప్పుతో వచ్చి భర్త పక్కనే సోఫాలో కూర్చుంది. పరాయివాళ్ళముందు అంతగా మగణ్ని ఆనుకున్నంత దగ్గరగా కూర్చుని కబుర్లు
చెప్పడం సిగ్గుమాలినతనంగా భావించాలో, జీవితానందాన్ని అనుభవించడంగా అర్థం చేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. వాళ్ళముందర తాను
సహజంగా ప్రవర్తించలేకున్నాడు. తాను వారి మధ్య సత్రకాయలా వున్నాననిపిస్తోంది.

అతని పరాకు ఏమిటో సునంద సులభంగానే కనిపెట్టేసింది. తమ అలవాట్లు అతనికి కొత్తగా వున్నాయనీ, ఉక్కిరిబిక్కిరి
చేస్తున్నాయనీ గ్రహించింది.

ఏదో పనిమీద లేచినట్లు లేచి ఈ మారు వేరే కుర్చీ లాక్కుని కూర్చుంది. రామనాధానికి కష్టం తోచింది. తన రాక వారికి ఇబ్బంది
కలిగిస్తోందనుకొన్నాడు.

మామగారు వ్రాసిన జాబు చూసేక సునంద అభినందనలు తెలిపింది. చంద్రశేఖరం నవ్వేడు.

"వారు తమ చెల్లెల్ని ఇంతవరకూ చూపించలేకపోయేరు. మీరేనా మీ భార్యను తీసుకువస్తారా?" అంటూ రామనాధాన్ని సూటిగా అడిగింది.

చంద్రశేఖరం తమ సంభాషణ సారాంశం అంతా చెప్పేక ఈమారు నవ్వడం వంతు ఆమెదయింది.

"మామగారి ఎత్తు చాలా పెద్దదే. చూడలేదుగాని, మా ఆడపడుచు ఎలా వుంటారు?

తనకు నచ్చిందా, రూపురేఖలు ఎలా వుంటాయని ప్రశ్నించినట్లనిపించి రామనాధం సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గులో ఆమె మొదటి వాక్యం
అర్థం గురించి ఆలోచన తట్టలేదు.

"ఆ వయస్సులో సరిగా అలాగే వుండేవాడిననేది మా అమ్మ."

చంద్రశేఖరానిది చూడముచ్చటయిన ఆకారం. సునంద కళ్ళతోనే నవ్వింది.

"మరింకేం. నేనూ అదే అనుకున్నా."

ఆ సంభాషణ వెనకనున్న కొంటెతనమూ, అప్యాయమూ ఛాయగా చెవులకి తగిలి రామనాధం మనస్సులోనే ఆనందించేడు. తన సమాధానంలోని
కొంటెతనం కనబడకుండా సర్దడానికి చంద్రశేఖరం చెల్లెలి గుణవర్ణన ప్రారంభించేడు.

"ఆ చాదస్తపు ఇంట్లో వుండడం చేత రాణింపుకు రావడంలేదుగాని చాలా చురుకైనది. ఈడుకు మించిన తెలివి వుంది. చదివించి వుంటే చాల
పైకి రాగల వూహ వుంది."

"తమ్ముడుగారే చదివించుకోవచ్చు కదా...."

ఆ అభిప్రాయం బాగానే వుంది అనిపించింది చంద్రశేఖరానికి. ఉద్యమాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా తన తండ్రి లంగరులాగ సుందరిని
వుపయోగించతలచినట్లు సునంద సూచనను పట్టి అతడు గ్రహించేడు. అదీ బాగానే వుందనిపించింది.

కారణం ఏదయినా తాను చెప్పదలచిన మార్గమూ అదే.

అయితే రామనాధం ఆ అభిప్రాయాన్ని అంగీకరించలేకపోయాడు. చదువు చెప్పించుకోడానికి భార్యను తెచ్చుకోమన్న సలహా అతడికి ఏ
మాత్రం నచ్చలేదు.

"ఇందాకా ఏమన్నారో జ్ఞాపకం వుందా?"

చంద్రశేఖరం అంగీకరించేడు.

"కాని స్థితిగతులు...."

ఆ స్థితిగతుల్ని అనేక దృక్కోణాలనుంచి వివరించేడు.

రామనాధం రాజకీయాలు తన తండ్రికి నచ్చవు. ఆయనకు ఈ స్థితి తెలుసో, తెలియదో. ఏ కళనున్నాడో కూతుర్ని
పంపేస్తానంటున్నాడు. తెచ్చేసుకోవడమే మంచిది.

ఆ సలహా తన మగతనానికే పెద్ద అవమానంగా భావించి రామనాధం ససేమిరా అన్నాడు.

మగడు తీసుకెళ్ళడేమోనన్న భయం ఆడపిల్లవాళ్ళకుండాలేగానీ, తనకు బెదురేమిటనిపించింది. అటువంటి భయం కలిగించబోవడం చూసి,
చంద్రశేఖరం తనను వెర్రి పప్పాయిగా భావించడం లేదుగదా అనిపించింది.

కాని, ఆ దంపతులిద్దరూ ఏకకంఠంతో అదేమాట చెప్తూంటే ఆ విధంగా అనుమానించలేకపోయేడు.... అయినా....

ఆపద్ధర్మం పేరుతోనైనా తప్పు అనుకొంటున్నది చేయవలసిందేనా?

"అక్కడే నీ నిగ్రహం...."

--అంటూ చంద్రశేఖరం వుపదేశం చేస్తూంటే రామనాధానికి చాల విసువే కలిగింది.

ఒకే ఇంట వుండడం, ఏకశయ్య--కాని దాంపత్య జీవితం నుంచి నిగ్రహం సులభమేనా? సులభమేననుకొన్నా ఆమె ఏమనుకొంటుంది? ఎంత
గొడవ జరిగిపోతుంది?

ఆ మాట నిజమేనని చంద్రశేఖరం ఒప్పుకొన్నాడు. కాని--

ఈమారు మరో భయం సూచనగా తెచ్చేడు.

ఆ యింట్లో దేవతాపూజలూ, నోములూ, వ్రతాలూ, చాదస్తాలూ మాత్రమే పట్టుబడతాయి. ప్రపంచం ఏమిటో తెలియదు. ఇదే నేర్చుకొనే
వయస్సు. ఆమెనిప్పుడు తెచ్చుకోవడం మంచిది.

"సంగతులన్నీ చెప్పు, చదువు చెప్పుకో...." అంటున్నాడు.

వీధిలోనుంచి 'అమ్మా' అని కేకపెడుతూ కేశవచంద్ర తుఫానులా పరుగెత్తుకొని వచ్చేడు.

సునంద ఎదురెళ్ళి ఎత్తుకొని, అతనిని గుండెలకదుముకుని ముద్దు పెట్టుకుంది.

"చూడు ఎవరొచ్చేరో చెప్పుకో?"

ఆమె దగ్గరకు తీసుకువచ్చి నమస్కారం పెట్టించింది. "మామయ్య"

రామనాధం వానిని దగ్గరకు తీసుకొని చేతిలో ఓ అయిదు రూపాయలు పెట్టేడు.

"నీ మాటే గుర్తులేకపోయిందోయి."



ఇరవయ్యేడు


తాను వచ్చిన పని నెరవేరలేదు. అమలాపురంలో వాళ్ళ ప్రయత్నాలు వారు చేసుకుపోతున్నారు. ఇప్పటికే దానిని నిరోధించగల
అవకాశం దాటిపోయినట్లు అనిపిస్తూంది. ఇంక తను ఏమన్నా పెద్ద గొడవ అయిపోతుంది. కాని ఏమి చెయ్యాలి?

"ఆపద్ధర్మం పేరుతోనైనా తప్పు అనుకొన్నవి చేయవలసిందేనా?"

రాత్రి భోజనం వేళ చంద్రశేఖరం కొత్త దిశనుంచి కవ్వించేడు.

"నువ్వు బయటపడేందుకొక్కటే మార్గం. సునంద వడ్డిస్తూంటే నీ మేనల్లుడి పంక్తిని కూర్చుని భోజనం చేసినట్లు కబురందిస్తే
బయటపడతావు."

"శాశ్వతంగా దూరంగా వుంచుతారేమో మీ చెల్లెల్ని...." అంటూ సునంద భయం ప్రకటించింది.

"తాను సిద్ధంగా వున్నప్పుడు బావగారు ఓ చిన్న ప్రాయశ్చిత్తకాండకి తయారయితే మళ్ళీ సర్దుకొంటాయి" అని చంద్రశేఖరం
పరిష్కారమార్గం సూచించేడు.

"ఇప్పుడు నేను చేస్తున్న పని తప్పు అని ఒప్పుకోవాలా?"

"లండన్‌ వెళ్ళి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే, అదెంత అపరాధమో ఇదీ అంతే, మూర్ఖత్వాలకి హేతువులతో
నిమిత్తం వుండదు. కొన్నింటికి చూసీ చూడనట్లు సర్దుకుపోతూంటే తప్ప అడుగెయ్యలేం." అన్నాడు చంద్రశేఖరం.

కాని సునంద ఆవిధంగా సర్దుకుపోవాలనే భావాన్ని అంగీకరించలేదు.

"మీరు అలాగ సర్దుకుపోలేదేం?"

చంద్రశేఖరం నవ్వేడు.

"సర్దుకుపోయేటట్లూహిస్తే, బాబిగాడికి వాళ్ళ మామయ్య కులం చెడగొట్టే ఛాన్సు వుండేది కాదు."

కాని, సంభాషణ సాగినకొద్దీ సమస్యలంత సున్నితంగా పరిష్కారం గావనిపించి చంద్రశేఖరం ఆలోచనలో పడ్డాడు.

రామనాధం తొందరపాటు మనిషిగాకపోయినా నిశ్చితమయిన అభిప్రాయాలు గలవాడు. తన ఇంటివద్ద మనుష్యుల స్వభావం ఎరిగిన
చంద్రశేఖరానికి ప్రస్తుతం నడుస్తున్న పద్ధతిలో తన చెల్లెలు కుటుంబ జీవితం భగ్నమైపోయే ప్రమాదం వున్నదనిపించింది.

తాను చేస్తున్నది తప్పుకాదనిపించినాక రామనాధం వెనకడుగు వేయడు. తాను వేళాకోళానికన్న మాట కూడా నిజమయి ఇదివరకే వున్న
చిక్కులకు మరొకటి కూడా తోడవుతున్నట్లనిపించింది.

మేనల్లునితో కబుర్లు చెపుతూ చెపుతూ చటుక్కున సునందను అడిగేడు.

"మీరేమంటారు?"

"ఇల్లాంటివి పైవాళ్ళు చెప్పదగినవి కాదు. ఎవరికివారు ఆలోచించుకోవలసినవి గాని." అంది ఆమె.

రామనాధం చటుక్కున కుడిచేతి చూపుడువ్రేలూ, మధ్యవేలూ ముందుకు చాపి మేనల్లుడికి చూపేడు.

"గమ్మున నీకు తోచిన వేలు పట్టుకోవోయ్‌?"

చంద్రశేఖరం, సునంద ఫక్కున నవ్వేరు-- "లాటరీ వేస్తున్నావా?"

"ఏం చెయ్యను? మీరు చెప్పింది నాకు నచ్చడం లేదు. నామాట మీదే కూర్చుంటే చాల మందితో విరోధం కొని తెచ్చుకోవలసి వుండేలా వుంది.
ఈ దశలో లాటరీ తప్ప మార్గం ఏం వుంది?"

కేశవచంద్ర మేనమామ ఆదేశాన్ని పాటించేడు. రామనాధం నవ్వేడు.

"మీవాడు ఆదర్శం వొదులుకోవద్దన్నాడు."

చంద్రశేఖరం ఆదుర్దాతో ప్రశ్నించేడు.

"కొంపతీసి ఆలోచన, హేతువాదం కట్టిపెట్టేసి ఈ లాటరీ మీద ఆధారపడి పనిచేస్తావేమిటి?"

"ఇంతకన్న మంచి మార్గం తోచకపోతే నామాట మీదనే వుండదలచుకొన్నాను. అంతే."

తెల్లవారగట్ల రైలుస్టేషనుకి దిగబెడుతూ చంద్రశేఖరం మరల ఒకమారు హెచ్చరించేడు.

"నాకు తోచినంత వరకు సుందరిని తెచ్చేసుకోమనే అంటాను. మా నాన్నకి వ్రాస్తాననుకో. కాని, మా మధ్యనున్న సయోధ్యల దృష్ట్యా
అది జరగదు. ఆలోచించుకో, మరెవరినేనా అడుగు."

"మీకంటె నాకు ఈ విషయంలో అడగడానికి చనువున్న సన్నిహితులెవరున్నారు? కానీండి."

బండి కదిలే వరకూ చంద్రశేఖరం అక్కడే నిలబడి ఆ కబురూ ఈ కబురూ చెప్పేడు.

ఇంటికి తిరిగి చేరుకొనేసరికి సునంద అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుని వుంది.

"వెళ్ళేడా?"

పరధ్యానంగానే సమాధానం ఇచ్చేడు. "ఆ". ఉభయులూ ఒకనిమిషం వూరుకున్నాక మరల చంద్రశేఖరం ప్రారంభించేడు.

"హఠాత్తుగా నాన్నగారికి ఈ ఆలోచన ఎందుక్కలిగిందోగాని, చెల్లాయి చిక్కుల్లో పడుతుంది. ఇంత చిన్న విషయంమీద ఒక సంసారం
భగ్నమయిందంటే సిగ్గుచేటు."

"అంత మంచిగా, నెమ్మదిగా కనిపించినవాడు ఎంత పట్టుదల చూపుతున్నాడు?" అంది సునంద ఆశ్చర్యంతో.

"అతనికి నచ్చచెప్పగల కీలకం మనకి దొరకలేదు." అని చిరాకుతో చొక్కావిప్పి సోఫాలో గిరాటువేసి హాలులో అటూ ఇటూ పచార్లు
ప్రారంభించేడు చంద్రశేఖరం.



ఇరవయ్యెనిమిది


రాజమండ్రి స్టేషనులో దిగే వరకూ అక్కడ ఏం చెయ్యాలో రామనాధానికి ఓ ఆలోచన అంటూ లేదు. తన తమ్ముడు వెంకటరమణను
చూడడం ఒకటి ముఖ్యం.

బెడ్డింగు కూలివాని నెత్తికెత్తి కాలేజీ హాస్టలుకు బయలుదేరాడు. గేటులోకి వచ్చేసరికి రాజరత్నం ఎదురయ్యేడు. అతడు హాస్టలులో
తన పక్క గదిలోనే వుండేవాడు, కూలివాని నెత్తిన బెడ్డింగు పట్టించుకొని వస్తున్న మిత్రుని చూసి అతడెంతో వుత్సాహం
ప్రకటించేడు.

"వచ్చేశావట్రా. చాలా మంచి పని చేశావు. నా గదిలో పెట్టించు."

తన పాత మిత్రుని కలుసుకొన్న ఆనందంలో అతని మాటలలోని ప్రత్యేకతను రామనాధం గ్రహించలేదు.

"మా తమ్ముడు"

"తమ్ముడెక్కడికీ పోడులే. రా!" అని రాజరత్నం అతనిని తన గదికే తీసుకుపోయేడు.

రామనాధం వెళ్ళిపోయినాక కాలేజీలో జరిగిన ఘటనలన్నింటినీ రాజరత్నం పదినిముషాలలో వివరించి కర్తవ్యం నిర్దేశించేడు.

"పోయి వెంటనే ప్రిన్సిపాల్‌ని చూడు."

రామనాధం వంటి విద్యార్థి కాలేజీ, చదువూ మానడం ప్రిన్సిపాల్‌కు ఎంతో అసంతుష్టి కలిగించింది. ఏదో తాత్కాలికావేశంలో
తొందరపడి వుంటాడనీ, పేరు తీసెయ్యకుండా కొన్నాళ్ళు చూసి, తిరిగివస్తే చేర్చుకుందామనుకుంటున్నాడనీ రాజరత్నం వార్త.

అసలటువంటి ప్రశ్న రావడమే రామనాధానికి చాలా అవమానకరం అనిపించింది. తాను వట్టి అనాలోచనాపరుడనుకోవడం చిన్నతనంగా
తోచింది.

"ఆ రోజున బహిరంగ సభలో చప్పట్లు కొట్టించుకొని...."

రాజరత్నం హేళనగా నవ్వేడు.

"ఆ చప్పట్లు కొట్టింది అభినందిస్తూననుకోవడం చేతనే ఈ పుట్టి మునక, పెళ్ళిభోజనాలూ, విందుల్లో గోవిందా కొడతారు ఎరగవూ!
దానికీ దీనికీ అర్థం ఒక్కటే. 'ఓరి చవట పెద్దమ్మా! నీ బ్రతుకింతే సుమా' అని తాటేకులు కట్టిన చప్పుడురా నాయనమ్మా!
అది."

ఆ రోజున సహాయ నిరాకరణ ప్రకటించిన అయిదుగురిలో మంగరాజు నాలుగోరోజున వచ్చి కాలేజీలో చేరిపోయేడు.

రామనాధానికి చాలా ఆశ్చర్యం కలిగింది. నిజానికి ఆరోజున తనకు హుషారునిచ్చింది ఆ మంగరాజే.

"నిజంగా?"

"వెళ్ళి తెలుసుకో"మన్నాడు రాజరత్నం నిర్లక్ష్యంగా.

నాలుగోరోజున మంగరాజును వాళ్ళ నాన్నగారు కారులో కూర్చోబెట్టుకొని కాలేజీకి తీసుకొచ్చేరు. ఇద్దరూ సరాసరి ప్రిన్సిపాలు గదిలోకి
వెళ్ళేరు. అక్కడినుంచి మంగరాజు క్లాసులోకి ఎలా వచ్చేడో, వాళ్ళ నాన్నగారు కారులో ఏ విధంగా నిష్క్రమించేరో రాజరత్నం
సాభినయంగా వివరించేడు.

"వెంకటేశ్వర్లు నిన్న వచ్చేడు. సూపరింటెండింగ్‌ ఇంజనీరు కొడుకు గనక మంగరాజును మాట్లాడకుండా చేర్చుకొన్నారుగాని,
వెంకటేశ్వర్లుగాడికెవరున్నారు? వట్టి అనాధప్రేతం. కనక సంజాయిషీ అడిగి, పదిహేను రోజులు సస్పెండు చేశారు.

ఆ అన్యాయానికి రామనాధం చాల బాధపడ్డాడు.

"అంటే పరీక్షకు కూర్చోడానికి వీలు లేకుండేటన్ని రోజులు సస్పెండు చేశారు. వాడు నెత్తిన గుడ్డేసుకొని పోయేడు."

"మీరంతా చూస్తూ కూర్చున్నారు."

"ఏం చెయ్యమంటావు? ఆ నక్కకోసం మమ్మల్ని తోకలు తెగ్గోసుకోమంటావా?"

పది పన్నెండేళ్ళక్రితం ఇదే కాలేజీలో గాడిచర్ల హరిసర్వోత్తమరావనే ఆయన వందేమాతరం బాడ్జి పెట్టుకు వచ్చినందుకు
ప్రిన్సిపాలు ఆయనను సస్పెండు చేశాడు. ఆ శిక్షను వ్యతిరేకిస్తూ కాలేజీలో పెద్ద తిరుగుబాటే వచ్చింది. దాని ఫలితం చాలావరకు
వెళ్ళింది కూడా. న్యాపతి సుబ్బారావుగారి వంటి ప్రముఖులు కదిలేరు. ప్రభుత్వం మోచర్ల రామచంద్రరావుగారితో విచారణ కమిటీని
వేయవలసి వచ్చింది.

ఆ విధంగానే విద్యార్ధులు నేడు కూడా ప్రతిఘటించి ఐక్యత కనబరచాలని రామనాధం చెప్పబోయేడు.

కాని ఆ నాటి ఘట్టం వేరు. నేటి స్థితి వేరు. ఆనాడు గాడిచర్లవారు లొంగనందుకు ప్రిన్సిపాల్‌ సస్పెండు చేశాడు.
కనకనే కాలేజీ అంతా ఆయన వెనక నిలబడింది. కాని, ఈ రోజున?

వెంకటేశ్వర్లు లొంగిపోయేడు. అందుచేతనే ఆయన సస్పెండు చేయగలిగేడు.

"ఆ బలహీనతను సమర్ధించమనా నీ అభిప్రాయం?" అని అడుగుతూ వుంటే రామనాధం నిరుత్తరుడయ్యేడు.

ఒక్క నిముషం ఆలోచించి రామనాధం తన ఆలోచనకు తప్పు వ్యాఖ్యానం చేశావన్నాడు.

"ఇక్కడ బలహీనత సమస్యే కాదు. ఒకే పనిచేసిన ఇద్దరికి చెరొకలాగా..."

"అంటే మంగరాజుని కూడా సస్పెండు చెయ్యాలంటావు."

రామనాధం విసుక్కున్నాడు.

"నీకు తప్పు అర్థమేకాని కనబడదేమిట్రా?"

తన్ను సమర్ధించుకోడానికి రాజరత్నం వెంకటేశ్వర్లు మరో అపరాధాన్ని వివరించేడు.

"ఆ చచ్చు పీనుగ వస్తూవస్తూ శుద్ధ కోరా, ముతక బట్టలతో హాజరయ్యేడు. ఆ వేషం చూసేసరికి రంగనాధరావు లెక్చరరు
మండిపడ్డారు. కాలేజీ మానేశానన్న వాడు మళ్ళీ రావడంగాక ఖద్దరు బట్టల ఏడ్పు ఎందుకు? చెప్పు, ఏం నోరు మూసుకొన్నావేం?
ముందు మాలో ఎవరి దగ్గరకైనా ఏడిస్తే బట్టలిచ్చేవాళ్ళంగా! తిన్నగా రంగనాధరావు లెక్చరరు వద్దకు వెళ్ళాడు. ఆయన
కస్సుమని ఆ బట్టలు మీ నాన్న మొహాన పారేసి రమ్మన్నాడు.

లెక్చరరుకు కోపం ఎందుకు వచ్చిందో రామనాధానికి అర్థం అయిందనిపించింది. రంగనాధరావు మాటవచ్చేక అబ్బాయినాయుడు రష్యా విప్లవం
గురించి అడిగిన మాట జ్ఞాపకం వచ్చింది, ఆయనకేమన్నా తెలుసునేమో "అడగాలి......" అనుకొన్నాడు.

"నేను ప్రిన్సిపాల్‌ని కలుసుకుంటాను."

రాజరత్నం అతనిని ఆపాదం చూసేడు.

"ఆ బట్టలతో వెళ్ళకు, నా పాంటూ, కోటూ వేసుకెళ్లు."

కాని, కాలేజీలో తన్ను చేర్చుకోమని అడగడానికిగాక వెంకటేశ్వర్లుకి అన్యాయం చేయడం గురించి అడిగేస్తానంటూంటే రాజరత్నం
కంగారుపడ్డాడు. అతడు బెడ్డింగు తన గదిలో వుంచి ప్రిన్సిపాల్‌ని కలుసుకుంటే తాను పంపినట్లు మాట వస్తుందని
భయపడసాగేడు.

"ఏడవకురా...."

"నీకేమిరా బాబూ! ఏదో పదెకరాల భూమి వుంది గనక ఎన్ని గంతులేనా వేస్తావు. ఎప్పుడు పరీక్ష పూర్తిచేస్తానో, వుద్యోగంలో
చేరతానో అని మా ఆవిడ పుట్టింట పిల్లవాడితో ఎదురుచూస్తూంది." అన్నాడు రాజరత్నం.

రామనాధం ఏమీ అనలేదు.

"మధ్యాహ్నానికి కనిపిస్తానని మా రమణతో చెప్పు." అంటూ కూలీని పిలిచి బెడ్డింగుతో సహా నాళంవారి సత్రం వేపు వెళ్ళాడు.



ఇరవైతొమ్మిది


నాళంవారి సత్రంలో గుమాస్తా చూపిన గదిలో సామాను పడేసుకొని తిన్నగా గోదావరికెళ్ళి స్నానం చేసి వచ్చేడు. బట్టలు మార్చుకొని
వీధిలోకి వచ్చేసరికి చిన్న ఖద్దరు బట్టల మూటతో సొట్టకాలుతో కుంటుకుంటూ ఇన్నీస్పేటలోకి మళ్ళుతున్న దువ్వూరు సుబ్బమ్మగారు
కనిపించింది.

ఆమె అతన్ని చూడగానే ఆప్యాయంగా పలకరించింది.

"వచ్చేవురా తమ్ముడూ."

వెనువెంటనే తన భుజాన వున్న బట్టలమూట అతనికిచ్చింది.

అందుకోవడమయితే అందుకున్నాడు కాని, భుజాన పెట్టుకోలేకపోయేడు.

ఆమె వుద్దేశ్యం అర్ధం అయింది. ఆ మూటతో ఆమె తనను వీధులవెంట తిప్పుతుంది. ఇంటింటికీ తిప్పుతుంది. ఆమె మాట తాను
కాదనలేడు. అయినా బట్టలమూట భుజానవేసుకొని వీధులవెంట బయలుదేరడం ఎంతో సిగ్గనిపించింది. ఆ విధంగా తిరిగి
అమ్ముకొనేవాళ్ళున్నారు. తానా కులం వాడు కాదు. అదో అభ్యంతరం. కానీ అంతకన్నా పెద్ద అభ్యంతరం నామోషీ. చిన్నతనం.
పడవలోంచీ, రైలులోంచీ పక్కచుట్ట దింపడానికి కూడా కూలివాడు కావలసి వస్తుంది. అల్లాంటిది బట్టలమూట భుజాన వేసుకొని
ఇన్నీస్పేట వీధులలో అమ్మాలంటే.....

అతని తటపటాయింపును సుబ్బమ్మగారు కనిపెట్టేసింది.

"సిగ్గేస్తూందట్రా వెర్రినాయనా?"

ఆ సిగ్గును ఒప్పుకోడానికి కూడా ధైర్యం లేదు.

"అబ్బే అదికాదక్కగారూ!"

అతడు ఏవో సాకులు చెప్పబోయేడుగాని ఆమె అవకాశం ఇవ్వకుండా నవ్వేసింది.

"ఆ హోదా తక్కువ పనికి దిగేవని మెళ్ళో వేసే దండ...."

"ఆ దండ పడిపోయిందంతే.....!"

"మరింకేం. పేచీయే లేదు. రా."

రామనాధానికి మరి మాట తోచలేదు. ఆమె పక్కన పిల్లిలా నడుస్తూ ఆలోచనలో పడ్డాడు.

ఈమె తన సమస్యకు ఏమన్నా పరిష్కారమార్గం చూపించగలదేమోననిపించింది.

"అక్కగారూ!"

"ఏమిట్రా, కొత్త పని ఏదన్నా జ్ఞాపకం వచ్చిందా?"

"వుండడం అయితే చాలా పనులున్నాయి. కాని మీతో మాట్లాడాలండీ...."

"ఏమిటది?"

రామనాధం ఇంటికి వెళ్ళేక తన పరిస్థితి చెప్పేడు. అంతా విని ఆమె సులభంగా చెప్పేసింది.

"అక్కడ విడిచిపెట్టకు. వెంటనే తీసుకువచ్చెయ్యి."

అతడా సలహాకు నోరు తెరిచేడు. తన నియమం మాటేమిటి?"

సుబ్బమ్మగారు నవ్వింది.

అతని ఆలోచనా లేమికి జాలిపడింది. "ఓరి వెర్రినాగన్నా" అంది.

"ఎప్పటికేనా అసలంటూ పెళ్ళాం కావాలనుకుంటున్నావా?" అంది.

"ఆ పెళ్ళాం కాస్త అనుకూలంగా వుండేది కావాలా?" అంది.

"సంసారంలో సుఖం, శాంతీ లేకుండా చేసుకోవాలనుకుంటున్నావా?" అంది.

సుందరికి కుటుంబ జీవితంలో ప్రవేశించే వయస్సు లేకపోవచ్చు. కాని చూసింది ఇట్టే పట్టుకొనే వయస్సులో వుంది. జీవితాన్ని మలిచే
అనుభవాల్ని నేర్చుకొనేది ఈ వయస్సులోనే, ఈ స్థితిలో ఆమెను ఒక పోలీసు ఉద్యోగి పెంపకంలో వదల వద్దని ఆమె సలహా.

"విషం నూరిపోసేస్తాడు. దానికి మరి విరుగుడు కూడా దొరకదు. యావజ్జీవం నీకు ఓ సమస్య అయి కూర్చుంటుంది."

భార్య తనకో సమస్య అయి కూర్చుంటుందనే సరికి రామనాధానికి మగతనపు అహంకారం దెబ్బతింది. చర్రుమన్నాడు.

"అల్లాంటిది మన దగ్గర చెప్పకండి. మరీ సమస్య కావాలనుకుంటే వాళ్ళ నాన్నకే అవుతుంది."

కాని ఆ మాట అనేశాక రామనాధం నొచ్చుకున్నాడు. సిగ్గు పడ్డాడు. ఇంతకీ తానూ, మామగారూ తగవుపడి సుందరి మీదనా కసి
తీర్చుకోవడం?

ఆ మాటనే సుబ్బమ్మగారూ అనేక రూపాలలో చెప్పింది.

ఇదివరకే ఆడవాళ్ళకి అనంతంగా వున్నాయి బాధలు. వానిలో మరొకటి జతపరచడం ఆమెకేమాత్రం సమ్మతం కాలేదు.

నిజమే. సుందరి చేయగలదేముందనిపించింది. కాని....

తానిప్పుడు చేయవలసిందేమిటి? తీసుకువచ్చెయ్యడానికి చిన్న పిల్లాయె. వాళ్ళు పంపెయ్యడానికే ఏర్పాట్లు చేస్తున్నారు. అదీ
నిజమే. అయితే తన నియమం మాటేమిటి?

"నియమం నియమం అంటావేమి"టంది ఆమె. దానిని పరిస్థితులకు వీలుగా సవరించుకోమంది.

"అదే మీరు చెప్పండని అడుగుతున్నా"నన్నాడు రామనాధం.

తిరిగి తిరిగి సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది.

సుబ్బమ్మగారు ఆలోచించింది.

"ఇప్పటినుంచీ సంసారం పెట్టడం మంచిది కాదంటావు కదూ. పెట్టకు. ఉన్నవ లక్ష్మీనారాయణగారూ, భార్యా కన్యా విద్యాలయం
లాంటిదేదో నడపాలనుకొంటున్నారు.

"వారు నడపదలచుకొన్నది ఏదో ఆషామాషీ విద్యాలయం కాదు. స్త్రీలకు చదువుతోపాటు చిత్త సంస్కారమూ, దేశభక్తీ,
జాతీయాభిమానమూ కలిగించాలనేది వారి ధ్యేయం."

"ఆమధ్య అన్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నామన్నారు. వుత్తరం వ్రాస్తాను."

"కానీ, ఉన్నవవారి విద్యాలయం ఇంకా ఆలోచనల దశలోనే వుందాయె."

"నీ భార్యే వాళ్ళ విద్యాలయంలోనే మొదటి విద్యార్థిని అవుతుంది."

అదీ బాగానే వుంది....

"కాని....." మరల ఏదో అనుమానం. సుబ్బమ్మగారు నవ్వింది.

"ఇన్ని సమస్యలు తెచ్చుకొని, ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలేమిటని బుర్ర పాడుచేసుకొంటూ కూర్చుంటే జీవితంలో ఒక్క అడుగు
వెయ్యలేం."

భార్య అన్నగారి సలహా, సుబ్బమ్మగారి సలహా ఒక్కటే. భార్యను వెంటనే తెచ్చేసుకోమనే ఇద్దరి సలహా. అయితే ఆ సలహాల
వెనుకనున్న ఆలోచనా ధోరణులు వేరు.

ఉన్నవవారి విద్యాలయం ఏర్పడే వరకూ సుందరి బాధ్యతను తాను తీసుకోడానికి ఆమె సిద్ధపడింది.

"మా ఇంట్లో వుంటుంది. జాతీయ పాఠశాలలో చేర్పిద్దాం." అంది.

కాని వారిద్దరూ ఎరగనిదీ, తెలుసుకోక తప్పనిదీ మరో ముఖ్య విషయం వుంది.

ఆ పిల్ల ఏమంటుంది?

రామనాధం వరకు పంపుతారు గాని, దువ్వూరి సుబ్బమ్మగారి వద్ద రాజమండ్రిలోనో, ఉన్నవవారి విద్యాలయం వచ్చేక గుంటూరులోనో
వుంచుతానంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అత్తగారూ, మామగారూ మాట అటుంచి, తన్ను పెంచిన వాళ్ళే వొప్పుకోరు.

వాళ్ళందరిదీ ఒక ఎత్తూ, అసలు సుందరిది ఒక ఎత్తూను.

ఆమె ఏమంటుంది? బంధువులూ, భర్తా లేనిచోట వుండాలనేదొకటి? రెండోది ఉన్నవవారి విద్యాలయం అన్ని కులాలనూ సమీకరిస్తుంది. ఏ
జాతీయ విద్యాలయమయినా చేయవలసిందదే. ఆ మార్పుకు మెట్లు లేవు. కులభేదాలు పాటించడం, పాటించకపోవడం--అంతే, సుందరి ఏం
చేస్తుంది?

ఆమె స్వభావం ఎటువంటిదో అతడెరుగడు. తొమ్మిదేళ్ళ పిల్లప్పుడు పెళ్ళి అయిదురోజులూ కూడా వున్నదేదో అంతే. ఈ నాలుగైదేళ్ళలో
అతడు చాలామార్లు అత్తవారింటికి వెళ్ళేడు. కాని పరికిణీ మెరుపు, చేతి గాజుల గలగల, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఆట
పట్టించినప్పుడు వినిపించే అణిచిపెట్టుకొన్న నవ్వు, కృత్రిమమైన విసుగుదల మాటలు తప్ప అతడు భార్య ముఖం చూసిన గుర్తు
కూడా లేదు. పరాకుగా వున్నప్పుడు ఎన్నడేనా తాను సందర్భపడితే, ఒక్క క్షణం మెరుపులా మాయమయ్యేది. ఇంక మాటా, పలుకూ
ఎక్కడ? ఆమె స్వభావం ఏం ఎరుగును? ఏం చెప్పగలడు?

పైగా మామగారు పోలీసు ఆఫీసరు. ఆయన బాలామంత్రోపదేశం పొందేడు. ఆ యింటి ఆడపడుచు.

అటువంటిదే ఏదో చంద్రశేఖరం సూచనగా చెప్పిన మాట కూడా గుర్తు వచ్చింది.

సుబ్బమ్మగారు ఇంత తటపటాయింపూ, మీన మేషాల లెక్కా పనికి రాదంది.

"తిన్నగా వెళ్ళు, ఆ పిల్లతో మాట్లాడు. రెండు ఖద్దరు చీరెలు, లంగాలు, ఓణీలు తీసుకెళ్ళు, కట్టుకోమను...."

పొందూరు రకాల సన్నబట్టలు చూచి మరీ ఇవ్వండి--అనాలనిపించింది. కాని ఆమె ఏమంటుందో అని భయపడ్డాడు. ఆమె నోరు మహా
చెడ్డది.... ఎవరో ఆఫీసరు పెళ్ళాం "నేనింత బరువు బట్టలు కట్టలేనండోయి" అందిట. దానిమీద సుబ్బమ్మగారు అనేసిన మోటు
మాట చెప్పుకొని ఇప్పటికీ పక్కలు పట్టుకొని దొర్లిదొర్లి నవ్వుతుంటారు. 'ఆరు మణుగుల మగడిని మోస్తున్నావు. అరవీశ చీర
నీకు బరువయిందా?" అనేసరికి అంత ఆఫీసరు పెళ్ళాం నిలువునా చచ్చిపోయిందట.

ఆ మాట జ్ఞాపకం వచ్చేసరికి అతడికీ నవ్వు వచ్చింది.

"ఎందుకురా నవ్వుతున్నావు?"

ఈ మాటతో అతడు పైకే నవ్వేశాడు.

"చూస్తే హడలిపోయేలా గాకుండా బాగా సన్నరకం చూచి మరీ ఇప్పించండి. ఈ వందా తీసుకోండి. ఇంకా పడితే.."

అతని నవ్వూ, సందేహమూ చూచి సుబ్బమ్మగారు ఒక్కక్షణం విస్తుపోయి, తరువాత తనూ నవ్వేసింది.

"మొగం ఎరక్కపోయినా పెళ్ళామంటే ఆ అభిమానం, సానుభూతి వుండాలి. ఆ పిల్ల ఎవరో అదృష్టవంతురాలు. వెళ్ళు వెళ్ళు."



ముప్ఫయి


హాస్టలు గదిలో వెంకటరమణ దొరికేడు. మనిషిలో ఇదివరకటంత ఆప్యాయత కన్పించలేదు. ఏదో మాటవరసకి అడిగినట్లు
"ఎప్పుడొచ్చేవు?" అన్నాడు.

"ఏమిటల్లా వున్నావు?" అంటూ కుశలప్రశ్న వేసి, కొద్దిసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడేడు. చటుక్కున ప్రశ్నించేడు.

"మీ అమ్మకి వుత్తరం వ్రాయలేదుట. ఆవిడ బాధపడుతూంది."

హఠాత్తుగా ఎదురయిన ఆ ప్రశ్నకు వెంకటరమణ కంగారుపడ్డాడు.

"ఏదో వ్రాయలేదు. బాబయ్యగారికి వ్రాశా కదా అని...."

"అందులో మీ అమ్మమాటే రాయలేదట. అది వినిపిస్తే బాధపడుతుందని ఆయన వుత్తరం వచ్చిందని చెప్పకుండా దాచిపెట్టేడు. ఆమె
ఒకటే గొడవ."

వెంకటరమణ ఏదో అస్పష్టంగా గొణిగేడు. రామనాధం మరో విషయం ఎత్తుకున్నాడు.

"నువ్వు సైంటిస్టువి కావాలని బాబయ్య అభిప్రాయం."

"కాని, ఎల్లా చదవడం? ఆ అత్తవారి వాళ్ళ డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. బాబయ్య ఇవ్వలేరు. ఇంకో ఆరేడేళ్ళు
చదవడం మాటలా?"

అది యథార్థం. బాబయ్య డబ్బు ఇవ్వగల స్థితిలో లేడు. ఏమన్నా ఇచ్చినా అది పెట్టుకొని చదువు కొసకంటా సాగించడం సాధ్యం
కాదు. తనకు సాయపడాలని వుంది. కాని, తనకే ప్రస్తుతం దారి లేదు. బట్టలు కొనుక్కొనేటందుకు నోటు వ్రాయవలసి వచ్చింది.
ఇప్పుడు తన భార్య సంగతి తేల్చుకోవలసి వుంది. ఆమెను ఎక్కడ వుంచినా డబ్బు కావాలి. ఆస్తిపాస్తుల విషయం ఏదో
తేల్చుకొంటేనే గాని, తనకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు.

కాని చదువు చెప్పించుకుంటామని తీసుకెళ్ళిన అత్తవారి వద్ద డబ్బు తీసుకోననడం ఏమిటో రామనాధానికి అర్థం కాలేదు. ఏమన్నా
గొడవలు వచ్చేయో ఏమిటో... ఆ విషయాన్ని ప్రస్తావించడం ఎల్లాగో అర్ధం కాలేదు.

"వాళ్ళు చదివిస్తామంటున్నప్పుడు ఎందుకు సందేహం? ఏం జరిగింది?"

వెంకటరమణ ముఖం నల్లబడిపోయింది. కాని పైకి ఏమీ చెప్పలేదు.

"నాకిష్టం లేదు."

ఇద్దరూ ఒక్క నిముషం వూరుకున్నారు. తమ్ముని అభిమానాన్ని ఎరిగిన రామనాధం ఇంక ఆ విషయం కదపతలచుకోలేదు.

"పోనీ, ఉద్యోగమే చేయాలనుకొన్నప్పుడు మరొకటి లేదా?"

"దానికేం?"

"బాబయ్య కిష్టం లేదు."

"బాబయ్య కిష్టం లేదు. ఆయన కిష్టం అయింది. పెళ్ళి చేసేడు. ఆ పెళ్ళిచేసి నాకెంత అపకారం చేసేరో ఆయనకి తెలియదు. నాకు
తెలుసు. ఇంక నా కష్టసుఖాలు నాకు వదిలెయ్యడం మంచిది."

అతని అసంతృప్తి ఏమిటో అర్ధం కాకపోయినా ఏదో మనస్సులో చాలా బాధపడుతున్నాడనిపించింది. ఇంతకాలం తమకెవ్వరికీ చెప్పలేదు.
తాము పట్టించుకోనూ లేదు. అదేదో సర్దుబాటు చేయవలసి వుటుంది. బాబయ్యతో చెప్పాలనుకొన్నాడు రామనాధం.

"పోనీ నీకయినా పోలీసుశాఖ ఎల్లా నచ్చింది?"

వెంకటరమణ మొండిగా మాట్లాడినట్లనిపించినా రామనాధం పట్టించుకోలేదు.

"ఏం, దానికేం లోటొచ్చింది?" అని రమణ ప్రశ్న.

"బ్రతకడానికి ఏ వుద్యోగమైతేనేం?"

"హోదా, ఫాయిదా లేని చచ్చు మేస్టరీకన్న ఇది నయం."

వెంకటరమణ ప్రశ్నల్నీ, నిశ్చితాభిప్రాయాల్నీ వివిధ దృక్కోణాల నుంచి ప్రత్యాఖ్యానం చెయ్యడానికి రామనాధం ప్రయత్నించేడు.

పోలీసు వుద్యోగంలో వున్న హింసా ప్రవృత్తిని వర్ణించేడు. పై అధికారులకు ఎంత హెచ్చుగా లొంగివుండాలో చెప్పేడు.

"ఆ విధంగా లొంగి చేతులు నలపడం ఎందులోనైనా తప్పదు." అన్నాడు రమణ.

"దేశం అంతా విదేశీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి పెద్ద వుద్యమం నడిపిస్తూంటే నువ్వు ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయాలి."

"అంటే.....?"

"దేశాన్నీ, బంధువుల్నీ కాదనాలి."

వెంకటరమణ చురుకు చురుకున చూసేడు.

"అది నా ఒక్కడి విషయంలోనేనా?"

అతని అభిప్రాయం గ్రహించి రామనాధం చిరునవ్వు నవ్వేడు. తల అడ్డంగా తిప్పేడు.

నాలుగేళ్ళ క్రితం పోలీసు సర్కిల్‌ ఇన్స్‌పెక్టరు కూతుర్ని కోడలుగా తెచ్చుకోవడం తమ కుటుంబానికే గొప్పగా
భావించేరు తమవాళ్ళు. ఆనాటి స్థితి వేరు. నేడు తాను ఐ.సి.ఎస్‌.కి వెళ్ళాలన్న సన్నాహాలను కూడా కట్టిపెట్టుకొని
జాతీయోద్యమంలో చేరేడు.

"కాని, మీరాయనతో తెగతెంపులు చేసుకోబోవటం లేదు కదా..."

"అంటే....?"

"ఈవేళ ఆయన నీకు మామగారు కాకపోతారా, ఆ సర్కిలినస్పెక్టరు కూతురు భార్య కాకపోతుందా?"

"ఎందుకు కారు? కాని, మామగారు పోలీసు ఆఫీసరు అయినంత మాత్రాన నువ్వు దేశద్రోహివి గావాలా?"

రామనాధం చర్చలలో తన సోదరుడి మనస్సు నొప్పించగలిగేడే గాని అతనిని వొప్పించలేకపోయాడు.

ఆ మాట తోచి అతనికెంతో బాధ కలిగింది. కాని ఏమనడానికీ తోచలేదు.

"సరే కానియ్యి."

ఇద్దరూ బయటకు వచ్చేరు. గదికి తాళం వేస్తూ వెంకటరమణ ప్రశ్నించేడు.

"నువ్వు ప్రిన్సిపాల్‌ను కలుసుకోవా....?"

"లేదు. మొదట అల్లా అనుకొన్నా, కాని, వెంకటేశ్వర్లుకే పట్టింపు లేనప్పుడు...."

"రాజరత్నంగారు చెప్పినప్పుడే అనుకొన్నా, నువ్వు అనవసర విషయంలో కలగచేసుకొంటున్నావని..."

"మొదట అల్లా అనుకోము... ప్రపంచంలో సమస్యలన్నీ మన సమస్యలే అనుకొని ప్రారంభం అవుతాము."

అది వెంకటేశ్వర్లును గురించి అన్న మాటో, తననుద్దేశించినదో రమణకు అర్ధం కాలేదు. ఏదయినా దానికి సమాధానం ఇవ్వవలసి
వుంటుందనుకోలేదు.

"తండ్రి బాధ పడలేక ఆయనను సంతృప్తి పరచడానికి ప్రిన్సిపాల్‌ను కలుసుకొన్నాడు. ఆయన కాదన్నదే చాలునని
బ్రహ్మానందపడ్డాడు. నిజంగా వెంకటేశ్వర్లు గారికి కాలేజీలో చేరాలనే వుంటే ప్రిన్సిపాల్‌ను సంతృప్తిపరచడమేం గగనం
కాదు."

"...... నే తోచింది."

ఇదివరకటి మాదిరిగా తన తమ్ముడు తనతో గేటు వరకూ రాలేదనీ, తనతో వుండడంలో వుత్సాహం చూపలేదనీ గ్రహించేక రామనాధం
నవ్వుకొన్నాడు.

"నాతో కనిపిస్తేనే పోలీసు ఉద్యోగానికి ముప్పు మూడుతుందని భయం కాబోలు" అనుకొన్నాడు.



ముప్ఫయ్యొకటి


కూలివాని నెత్తిన బట్టల మూట పట్టించుకొని రామనాధం గుమ్మం మెట్లెక్కుతూంటే రంగనాధరావు ఆశ్చర్యం కనబరచేడు.

"నమస్కారం గురువుగారూ! ఏదో పనిమీద ఊళ్లోకి వచ్చేను. తమ దర్శనం చేసుకుపోదామని....."

రామనాధం కూలివాని నెత్తిమీద మూట దింపి డబ్బులిచ్చి పంపేసేడు.

"ఏమిటయ్యా ఇది?"

"తమతో మాట్లాడాలనుకొన్నా, పోనీ ఎలాగూ వస్తున్నాకదాయని దుప్పట్లూ, వగైరా పట్టించుకొచ్చా. తమ యింట్లో వాడకానికి మంచి
రకాలు వున్నాయి."

రామనాధం చూపుతూంటే రంగనాధం, భార్యా కొన్ని దుప్పట్లూ, డోర్‌ కర్టెన్లూ, టేబుల్‌క్లాతూ తీసుకొన్నారు.

బేరం ముగించి రంగనాధరావు అభినందించేడు..."బలేవాడివోయి."

"అసలు నీకీ ఆలోచన ఎందుకు తట్టిందంట. వారం నుంచి బజారుకెళ్ళి కొన్ని బట్టలు తేవాలనుకుంటూనే బద్ధకిస్తున్నా" నంటూ
గురుపత్ని రెండు కప్పులతో టీ తెచ్చి ముందుంచింది.

"తీసుకోవయ్యా"--అంటూ రంగనాధరావు ఒక కప్పు అతనికందించి తానొకటి తీసుకొన్నాడు.

"ఇప్పుడు చెప్పు, ఖద్దరు ప్రచారం పట్టుకున్నట్లున్నావు? ఔను కాని, ఈ ఖద్దరు అమ్మితే బ్రిటిషువాళ్లని
పంపెపయ్యగలమనే అనుకుంటున్నారా మీరంతా?"

రామనాధం నిజం వొప్పేసుకున్నాడు. ఆ రోజు వుదయమే దువ్వూరి సుబ్బమ్మగారు ఖద్దరు మూట భుజానికెత్తేరు తప